4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

దేవ యీ తగవు దీర్చవయ్యా - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

దేవ! యీ తగవు దీర్చవయ్యా! వేవేలకునిది విన్నపమయ్యా!!

తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా!
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడికేగుదురయ్యా!!

పొడుగుచు మనమున బొడమిన యాసలు అదననెక్కడికి నరుగునయా!
వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా!!

లలినొకటొకటికి లంకెలు నీవే అలరుచునేమని యందునయా!
బలు శ్రీవేంకటపతి నాయాత్మను గలిగితివెక్కడి కలుషములయ్యా!!

దేవా! నీకు వేవేల విన్నపాలు, ఈ తగవు కాస్త తీర్చవయ్యా! ఈ దేహములో మొలిచిన ఇంద్రియములు, ప్రేగులు క్షీణించి ఎక్కడికి పోవును? తల్లి చుట్టూ తిరిగే బిడ్డలు విడిచి ఎక్కడికేగుదురు? మనసులో మొలకెత్తిన ఆశలు పెరుగుతూ ఆ తరువాత ఎక్కడికి వెళతాయి? దాగుతూ నీటిలో ఉండే మత్స్యములు ఆ తరువాత ఏ గతి పొందును? క్రమక్రమముగా ఒకటికొకటి లంకెలు వేసేది నీవే, నేనేమని చెప్పేది? ఓ వేంకటనాథా! నీవే నా ఆత్మయైనప్పుడు ఈ కలుషములు ఎలా కలిగినాయి?

సావేరి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

చక్కని తల్లికి చాంగు భళా - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

చక్కని తల్లికి చాంగు భళా తన చక్కెర మోవికి చాంగు భళా

కులికెటి మురిపెపు గుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగు భళా
పలుకుల సొలపుల పతితో గసరెడి చలముల యలుకకు చాంగు భళా

కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెరుగులకు చాంగు భళా
ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగు భళా

జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగు భళా
విందై వేంకట విభు బెనచిన తన సంది దండలకు చాంగు భళా

తీయనైన అధరములు కలిగిన చక్కనైన తల్లికి జయము జయము! మురిపెము కుమ్మరించే కులుకులతో, గుచ్చేటి చూపులు కలిగిన తల్లికి జయము జయము. విముఖమైన పలుకులతో వేంకటపతిని సరసముగా తిరస్కరించే, పట్టుదలతో కూడిన అలకలు కలిగిన తల్లికి జయము జయము. వీణ ధరించి పతి పక్కన నిలచి మెరిసేటి స్తనములు కలిగిన తల్లికి జయము జయము. ఉన్నతుడైన పతిపైకి ఒరిగి నిలిచే సన్నని నడుము కలిగిన తల్లికి జయము జయము. బంగారపు ముత్యాల వరుసల హారములు, చందనపు సువాసనలు కలిగిన తల్లికి జయము జయము. పతియైన వేంకటేశ్వరుని మధ్యలోని దండలతో విందుగా పెనవేసుకుని యున్న తల్లికి జయము జయము.

పాడి రాగంలో కూర్చబడిన ఈ కృతిని సుధా రఘునాథన్ గారు ఆలపించారు.

రారా చిన్నన్నా- తాళ్లపాక అన్నమాచార్యుల వారు



రారా చిన్నన్నా రారోరి చిన్నవాడ
రారా ముద్దులాడ రారోరి బాలకృష్ణ రారా! కృష్ణ రారా!!

కిందిచూపుల గిలిగించి ఆలమంద గొల్లెతల మరగించి
సందడి వలపించి జవరాండ్ల ఊరవిందవైనయట్టి వేడుక కాడ!

కొదలు మాటలనె గొణకుచు భూమి సుదతుల శిగ్గులు చూరాడి
చిదుకు చేష్టలనె చెణకుచు ముద్దు పెదవి చవులు చూపిన జాణకాడ!

కలికితనమునె కరగించి కాచి చెలులకాగిటనె చెలగి
లలనామణి యైన లక్కిమమ్మ తలచుక్క శ్రీవేంకటనాథుడైనవాడ!

చిన్ని నా బాలకృష్ణయ్యా! రారా! నిన్ను ముద్దాడాలని ఉంది రారా! నీ కొంటె కింది చూపులతో మమ్మల్ని గిలిగింతలు పెట్టేవు, గోకులాన్ని మైమరపిస్తూ, గోపికలను ఆకర్షించెదవు. సందడి చేస్తూ అందరినీ మురిపిస్తూ స్త్రీలకు కనువిందైన వేడుక వాడా రారా. తీయని మాటలతో చిన్నగా మాట్లాడుచు, గోపకాంతల చీరలు దోచి, చేత కర్రతో చేష్టలుడిగించుచు, ముద్దులను దోచుకునే నేర్పరి రారా! చక్కదనముతో గోపస్త్రీలను కరగించి, వారిని కౌగిట తమను తామే మరచేలా చేసే, నారీరత్నమైన లక్ష్మీదేవికి పూజనీయుడైన శ్రీవేంకటేశ్వరా రారా!

జంఝూటి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

3, సెప్టెంబర్ 2020, గురువారం

పాల జలనిధిలో బాయని - అన్నమాచార్యుల వారి కృతి

పాల జలనిధిలో బాయని
నీలవర్ణుడవట నీవా ఇపుడు

వెదజల్లు మణుల వేయి పడగలను
చెదరని మెరుగుల శేషునిపై
మృదువు బరువుగా మెల్లనే పొరలుచు
నిదురవోదువట నీవా ఇపుడు

పరమ మునీంద్రులు పద్మ భవాదులు
ఇరువంకల నుతించగను
అరవిరి మోమున నల్లన నవ్వెడి
నిరత మూర్తివట నీవా ఇపుడు

పగటున సిరియును పరగిన ధరణియు
బిగియుచు అడుగులు పిసుకగను
తగు వేంకటగిరి తనరుచు చెలగెడి
నిగమ మూర్తివట నీవా ఇపుడు

ఓ వేంకటేశా! పాలకడలిలో నీలవర్ణముతో శాశ్వతుడవై యున్నది నీవే. వేయి పడగలపై కాంతులను వెదజల్లే మణులను కలిగిన ఆదిశేషునిపై చెదరని ప్రకాశముతో మృదువుగా, బరువుగా, మెల్లగా పొరలుతూ నిదురించేవట నీవు. పరమయోగులు, కమలభవుడైన బ్రహ్మ మొదలగు వారు ఇరుప్రక్కల నిలబడి నుతించగా వికసిస్తున్న పూవుల వంటి మోముతో అందముగా నవ్వే శాశ్వతమూర్తివట నీవు. లావణ్యముగా లక్ష్మీదేవి, ప్రయుక్తముగా భూదేవి నీ పాదములను ఒకింత బిగువు చేస్తూ వత్తుచుండగా వేంకటాద్రి శిఖరమున అతిశయముతో ప్రకాశించే వేదస్వరూపుడవు నీవే.

ఇటు గరుడని నీవెక్కినను - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

ఇటు గరుడని నీవెక్కినను
పట పట దిక్కులు బగ్గన పగిలె

ఎగసిన గరుడని యేపున 'ధా' యని
జిగిదొలక చబుకు చేసినను
నిగమాంతంబులు నిగమ సంఘములు
గగనము జగములు గడ గడ వడకె

బిరుసుగ గరుడని పేరెము దోలుచు
బెరసి నీవు కోపించినను
సరుస నఖిలములు జర్జరితములై
తిరువున నలుగడ దిర దిర దిరిగె

పల్లించిన నీ పసిడి గురుడనిని
కెల్లున నీవెక్కినయపుడు
ఝల్లనె రాక్షస సమితి నీ మహిమ
వెల్లి మునుగుదురు వేంకటరమణా

ఓ వేంకటేశ్వరా! నీవు గరుత్మంతుని ఎక్కినపుడు దిక్కులన్నీ పటపటలాడుచు పగిలినట్లుగా పెద్ద శబ్దములు చేసేను. ఎగసిన గరుత్మంతుని విజృంభించి ధా అని కొరడా మెరుపులు మెరిసినట్లు ఝళిపించగా, వేదవేదాంతములు, ఆకాశము, ముల్లోకములు గడ గడ వణికెను. కాఠిన్యముతో నీవు గరుడుని వేగముగా తోలుచు కోపించితే అన్నియు ఢక్కము తిరిగినట్లు శబ్దము చేయుచు నాలుగుదిక్కులా తిరిగెను. జీనువేసిన బంగారు గరుడుని నీవు విజృంంభించి యెక్కినపుడు రాక్షసమూహము భయపడి నీ మహిమయనే ప్రవాహము మునిగెదరు.

(ఈ సంకీర్తన శ్రీహరి కల్క్యావతారము గురించి అని అర్థమవుతోంది. అధర్మము పేట్రేగినపుడు శ్రీహరి కోపోద్రిక్తుడై ధర్మస్థాపనకై ఉద్యుక్తుడైనప్పటి సన్నివేశం ఇది. ఇక్కడ వాహనంగా గరుత్మంతుడని చెప్పినా కూడా కీర్తనలో ఉపయోగించిన చబుక, పల్లించిన మొదలైన పదాలు కల్కి అవతారములోని అశ్వమునే సూచిస్తున్నాయి)

నాట రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు

విన్నపాలు విన వలె - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

విన్నపాలు విన వలె వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య

తెల్లవారె జామెక్కె దేవతలు మునులు
అల్లనల్లనంతనింత అదివో వారే
చల్లని తమ్మి రేకుల సారసపు కన్నులు
మెల్లమెల్లన విచ్చి మేలుకొనవేలయ్య

గరుడ కిన్నెర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరి పరి విధముల పాడేరు నిన్నదివో
సిరి మొగము దెరచి చిత్తగించవేలయ్య

పొంకపు శేషాదులు తుంబురు నారదదులు
పంకజ భవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలు మంగను
వేంకటేశుడా! రెప్పలు విప్పి చూచి లేవయ్య

ఓ శ్రీనివాసా! వింత వింతలైన భక్తుల విన్నపాలు వినుటకు ఆ ఆదిశేషుని పడగలనే దోమతెరను పైకెత్తి మేల్కొనవేల? తెల్లవారింది, జాము పొద్దెక్కింది, దేవతలు మునులు అదిగో అక్కడ చేరుకున్నారు. చల్లనైన కలువరేకుల వంటి అందమిన కన్నులను మెల్లమెల్లగా తెరచి మేలుకొనవేల? అదిగో గరుత్మంతుడు, కిన్నెరులు, యక్షులు, అప్సరసలు గుంపుగా విరహపు గీతాలు, వింతైన ఆలపానలతో పరిపరి విధాల నిన్ను నుతించుచున్నారు సిరులొలికించే ముఖముతో వారిని ఆలకించవేల? అతిశయముగా శేషుడు, తుంబురుడు, నారదుడు, బ్రహ్మ మొదలైన వారు నీ పాదాల వద్దకు చేరి వరుసగా నిలుచున్నారు, నిద్దుర లేచి రెప్పలు విప్పి అలమేలుమంగను చూచి మేల్కొనుము వేంకటేశ్వరా!

భూపాల రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఆలపించారు

కదిరి నృసింహుడు కంభమున వెడలే - తాళ్లపాక అన్నమాచార్యులవారు

కదిరి నృసింహుడు కంభమున వెడలే
విదితముగా సేవించరో మునులు

ఫాలలోచనము భయదోగ్ర ముఖము
జ్వాలామయ కేసరములునూ
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలిచే

ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడ నదరెడి కటములునూ
నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసే

సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూనీ
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివో

ఓ మునులారా! కదిరి నరసింహుడు స్థంభంలో ప్రఖ్యాతముగా వెలసినాడు, స్వామిని సేవించండి! జ్వలించే కన్నులు, భయమును కలిగించే ఉగ్రమైన ముఖము, ప్రకాశించే జూలు, కాలరుద్రునివంటి పదునైన దంతములు, అద్భుతమైన రూపవిన్యాసములతో నారసింహుడు వెలసినాడు, సేవించండి. ముడిపడే కనుబొమ్మలు, దీర్ఘమైన నిట్టూర్పులు, గడగడ అదిరే చెక్కిళ్లు, పొడవైన నాలుక, నిక్కబొడిచిన చెవులు కలిగి విలక్షణ రూపములో నారసింహుడు వెలసినాడు, సేవించండి. సమస్త ఆయుధములు, ఎనలేని చేతులు, భయంకరమైన గోళ్లు కలిగి వింత చేష్టలతో వేగముగా వేంకటేశ్వరుడు దుష్టనాశనానికై ఆవిర్భవించినాడు, సేవించండి.

అఠాణా రాగంలో కూర్చబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...