5, నవంబర్ 2020, గురువారం

అందము ఆనందము రామానుజార్య సంబంధము - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు

త్యాగరాజ శిష్యపరంపరకు చెందిన ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, పండితులు, గురువులు, హరికథా భాగవతార్ శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారు. పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి శిష్యులైన వీరు ఎందరో గొప్ప కళాకారులకు గురువులు. ఎన్నో పుస్తకాలను రచించారు. 1924లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జన్మించిన వీరు వ్యాకరణ మీమాంస శాస్త్రములను అభ్యసించారు. రామకృష్ణయ్య పంతులు గారి వద్ద గురుకుల పద్ధతిలో కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 1948 నుండి 1983 వరకు ఆకాశవాణి విజయవాడలో నిలయ విద్వాంసునిగా పనిచేశారు. గానకళాప్రపూర్ణ, సంగీత సాహిత్య కళానిధి, హరికథా చూడామణి, సంగీత కళాసాగర బిరుదులను పొందారు. ఆకాశవాణి స్వర్ణోత్సవాల సమయంలో, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రత్యేక పురస్కారాలను పొందారు. కృష్ణమాచార్యుల వారు త్యాగరాజస్వామి యక్షగానాలను తెలుగు నుండి సంస్కృతంలోకి అనువదించారు. 20కు పైగా కృతులు, వర్ణాలు, తిల్లానాలు రచించారు. 60 ఏళ్ల సుదీర్ఘమైన సంగీత ప్రస్థానం కలిగిన వీరికి మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ వారు వీరికి వాగ్గేయకార అవార్డును ప్రదానం చేశారు. శ్రీభాష్యం అప్పలాచార్యుల వారితో ఎంతో అనుబంధం ఉన్న వీరు 2006లో పరమపదించారు. 

కృష్ణమాచార్యుల వారు రామానుజుల వారిని నుతిస్తూ రచించిన ఒక చక్కని కృతిని రచించారు. ఈ కృతిని ఆనందభైరవి రాగంలో స్వరపరచారు. ఈ కృతిని వారి శిష్యుడు ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ ఎం.ఎస్.ఎన్ మూర్తి గారి సతీమణి, ప్రఖ్యాత విద్వాంసురాలు డాక్టర్ పంతుల రమ గారు ఆలపించారు

అందము ఆనందము రామానుజార్య సంబంధము దాని
చందము మోక్ష కందము మరి చందనాగురు గంధము 

ఘనము పావనము భాష్యకార పద సేవనము జీ-
వనము సదవనము ప్రాక్తన పాప మోచనము

సారము పుణ్య సారము యతి చంద్రుని దివ్యాకారము జగదా-
ధారము తమోదూరము భూత దయాపారావారము

ధ్యేయము భాగధేయము యతి దినకరు నామధేయము కర్ణ-
పేయము నిరపాయము కృష్ణ గేయము సదుపాయము

ఎవ్వరే రామయ్య నీ సరి - త్యాగరాజస్వామి కృతి


రాముని అనేక సుగుణాలలో వైరివర్గములో ఉన్నా సజ్జనులను గుర్తించి వారికి అభయమిచ్చి అనుగ్రహించటం. సీతమ్మను అపహరించిన రావణుని సోదరుడైన విభీషణుని అనుగ్రహించి లంకకు రాజును చేయటంలో రాముని విచక్షణ ఎంత ఉన్నతమైనదో, సునిశితమైనదో మనం గుర్తించాలి అన్న ముఖ్యమైన అంశాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ రాముని ప్రాతిపదిక విభీషణుని వ్యక్తిత్వం, ధర్మానురక్తి మరియు రావణుని తరువాత లంక సుఖశాంతులతో ఉండాలి అన్న సంకల్పం. రావణుడు చేసిన దారుణానికి విభీషణుని నమ్మకపోవటం అనేది మానవ సహజం, కానీ రాముడు అందుకు భిన్నంగా అతని నైజాన్ని, భక్తిని, సమర్థతను గుర్తించి సముచితమైన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే రాముని మించిన ప్రభువు లేడు అన్నది త్యాగరాజస్వామి సుస్పష్టం చాటారు. 

రామాయణం పఠించి ఆ లోకాభిరాముని వ్యక్తిత్వాన్ని ఆకళింపు చేసుకుంటే రాముడి నడవడిక నుండి మనకు నిత్యజీవితంలో అత్యంత శ్రేయస్కరమైన లక్షణాలు ఎన్నో అవగతమవుతాయి. ఎక్కడ ఉన్నా ధర్మబద్ధమైన నడవడిక కలిగిన వారికి పరమాత్మ అనుగ్రహం ఉంటుంది అన్నది రాముని విచక్షణ ద్వారా మనకు ఎంతో కీలకమైన సందేశం. ఈ సులక్షణాలే మనకు ఎల్లప్పటికీ మార్గదర్శకాలు. 

ఎవ్వరే రామయ్య నీ సరి

రవ్వకు తావులేక సుజనులను రాజిగ రక్షించే వా(రె)

పగవానికి సోదరుడని యెంచక భక్తినెరిగి లంకా పట్టణమొసగగ
నగధర సురభూసుర పూజిత వర నాగశయన త్యాగరాజ వినుత సరి

ఓ రామయ్యా! నీకు సాటి ఎవ్వరు? కీర్తికి భంగము కలుగకుండా సుజనులను సక్రమముగా నీవలె రక్షించే వారెవ్వరు? శత్రు సోదరుడని యెంచక విభీషణుని భక్తిని గుర్తించి లంకా పట్టణమునకు రాజును చేసినావు. మందర పర్వతమును ధరించిన శ్రీహరీ! దేవతలచే, బ్రాహ్మణులచే పూజించబడిన శ్రేష్ఠుడా! ఆదిశేషునిపై శయనించేవాడా! పరమశివునిచే నుతించబడే శ్రీరామా! నీకు సాటి ఎవ్వరు? 

గాంగేయభూషణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు మధురంగా ఆలపించారు

4, నవంబర్ 2020, బుధవారం

రాముడు రాఘవుడు రవికులుడితడు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 
రాముడు రాఘవుడు రవికులుడితడు 
భూమిజకు పతియైన పురుష నిధానము 

అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున
పరగ జనించిన పర బ్రహ్మము
సురుల రక్షింపగ నసురుల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్య తేజము

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సతతము నిలిచిన సాకారము
వింతలుగా మునులెల్ల వెదకినయట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము

వేద వేదాంతముల యందు విజ్ఞాన శాస్త్రములందు
పాదుకొన పలికేటి పరమార్థము
పోదితో శ్రీ వేంకటాద్రి బొంచి విజయనగరాన
ఆదికిననాదియైన అర్చావతారము

సూర్యవంశమున రఘుమహారాజు పరంపరలో జన్మించి సీతమ్మకు పతియైన పురుషోత్తముడు ఈ రాముడు. దశరథ మహారాజు చేసిన పుత్రకామేష్టిలో పరమాన్నమున పరబ్రహ్మ రూపమై, దేవతలను రక్షించుటకు, దానవులను శిక్షించుటకు స్థిరముగా ఆవిర్భవించిన దివ్య తేజో రూపము ఇతడు. నిరంతరం ధ్యానించే యోగిశ్రేష్ఠుల హృదయ కమలములలో ఎల్లప్పుడూ నిలిచిన సాకారము, మునిజనులు ఎంతో ఆతృతతో వెదకే  కాంతులతో ప్రకాశించే ముక్తి పదము ఇతడు. వేద వేదాంతములలో, విజ్ఞాన శాస్త్రములలో పలుకబడిన శాశ్వత పరమార్థము, వైభవముతో రక్షకుడై వేంకటాద్రిపై మరియు విజయనగరములో వెలసి, ఆదికే అనాదియై అర్చించబడే అవతారమూర్తి ఈ రాముడు. 

ఈ కృతిని గరిమెళ్ల అనిలకుమార్ గారు ఆలపించారు

3, నవంబర్ 2020, మంగళవారం

ఆడ మోడి గలదా రామయ్యా! - త్యాగరాజస్వామి కృతి

రామభక్తి సామ్రాజ్యపు దొర హనుమ. మరి ఆ హనుమ స్వామిని మొట్టమొదటి సారి కలిసే రామాయణ ఘట్టంలో రాముడు ఏం చేశాడు? ఇతనెవరో అన్న శంకతో ఉన్న లక్ష్మణుని మాట్లాడేందుకు పంపాడు, తమ్మునికి హనుమ వైభవాన్ని అద్భుతంగా లక్షణయుతంగా వివరించాడు. సకల విద్యాపారంగతుడు, వ్యాకరణాది సమస్త శాస్త్ర కోవిదునిగా అభివర్ణించి లక్ష్మణుని శంకను తొలగించాడు. ఆ విధంగా రాముడు హనుమ గొప్పతనాన్ని చాటాడు. ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకుని త్యాగయ్య ఈ కృతి ద్వారా తనను తాను సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు అనిపించినా రాముని మనసులోని మర్మాన్ని, ఆధ్యాత్మిక మార్గంలో పరమాత్మ ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తాడు అన్న దానిని సూచించేందుకే ఈ కృతి. రామాంజనేయ సమాగమ ఘట్టం నుండి మనకు సందేశం ఏమిటి? అన్నీ తెలిసిన పరమాత్మ లీలానాటకాలు కార్యాకారణ సంబంధం కలవి. హనుమ యొక్క గొప్పతనం ప్రపంచానికి తెలిసేది ఎలా? ఈ విధంగానే. 

ఆడ మోడి గలదా రామయ్యా చారుకేశి రాగంలో కూర్చబడింది. నూకల చినసత్యనారాయణ గారు ఈ కృతికి త్యాగరాజస్వామి ఈ రాగాన్నే ఎందుకు ఎన్నుకున్నారో అద్భుతంగా వివరించారు. చారుకేశి శంకరాభరణం, తోడి సమ్మేళనం. శంకరాభరణ స్వరాలతో త్యాగరాజునికి, మనకు, తోడి స్వరాలతో రాముని మేళవించి,ఒకే రాగంగా చారుకేశి అయిన సీతాదేవిని తిరిగి పొందటం అనే ఒకే సంకల్పంగా ఒకరికొకరు సన్నిహితులై ఐక్యతను సాధించే సన్నివేశంగా అభివర్ణించారు. సాహిత్య సంగీత రస భావ ప్రకటనను ఆ విధంగా త్యాగరాజస్వామి అద్భుతంగా వివరించారు అని నూకల వారు ఎంతో ఉన్నతంగా తమ త్యాగరాజ సాహిత్య సర్వస్వంలో వివరించారు. రామాంజనేయుల సమాగమం శంకరభరణం తోడిల కలయికల ఫలితం చారుకేశి రాగం. త్యాగరాజస్వామి వారు వాల్మీకి అవతారమనేది పరమ సత్యం. ఇంతటి లోతన వివరణ ఇచ్చిన మహామహోపాధ్యాయ నూకల వారికి సాష్టాంగ ప్రణామాలు. 

ఆడ మోడి గలదా రామయ్యా మాట(లా)

తోడు నీడ నీవే యనుచు భక్తితో గూడి పాదముల బట్టిన మాట(లా)

చదువు లన్ని తెలిసి శంకరాంశుడై సదయుడాశుగసంభవుండు మ్రొక్క
కదలు తమ్ముని బల్క జేసితివి గాకను త్యాగరాజేపాటి మాట(లా)

ఓ రామయ్యా! నాతో మాట్లాడుటకు వెనకడుగెందుకు? నీవే తోడునీడయని భక్తితో పాదములను శరణంటిని, అటువంటి నాతో మాట్లాడుటకు వెనకడుగెందుకు? అవునులే! సమస్త విద్యా పారంగతుడు, పరమశివుని అంశలో జన్మించిన వాడు, శ్రేష్ఠుడు, వాయుపుత్రుడైన హనుమ నీకు మ్రొక్కగా, అతడెవరో యన్న శంకతో యున్న లక్ష్మణుని ఆ హనుమంతునితో మాట్లాడమన్నావు, ఇంక ఈ త్యాగరాజు ఏపాటి? 

ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు అద్భుతంగా ఆలపించారు

19, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీరాజరాజేశ్వరీ త్రిపురసుందరీ - ముత్తుస్వామి దీక్షితుల వారు

శ్రీరాజరాజేశ్వరీ త్రిపురసుందరీ శివే పాహిమాం వరదే

నీరజాసనాది పూజితపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే

శౌరి విరించాది వినుత సకలే శంకర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖ ప్రదే నిష్కళే పూర్ణచంద్రికా శీతలే విమలే
పరమాద్వైత బోధితే లలితే ప్రపంచాతీత గురుగుహ మహితే
సురుచిర నవరత్న పీఠస్థే సుఖతర ప్రవృత్తే సుమనస్థే

ఓ రాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! శివానీ! నన్ను రక్షింపుము. నాకు వరములిచ్చే దేవివి నీవే. బ్రహ్మాదులచే పూజించబడే పరదేవతా! సమస్త సంశయములను హరించే నిపుణురాలవు నీవు. నన్ను రక్షింపుము. బ్రహ్మ, విష్ణువులచే నుతించబడిన సర్వాంతర్యామివి, పరమశివునికి ప్రాణనాయకివి, కమలంవలె మనోజ్ఞమైన రూపము కలిగియున్నావు, నిరుపమానమైన ఆనందాన్ని కలిగించేవు, నిష్కళంకవు, పూర్ణచంద్రుని వలె చల్లదనము కల్గించేవు, నిర్మలవు, ఉత్కృష్టమైన అద్వైతాన్ని బోధించే లలితవు, ప్రపంచానికి అతీతమైన ఆదిపరాశక్తివి, సుబ్రహ్మణ్యునిచే నుతించబడేవు, మనోజ్ఞమైన నవరత్న పీఠమున స్థిరమై యున్నావు, సుఖకరమైన అంతఃప్రకృతి కలిగియున్నావు, సహృదయుల మనసులలో స్థిరమై యున్నావు, నన్ను రక్షింపుము. 

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

17, అక్టోబర్ 2020, శనివారం

కర్మ ఫలం: మహాభారతం: సైంధవుడు


సోదరి సమానయైన ద్రౌపదిని చెరబట్టబోయిన వాడు సైంధవుడు (కౌరవుల సోదరి దుశ్శల భర్త). పాండవులు వానిని నిలువరించి శిక్షిస్తారు. ప్రతీకారంతో తపస్సు చేసి శివుని అనుగ్రహంతో కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కరోజులో అర్జునుని తక్క మిగిలిన పాండవులను జయించే వరమును పొందిన వాడు. పద్మవ్యూహంలోనికి అభిమన్యుడు వెళ్లిన తరువాత అర్జునుడు తక్క మిగిలిన పాండవులు లోనికి రాకుండా వారిని శివుని వరముతో నిలువరించి అభిమన్యుని మరణానికి కారకుడైనాడు. కుమారుని మరణవార్త విని అర్జునుడు సైంధవుని మర్నాడు సూర్యాస్తమయంలోపు చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరునాడు ద్రోణుడు అర్జునుని బారి నుండి సైంధవుని కాపాడేందుకు అద్భుతమైన ప్రణాలికను రూపొందించాడు. కురుసైన్యాన్ని ఎదుర్కోవటంలోనే అర్జునినికి రోజంతా గడచిపోతుంది. సూర్యాస్తమయం కాబోతోందని గ్రహించి శ్రీకృష్ణుడు మాయతో నల్లని మబ్బులు సృష్టించగా, సూర్యాస్తమయం అయినదని ఏమరపాటు చెందిన సైంధవుని చూచి కృష్ణుడు ఆ మబ్బుని వెంటనే తొలగించగా, సూర్యుడు ఇంకా ఉన్నాడని గ్రహించి అర్జునుడు ఆ సైంధవుని తలను వెంటనే బాణములతో ఛేదిస్తాడు. సైంధవునికి తండ్రి వృద్ధక్షతుడు నుంచి వచ్చిన వరం - సైంధవుని శిరస్సు నేలకూల్చిన వాని శిరస్సు ముక్కలవుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఆ శిరస్సు ఎక్కడో శమంతపంచకంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుని ఒడిలో పడేలా బాణం వెంట బాణం వేసే పాశుపతాస్త్రాన్ని వేయమని చెబుతాడు. అర్జునుడు అది చేస్తాడు. తన ఒడిలో పడిన శిరస్సును చూసి వృద్ధక్షతుడు దానిని కింద వేయగా ఆయన శిరస్సు కూడ ముక్కలవుతుంది.

ఇక్కడ ఏమిటి దుష్టకర్మలు?

సైంధవుడు:
==========

1. సోదరి సమాన ద్రౌపదిని బలాత్కరించబోవటం

2. తనకు పరమశివుడు అనుగ్రహించినప్పుడు సజ్జనులైన పాండవులపై ప్రతీకార వరం కోరుకోవటం

3. ఆ వరమును బాలుడు, వీరుడు అయిన అభిమన్యుని మరణానికి దుర్వినియోగం చేయటం

వృద్ధక్షతుడు:
===========

1. కుమారుని దుష్టబుద్ధిని సరిచేయకపోవటం

2. కుమారుని మరణానికి కారణమైన వాని శిరస్సు ఛేదం కావాలని దుష్టాలోచనతో వరం పొందటం

దుష్టకర్మల ఫలమేమిటి?
===================

1. ఏమరపాటులో ఉండగా సైంధవుడు వధించబడటం

2. కుమారుని శిరస్సు క్రింద పడవేసి వృద్ధక్షతుడు మరణించటం

తండ్రీకొడుకులు ఒకరి మరణానికి మరొకరు కారకులైనారు. ఇదీ కర్మఫలం యొక్క బలం.

16, అక్టోబర్ 2020, శుక్రవారం

కొనరో కొనరో మీరు కూరిమి మందు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 

కొనరో కొనరో మీరు కూరిమి మందు ఉనికిమనికికెల్ల ఒక్కటే మందు

ధ్రువుడు కొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు చవిగా గొనిన మందు చల్లని మందు
భవ రోగములు వీడి పారగ పెద్దలు మున్ను జవ కట్టుకొనిన నిచ్చలమైన మందు

నిలిచి నారదుడు గొనిన మందు జనకుడు గెలుపుతోగొని బ్రతికిన ఈ మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు కలకాలముగొని కడగన్న మందు

అజునకు పరమాయువై యొసగిన మందు నిజమై లోకమెల్ల నిండిన మందు
త్రిజగములు నేరుగా తిరువేంకటాద్రిపై ధ్వజమెత్తే కోనేటి దరినున్న మందు

ఓ జనులారా! మన ఉనికికి, జీవనానికి ఏకైక ఔషధమైన పరమాత్ముడనే శ్రేయమును సంపాదించుకొనండి. ధ్రువుడు సంపాదించుకున్నది, ప్రహ్లాదుడు చవి చూసినది ఈ చల్లని ఔషధము. భవరోగములను తొలగించుకొనుటకు ఇంతకు మునుపు శ్రేష్ఠులు మూటగట్టుకున్న నిశ్చమైన మందు ఇది. నారదుడు కొలిచి సంపాదించుకున్నది, శివధనుర్భంగముతో జనకమహారాజు పొంది తనను తాను ఉద్ధరించుకునేలా చేసిన మందు ఇది, నాలుగు యుగములలోనూ అనేకులైన రాజులు, గొప్పవారు ఎంతో కాలము సాధన చేసి ముక్తిని పొందేలా చేసింది ఈ మందు. బ్రహ్మదేవునకు ప్రాణవాయువైనది ఈ మందు, లోకమెల్లా నిండిన సత్యమనెడిది, ముల్లోకాల అభ్యున్నతికై శ్రీవేంకటాద్రిపై కోనేటి సమీపమున వెలసిన శ్రీనివాసుడనే మందు ఇది, దానిని సంపాదించుకొనండి. 

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు గానం చేశారు. 

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...