7, నవంబర్ 2020, శనివారం

అక్షయలింగ విభో స్వయంభో - ముత్తుస్వామి దీక్షితుల కృతి

ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో ఎక్కువ మటుకు క్షేత్ర కృతులే. అనగా, దక్షిణ భారత దేశంలో ఉన్న అనేక దివ్యక్షేత్రాలను సందర్శించి, ఆ దేవతను ఆయన ఉపాసన చేసినప్పుడు రచించినవి. అటువంటి కృతి ఒకటి తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కీళ్వేలూరులో ఉన్న అక్షయలింగేశ్వర క్షేత్రంలో వెలసిన స్వామిపై రచించినది. క్షేత్ర ప్రస్తావనలో వాగ్గేయకారులు ఆ క్షేత్రంలోని దేవతలతో పాటు ఇతర వివరాలను కూడా సుస్పష్టంగా పొందుపరచటంలో ఉద్దేశం ఆయా క్షేత్రాలు, దేవతామూర్తుల యొక్క విశిష్టతను, విలక్షణతను శాశ్వతం చేయటం కోసమే. ఇక్కడ అమ్మవారు, స్వామి బదరీవృక్షం క్రింద స్థితమై ఉంటారు. అలాగే ఇక్కడ భద్రకాళీ అమ్మ వారి మూర్తి కూడా ఉంది. వీటిని కృతిలో దీక్షితులవారు ప్రస్తావించారు. అక్షయలింగేశ్వర స్వామి క్షేత్రం చాలా పురాతనమైనది. స్వయంభూ లింగ స్వరూపంలో పరమశివుడు సుందరకుచాంబిక, భద్రకాళిగా పార్వతీ దేవి, వినాయకుడు, కుమారస్వామితో సహా అనేక దేవతామూర్తులు ఈ క్షేత్రంలో ఉన్నాయి. శైవయోగి, కవి జ్ఞానసంబంధర్ రచనలలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. కృతిలో చైత్రపూర్ణిమ నాడు స్వామికి జరిగే భవ్యమైన రథోత్సవ ప్రస్తావన కూడా దీక్షితార్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో దీక్షితార్ కృతుల పాత్ర ఎనలేనిది. ఇప్పుడు ద్రావిడవాదం వచ్చి పేర్లు మార్చబడినా, ఒకనాడు తమిళనాడులో ఉన్న క్షేత్రాలు, దేవతల నామాలన్నీ కూడా సనాతన ధర్మానికి మూలమైన సంస్కృత భాషలో ఉన్నవే. దీక్షితుల వారు ఆ నామాలనే తన కృతులలో ఉపయోగించారు. 

ధీరశంకరాభరణ రాగంలో కూర్చబడిన ఈ కృతిని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

అక్షయలింగ విభో స్వయంభో అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో

అక్షయ స్వరూప అమిత ప్రతాప ఆరూఢ వృషవాహ జగన్మోహ
దక్ష శిక్షణ దక్షతర సుర లక్షణ విధి విలక్షణ లక్ష్య
లక్షణ బహు విచక్షణ సుధా భక్షణ గురు కటాక్ష వీక్షణ

బదరీ వనమూల నాయికాసహిత భద్రకాళీశ భక్త విహిత
మదన జనకాది దేవ మహిత మాయాకార్య కలనా రహిత
సదయ గురుగుహ తాత గుణాతీత సాధు జనోపేత శంకర నవనీత
హృదయ విభాత తుంబురు సంగీత హ్రీంకార సంభూత హేమగిరి నాధ
సదాశ్రిత కల్పక మహీరుహ పదాంబుజ భవ రథ గజ తురగ
పదాది సంయుత చైత్రోత్సవ సదాశివ సచ్చిదానందమయ

ఓ అక్షయలింగ ప్రభో! నీవు స్యయంభువుడవు, సమస్త విశ్వములకు ప్రభువువుం శంకరుడవు, నన్ను రక్షింపుము. నాశనము లేని స్వరూపము కలవాడవు, అమిత ప్రతాపవంతుడవు, నందీశ్వరుని అధిరోహించిన జగన్మోహనుడవు. దక్షుని శిక్షించినవాడవు, దేవతలకు విధివిధానములను, విలక్షణమైన తత్త్వములను, లక్ష్యములను దక్షిణామూర్తి రూపములో శిక్షణనొసగిన నిపుణుడవు, అనేక రకములైన విచక్షణ కలవాడవు, అమృతమును సేవించేవాడవు, ఘనమైన కటాక్ష వీక్షణము కలవాడవు, నన్ను రక్షింపుము. బదరీ వనములో పార్వతీదేవి సమేతుడవై యున్నవాడవు, భద్రకాళికి ప్రభువువు, భక్తులకు హితుడవు. మదనుని జనకుడైన శ్రీహరి మొదలైన దేవతలచే నుతించబడిన వాడవు, మాయ చేసే కల్పనలకు అతీతుడవు, ఎల్లప్పుడూ కుమారస్వామిపై పితృవాత్సల్యమును కురిపించేవాడవు, గుణాతీతుడవు, సాధుజనుల సమీపములో ఉండి శుభములు కలిగించేవాడవు, వెన్నవంటి హృదయము కలవాడవు, తుంబురుని సంగీతమును ఆనందించేవాడవు, హ్రీంకారము నుండి ఉద్భవించినవాడవు, కైలాసపతివి, నీ పదకమలములను ఆశ్రయించేవారికి కల్పవృక్షము వంటివాడవు, భవుడవు, రథ గజ తురగ పదాది సైన్యముతో చైత్రోత్సవములో ప్రకాశించే సదాశివుడవు, సచ్చిదానందమయుడవు. నన్ను రక్షింపుము.

చిత్రం కీళ్వేలూరులోని కెదిలియప్పర్ (అక్షయలింగేశ్వరుని) రూపము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి