5, సెప్టెంబర్ 2020, శనివారం

ఆరుపడై వీడు - ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు

శ్రీగాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి

గంగాపుత్రుడు, అగ్నిగర్భుడు,రెల్లుగడ్డిపై జన్మించిన వాడు, జ్ఞానశక్తి కలిగిన కుమారుడు, పరబ్రహ్మ స్వరూపుడు, స్కందుడు, గుహ్యమైన తత్త్వముతో నిర్మలమైన గుణములు కలవాడు, రుద్రతేజస్వరూపుడు, సేనాపతి, తారకాసురుని సంహరించినవాడు, గురువు, అచంచలమైన బుద్ధి కలవాడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడూ, మయూరవాహనుడు, రథసహితుడైన దేవదేవునికి నమస్కారములు.

గత వారంలో సుబ్రహ్మణ్య తత్త్వం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు స్వామి ముఖ్యమైన క్షేత్రాల వివరాలు. సుబ్రహ్మణ్యుడు ఆరుముఖములతో, పన్నెండు చేతులతో కొలువబడుతున్నాడు. ఆరుపడైవీడు అని పేరొందిన ఆరు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. ఇవి తిరుప్పరన్‌కుండ్రం, తిరుచెండూరు, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళముదిర్చోళై.

1. తిరుప్పరన్‌కుండ్రం

ఇది మదురైకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఉంది. శూరపద్ముడు హతుడైన తరువాత స్కందుడు దేవతాసమూహంతో కలిసి తిరుచెండూరునుండి తిరుప్పరన్‌కుండ్రం వెళ్లాడు. ఇక్కడ ఇంద్రుని కోరికపై దేవసేనను వివాహమాడాడు. ఈ ప్రదేశంలోని పరాశరుని కుమారులు స్కందుని అనుగ్రహంతో విముక్తి పొందారు. పాండ్యరాజులు ఈ దేవాలయాన్ని 6వ శతాబ్దంలో కట్టించారు. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యునితో పాటు శివుడు, విష్ణువు, దుర్గ, గణపతి ప్రధాన దేవతలు.

2. తిరుచెండూరు

తిరునెల్వేలికి 50 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు తూరుపు తీరాన ఉంది తిరుచెండూరు. స్కాందపురాణం ప్రకారం స్కందుడు, దేవతా సేనలతో ఈ ప్రదేశాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు. ఇక్కడినుండే వీరభద్రుని తన దూతగా శూరపద్ముని వద్దకు పంపాడు. శూరపద్ముని సంహరించిన తరువాత ఇక్కడే నివసించాడు. స్కందషష్టి ఇక్కడి ప్రధాన ఉత్సవం. ఆ ఆరురోజుల సమయంలో భక్తులు ఇక్కడే ఉండి స్వామిని కొలుస్తారు. శూరపద్ముని సంహరించిన తరువాత స్కందుడు తన తండ్రిని కొలువాలని అభిలషించగా మయుడు ఇక్కడి దేవాలయం కట్టించాడని పురాణం చెబుతోంది. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది డచ్ దొంగలు 17వ శతాబ్దంలో ఇక్కడి సుబ్రహ్మణ్యుని, నటరాజుని విగ్రహాలు బంగారంతో చేయబడినవని తలచి వాటిని దొంగిలించి కరిగించ ప్రయత్నం చేయగా అవి కరుగలేదు. వారు ఆ విగ్రహాలను సముద్రంలో తీసుకు వెళుతుండగా సముద్రం అల్లకల్లోలమవుతుంది. అప్పుడు ఆ నావికులు ఆ విగ్రహాలను సముద్రంలో పడవేస్తారు. విగ్రహాలు అపహరించబడ్డాయని అక్కడి ప్రాంతీయ పాలనాధికారి వడమలయప్ప పిళ్లయన్ తిరిగి కొత్తగా పంచలోహ విగ్రహాలు సిద్ధం చేయిస్తాడు. ఒకరోజు రాత్రి ఆయనకు కలలో స్వామి కనిపించి సముద్రంలో ఎక్కడైతే నిమ్మకాయ తేలుతూ కనబడుతుందో, గరుడుని ధ్వజము ఎగురుతూ ఉంటుందో అక్కడ వెదకమని చెబుతాడు. పిళ్లయన్ అక్కడ వెద్కించగా విగ్రహాలు దొరుకుతాయి. ఆనందంతో అతడు విగ్రహాలను పునః ప్రతిష్ఠ చేయిస్తాడు. తిర్చెండూరు అత్యంత మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతోంది.

3. పళని

దిండిగల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో కొండపై వెలసిన సుబ్రహ్మణ్య క్షేత్రం పళని. దండాయుధపాణిగా ఇక్కడ స్వామి కొలువబడుతున్నాడు. నవపాషాణాములచే ప్రత్యేకముగా చేయించబడిన విగ్రహం స్వామిది. ఒకసారి నారదుడు కైలాస పర్వతముపై ఉన్న పరమశివుని వద్దకు జ్ఞానఫలాన్ని తీసుకు వెళతాడు. పరమశివుడు తన కుమారులతో మూడు మార్లు ఎవరు ముందర ముల్లోకాలను చుట్టి వస్తారో వారికి ఆ ఫలాన్ని ఇస్తానని చెబుతాడు. వాయువేగంతో సుబ్రహ్మణ్యుడు తన నెమలి వాహనంపై మూడు సార్లు లోకాలను చుట్టి వస్తాడు. అప్పటికే గణపతి ఆ కార్యం పూర్తిచేశాడని తండ్రి చెప్పగా స్థూలకాయుడైన గణపతి అది ఎలా సాధ్యమైందని అని సుబ్రహ్మణ్యుడు ప్రశ్నిస్తాడు. తల్లిదండ్రుల ప్రదక్షిణ ద్వారా గణపతి దానిని సాధించాడు అని చెప్పి శివుడు ఆ ఫలాన్ని గణపతికి ఇస్తాడు. దీనితో సుబ్రహ్మణ్యుడు తన అహంకారానికి చింతించి తన వేషభూషలు వదిలి కౌపీనము, కర్రతో పళని కొండపై కఠోరమైన తపస్సు చేస్తాడు. గౌరీశంకరులు అతని తప్పసుకు మెచ్చి పళని ఓ భవ్యమైన క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని సుబ్రహ్మణ్యుని అనుగ్రహిస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు కైలాసానికి తిరిగి వస్తాడు.

4. స్వామిమలై

కుంబకోణం సమీపంలో ఉన్న కొండ పేరు స్వామిమలై. భృగు మహర్షి శాపాన పరమశివుడు తన జ్ఞానశక్తిని కోల్పోగా సుబ్రహ్మణ్యుడు తండ్రికి గురువై శివగురునాథునిగా పేరొంది ప్రణవ మంత్రార్థాన్ని ఉపదేశించాడని, దానికి ప్రతీకగా చోళ రాజులు ఈ దేవాలయాన్ని 2వ శతాబ్దంలో నిర్మించాడు. 18వ శతాబ్దంలో ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధంలో ఈ దేవాలయం హైదర్ ఆలీ చేత పూర్తిగా ధ్వంసం కాగా తరువాత దానిని పునర్నిర్మించారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు స్వామినాథునిగా కొలువబడుతున్నాడు.

5. తిరుత్తణి

వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యుడు చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో తిరుత్తణి క్షేత్రం ఉంది. ఇంతకు ముందు వ్యాసంలో చెప్పబడిన వల్లీసుబ్రహ్మణ్యుల గాథ జరిగింది ఇక్కడి సమీపంలోని వల్లిమలై కొండపైనే. వల్లితో వివాహం తరువాత దేవసేనతో కలిసి స్వామి ఇక్కడ తణిగై కొండపై నివసించాడు. ఈ క్షేత్రం సనాతనమైనది. విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పోషించారు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారికి సుబ్రహ్మణ్యుడు ఓ ముసలివాని రూపంలో వచ్చి ఇక్కడి క్షేత్ర ప్రసాదాని తింపించాడుట. ఆ జ్ఞానశక్తితోనే దీక్షితులవారు గురుగుహ అన్న పదాన్ని తన ముద్రగా చేసుకున్నారు. ఇక్కడి స్వామిపైనే "శ్రీనాథాది గురుగుహో జయతి జయతి అని కృతిని రచించారు. ఇక్కడి బంగారు గోపురం ఎంతో ప్రసిద్ధి.

6. పళముదిర్చోళై

మదురైకి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న విష్ణు క్షేత్రం అళగర్ కోయిల్. అక్కడి సమీపంలో దట్టమైన అడవుల మధ్య కొండపై సుబ్రహ్మణ్యుడు వల్లీదేవసేనా సమేతుడై వెలసిన క్షేత్రం ఇది. వల్లీ దేవితో వివాహానికి పూర్వం జరిగిన గాథలో కొంతభాగం పళముదిర్చోళైలో కూడా జరిగింది. ఈ క్షేత్రానికి శోలమలై అని కూడా పేరు. ఇక్కడ స్వామిని కురింజి నిళక్కిళవన్ అంటారు. ఇక్కడే స్వామి ప్రఖ్యాత యోగి అవ్వయ్యార్‌కు జ్ఞానబోధ చేశాడు. ఈ కొండకు వృషభాద్రి అని పేరు. తొలుత ఇక్కడ ఉన్న స్వామిని అళగర్ కోయిల్‌లోనే అర్చించి తరువాత పళముదిర్‌చోళైలో ప్రతిష్ఠించారు.

మొత్తం ఆరు క్షేత్రాలు కూడా కొండలపై పచ్చని ప్రకృతి మధ్య నిర్మించబడినవే. జ్ఞానసముపార్జనకు ఇటువంటి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నది ఆరుపడై వీడు క్షేత్రాల దర్శనం ద్వారా భక్తులు పొందిన అనుభూతులు, అనుభవాలు చెబుతున్నాయి. సంతాన ప్రాప్తికై, జ్ఞానప్రాప్తికి, ఆటంకాలు తొలగటానికి ఈ క్షేత్రాలలోని స్వామి ప్రసిద్ధి.

ఓం శరవణభవ!!

రుక్మిణీ కల్యాణం చదివితే పెళ్లవుతుందా? తప్పక

రుక్మిణీ కల్యాణం చదివితే పెళ్లవుతుందా? ఈకాలంలో కూడానా? ఏం మాట్లాడుతున్నారండీ! ఇలాంటివి చేస్తే పెళ్ళిళ్లు అయితే ఇంకేముందండీ, అందరు కన్యలకు కృష్ణ పరమాత్మలాంటి భర్త లభించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంసారాలు సాగిస్తారు కదా? నేటి ప్రపంచంలో ఇలాగ మన పురాణేతిహాసాలను అపహాస్యం చేయటం ఓ ఆనవాయితీ అయ్యింది. ఆ భాగవత గాథల మహత్తు నిజమే. ముమ్మాటికీ నిజమే. అదే భాగవతంలో ఉన్న గొప్పతనం. శ్రధాసక్తులతో, భక్తితో భాగవత గాథలను చదివితే ఈ అద్భుతాలు నిజమని నమ్మకం కలుగుతుంది. పోతన భాగవతం మామూలు కథల సంపుటి కాదు. పరమ భాగవతోత్తములవి. వారిలో రుక్మిణి కూడా ఒక ఉత్తమ భక్తురాలు. శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమ స్కంధములో ఈ రుక్మిణీ కల్యాణ గాథ మనోజ్ఞంగా వివరించబడింది.

యుక్త వయసులో ఉన్న స్త్రీకి భర్త గురించి దృఢమైన అభిప్రాయాలుంటాయి. అలానే, రుక్మిణికి కూడా. విదర్భదేశంలో కుండిన నగరానికి భీష్మకుడు ప్రభువు. అతను వీరుడు, గొప్ప రాజు. అతనికి ఐదుగురు కుమారులు - రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే వారు. వీరి తరువాత ఒక కుమార్తె జన్మించింది. ఆమే రుక్మిణి. ఆ శ్రీకృష్ణుని కోసమే జన్మించింది.

యుక్త వయసులో ఆ స్వామిని వివాహమాడవలెనన్న కోరిక ఆమెలో ఎంత బలంగా ఉందంటే - "సన్నగా కొనసాగినట్లు ఆమె దేహము కూడా కోమలమైన తీగవలె వృద్ధి చెందింది. ఆ గోవింది హృదయ కమలము విప్పారేలా ఆమె ముఖపద్మము కాంతితో వికసించింది. ఆ శౌరి మనసు ఆమెపైనే ఉండే విధంగా ఆమె నడుము సన్నని ఆకృతిని పొందింది. ఆ గోవిందునిలో ప్రణయ భావనలు స్థిరమయ్యేలా ఆమె ఫాల భాగం విశాలమైంది. ఆ స్వామికై ఆమె యవ్వనము వికసించింది" - అని పోతన వర్ణించారు.

మరి ఆ రుక్మిణికి శ్రీకృష్ణుని గుణగణాలు ఎలా తెలిశాయి? తండ్రి యింటికి వచ్చే అతిథుల నోట ఆ స్వామి గొప్పతనం, సౌందర్యం, శౌర్యం విని ఆతడే నా ప్రభువు అని గట్టిగా నిర్ణయించుకుంది. అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా ఆమె శుభలక్షణాలు, సత్ప్రవర్తన, రూపము, వివేకము గురించి విని ఆమెనే వివాహము కోవాలని నిర్ణయించుకున్నాడు. వీరి మనోరథము తెలుసుకున్న బంధుజనం కూడా ఈ వివాహము జరగాలని ఆశించారు. కానీ మూఢుడైన రుక్మి మాత్రం తన చెల్లెలిని చేది రాజైన శిశుపాలునకిచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి బాధపడి అగ్నిద్యోతుడనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి సందేశం పంపించింది. బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతుని ఎన్నుకోవటంలో రుక్మిణి మనోరథం, ఆమె వివేకము మనకు తేటతెల్లమవుతాయి. ఆ అగ్నిద్యోతుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి మనసారా "పెండ్లికొడుకువు కమ్మని" ఆశీర్వదిస్తాడు. మీరు సద్బ్రాహ్మణులు మీ వాక్యము సత్యమగును అని శ్రీకృష్ణుడు సమాధానం చెబుతాడు. అప్పుడు అగ్నిద్యోతుడు రుక్మిణి సందేశాన్ని తెలుపుతాడు:

"ఓ మంగళమూర్తీ! పురుషులలో సింహము వంటి వాడవు నీవు. నీ చరణ సరోజములను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు వివాహము చేసుకును అపహరించుటకు ప్రయత్నము చేయుచున్నాడు. అతడు నీ పరాక్రమము ఎఱుగడు. నేను పూర్వజన్మలో వ్రతములు, గురుసేవ, దానధర్మములు చేసితినేని వసుదేవ కుమారుడవైన నీవే నాకు ప్రాణేశ్వరుడవుతావు, శిశుపాలాదులు యుద్ధములో పరాజితులవుతారు. ఇక్కడ నీ పరాక్రమమునకు అడ్డులేదు, రేపే రథ గజ తురగ పదాతులనే చతురంగబలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఉగ్రరణములో ఓడించి. రాక్షస వివాహపద్ధతిలో నన్ను తీసుకుని వెళ్లు. నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను."

అని అంటుంది రుక్మిణి. అంతటితో ఆగదు. "నేను అంతఃపురములో ఉంటాను కాబట్టి ఎలా తీసుకు వెళ్లటం అని ఆలోచించకు. పెళ్లికి ముందు మా ఇలవేల్పు మంగళగౌరిని కొలిచేందుకు మా వారు నన్ను పంపుతారు. నేను ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి మొక్కు చెల్లించడానికై బయలుదేరుతాను, ఆ సమయంలో నన్ను నిరాటంకముగా నీ వెంట తోడ్కొని పొమ్ము" అంటుంది. అంతటితో ఆగిందా? "నాథా! ఏ పరమపురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగాజలాలో ఓలలాడాలని మహాత్ములు తపిస్తారో అట్టి తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే బ్రహ్మచర్య వ్రతదీక్ష వహించి నూరుజన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను. అది నా మనోనిశ్చయం" అని పలుకుతుంది.

ఈ సందేశం వినిపించిన తరువాత అగ్నిద్యోతుడు రుక్మిణి గుణగణాలను, రూపలావణ్యాలను, ఆమె ఆరాధనను మనోజ్ఞంగా వర్ణించి "ఓ కృష్ణా! మీరిద్దరూ ఈడూ జోడుగా ఉంటారు, మీకు వివాహం తప్పక జరుగుతుంది. ఆలస్యము వలదు, వెంటనే బయలుదేరి లోకకల్యాణమొనరించు" అంటాడు.

అప్పుడు కృష్ణుడు అగ్నిద్యోతునితో "ఓ పండితోత్తమా! నాకు కూడా రుక్మిణిపై గాఢమైన ప్రేమ కలదు. ఆమె నన్ను కోరుకుంటున్న విషయము కూడా తెలుసు. మీ సందేశము ద్వారా దానిని నిశ్చయం చేసుకున్నాను గాన ఇప్పుడు ఆమె కోసమై వచ్చి, విరోధులను ఓడించి ఆమెను స్వీకరించెందను" అని పలుకుతాడు.

రుక్మి, భీష్మకుడు వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. శిశుపాల జరాసంధులు బంధుమిత్ర సమేతంగా కుండిన నగరానికి చేరుకున్నారు. బలరాముడు సోదరుడొక్కడే వెళుతున్నాడని గ్రహించి ఆతనికి దన్నుగా తన సైన్యంతో విచ్చేశాడు.

ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రుక్మిణి మనసులో ఆందోళన పెరిగింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్లాడో లేదో? నందనందనుడు నా సందేశాన్ని తప్పుగా భావించిలేదు కదా? పరమేశ్వరుడు ఈ కార్యానికి అనుకూలిస్తాడో లేదో? ఆ పార్వతి నన్ను కాపడుతుందో లేదో? ఇలా పరి పరి విధాల ఆలోచించసాగింది. తల్లికి కూడా తన మనోభావనలు తెలుపలేదు. ఆమె దుఃఖించుచుండగా, అగ్నిద్యోతుడు వస్తాడు. అతని ముఖలక్షణాలు గమైంచి చిరునవ్వుతో అతనిని వివరాలు అడిగింది. శ్రీకృష్ణుని మనోభీష్టాన్ని ఎరిగి సంతోషపడి, ఆ బ్రాహ్మణునికి నమస్కరిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి స్వయంవరానికై విదర్భకు చేరుకున్నాడు. ప్రజలంతా ఆ గోవిందుడే రుక్మిణికి భర్త కావాలని పలికి దృఢంగా ఆకాంక్షించారు.

రుక్మిణి గౌరీపూజకై పరమేశ్వరి సన్నిధికి చేరుకొని:

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్మి
మ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ! హరిం బతి సేయుమమ్మ నిన్న
మ్మినవారి కెన్నడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ!

అని ప్రార్థించింది. దుర్గకు నమస్కరించి భర్తృసమేతలైన బ్రాహ్మణ పత్నులకు తాంబూలములు, మంగళ సూత్రములు, చెరకుగడలు మొదలైనచి ఇచ్చి పూజించింది. ఆ ముత్తైదువలు ఉత్సాహంతో దీవెనలిచ్చి రుక్మిణి తలపై అక్షతలుంచారు. తిరిగి రాజప్రాసాదానికి వస్తున్నప్పుడు ఆమె అందచందాలు చూసి అందరూ ముగ్ధులైనారు. వీరుల మనసులు చలించాయి, వారు ఆయుధాలు వీడి సమ్మోహితులైనారు. అప్పుడామె శ్రీకృష్ణుని చూసింది:

కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం గంఠీరవేంద్రావల
గ్నునవాంభోజదళాక్షు జారుతరవక్షున్ మేఘసంకాశ దే
హునగారాతి గజేంద్ర హస్తనిభబాహుం జక్రి బీతాంబరున్ఘ
నభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్

చంద్రబింబము వంటి మోము, సింగము వంటి నడుము, క్రొత్త తామరలవంటి కన్నులు, అత్యంత రమణీయమైన వక్షము, నీలమేఘము వంటి మేను, ఐరావత గజతుండము వంటి బాహువులు, పీతాంబరము ధరించి చక్రాయుధము కలవాడు, వీజయమునందు ఆసక్తి గలవాడు, జగత్తును మోహింపజేసే వాడు అయిన శ్రీకృష్ణుని దర్శించింది.

అప్పుడు కృష్ణుడు ఆమె మనోభీష్టం నెరవేర్చటానికి అక్కడి వీరులపై యుద్ధం చేసి ఆమెను తీసుకొని పోవుచుండగా రుక్మి తన చెల్లెలిని అపహరించినందుకు శ్రీకృష్ణుని తూలనాడుతాడు. అతనిని నిరాయుధుడిని చేసి సంహరించబోగా రుక్మిణి అనన్ను చంపవద్దని అతనిని క్షమించమని వారిస్తుంది. బలరాముడు కూడా ఆమె మాటకు సమ్మతించి కృష్ణునితో రుక్మిని సంహరించవద్దని పలుకుతాడు. బంధుజనులు కొనియాడగా శ్రీకృష్ణుదు రుక్మిణిని ద్వారకకు తీసుకు వచ్చి వివాహం చేసుకుంటాడు.

అంతరార్థం:

దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటి? రుక్మిణి మనోభీష్టము, అది నెరవేరాలన్న సంకల్పము, దానిని వ్యక్తపరచి సాధించుకునే యత్నము, దానికై దైవప్రార్థన. ఇవే ఆ వివాహానికి కారణాలు. ఆమె భావనలు స్వయంగా తెలుసుకున్న తరువాత, ఆమె కోరిక మేరకే శ్రీకృష్ణుడు ఆమెను రాక్షస పద్ధతిలో కొనిపోయి వివాహము చేసుకుంటాడు. తాను స్వయంగా చేసినది కాదు.

మరి ఈ రుక్మిణీ కల్యాణం చదివితే యువతులకు వివాహమెందుకు అవుతుంది అని మన పెద్దలు నిర్ణయించారు?

1. యువతి మనోభీష్టం ముఖ్యం. ఆమె కామ్యము ఎంత గట్టిదైతే అంత త్వరగా సఫలమవుతుంది. తాను ఆ శ్రీకృష్ణుని తప్ప వేరెవరినీ చేసుకోనన్న నిర్ణయాన్ని స్వయంగా పలికింది.

2. తన సంకల్పానికై దైవాన్ని ప్రార్థించింది. తన కులదైవమైన గౌరిని పూజించి, మంగళప్రదమైన ఫలితాలు కలిగించే కర్మలను నిర్వర్తించింది.

3. తన సంకల్పం నెరవేరటానికి ఆమె వివేకాన్ని, ప్రదర్శించింది. ఉత్తముడు, వచనుడు అయిన అగ్నిద్యోతుని దూతగా ఎన్నుకోవటం దీనికి సూచిక. ఇతరుల శుభము కోరుకుని, లోకకల్యాణార్థమైన కార్యములను సఫలం చేయటానికి తమ బుద్ధిని, శక్తిని వినియోగించేవారు బ్రాహ్మణులు. అదే అగ్నిద్యోతుడు చేశాడు.

4. తన సంకల్ప సిద్ధికై సమయస్ఫూర్తితో వ్యవహరించి శ్రీకృష్ణునికి ఉపాయాన్ని కూడా సూచించింది రుక్మిణి.

5. తన మనోభీష్టాన్ని మొదటి సారి అగ్నిద్యోతుని ద్వారా కాదు, అంతకు మునుపే హితుల ద్వారా శ్రీకృష్ణునికి చేరేలా పలికింది.

అన్నిటినీ మించి, తన నడవడిక, తన వ్యక్తిత్వం, తన గుణగణాలు జగద్విదితమై శ్రీకృష్ణుని మనసు దోచుకునేలా జీవించింది. చివరకు అన్నను సంహరించకుండా సోదరి ధర్మాన్ని కూడా నిర్వర్తించింది. ఇక అటు తరువాత కృష్ణ పరమాత్మ పట్టపురాణిగా రుక్మిణి ఎంత పేరొందిందో మనకు తెలిసిందే.

ఆమె కనబరచిన సంకల్పబలం, వివేకం, దైవభక్తి, శ్రీకృష్ణునిపై అవ్యాజమైన ప్రేమ..ఆమె అభీష్టాన్ని నెరవేర్చి ఆమెకు సరైన నాథుడైనాడు కృష్ణుడు. ఇవీ రుక్మిణీ కల్యాణ గాథ ద్వారా అవివాహితులైన యువతులకు పాఠాలు. అవి అర్థమై, వారు తగిన విధంగా నడచుకుంటే వివాహం తప్పక జరిగి తీరుతుంది.

దూతగా హనుమాన్ - రెండవ భాగం

సరే, సీత కనిపించింది. మరి వెంటనే బయలుదేరి వెళ్లి రామునికి చెప్పవచ్చు. కానీ, అలా చేయలేదు. ఎందుకంటే, అప్పుడు సీత ఉన్న పరిస్థితి చూసి అలా చేయడం సరి కాదు అన్నది అతని నిర్ణయం. భర్తకు దూరమై, భయముతో, దుఃఖముతో, జీవన్మరణ పరిస్థితులలో ఉంది సీత. ఆమెను పలకరించి ఓదార్చి రాముని మాట చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ, తానేమో వానరం, ఆమెతో బిగ్గరగా మాట్లాడితే ఆమె భయపడి అరచితే రాక్షసులు మేల్కొంటారు, సీతను హింసిస్తారు, రావణుడు నాపై యుద్ధానికి రాక్షసులను పంపుతాదు. నేను తిరిగి వెళ్ళటం కష్టతరమవుతుంది దాని వల్ల అరిష్టం అని గ్రహించి రామ గుణ కీర్తన ఆరంభిస్తాడు హనుమాన్. సీత సందేహిస్తుంది. తన వాఙ్నైపుణ్యంతో ఆమెకు విశ్వాసం కలిగిస్తాడు. ఆమె హనుమను గుర్తిస్తుంది. మనసు కుదుటపడుతుంది. సరే, ఇంతటితోనైనా తన కార్యం పూర్తి అనుకోలేదు హనుమ.

రాక్షసుల బలం, ఆ లంకా నగర నిర్మాణ విధానం తెలుసుకోవాలి. తామసులైన రాక్షసులకు సామదానభేదదండోపాయాలలో దండోపాయమే సరైన మార్గము. రావణుని హృదయము, రాక్షస బలము తెలుసుకోవాలంటే యుద్ధం చేయాలి. అశోకవన విధ్వంసం ద్వారా అది సిద్ధిస్తుంది. కొందరు రాక్షసులను చంపితే వారు భయపడతారు. వారి బలాబలాలు తెలుసుకోవచ్చు. ఇదే అసలు పరమార్థం.

సరే, తాను అనుకున్నట్లు యుద్ధం జరిగింది, లంక భయభ్రాంతమైంది, హనుమ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. రావణుడు అడిగితే - నేను వానరుడను, నీ దర్శనం కోసం వనధ్వంసం చేశాను, ఆత్మ రక్షణకై రాక్షసులను ఎదుర్కొన్నాను, నేనొక రాచకార్యంపై వచ్చాను, రాముని దూతగా, నీ హితవు కోరి వచ్చాను అని ప్రియమైన మాటలు పలుకుతాడు. కోపోద్రిక్తుడైన రావణుడు హనుమను వధించమని ఆజ్ఞాపిస్తాడు. విభీషణుని మాటలతో శాంతించి లాంగూల దహనానికి ఆజ్ఞాపిస్తాడు. రాముని కోసం ఆ రాక్షస అకృత్యాన్ని సహిస్తాడు. సీతమ్మ తల్లి అనుగ్రహంతో చల్లదనాన్ని, పరిమళాలను పొంది ప్రకాశించాడు. అగ్నిదేవునికి సంతృప్తి కలిగించటానికి, రాక్షసులకు సంతాపం కలుగజేయటానికి లంకాదహనమే సరైనది అని నిశ్చయించుకుని తగులబెట్టాడు. తన రజోగుణం వల్ల కలిగిన ఆగ్రహానికి సీతమ్మ ఉన్న అశోకవనం కూడా దగ్ధమైందో, దాని వల్ల ఎంత అరిష్టం అని పరి పరి విధాలా చింతించి, కొన్ని శుభ శకునాల వల్ల సీత సుఖంగా ఉందని భావించి, ఆమెని చూసి సంతోషముగా లంకకు తిరిగి వచ్చి సీతావృత్తాంతాన్ని అందరికీ వివరిస్తాడు. రాముని గాఢ పరిష్వంగన గౌరవాన్ని పొందుతాడు. సామాన్యంగా భుజశాలి బుద్ధిశాలి కావటం అరుదు. హనుమ దానికి అపవాదం. హనుమ విషయంలో సద్యోవికసితమైన బుద్ధి ఔచిత్యం నిబద్ధంగా కార్యసానుకూల సాధనమవుతుంది.

హనుమలో పౌరుష, పరాక్రమ, బుద్ధికుశలత లక్షణాల సమగ్రత ఉంది. అందుకే జగద్వంద్యుడైనాడు. సాధారణంగా సందేశహరులు మాత్రమే దూతలు. అంతకు మించి వారి ప్రమేయముండదు. కానీ, హనుమ పరిపూర్ణమైన కార్యసాధకుడు. అందుకే దౌత్యానికి హనుమ ఆదర్శం.

జయహనుమాన్ జ్ఞానగుణసాగర!
జయకపీశ తిహు లోక ఉజాగర!

- శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందరమారుతి పుస్తకం నుండి.

దూతగా హనుమాన్ - మొదటి భాగం

హనుమంతునికి అనేక నామాలు ఉన్నా, ఆయనను రామదూత అని వ్యవహరించటం ఆయనకు ఎంతో మోదాన్ని కలిగించింది. తానే స్వయంగా దూతోహం, దాసోహం అని చెప్పుకున్నాడు కదా.

దౌత్యం అనేది చాలా కష్టతరమైన విద్య. లోకవ్యవహారములలో వ్యక్తుల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించి వారి జీవితాలను అతికించే సామర్థ్యము కలవాడే దౌత్యములో నేర్పరి. ముఖ్యంగా దూత వినయము కలవాడు, జితేంద్రియుడు కావలెను. హనుమ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం అని పేరుపొందాడు కదా? వాగ్మి అనగా మంచి వాక్కు కలిగిన వాడు కావలెను. దీనికి జన్మ సహజమైన సంస్కారముతో పాటు, చక్కని పాండిత్యము కూడా తోడుండవలెను. "దూతంచైవ ప్రకుర్వీత సర్వశాస్త్ర విశారదాం" అని సమస్త శాస్త్రములు తెలిసినవానినే దూతగా నియమించాలి. మరి వానరం దూత ఎలా అయినాడు? అత్యంత విజ్ఞతతో, విచక్షణతో వ్యవహరించిన వాడు హనుమ. రామునికి మొట్టమొదటి సందర్శనంలోనే హనుమలో ఒక మంచి దూత లక్షణాలు కనిపించాయి. అతని మాటలలో వాక్శుద్ధి, ప్రజ్ఞ గోచరించాయి. అందుకే రాముడు లక్ష్మణునితో హనమంతుని పాండిత్యాన్ని ప్రశంసించాడు. అది పైపై పొగడ్త కాదు. సత్యం. హనుమ యొక్క వైదుష్యాన్ని, బుద్ధి కౌశలాన్ని ప్రశంసించి అటువంటి వ్యక్తి ఒక రాజుకు ఏ విధంగా సహాయకారో తెలియజేస్తాడు.

ఎవరైనా కొత్తగా వ్యక్తులు కలిసినప్పుడు వారి ముఖం మీదే మీరెవరు, మీ పేరేమిటి, ఎందుకు వచ్చారు అని అడగటం అమర్యాదే. రామలక్ష్మణులను తొలిసారి కలిసినప్పుడు హనుమ ఇలా నేరుగా ప్రశ్నించకుండానే ఆ ప్రశ్నలకు సమాధానం రాబడతాడు. ప్రశంసా సంభాషణలలో వారి గోత్రనామధేయాలు బయటపడతాయి. ఇదీ వాక్చాతుర్యము. ఇక్కడ కేవలం మాట పొందికే కాదు, మాట్లాడిన తీరు కూడా అద్భుతం. హనుమంతుని వాకులో శ్రీరామునికి అంతర్వాణి గోచరించించి. ఇవన్నీ గమనించే రాముడు కిష్కింధకాండలోని ఈ సందర్భంలో:

ఏవం విధోయస్య దూతో నభవేత్ పార్థివస్యతు
సిద్ధ్యంతి హి కథం తస్య కార్యాణాంగతయోనఘ

ఏవం గుణగణైర్యుక్తా యస్యస్యుః కార్యసాధకాః
తస్య సిద్ధ్యంతి సర్వార్థా దూతవాక్య ప్రాచోదితాః

ఇటువంటి గుణగుణములు కలిగిన దూత ఉంటే ఆ రాజుకు ఎటువంటి కార్యమైనా సిద్ధిస్తుంది అని స్పష్టంగా పలికాడు రాముడు. ఇక హనుమ ఎటువంటి వాడు?

సమస్తశాస్త్ర విశారదుడు, నవవ్యాకరణ పండితుడు, అవతలివ్యక్తి మనసులో ఉన్నమాటను చెప్పకుండానే తెలుసుకొనగల నేర్పరి. ఇది మనకు సుగ్రీవ రామకార్య నిర్వహణలో సుస్పష్టమవుతుంది. ఇక శుచిత్వం గురించి చెప్పేదేముంది? రావణాంతఃపురంలో స్త్రీల మధ్య సీతాన్వేషణైక చిత్తంతో సంచరిస్తూ సీత జాడ తెలియక ఇతర స్త్రీలను పరికించి చూడవలసి వచ్చినందుకు పరితాపాన్ని ప్రకటిస్తాడు.

తానొక్కడు, పరదేశం, అనంతమైన శత్రుసైన్యం, రాక్షసులు. అయినా కూడా భీతిలేకుండా వెదకటానికి కానీ, తలపడటానికి కానీ, రావణ సభలో తర్కించి దూతను చంపని తర్జనభర్జనలు చేసినప్పుడు గానీ చలించని ధైర్యశాలి. సముద్రం ఎలా దాటాలో, దానిలో ఉన్న కష్టనష్టాలేమిటో, ఎంతదూరం వెళ్లాలో, ఎలా ప్రవేశించాలో ఏమీ తెలియకపోయినా సముద్రతారణ, లంకాభిగమన, సీతాన్వేషణ కార్యాలు అత్యంతావాశ్యకమని సిద్ధపడిన ధీశాలి. ఇది దూతకు మరో ముఖ్యమైన లక్షణం.

దేశకాలాన్ని ఎరిగి మాట్లాడటం - అత్యంత ముఖ్యమైన లక్షణం ఇది. ఎప్పుడు ఎవరి ముందు ఎలా మాట్లాడలో, అనగా సందర్భోచితంగా మాట్లాడటం తెలిసిన వాడే వాగ్మి. ఇది హనుమకు తెలిసినంత మరెవరికీ తెలియదు కాబట్టే సుగ్రీవుడు ఎవరో ఇద్దరు మానవులు వచ్చారు అని అనుమానంతో హనుమంతుని పంపుతాడు. అప్పుడు హనుమ కనబరచిన సందర్భోచిత వాక్పటిమ రాముని ప్రశంసలందుకుంది. ఎంతో సంయమనం కనబరచి మాట్లాడతాడు హనుమ.

హనుమంతుడు రాక్షసీగణ మధ్యంలో సీతను కలుసుకునే ముందు అంతఃపురంలో బాగా శోధిస్తాడు. ప్రతి స్త్రీని ఓపికతో పరిశీలించి, లక్షణాలను బట్టి వివేచించి ఔనా కాదా అని నిశ్చయించుకోవలసి వస్తుంది. దానికి కారణం సీతను తానెరుగకపోవటం. అందువల్ల స్త్రీగణాలను తాను నిశితంగా పరిశీలించాలి. దీనికి జాగరూకత, సంయమనం కావాలి. క్షణకాలం పొరబడే తొలుత మండోదరిని సీత అనుకున్నా, జాగరూకతతో, విశ్లేషణాత్మక ధోరణితో వివేచన చేయగలిగాడు. ఇక్కడ హనుమ కనబరచిన నిగ్రహం శ్లాఘనీయం. స్త్రీగణ మధ్యంలో సంచరిస్తూ ఉన్నా తన బ్రహ్మచర్యవ్రతానికి భంగం కలుగకుండా వ్యవహరించాడు.

ఇక మరో ముఖ్యమైన లక్షణం - నష్టపోయినవి వెదకటానికి ఆ వస్తు జాతిలోనే వెదకాలి అన్న సూత్రం పాటించాడు కాబట్టే స్త్రీగణాలలో నిశితంగా వెదకాడు. ఇది హనుమ శాస్త్ర పారంగతను తెలియజేస్తుంది. అటుతరువాత లంకాదహనానికి కారణం పుచ్చాన్ని కాలచటం, దానికి కారణం వనభంజనం, దానికి కారణం రావణుని చూడాలన్న ఇచ్ఛ, దానికి కారణం కార్యసుగమం. ఆ కార్యమేమిటి? రాముని సీతాన్వేషణ. ఆమె కోసం రాముడు వాలివధ, కబంధ నిపాతనం, విరాధవధ, ఖరత్రిశిరసుల వధ, దూషణ వధ. అన్నీ సీతమ్మ కోసమే కదా? కాబట్టి ఆమెను చూసి రక్షించటం కోసం ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసినా సరే అన్న ధైర్యం, తెగింపు హనుమలో. అందుకే కార్యసిద్ధి హనుమాన్‌గా పేరొందాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మార్లు, ఎన్ని చోట్ల వెదకవలసి వచ్చినా వెనకంజ వేయను అన్న పట్టుదల హనుమది. ఇది సమతుల ఆలోచన. పని సానుకూలం కానప్పుడు ఉద్రేకంతో పనిని పాడు చేయటం మానవసహజం, కానీ హనుమంతుడు తితీక్షతో కార్యాన్ని సానుకూల పరచుకొని తన వివేకాన్ని ప్రదర్శించాదు. మళ్లీ మళ్లీ వదకుతాడు. సాధిస్తాడు.

సీత కనిపించింది. సరే. తరువాత హనుమ కనబరచిన విజ్ఞత ఏమిటి? తదుపరి వ్యాసంలో.

(శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందర మారుతి పుస్తకం నుండి)

రామాయణం - అరణ్యకాండ విశేషాలు - శూర్పణఖ రహస్యం

అగస్త్య మహాముని ఆశీస్సులు పొంది వారి అనుమతితో సీతారామలక్ష్మణులు గోదావరీతీరంలో పంచవటీ క్షేత్రంలో ఒక పర్ణశాల నిర్మించి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఉదయం నదీ స్నానం, మధ్యాహ్నం తత్త్వ జిజ్ఞాస, సాయంకాలం వనవిహారం - ఇలా రోజులు, వారాలు, నెలలు, ఋతువులు సాగిపోతుంటాయి. ఉన్నట్టుండి ఆ హాయికి అంతరాయం కలుగుతుంది. రావణ సహోదరి శూర్పణఖ ఆ పరిసరాల్లో పచార్లు చేస్తూ ఒకనాడు హేమంత ఋతువులో రామలక్ష్మణులను పర్ణశాలలో చూస్తుంది. కామదూరుడైన రాముణ్ణి కామిస్తుంది. సీతను చూసి అసూయ పడుతుంది. రాముడు కాదంటే లక్ష్మణుడైనా సరేనని ఇదరిలో ఎవరినో ఒకరిని తనవానిగా చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. రామలక్ష్మణుల పరిహాసాన్ని అర్థం చేసుకోలేని చుప్పనాతికి తగిన శాస్త్రి జరుగుతుంది. రాముని కనుసన్నలను గమనించిన లక్ష్మణుడు ఆమె ముక్కును, చెవులను కోసి అసలే అనాకారి అయిన ఆమెను మరీ వికారి చేసి పంపుతాడు. దీనితో శూర్పణఖకు అండదండగా సోదరులు ఖరదూషణాదులు రామలక్ష్మణులపై కత్తిదూస్తారు. రాముడు ఒంటరిగా పద్నాలుగు వేల రాక్షసులను సంహరిస్తాడు. శూర్పణఖకు జరిగిన పరాభవం రాముని దాకా వెళుతుంది. సీత అందాన్ని విని రావణుడు చలిస్తాడు. మారీచుని సాయంతో సీతను అపహరిస్తాడు. రామలక్ష్మణులు జటాయువు వల్ల జరిగిన వృత్తాంతం తెలుసుకుంటారు. సీతాపహరణం కంటే జటాయు మరణం రాముణ్ణి ఎక్కువగా బాధిస్తుంది. జటాయువుకు అంత్యక్రియలు చేసి సీతాన్వేషణకై బయలుదేరుతారు రామలక్ష్మణులు.

శూర్పణఖ వచ్చింది రాముని కోసం. కానీ. పర్యవసానం సీతాపహరణం. ఒక విధంగా శూర్పణఖ కోరింది కూడా సీతావియోగమే. రావణుడు సాధించింది కూడా రామవిరహమే. సీతారాములు కలిసి ఉన్నంతవరకు సోదరసోదరీమణుల కోరిక నెరవేరదు. చెల్లెలు రామునిపై చాటలవంటి గోళ్లతో మొరటుగా పర్ణశాలపై విరుచుకు పడుతుంది. అన్న సీతమ్మను అపహరించేందుకు దొంగ పన్నాగంతో సాధువేషంలో వచ్చి ఒంటరిగా ఉన్న సాధ్విని బలవంతంగా తీసుకొనిపోతాడు. శూర్పణఖ వ్యక్తిత్వం ఆమె నఖాల్లో (గోళ్లలో) ప్రతిబింబితమైతే రావణుని దంభం అతని శిరసులో కుంభించి ఉంటుంది. పరమాత్ముని కాలిగోళ్లు పరంజ్యోతిని ప్రసరింపజేస్తాయని ప్రతీతి. శూర్పణఖ చేతిగోళ్లు విషయవాసనలను విరజిమ్మాయి. గోళ్లు వాసనకు, ఉపాసనకు కూడా పనికి వస్తాయి. జీవలక్షణాలు గల నిర్జీవ పదార్థాలలో గోళ్లు కూడా పరిగణించబడతాయి. కండూతికి, పాండితికి రెండిటికీ గోళ్లు వాటంగా, ఘాటంగా ఉపకరిస్తాయి. అలాంటి గోళ్లతో శూర్పణఖ రామచంద్రుని సమీపిస్తుంది. చూడటానికి చక్కగా ఉన్న రాముని చూసి నేను నీకు తగిన దానను అని సిగ్గు లేకుండా చెప్పుకుంటుంది. సీతాసమేతుడైన రామచంద్రుడెక్కడ? కొండల్లో కోనల్లో మానం వదలుకొని మైమరచి విహరించే శూర్పణఖ ఎక్కడ? ఇద్దరి రూపవైరుధ్యాన్ని నిరూపిస్తూ వాల్మీకి అంటాడు:

సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ
విశాలాక్షం విరూపాక్షీ సుకేశం తామ్ర మూర్ధజా
ప్రియరూపం విరూపా సా సుస్వరం భైరవస్వనా
తరుణం దారుణా వృద్ధా దక్షిణం వామభాషిణీ
న్యాయవృత్తం సుదుర్వృత్తా ప్రియమప్రియదర్శనా
శరీరజ సమావిష్టా రాక్షసీ రామమబ్రవీత్

శూర్పణఖ రాక్షసి, రాముడు పురుషోత్తముడు. రాక్షసీ రాముల రూప వైషమ్యం గమనించదగినది. ఆమె దుర్ముఖి, అతడు సుముఖుడు, ఆమె మహోదరి, అతడు సన్నని నడుము గల సుకుమారుడు. ఆమె విరూపాక్షి, అతడు విశాలమైన కన్నులు గలవాడు. ఆమెది ఎర్రని రాగి జుట్టు, అతనిది నల్లని జుట్టు. ఆమె వికృతాకారంతో విపరీతంగా పెరిగిన వయోవృద్ధ. అతడు పిన్నవయసులో వెన్నలా కన్నులవిందుగా కనిపించే కమనీయ స్ఫురద్రూపి. ఆమెది కఠోరమైన కంఠం, అతనిది మృదుమధురమైన స్వరం. కట్టె విరిచినట్లు మాట్లాడే గడుసుదనం ఆమెలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అతడు అన్నివిధాలా అందరికీ అనుకూలంగా అణకువతో మాట్లాడే ప్రియంవదుడు. ఆమె కామాంధురాలైన కామిని, అతడు న్యాయసమ్మతంగా వ్యవహరించే ప్రియదర్శనుడు.

ఇలాగే, రామ రావణులకు మధ్యగల వ్యత్యాసాన్ని కూడా సీతాదేవి రావణునికి సుస్ఫష్టంగా చెబుతుంది. సింహం ముందు నక్కలా రావణుడు రాముని ఎదుట నిలబడేందుకు కూడా పనికిరాడని ఆమె చెబుతుంది. మురికి కాలువకు మున్నీటికి, ఇనుముకు బంగారానికి, బురదకు గంధానికి. కాకికి గరుత్మంతునికి ఎంత భేదముందో అంత వ్యత్యాసం వారి మధ్య ఉందని ఆమె తనను అపహరించేందుకు వచ్చిన రావణునితో నిర్భయంగా చెబుతుంది. తపస్సు, వర్చస్సు, ఓజస్సు - ఎన్ని ఉన్నా ఒక్క ధర్మం లోపించటం వల్ల కామమోహితుడైన రావణుడు లోకరావణుడవుతాడు. సత్య ధర్మ పరాయణుడైన రామచంద్రునికి దూరమవుతాడు. శూర్పణఖది సుఖప్రధానమైన వ్యక్తిత్వమైతే రావణుడు శిరఃప్రధానుడు. ఒకటికి పది తలలు గల పెద్ద మనిషి. మంచికి చెడుకు కూడా శిరస్సే ఆధారం. మంచి మంచి ఆలోచనలతో మంచి తలపెట్టి ప్రపంచంలో మంచిని పంచగలిగేది తలపులకు నిలయమైన తలయే. ఆ తలకాయలోనే ప్రపంచాన్ని ముంచి వేసే దురాలోచనలు కూడా బయలుదేరవచ్చు. శూర్పణఖ గోళ్లవలె రావణాసురుని తలలు కూడా మంచిని అణచి వేసి చెడును చేరదీస్తాయి. పర్యవసానం రావణ సంహారం, శ్రీరామజయం, సీతావిముక్తి. ఈ శుభాంతానికి బీజం శూర్పణఖ పరాభవం, సీతాపహరణం. శూర్పణఖ లేకుంటే ఆ తరువాతి కథే లేదు, రామాయణ పరమార్థం నెరవేరదు. కాబట్టి శూర్పణఖ వృత్తాంతం రామాయణ కథలో కీలకమైన నాభి స్థానాన్ని పొందుతుంది. కైక వరంతో రామాయణంలోని బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమైతే శూర్పణఖ పరాభవంతో విష్ణుగ్రంథి విడిపోతుంది. ఇక రుద్రగ్రంథి వైపు రామాయణం పయనిస్తుంది.

రాముడు-సీత-రావణుడు: పరమాత్మ-జీవాత్మ-మనసు



మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

మనస్సే బంధములో పడుటకు, బంధము నుండి విడుటకు కూడా కారణము. ఆ మనస్సే రావణుడు. రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇతి రావణః. చెడు పలుకులను పలికించువాడు రావణుడు మనస్సే చెడు పలుకులను పలికించునది. అవి రెండు - 1. అహం 2. మమ. నేను-నాది అనేవి.

అనాత్మన్యాత్మబుద్ధిర్యా అస్వేస్వమితి యా మతిః
అవిద్యా తరుసంభూతి బీజమేతద్ద్విధా స్థితం

తాను కాని శరీరమును తానని అహంకరించుట, పరమాత్మదే అయి తనది కాని వస్తుజాతమును తనది యనుకొనుట అను ఈ రెండే అజ్ఞానమను వృక్షమునకు మూలమగు విత్తనము. ఈ మనస్సు అను రావణునికి కూడా రావణుని వలె పది ముఖములు కలవు. మనస్సు వెలుపలికి ప్రసరించు మార్గములే ఇంద్రియములు. అవి పది - ఐదు జ్ఞానేంద్రియములు (చర్మము, నేత్రము, చెవి, నాలుక, ముక్కు), ఐదు కర్మేంద్రియములు (వాక్కు, చేయి, పాదము, మలద్వారము, మూత్రద్వారము). ఈ పది మనస్సుకు ముఖములు. అందుచేత మనస్సు కూడా దశముఖుడే. అతడు పరిపాలించునది లంక, మనసు పరిపాలించునది శరీరము. శరీరము సంసారమనే సముద్రముచే చుట్టబడి యుండును, లంక నూరుయోజనముల సముద్రముచే చుట్టబడియున్నది. రాజస తామస సాత్విక చిత్త్రవృత్తులే రావణ కుంభకర్ణ విభీషణులు. రాజసవృత్తి గల రావణుడు లంకను పాలించునప్పుడు రాముని భార్యయైన సీత లంకయందు బంధించబడును. రాజసవృత్తి ప్రధానముగానున్నప్పుడు అవివేక పూర్ణమైన మనస్సు రామునికే శేషభూతమైనదియు, రామునిచేతనే రక్షించబడదగినదియు, రామునిచే అనుభూతి చెందబడదగినదియునగు ఆత్మను, అనగా సీతమ్మను, లంకలో బంధించును.

పరమాత్మయే రాముడు, ఆనందము కలవాడు, ఆనందమునిచ్చువాడు. ఆనంద స్వరూపుడగు పరమాత్మయే రామునిగా అవతరించును. రామశబ్దమునకు అర్థమదే. పరమాత్మ వసించు స్థానము, పరమపదము, వైకుంఠము. దానికే అయోధ్య - అపరాజిత అని పేర్లు కూడా కలవు. దేవానాం పూ రయోధ్యా అని వేదము చెప్పుచున్నది. ఆ రామునకు, జనకుని యజ్ఞ క్షేత్రములో దొరకిన సీత భార్యయగును. సీత జీవ స్వరూపమును నటించును. జన్మింపదు, దొరకును. న జాయతే మ్రియతే వా కదాచిత్ అని ఉపనిషత్తు చెప్పుచున్నది. జనకుని యజ్ఞ క్షేత్రము కర్మక్షేత్రమగు శరీరము. ఆ శరీరములో అన్వేషించిన లభించునది ఆత్మ. ఆ అత్మ భగవానునికే చెందినదై భగవానునికి భార్యయై ఉండు. భార్యకు భర్తతో గల సంబంధం జీవాత్మకు పరమాత్మతో గల సంబంధము సమానము. ఈ సంబంధము ఆరు విధాలుగా నుండును.

1. అనన్యార్హ శేషత్వము - వానికే తప్ప ఇతరులకు చెందనిదై యుండుట
2. అనన్య శరణత్వము - వాడే తప్ప వేరొకడు రక్షకుడుగా లేకుండుట
3. అనన్య భోగ్యత్వము - వానిచేతనే తప్ప ఇతరులచేత అనుభవింపరానిదయి యుండుట
4. తత్ సంశ్లేషైక సుఖిత్వము - వానితో కూడి యుండుటే సుఖముగా నుండుట
5. తద్విశ్లేషైక దుఃఖిత్వము - వాని యెడబాటే దుఃఖముగా నుండుట
6. తదేకనిర్వాహ్యత్వము - వాని చేతనే నడిపింపబడుట

ఈ ఆరు లక్షణములు గల భార్యగా సీత రామునితో చేరినది.

ఈ విధంగా పరమాత్మతో నున్న జీవుడు వలె సీతమ్మ రామునితో యున్నది.

అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా! - నేను రామునితో వేరైనదానను కాదు. సూర్యునితో కాంతివలె కలసియే యుందును అని సీతమ్మ సుందరకాండ 21వ సర్గలో పలుకుతుంది.

ఇదే సీతారాముల తత్త్వం, మానవ జీవన రహస్యాన్ని తెలిపేది సీతారాముల చరిత.

(మహామహోపాధ్యాయ, ప్రవచన శిరోమణి శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందరకాండము - తత్త్వదీపిక నుండి)

రామాయణంలోని ఆసక్తికరమైన విషయాలు



ఏ ఘట్టం కూడా ఒక ప్రాతిపదిక లేకుండా జరగలేదు. ప్రతి ఒక్క సర్గకూ, ప్రతి ఒక్క కాండకూ, ముందస్తుగా రంగం, పాత్రలు, ఆ పాత్రల ప్రతిస్పందనలు నిర్ణయాత్మకం. అదే వాల్మీకి మహర్షి గొప్పతనం. అటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

నేపథ్యం:

సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి బద్ధుడై రావణుని ఎదుట నిలిచి రాముని ప్రతాపం గురించి పలికి, లంకను దహనం చేసి తిరిగి వచ్చి రామునికి సీతమ్మ ఆనవాలు ఇచ్చి రామునికి ఆనందం కలిగిస్తాడు. ఇక్కడ హనుమంతునికి రామకార్యమొక్కటే కాదు, రామదూతగా శత్రువునకు రాముని పక్షం యొక్క బల పరాక్రమాల రుచి చూపించి భయం కలిగించటం, రావణునికి మరొక అవకాశం కలిగించటం. ఆ కార్యంలో హనుమ పూర్తిగా సఫలమై తిరిగి వచ్చాక యుద్ధం అనివార్యమని అందరికీ తెలుసు. కానీ, ఎవరి ప్రవృత్తులను బట్టి వారు ప్రవర్తించారు.

ఎలా?

1. విభీషణుడు అన్నకు రామబాణం యొక్క శక్తిని తెలిపి అతనికి నచ్చచెప్ప జూచి అది ఫలించక రాముని పక్షాన చేరి శరణు కోరటం. అనగా, మంచి వైపు చేరే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్న రాక్షస ప్రవృత్తిని ఇక ఏ మాత్రం సమర్థించను అన్న నిర్ణయానికి రావటం. మరి రాముడేం చేశాడు? వైరి తమ్ముడు వచ్చి తన శరణు కోరాడు కాబట్టి అతనిని స్వాగతించాడు. అది సత్పురుషుల లక్షణం. ఈ రామ-విభీషణ సమాగమం విభీషణుని రామభక్తునిగా, తద్వారా రామానుగ్రహంతో లంకానగరానికి పాలకునిగా మరియు చిరంజీవిని చేసింది.

2. వానరసైన్యం సహాయంతో రాముడు తనపై యుద్ధానికి వచ్చాడు అన్న సంగతి తెలిసినా, రావణుడు తన కుతంత్రాన్ని వీడలేదు. 10 యోజనముల మేర వానరసైన్యమున్నదన్న శార్దూలుని మాటలకు కలవరపడి మిత్రభేధం కలిగించాలని ప్రయత్నం చేశాడు. రామసుగ్రీవ మైత్రికి విఘాతం కలిగించటానికి శుకుడనే వానిని పక్షిరూపంలో వెళ్లి సుగ్రీవునికి మాయమాటలు చెప్పమని ఆజ్ఞాపిస్తాడు. శుకునికి సుగ్రీవునితో ఇలా చెప్పమని పలుకుతాడు " ఓ సుగ్రీవా, నీవు మహావీరుడవు, గొప్పవాడవు, ఈ యుద్ధం వలన నీకు ఒరిగేదేమీ లేదు, నీవు నాకు సోదరుని వంటి వాడవు, నేను సీతను అపహరిస్తే నీకెందుకు? కాబట్టి కిష్కింధకు తిరిగి వెళ్లిపో". ఆ మాటలు విన్న వానరసైన్యమంతా ఆ పక్షిరూపంలో ఉన్న శుకుని రెక్కలు తెంచి అతని చంపబోతాయి.

3. ఆ శుకుడు భయంతో రామునితో దూతను చంపటం న్యాయం కాదు అని పలుకుతాడు. అంతా విన్న సుగ్రీవుడేమన్నాడు? అతను కూడ మిత్రధర్మాన్ని నిర్వర్తించాడు. రావణుని మాయమాటలకు లొంగకుండా - "ఓ రావణా! నీకు నాకు భ్రాతృ బంధం లేదు, రాముని శత్రువైన నీవు అధర్మానికొడిగట్టిన వాలిలా రాముని చేత హతుడవవుతావు, నీవు జటాజటాయువును చంపి, సీతమ్మను అపహరించి అధర్మానికొడిగట్టావు, నీకు మరణం తప్పదు" అని శుకుని ద్వారా సందేశం పంపి రావణుని హెచ్చరిస్తాడు.

4. మరి రాముడేం చేశాడు? భయంతో తనను చంపవద్దు దాని వల్ల రామునికే పాతకమన్న శుకుని మాటలు విని అతనిని విడిచిపెట్టమని వానరులను ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం గమనించవలసింది హనుమ లంకకు వెళితే రావణుడు అతనిని చంపమని ఆజ్ఞాపించి, తిరిగి విభీషణుని సలహా మేరకు దూతను చంపకుండా అతనికి శక్తికి సంకేతమైన లాంగూలానికి నిప్పంటించమని ఆజ్ఞాపిస్తాడు, దాని వల్ల నష్టం ఎవరికి జరిగింది? లంకకే! మరి రాముడేం చేశాడు? శుకుని చంపకుండా వదిలేస్తాడు. దీని వల్ల లాభమేమిటి? రాముని గొప్పతనం, రామసుగ్రీవుల మైత్రీబంధం రావణునికి వివరంగా తెలుస్తాయి. ఇక అతనికి మరణం తథ్యం. కానీ, రామయ్య వెంటనే ఆ పని చేయలేదు. మరిన్ని వివరాలు రేపు.

అడుగడుగునా రామయ్య ధర్మాన్ని పాటించాడు, పరిస్థితిని ధర్మ విజయానికి అనుకూలంగా తీర్చిదిద్దాడు. రావణుడో? ప్రతి అడుగూ, తన వినాశనానికే దారి తీసేలా చేసుకున్నాడు.

శ్రీరామ జయం

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...