7, డిసెంబర్ 2020, సోమవారం

కమలాంబాం భజరే రే మానస - దీక్షితుల వారి నవావరణ కృతి


ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రీవిద్యోపాసకులు. వారు తిరువారూరులో జన్మించారు. అక్కడ త్యాగరాజస్వామి దేవస్థానంలో వెలసిన కమలాంబికను ఉపాసన చేసి తరించారు.  ఆ అమ్మ పేరుతోనే తిరువారూరు కమలాలయక్షేత్రంగా కూడ పిలువబడింది. ఈ దేవస్థానం సమీపంలో కమలాలయ తటాకం ఉండటం  విశేషం. ఈ కమలాంబ ప్రత్యేకతలు ఎన్నో. అమ్మవారు సుఖాసీనురాలుగా కాకుండా యోగ ముద్రలో ఒక కాలి మీద మరొక కాలు మెలిక వేసి కూర్చొని ఉంటుంది. తన చేత కమలము, పాశాంకుశము, రుద్రాక్ష ధరించి యోగినిగా దర్శనమిస్తుంది. శ్రీవిద్యా ఉపాసనా పద్ధతిలో ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు. దీక్షితుల వారు  ఈ కమలాంబ శ్రీ విద్యా ఉపాసనతో జ్ఞాన దృష్టి కలిగి ఈ అమ్మపై 9 కీర్తనలను రచించారు. వీటిని నవావరణ కృతులు అంటారు. శ్రీచక్రంలో ఉన్న తొమ్మిది ఆవరణలకు ఈ తొమ్మిది కృతులను దీక్షితుల వారు రచించారు. ధ్యానము, మంగళము కలుపుకొని మొత్తం 11 కమలాంబ కృతులు ఆయన జ్ఞాన ధారగా వెలువడ్డాయి. తోడి రాగంలో ధ్యాన కృతి కమలాంబికే, తరువాత ఆనందభైరవిలో కమలాంబ సంరక్షతు, కళ్యాణి రాగంలో కమలాంబాం భజరే, శంకరాభరణ రాగంలో శ్రీ కమలాంబికాయ రక్షితోహం, కాంభోజి రాగంలో కమలాంబికాయై, భైరవిలో శ్రీ కమలాంబాయాః పరం, పున్నాగవరాళి రాగమలో కమలాంబికాయాస్తవ, శహానా రాగంలో శ్రీ కమలాంబికాయాం, ఘంట రాగంలో శ్రీ కమలాంబికే, ఆహిరి రాగంలో శ్రీ కమలాంబా జయతి, శ్రీ రాగంలో శ్రీ కమలాంబికే అనే 11 కృతులను రచించారు.

ఈ కీర్తనలలో విభక్తి అవరోహణ ప్రత్యేకత. కృతుల సాహిత్యాన్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది. ఈ నవావరణ కీర్తనలు గానానికి క్లిష్టతరమైనవిగా చెప్పబడతాయి. లోకానికి ఈ ఉపాసనలోని గొప్పతనాన్ని చెప్పటానికి ఆయన దేవతల, యోగినుల వివరాలతో ఈ కృతులను రచించారు. చక్రాలను, ఆయా దేవతల వలన కలిగే సిద్ధులను ఆయన వర్ణించారు. శ్రీవిద్యా ఉపాసన అందరికీ కాదు. చాలా నిష్ఠగా, అర్హులైన గురువుల అనుగ్రహంతో చేయవలసినది. ఈ ఉపాసన సరిగ్గా తెలిసిన గురువులు కూడా చాలా తక్కువ. ఈ నాటి కాలంలో ఇటువంటి ఉపాసన తాంత్రికంగా భావించబడుతుంది. కానీ, దీక్షితుల వారు సిద్ధులైన వారు. తిరువారూరులో అమ్మను ఉపాసన చేస్తూ ఈ కృతులను రచించారు.

కమలాంబ నవావరణ కృతులలో రెండవ కృతి కమలాంబాం భజరే రే మానస. వివరాలు:

సాహిత్యం
=======

కమలాంబాం భజరే రే మానస కల్పితమాయాకార్యం త్యజ రే

కమలావాణీసేవితపార్శ్వాం కంబుజయగ్రీవాం నతదేవాం
కమలాపురసదనాం మృదుగదనాం కమనీయరదనాం కమలవదనాం

సర్వాశాపరిపూరకచక్రస్వామినీం పరమశివకామినీం
దుర్వాసార్చిత గుప్తయోగినీం దుఃఖధ్వంసినీం హంసినీం
నిర్వాణనిజసుఖదాయినీం నిత్యకల్యాణీం కాత్యాయనీం
శర్వాణీం మధుపవిజయవేణీం సద్గురుగుహజననీం నిరంజనీం
గర్వితభండాసురభంజనీం కామాకర్షిణ్యాదిరంజనీం
నిర్విశేషచైతన్యరూపిణీం ఉర్వీతత్వాదిస్వరూపిణీం

భావం
=====

ఓ మనసా! కమలాంబను భజింపుము. మాయా కార్యములను త్యజించుము. వింజామరలను ధరించిన లక్ష్మీ సరస్వతులచే ప్రక్కభాగములందు సేవింపబడే ఆది పరాశక్తి, శంఖాన్ని మించిన కంఠము కలిగినది, దేవతలచే నుతించబడేది, కమలాపురంలో (తిరువారూరులో) వెలసినది, మృదువైన మాటలు,అందమైన పలువరస, కమలము వంటి ముఖము కలిగిన కమలాంబను భజింపుము. అన్ని దిక్కులలోను వ్యాపించి శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత అయినది, పరమశివుని అర్థాంగి అయిన కమలాంబను భజింపుము. దుర్వాసునిచే అర్చించబడిన గుప్తయోగిని స్వరూపిణి, దుఃఖములను తొలగించే దేవి, ఆత్మ మంత్ర స్వరూపిణి, తనదైన మోక్షానందమును ప్రసాదించే తల్లి, నిత్య మంగళ స్వరూపిణి, కాత్యాయని, పరమశివుని పత్ని, తుమ్మెదల నలుపును మించిన కురులు కలిగినది, జ్ఞాననిధియైన సుబ్రహ్మణ్యుని జనని, అజ్ఞానమును తొలగించే జ్ఞానస్వరూపిణి, గర్వముతో అంధుడైన భండాసురుని సంహరించినది, శ్రీచక్రములోని రెండవ ఆవరణలో ఉన్న కామాకర్షిణి దేవతలను రంజింపజేసేది, గుణము, ఉపాధి లేని శుద్ధచైతన్య స్వరూపిణి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతములు మొదలైన వాటి రూపము కలది అయిన కమలాంబను భజింపుము, మాయా కార్యములను త్యజించుము. 

శ్రవణం
======

కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

చిత్రం
====

తిరువారూరులోని కమలాంబ మూల రూపం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి