రాముని శౌర్యాన్ని, ధీరత్వాన్ని వర్ణించే త్యాగరాజస్వామి కృతులు ఎన్నో. రామాయణంలో విశ్వామిత్ర యాగరక్షణ మొదలు రావణ సంహారం వరకు ఎన్నో ఘట్టలను త్యాగరాజస్వామి తన కృతులలో సవివరంగా రాగయుక్తంగా పలికారు. సీతమ్మ కోసం రాముడు కడలిని దాటే సమయంలో సముద్రుని నిలువరించిన ఘట్టం ప్రస్తావన కూడా అనేక కృతులలో చేశారు. నీరజాక్షికై నీరధి దాటిన నీ కీర్తిని విన్నానురా రామా అని క్షీర సాగర శయన అనే కృతిలో అద్భుతంగా వర్ణించారు. నిజంగా రాముని శౌర్యం తెలుసుకోవాలంటే అరణ్యకాండలోని ఖరదూషణ వధ ఘట్టం, యుద్ధకాండలో రావణాదులపై చేసిన ప్రహార వివరాలు శ్రీమద్వాల్మీకి రామాయణం పఠించాలి. వాటి సారాంశాన్ని త్యాగరాజస్వామి అనేక కృతుల ద్వారా ఆవిష్కరించారు. రాముని శౌర్యం వెనుక ఉన్న మర్మం కూడా తెలిపారు. అటువంటి ప్రస్తావనే ఈ శర శర సమరైక శూర అన్న కృతిలో కూడా చేశారు. వివరాలు:
సాహిత్యం
=======
శర శర సమరైక శూర శరధి మద విదార!
సురరిపు మూల బలమనుతూల గిరులకనల సమమౌ శ్రీరామ
తొలిజేసిన పాపవనకుఠారమా కలనైనను సేయగలేని బలు
విలును విరచి వెలసిన శ్రీరఘుకులవర బ్రోవుము త్యాగరాజనుత!
భావం
====
ఒక్కొక్క బాణముచేత సాటిలేని యుద్ధ శౌర్యమును చూపిన, సముద్రుని గర్వమణచిన శ్రీరామా! దూది పర్వతముల వంటి రావణుని మూలబలమునకు అగ్నితుల్యమైన శ్రీరామా! అనేక జన్మముల పాపములనే అరణ్యములకు గొడ్డలిపెట్టువంటి శ్రీరామా! రాజాధిరాజులు కలలో కూడా ఊహించని రీతి శివధనుస్సును విరిచిన రఘుకులతిలకుడైన శ్రీరామా! పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నన్ను బ్రోవుము.
శ్రవణం
=====
కుంతలవరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి