20, నవంబర్ 2020, శుక్రవారం

త్యాగరాజస్వామి లాల్గుడి పంచరత్న కృతి - ఈశ పాహిమం

కర్నాటక సంగీత త్రయంలో త్యాగరాజస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఐదు రకాల పంచరత్న కృతులను రచించారు. అవి ఘనరాగ పంచరత్న కృతులు, తిరువొట్ట్రియూర్ పంచరత్న కృతులు, కోవూరు పంచరత్న కృతులు, శ్రీరంగ పంచరత్న కృతులు, లాల్గుడి పంచరత్న కృతులు. వీటిలో ఘనరాగ పంచరత్న కృతులు జగత్ప్రసిద్ధమైనవి, తిరువాయూరులో, ప్రపంచమంతటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలలో ఆలపించబడేవి. మిగిలినవి తిరువొట్ట్రియూరులోని త్యాగరాజస్వామి దేవస్థానంలోని త్రిపురసుందరీ అమ్మవారిపై, కోవూరు సుందరేశ్వరునిపై, శ్రీరంగంలోని రంగనాథస్వామిపై, లాల్గుడిలోని సప్తఋషీశ్వర స్వామి దేవస్థానంలోని స్వామిపై, అమ్మపై రచించారు. 

సుబ్రహ్మణ్యుని శాపం నుండి విముక్తి కలిగేందుకు సప్తఋషులు తపస్సు చేసి పరమశివుని కరుణతో శాపవిముక్తులైనారు. అందుకే లాల్గుడిలో వెలసిన ఆ పరమశివుని రూపానికి సప్తఋషీశ్వరుడని పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి పేరు మహిత ప్రవృద్ధ శ్రీమతి. ఇక్కడి దేవాలయం ఎనిమిదవ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది, స్వామి లింగం స్వయంభూ. లాల్గుడిని సందర్శించినప్పుడు త్యాగరాజస్వామి అయ్యవారిపై, అమ్మవారిపై రచించిన పంచరత్న కృతులు - గతి నీవని (తోడి), లలితే శ్రీప్రవృద్ధే (భైరవి), దేవ శ్రీ (మధ్యమావతి), మహిత ప్రవృద్ధ (కాంభోజి), ఈశ పాహిమాం (కల్యాణి). చివరి కృతి వివరాలు:

సాహిత్యం
========

ఈశ పాహిమాం జగదీశ పాహిమాం

ఆశరగణ మదహరణ బిలేశయ భూష సప్తఋషీ(శ)

శ్రీనాథ కరార్చిత దొరికేనాల్పులకీదర్శన
మేనాటి తపఃఫలమో నీ నామము దొరకె
శ్రీ నారద గానప్రియ దీనార్తి నివారణ పర
మానందార్ణవ దేవ యనాపజనక సప్తఋషీ(శ)

వ్యాసార్చిత పాలిత నిజదాస భూలోక కై
లాసంబను పల్కులు నిజమే సారెకు గంటి
నీసాటి ఎవరయ్యా నీ సాక్షాత్కారమున
వేసట లెల్ల దొలగె నేడే జన్మము సాఫల్యము 

సామాది నిగమ సంచార సోమాగ్ని తరణి లోచన
కామాది ఖండన సుత్రామార్చిత పాద
హేమాచల చాప నిను వినా మరెవరు ముని మనో
ధామ త్యాగరాజ ప్రేమావతార జగ(దీశ)

భావం
======

పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. రాక్షస గణముల అహంకారాన్ని అణచేవాడవు, సర్పములు ఆభరణములు కలవాడవు, సప్తఋషీశ్వరుడవైన పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. శ్రీహరి కరములచే పూజించబడిన వాడవు, అల్పులకు నీ దర్శనము దొరికేనా? ఇది ఏ నాటి తపస్సుల ఫలమో నీ నామము లభించింది. నారదుని గానాన్ని ఆనందించేవాడవు, దీనజనుల ఆర్తిని నివారణ చేసే వాడవు, పరమానందమనే సముద్రము వంటి వాడవు, అగ్నిదేవునికి తండ్రివి, సప్తఋషీశ్వరుడవైన పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. వ్యాసునిచే పూజించబడిన వాడవు, నిజభక్తులను రక్షించేవాడవు, కాబట్టే ఈ లాల్గుడి సప్తఋషీశ్వర క్షేత్రానికి భూలోక కైలాసమన్న పేరు సార్థకము. మరల మరల నిన్ను దర్శించాను, నీ సాటి ఎవ్వరూ లేరు, నీ సాక్షాత్కారముతో నా అలసటలన్నీ తొలగాయి, నా జన్మ సఫలమైనది, పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. సామాది వేదములలో సంచరించేవాడవు, సూర్యచంద్రాగ్నులు నేత్రములుగా కలవాడవు, కామాది అరిషడ్వర్గములను నాశనము చేసేవాడవు, ఇంద్రునిచే అర్చించబడిన పాదములు కలవాడవు, మేరు పర్వతమును చాపముగా ధరించినవాడవు, నీవు గాక నాకు దిక్కెవరు. మునుల మనసులలో నివసించేవాడవు, ప్రేమావతారుడవైన ఓ పరమేశ్వరా! జగదీశ్వరా! నన్ను రక్షించుము. 

శ్రవణం
=======

కల్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఈ కృతిని ఓ ఎస్ త్యాగరాజన్ గారు ఆలపించారు

15, నవంబర్ 2020, ఆదివారం

ఈ వసుధ నీ వంటి దైవము - త్యాగరాజస్వామి వారి కృతి

 

సంగీత త్రయంలో ఉన్న ఒక ప్రత్యేకత అనేక క్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడి దేవతామూర్తులపై కృతులను రచించటం. ముత్తుస్వామి దీక్షితులవారు భారతదేశమంతా తీర్థయాత్రలు చేశారు, అందుకే చాలా ఎక్కువ కృతులు అటువంటివి రచించారు. త్యాగరాజస్వామి ఎక్కువమటుకు తిరువయ్యారులోనే ఉండేవారు. అప్పుడప్పుడు తీర్థయాత్ర చేసిన క్షేత్రాలలో దేవతామూర్తులపై ఆయన కూడా కృతులను రచించారు. అటువంటి కృతి ఒకటి శహన రాగంలో కూర్చబడిన ఈ వసుధ నీ వంటి దైవము. చెన్నై సమీపంలోని కోవూరు సుందరేశ్వరునిపై ఆయన ఐదు కృతులను రచించారు. అవి కోవూర్ పంచరత్న కృతులుగా పేరొందాయి. దీని వెనుక ఒక గాథ ఉంది. 

త్యాగరాజస్వామి వారు తిరుమల తీర్థయాత్రకు వెళుతూ మధ్యలో కోవూరులో సుందరేశ మొదలియార్ అనే జమీందారును కలుస్తారు. త్యాగరాజస్వామి వారిని మొదలియార్ గారు కొన్ని కృతులను తనపై కృతులను రచించమని కోరతాడు. తాను మానవులను నుతిస్తూ కృతులను రచించనని చెప్పి త్యాగరాజస్వామి తిరుపతి బయలుదేరతారు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలో బందిపోటు దొంగలు త్యాగరాజస్వామి వారి సమూహంపై దాడిచేయబోగా స్వామి వారికి తన వద్ద ఏమీ లేదని చెబుతారు. ఆ బందిపోట్లు తమపై రాళ్లు విసిరిన ఇద్దరు తేజోమూర్తులెవరు అని ప్రశ్నిస్తారు. త్యాగరాజస్వామి వారిని రామలక్ష్మణులుగా గుర్తించి ఆ బందిపోట్ల భాగ్యానికి ఆనందిస్తారు. కోవూరు క్షేత్రానికి గల మహిమను గ్రహించి అక్కడి సుందేశ్వరుడు, సౌందరాంబికను దర్శించుకుని ఐదు కృతులను రచిస్తారు. ఆ కృతులను విన్న మొదలియారు అవి తనపై రచన చేశారు అనుకుని సంతోషించగా త్యాగరాజస్వామి ఆ కృతులను తాను కోవూర్ సుందరేశ్వరునిపై రచించాను అని చెప్పి తిరిగి తిరువయ్యరు వెళ్లిపోతారు. ఈ కోవూరు పంచరత్న కృతులు - ఈ వసుధ (శహన), కోరి సేవింప (ఖరహరప్రియ), శంభో మహాదేవ (పంతువరాళి), నమ్మి వచ్చిన (కల్యాణి), సుందరేశ్వరుని (శంకరాభరణం). వాటిలో ఈ వసుధ నీ వంటి అనే కృతి వివరాలు:


సాహిత్యం
========

ఈ వసుధ నీ వంటి దైవమునెందు గానరా

భావుకము గల్గి వర్ధిల్లు కోవూరి సుందరేశ గిరీశ

ఆసచే అరనిముషము నీ పురవాస మొనర ఏయు వారి మది
వేసటలెల్లను తొలగించి ధనరాశులనాయువును
భూసుర భక్తియు తేజమునొసగి భువనమందు కీర్తి గల్గ జేసే
దాస వరద త్యాగరాజ హృదయ నివాస చిద్విలాస సుందరేశ

భావం
=====

శుభములు కలిగించుచు వర్ధిల్లే ఓ కోవూరి సుందరేశా! గిరీశ్వరా! ఈ భూమిపై నీవంటి దైవమును ఎక్కడా కానలేను. ఆశతో అరనిమిషమైన నీ సన్నిధిలో యుండే వారి మనసులోని పరితాపములను తొలగించి ధనరాశులను, ఆయుష్షును, బ్రాహ్మణుల పట్ల భక్తిని, తేజస్సును ప్రసాదించి ఈ జగత్తులో కీర్తిని కలిగించేవాడవు, దాసులకు వరములొసగే వాడవు, త్యాగరాజుని హృదయములో నివసించేవాడవు, చిద్విలాసుడవైన ఓ సుందరేశా! ఈ భూమిపై నీవంటి దైవమును ఎక్కడ కానలేను. 

శ్రవణం
======

శహన రాగంలో కూర్చబడిన ఈ కృతిని జీఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు

14, నవంబర్ 2020, శనివారం

రారా మా ఇంటి దాక - త్యాగరాజస్వామి వారి కృతి



ప్రహ్లాద విజయం త్యాగరాజస్వామి వారు రచించిన అద్భుతమైన యక్షగానం. అనేక కృతులతో, పద్యాలతో, గద్యంతో ఈ యక్షగానం ప్రహ్లాదుని భక్తిని, శ్రీహరి రూపమైన రాముని అనుగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. సాగర తీరంలో శ్రీహరి దర్శన భాగ్యం కలిగిన తరువాత స్వామి ప్రహ్లాదుని తన తొడపై కూర్చుండబెట్టుకుని చేతులతో నిమిరి ప్రహ్లాదుని కౌగిలించుకుంటాడు. ఆ భాగ్యాన్ని ఆస్వాదించిన ప్రహ్లాదుడు స్వామిని తన నివాసానికి రమ్మని వేడుకునే కృతి ఇది. పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు నిరంతర శ్రీహరి దర్శనాభిలాషియై స్వామిని తనతోనే ఉండమనే భావనను ఈ కృతి ద్వారా త్యాగరాజస్వామి తెలియజేశారు. ప్రహ్లాదుని హరిభక్తిలో ఉండే శరణాగతి, అనన్యమైన విశ్వాసాలు ఈ కృతిలో స్పష్టంగా మనకు గోచరిస్తాయి. వాగ్గేయకారులు భాగవతోత్తములపై ఇటువంటి రచనలు చేయటంలో ఉద్దేశం వారి మార్గంలోని ఔన్నత్యాన్ని, వారి భావనలను మనకు తెలియజేయటానికే. అందుకు సంగీత సాహిత్యాలకు మించిన సాధనమేముంటుంది? అందుకే త్యాగరాజస్వామి ప్రహ్లాద విజయం మేటి యక్షగానంగా నిలిచిపోయింది. 

సాహిత్యం
========

రారా మా ఇంటి దాక! రఘువీర! సుకుమార! మ్రొక్కేరా!

రారా దశరథ కుమార! నన్నేలుకోరా! తాళలేరా!

కోరిన కొర్కెలు కొనసాగకనే నీరజనయన నీ దారిని గని వే 
సారితి గాని సాధు జనావన సారి వెడలి స్వామి నేడైనా

ప్రొద్దున లేచి పుణ్యము తోటి బుద్ధులు చెప్పి బ్రోతువు గాని 
ముద్దుగారు నీ మోమును జూచుచు వద్ద నిలచి వారము పూజించేను

దిక్కు నీవనుచు తెలిసి నన్ను బ్రోవ గ్రక్కున రావు కరుణను నీ చే 
జిక్కియున్న నన్ను మరతురా ఇక శ్రీ త్యాగరాజుని భాగ్యమా

భావం
=====

ఓ రఘువీర! సుకుమార! నీకు మ్రొక్కెదను మా యింటి దాకా రారా! ఓ దశరథ కుమారా, నేనిక తాళలేకున్నాను నన్నేలుకొనుటకు రారా! నేను కోరుకున్న కోరికలు తీరకనే నీవు వెళ్లిపోయినంత నేను వేసారితిని. కావున ఓ సాధుజన రక్షకా! మరల ఈరోజైనా రావయ్యా స్వామీ! పొద్దునే లేచి పుణ్యమైన బుద్ధులు నాకు చెప్పి నన్ను బ్రోవుము. నీ ముద్దుగారే మోమును చూచుచు నీ వద్దనే నిలిచి మరల మరల పూజింతును, నీకు మ్రొక్కెదను, మా ఇంటి దాకా వచ్చి నన్ను బ్రోవుము. నీవే దిక్కని తెలిసినా నన్ను బ్రోచుటకు వేగము రావు, నాపై కరుణించుము, నీచేతిలో చిక్కియుంటే నన్ను నేను మరతునురా! నా భాగ్యమా! నీకు మ్రొక్కెదను, ఇక నన్ను బ్రోచుటకు మా ఇంటి దాకా రారా! 

శ్రవణం
======

అసావేరి రాగంలోని ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

12, నవంబర్ 2020, గురువారం

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల - సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి కృతులలో శరణాగతి చాలా కృతులలో గోచరిస్తుంది. సంసార సాగరాన్ని దాటలేని నిస్సహాయ స్థితిలో ఆశ్రితులజనరక్షకుడని పేరొందిన రాముని పాదములను పట్టుకుని విడువకుండా కొలిచే స్థితిని రఘునాయకా నీ పాదయుగ రాజీవముల అన్న కృతిలో ఆవిష్కరించారు. ఎంతో శ్రమపడి రాముని సన్నిధి చేరి శరణు కోరుతున్నాను అని స్వామిని వేడుకున్నారు స్వామి. శ్రీమద్రామాయణంలో ఆశ్రయించిన వారిని రాముడు అమితమైన వాత్సల్యంతో అనుగ్రహించి రక్షించిన సందర్భాలు ఎన్నో. ఆ విధంగానే తాను కూడా, తనను ఆదరించి ఆనందము కలుగజేయవలసిందిగా రాముని ప్రార్థించారు. 

సాహిత్యం
========

రఘునాయకా నీ పాదయుగ రాజీవముల నే విడజాల శ్రీ 

అఘజాలముల పారద్రోలి నన్నాదరించ నీవే గతి గాదా శ్రీ

భవసాగరము దాటలేక నే బలు గాసి పడి నీ మఱుగు జేరితిని
అవనిజాధిపాశ్రితరక్షకా ఆనందకర శ్రీ త్యాగరాజనుత

భావం
=====

రఘుకుల శ్రేష్ఠుడవైన శ్రీరామా! నీ పదకమలములను నే విడువను. నా పాపసమూహములను పారద్రోలి ఆదరించుటకు నీవే గతి కదా! ఈ సంసార సాగరము దాటలేక నేను ఎంతో శ్రమపడి నీ సన్నిధికి చేరుకున్నాను. భూమిజయైన సీతకు పతివైన శ్రీరామా! నీవు ఆశ్రితరక్షకుడవు, ఆనందమును కలిగించేవాడవు! శివునిచే నుతించబడిన వాడవు, నీ పదకమలములను నేను విడువలేను. 

శ్రవణం
=======

హంసధ్వని రాగంలో కూర్చబడిన ఈ కృతిని ప్రియా సోదరీమణులు షణ్ముఖ ప్రియ, హరిప్రియ ఆలపించారు

11, నవంబర్ 2020, బుధవారం

నిన్నాడనేల - సద్గురువులు త్యాగరాజస్వామి కృతి

 


దైవనింద నాస్తికులే కాదు, భక్తిమార్గంలో ఉన్నవారెందరో కూడా చేస్తారు. దీనికి కారణం ఈ భవసాగరంలో ఎదురయ్యే బాధలు, సమస్యలను తట్టుకోలేక తాము నమ్ముకున్న దైవం కూడా కాపాడటం లేదు అన్న ఆవేదనతో. కానీ భగవదనుగ్రహం ఎప్పుడూ సానుకూల ఫలాలలోనే కాదు, భవసాగర తారణంలో కలిగే పాఠాలలో కూడా ఉంటుంది అనేది భగవంతుడు సాక్షీభూతుడుగా ఉండటంలో రహస్యం. ఇది సద్భక్తులకు అనుభవపూర్వకంగా అవగతమవుతుంది. అందుకే ఆధ్యాత్మిక కొండను ఎక్కుతున్న భక్తునికి మొదటి భాగంలో అనేక రకాల భావనలు వస్తాయి, ముందుకు వెళుతున్న కొద్దీ అనేక ప్రశ్నలకు సమాధానాలు లభించిన తరువాత దైవనింద చేయటం తగ్గుతుంది. పూర్వజన్మ కర్మఫలాలు కొన్నిటిని అనుభవించక తప్పదు అన్నది చాలా మెట్లు ఎక్కితే కానీ మనసు అంగీకరించదు. ఆ తరువాత ప్రయాణంలో అటువంటి ఆలోచనా తరంగాలు సద్దుమణుగుతాయి, తారణం సాఫీగా సాగుతుంది. 

అనుభవపూర్వకంగా కలిగే ఈ జ్ఞానాన్ని తన కృతిద్వారా వివరించారు సద్గురువులు త్యాగరాజస్వామి. సాక్షీభూతుడైన స్వామికి నిన్నాడనేల అని తన ఉన్నతమైన భావనలను తెలియజేశారు. కన్నడ రాగంలోని ఈ కృతిని హైదరాబాద్ సోదరులు శేషాచార్యులు, రాఘవాచార్యులు ఆలపించారు. కన్నడ రాగం ధీర శంకరాభరణ జన్యం. అందమైన గమకాలతో త్యాగరాజస్వామి భావనలను మనోజ్ఞంగా కన్నడ రాగం ఆవిష్కరిస్తుంది. 

నిన్నాడనేల! నీరజాక్ష శ్రీరామ!

కన్నవారిపైని కాకసేయనేల!

కర్మానికి తగినట్టు కార్యములు నడిచేని
ధర్మానికి తగినట్టు దైవము బ్రోచేని

చిత్తానికి తగినట్టు సిద్ధియు కలిగేని
విత్తానికి తగినట్టు వేడుక నడిచేని

సత్త్వరూప నిన్ను సన్నుతి జేసి
తత్త్వము దెలిసిన త్యాగరాజునికి

కలువలవంటి కన్నులు కలిగిన శ్రీరామా! నా కష్టములకు నిన్ను నిందించుట తప్పు. మన కష్టాలకు కన్న తల్లిదండ్రులపై కోపగించుకొనుట యెందుకు? కర్మలకు తగినట్లుగానే కదా ఫలములు, తదుపరి కార్యములు నడిచేది? ధర్మాచరణను బట్టి కదా దైవానుగ్రహము? మన చిత్తశుద్ధిని బట్టి కదా మనకు సిద్ధించే ఫలాలు? డబ్బుకు తగినట్లు కదా వేడుకలు? శుద్ధ సత్త్వ స్వరూపుడవైన నిన్ను నుతించి నీ తత్త్వము గ్రహించినాను, నేను నిందించే పని లేదు శ్రీరామా! 

7, నవంబర్ 2020, శనివారం

అక్షయలింగ విభో స్వయంభో - ముత్తుస్వామి దీక్షితుల కృతి

ముత్తుస్వామి దీక్షితులవారి కృతులలో ఎక్కువ మటుకు క్షేత్ర కృతులే. అనగా, దక్షిణ భారత దేశంలో ఉన్న అనేక దివ్యక్షేత్రాలను సందర్శించి, ఆ దేవతను ఆయన ఉపాసన చేసినప్పుడు రచించినవి. అటువంటి కృతి ఒకటి తమిళనాడులోని నాగపట్టణం జిల్లా కీళ్వేలూరులో ఉన్న అక్షయలింగేశ్వర క్షేత్రంలో వెలసిన స్వామిపై రచించినది. క్షేత్ర ప్రస్తావనలో వాగ్గేయకారులు ఆ క్షేత్రంలోని దేవతలతో పాటు ఇతర వివరాలను కూడా సుస్పష్టంగా పొందుపరచటంలో ఉద్దేశం ఆయా క్షేత్రాలు, దేవతామూర్తుల యొక్క విశిష్టతను, విలక్షణతను శాశ్వతం చేయటం కోసమే. ఇక్కడ అమ్మవారు, స్వామి బదరీవృక్షం క్రింద స్థితమై ఉంటారు. అలాగే ఇక్కడ భద్రకాళీ అమ్మ వారి మూర్తి కూడా ఉంది. వీటిని కృతిలో దీక్షితులవారు ప్రస్తావించారు. అక్షయలింగేశ్వర స్వామి క్షేత్రం చాలా పురాతనమైనది. స్వయంభూ లింగ స్వరూపంలో పరమశివుడు సుందరకుచాంబిక, భద్రకాళిగా పార్వతీ దేవి, వినాయకుడు, కుమారస్వామితో సహా అనేక దేవతామూర్తులు ఈ క్షేత్రంలో ఉన్నాయి. శైవయోగి, కవి జ్ఞానసంబంధర్ రచనలలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. కృతిలో చైత్రపూర్ణిమ నాడు స్వామికి జరిగే భవ్యమైన రథోత్సవ ప్రస్తావన కూడా దీక్షితార్ చేశారు. సనాతన ధర్మ పరిరక్షణలో దీక్షితార్ కృతుల పాత్ర ఎనలేనిది. ఇప్పుడు ద్రావిడవాదం వచ్చి పేర్లు మార్చబడినా, ఒకనాడు తమిళనాడులో ఉన్న క్షేత్రాలు, దేవతల నామాలన్నీ కూడా సనాతన ధర్మానికి మూలమైన సంస్కృత భాషలో ఉన్నవే. దీక్షితుల వారు ఆ నామాలనే తన కృతులలో ఉపయోగించారు. 

ధీరశంకరాభరణ రాగంలో కూర్చబడిన ఈ కృతిని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

అక్షయలింగ విభో స్వయంభో అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో

అక్షయ స్వరూప అమిత ప్రతాప ఆరూఢ వృషవాహ జగన్మోహ
దక్ష శిక్షణ దక్షతర సుర లక్షణ విధి విలక్షణ లక్ష్య
లక్షణ బహు విచక్షణ సుధా భక్షణ గురు కటాక్ష వీక్షణ

బదరీ వనమూల నాయికాసహిత భద్రకాళీశ భక్త విహిత
మదన జనకాది దేవ మహిత మాయాకార్య కలనా రహిత
సదయ గురుగుహ తాత గుణాతీత సాధు జనోపేత శంకర నవనీత
హృదయ విభాత తుంబురు సంగీత హ్రీంకార సంభూత హేమగిరి నాధ
సదాశ్రిత కల్పక మహీరుహ పదాంబుజ భవ రథ గజ తురగ
పదాది సంయుత చైత్రోత్సవ సదాశివ సచ్చిదానందమయ

ఓ అక్షయలింగ ప్రభో! నీవు స్యయంభువుడవు, సమస్త విశ్వములకు ప్రభువువుం శంకరుడవు, నన్ను రక్షింపుము. నాశనము లేని స్వరూపము కలవాడవు, అమిత ప్రతాపవంతుడవు, నందీశ్వరుని అధిరోహించిన జగన్మోహనుడవు. దక్షుని శిక్షించినవాడవు, దేవతలకు విధివిధానములను, విలక్షణమైన తత్త్వములను, లక్ష్యములను దక్షిణామూర్తి రూపములో శిక్షణనొసగిన నిపుణుడవు, అనేక రకములైన విచక్షణ కలవాడవు, అమృతమును సేవించేవాడవు, ఘనమైన కటాక్ష వీక్షణము కలవాడవు, నన్ను రక్షింపుము. బదరీ వనములో పార్వతీదేవి సమేతుడవై యున్నవాడవు, భద్రకాళికి ప్రభువువు, భక్తులకు హితుడవు. మదనుని జనకుడైన శ్రీహరి మొదలైన దేవతలచే నుతించబడిన వాడవు, మాయ చేసే కల్పనలకు అతీతుడవు, ఎల్లప్పుడూ కుమారస్వామిపై పితృవాత్సల్యమును కురిపించేవాడవు, గుణాతీతుడవు, సాధుజనుల సమీపములో ఉండి శుభములు కలిగించేవాడవు, వెన్నవంటి హృదయము కలవాడవు, తుంబురుని సంగీతమును ఆనందించేవాడవు, హ్రీంకారము నుండి ఉద్భవించినవాడవు, కైలాసపతివి, నీ పదకమలములను ఆశ్రయించేవారికి కల్పవృక్షము వంటివాడవు, భవుడవు, రథ గజ తురగ పదాది సైన్యముతో చైత్రోత్సవములో ప్రకాశించే సదాశివుడవు, సచ్చిదానందమయుడవు. నన్ను రక్షింపుము.

చిత్రం కీళ్వేలూరులోని కెదిలియప్పర్ (అక్షయలింగేశ్వరుని) రూపము

6, నవంబర్ 2020, శుక్రవారం

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా - త్యాగరాజస్వామి కృతి


మానసిక స్థితిని బట్టి ఆధ్యాత్మిక అనుభూతులు. మన ధర్మంలో ఈ సత్యానికి ఎన్నో నిదర్శనాలు. సద్గురువులు త్యాగరాజస్వామి వారి కృతులలో ఇది మనకు సుస్పష్టంగా గోచరిస్తుంది. కనబడలేదని విచారము, దయలేదని నిష్ఠూరము, ఉన్నాడో లేడో అని సంశయము, మహిమ అనుభూతికి రాగానే అమితానందము, అంతటా ఉన్నాడని గ్రహింపుకు వస్తుంటే తనువు పులకింత, అది అనుభవాల ద్వారా మరింత ప్రగాఢమై అంతర్ముఖమైన సాధన, అన్నిటికీ రాముడే రక్ష అన్న దృఢమైన విశ్వాసముతో ఎటువంటి క్లేశాన్నైనా భరించే ఓర్పు...ఇలా త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ప్రయాణంలో సమస్త లక్షణాలూ తన కృతులలో వ్యక్తపరచారు. మలిదశలో పరిణతి చెందిన భక్తివిశ్వాసములతో పరిపుష్టమైన మానసిక వికాసము కనబరచిన ఒక కృతి తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా. 

సాహిత్యము:

తలచినంతనే నా తనువైతే ఝల్లనెరా

జలజ వైరి ధరాది విధీంద్రుల
చెలిమి పుజలందిన నిను నే

రోటికి కట్టదగిన నీ లీలలు
మూటికెక్కువైన నీదు గుణములు
కోటిమదనలావణ్యమునైన
సాటి గాని నీ దివ్యరూపమును 

నిద్రాలస్య రహిత శ్రీరామ 
భద్రానిలజ సులభ సంసార
చ్ఛిద్రార్తిని దీర్చే శక్తిని విధి
రుద్రాదుల నుతమౌ చరితంబును

పాదవిజిత మునితరుణీ శాపా
మోద త్యాగరాజనుత ధరాప
నాదబ్రహ్మానంద రూప
వేదసారమౌ నామధేయమును

భావము:

ఓ శ్రీరామా! నిన్ను తలచినంతనే నా శరీరామంతా ఝల్లుమని పులకరిస్తుంది. కమలమునకు శత్రువైన చంద్రుని శిరమున ధరించే పరమశివుడు, బ్రహ్మేంద్రాదుల స్నేహము, పూజలు అందుకున్న నిన్ను తలచినంతనే నా శరీరము పులకిస్తుంది. శ్రీకృష్ణావతారములో నీ అల్లరి చేష్టలకు యశోదమ్మ నిన్ను రోటికి కట్టివేయుట, త్రిగుణాతీతమైన నీ గుణములు, కోటి మన్మథులకైన సాటి కాని సౌందర్యము గల నీ దివ్యరూపమును తలచినంతనే నా శరీరమంతా పులకించును. నిద్ర, అలసత్వము మొదలైన తమోగుణములు లేని శ్రీరామా! భద్రునికి, ఆంజనేయునికి నీవు సులభుడవు! సంసార దోషములనే ఆర్తులను తీర్చే శక్తి కలిగిన వాడవు! బ్రహ్మ రుద్రాదులచే నుతించబడిన చరితము కలిగిన నిన్ను తలచినంతనే నా శరీరము పులకించును. సమస్త భూమండలమును పాలించి, ఆనందముతో పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీ పాద ధూళిని తాకినంతనే శాపవిముక్తురాలైన గౌతమముని పత్ని అహల్య చరితము, నీ నాదబ్రహ్మానంద స్వరూపము, వేదముల సారమైన నీ నామమును తలచినంతనే  నా శరీరమంతా ఝల్లని పులకిస్తుంది. 

వివరణ:

పరబ్రహ్మ స్వరూపమైన రాముని గుణములను, సౌందర్యాన్ని, వైభవాన్ని తెలిపే రామాయణాది వాఙ్మయం మనకు నిత్య పూజనీయమైనవి. శ్రీరాముని చరితమును అత్యంత మనోజ్ఞముగా వర్ణించిన వాల్మీకి మహర్షి రచించిన రామాయణం పఠించేటప్పుడు ఈ కృతిలో త్యాగరాజస్వామికి కలిగే భావనలన్నీ మనకు కలుగుతాయి. ఆ భావనలు మనసులో నిలిచిపోవాలంటే నిరంతర పునశ్చరణ, నామస్మరణముతో కూడిన సాధన అవసరం. ఆ స్థాయికి త్యాగరాజస్వామి వారు చేరుకున్నాక రాముని తలచుకున్న వెంటనే భవ్యమైన రామ పరబ్రహ్మ తత్త్వముతో పాటు సగుణ వైభవములు కూడా గోచరమై తనువు పులకించి తన్మయత్వము కలిగింది. ఈ భావనలన్నీ సాధకునికి భవసాగరం దాటడానికి అత్యంత ఉపయుక్తమైన ఆలంబనలు. అనంతమైన పరమాత్మ తత్త్వం ముందు మనము, మన కష్టాలు ఎంత? ఘోరమైన శాపం వల్ల  పాషాణమైన అహల్యకు ముక్తిని కలిగించాడు రాముడు, మనలను కూడా అదే విధంగా అనుగ్రహిస్తాడు అన్న భావనను తప్పక కలిగిస్తుంది. రాముని జీవితంలో ప్రతి అడుగూ మనకు ఆదర్శప్రాయమే, మన దోషాలను తొలగించుకుంటూ ముక్తి పథంలో ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి. ఇది అనుభవైకవేద్యంగా తెలిపారు నాదయోగి త్యాగరాజస్వామి. రామనామ స్మరణ, సంకీర్తనల ద్వారా రాముని హృదయములో నిలుపుకుని తరించారు. 

శ్రవణం:

ముఖారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణగారు శ్రావ్యంగా ఆలపించారు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...