28, డిసెంబర్ 2020, సోమవారం

రంగనాయకం భావయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


సాహిత్య సంపదలో, ఆధ్యాత్మిక వైభవంలో, సంస్కృత భాషా విశేషణాలలో, సంగీతత్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారిది అగ్రస్థానం. వారి ఉపాసనా బలమంతా ఈ మూడు కోణాల ద్వారా ఆయన రచనలలో అద్భుతంగా గోచరిస్తుంది. అటువంటి ఒక కృతి వారు శ్రీరంగంలోని రంగనాథునిపై రచించినది. వివరాలు:

సాహిత్యం
========

రంగనాయకం భావయేऽహం శ్రీరంగనాయకీ సమేతం శ్రీ

అంగజ తాతమనంతమతీతం అజేంద్రాద్యమరనుతం సతతం
ఉత్తుంగ విహంగ తురంగం కృపాపాంగం రమాంతరంగం శ్రీ

ప్రణవాకార దివ్య విమానం ప్రహ్లాదాది భక్తాభిమానం
గణపతి సమాన విష్వక్సేనం గజ తురగ పదాది సేనం
దినమణికులభవ రాఘవారాధనం మామక విదేహ ముక్తి సాధనం
మణిమయ శశివదనం ఫణిపతి శయనం పద్మనయనం
అగణితసుగుణగణ నతవిభీషణం ఘనతర కౌస్తుభమణి విభూషణం
గుణిజన కృత వేదపారాయణం గురుగుహ ముదిత నారాయణం శ్రీ

భావం
=====

రంగనాయకీ సమేతుడైన శ్రీరంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. మన్మథునికి తండ్రి, అనంతుడు, అన్నిటికీ అతీతుడు, బ్రహ్మేంద్రాది దేవతలచే ఎల్లప్పుడూ నుతించబడేవాడు, గరుత్మంతుని వాహనంగా ఆకాశంలో విహరించేవాడు, కృపావీక్షణములు కలవాడు, లక్ష్మీదేవి హృదయములో ఉండేవాడు అయిన శ్రీరంగనాయకుని ధ్యానిస్తున్నాను. ఓంకారమనే దివ్యవిమానంలో విహరించేవాడు, ప్రహ్లాదాది భాగవతోత్తములను ప్రీతితో అనుగ్రహించేవాడు, గణపతితో సమానమైన విష్వక్సేనునిచే పూజించబడేవాడు, గజములు, అశ్వములు, సైనికులతో కూడిన సైన్యము కలవాడు, సూర్యవంశములో జన్మంచి రాఘవునిగా కొలువబడినవాడు, దేహముక్తి పొందేందుకు నాకు సాధనమైనవాడు, మణులతో ప్రకాశించేవాడు, చంద్రుని వంటి ముఖము కలవాడు, విభీషణునిచే నుతించబడినవాడు, శ్రేష్టమైన కౌస్తుభ మణిని వక్షస్థలమున ఆభరణముగా కలవాడు, ఉత్తములైన పండితులచే వేద పారాయణ ద్వారా నుతించబడిన వాడు, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించేవాడు, శ్రీమన్నారాయణుడైన రంగనాయకుని నేను ధ్యానిస్తున్నాను. 

శ్రవణం
=======

ఖరహరప్రియ జన్యమైన నాయకి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి