5, సెప్టెంబర్ 2020, శనివారం

సనాతన ధర్మం

"స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే"

- మానవులందరికీ మేలు కలుగుగాక, చెట్లు చేమలు పైకి పెరుగు గాక, రెండు, నాలుగు కాళ్లున్న ప్రాణులకు శుభము కలుగుగాక.


"భద్రం కర్ణేభి శృణు యామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః"

- మా చెవులతో శుభం కలిగించేవి మాత్రమే వినెదము గాక, మా కళ్లతో శుభమునే చూచెదము గాక.


"ఆ నో భద్రా క్రతవో యన్తు విశ్వతః"

- విశ్వములోని అన్ని దిక్కుల నుండి ఉన్నతమైన ఆలోచనలు మాకు వచ్చు గాక.


"ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి"

- నీవే యదార్థము, నీవే సత్యము అని పలికెదను.


"ఋతం వచ్మి సత్యం వచ్మి"

యదార్థమును, సత్యమునే పలికెదను


"శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరివిశ్రువం"

- నా శరీరం ఆరోగ్యంగా ఉండనీ, నా నాలుక మధురమైన మాటలనే పలుకనీ, నా చెవుల ద్వారా అనేక మంచి విషయాలనే ఆలకించనీ.


"ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్వాషావహై"

మనలను భగవంతుడు రక్షించు గాక, పోషించు గాక, ఇద్దరమూ ఉత్తేజితులమై పరిశ్రమించెదము గాక, మన ఏకాగ్రత ఫలవంతమగు గాక, మనమిద్దరమూ ఒకరినొకరు ద్వేషించకుండా ఉండెదము గాక.


"స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాం గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినో భవంతు"

- ప్రజలకు శుభం కలుగుగాక, రాజులు న్యాయమార్గములో ఈ భూమిని పరిపాలింతురు గాక, గోవులకు, బ్రాహ్మణులకు శుభం కలుగు గాక, సమస్త లోకములకు సుఖము కలుగు గాక.


"మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వౌషదీ మధు నక్తంతోషసి మధుమత్పితార్థివగ్‌ం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః"

- సత్కార్యం చేయదలచిన మనకు గాలి తీయగా వీచుగాక, నదులు తీయని నీటితో ప్రవహించు గాక, చెట్టు చేమలు పరిపుష్టమై ఉండు గాక, భూమి మాధుర్యాన్ని అందించు గాక, మన తండ్రియైన ఆకాశము తియ్యదనాన్ని వర్షించు గాక, చెట్టుచేమల అధిపతియైన చంద్రుడు తీయగానుండు గాక, గోవులు అధికంగా పాలనిచ్చుగాక.

ఇలా ప్రతి అడుగులోనూ మంచినే వినాలని, మాట్లాడాలని, చూడాలని, ఆచరించాలని చెప్పింది వేదరూపమైన సనాతన ధర్మం. సమస్త జీవరాశి మంచి కోరుకుని వాటికి పుష్టి, తుష్టి శాంతి కలగాలని, దానిని నమ్మి నిరంతరం పలుకమని వేదాలు ఘోషించాయి. త్రికరణములు కూడా మంచిపైనే ధ్యాస కలిగి మంచినే ఆచరించాలని సహస్రాధికంగా పలికాయి. విశాలమైన భావనలతో అందరినీ ఆహ్వానించాయి, అందరికీ శుభం కలగలాని అడుగడుగునా నినందించాయి. అదీ ఈ ధర్మం యొక్క గొప్పతనం. ప్రతి అడుగులోనూ, సూక్తం లోనూ శాంతి మంత్రంతో శాంతికాముకతను పునరుద్ఘాటించాయి.

మరి మిగిలినవో? - వాళ్లు అది చేస్తున్నారు, అది సహేతుకం కాదు, అది మూఢం, అది అనాగరికం, రాళ్లు రప్పలను పూజించటమేమిటి అని దూషించి, దుష్ప్రచారం చేసేవారొకరైతే మరొకరు బలవంతం చేసైనా సరే వారు వారి ధర్మాన్ని వీడేటట్లు చేయండి, వారి దేవాలయాలను నాశనం చేయండి, వారి సంస్కృతి సాంప్రదాయాలను నామరూపాల్లేకుండా చేయండి, వారి ఆడవారిని చెరపట్టండి అని ధర్మపరాయణులను హింసించి మతమార్పిడులు, అత్యాచారాలు చేశారు, శతాబ్దాలపాటు దేశాన్ని రక్తసిక్తం చేసి మహోన్నతమైన సంస్కృతిని కాలరాశారు.

ఎవరిది అసహనం? ఎవరిది సర్వమానవ సౌభ్రాతృత్వం? మరొక మతానికి చెందిన వారిని చంపి రక్తసిక్తం చేసేవారు శాంతికాముకులా? దారుణంగా ఆడవారిని చెరబట్టి మానభంగం చేసి చంపి మారణహోమం సృష్టిస్తున్నవారు శాంతి కాముకులా?

లేక,

సన్యాసం ముసుగులో రాసలీలు సాగిస్తూ, అన్యమత ప్రచారం కోసం ఇతరుల ఆరాధనా ప్రదేశాలను అపవిత్రం చేస్తూ, సరైన అస్తిత్వం లేక దొడ్డిదారి తొక్కి చాపకింద నీరులా ప్రజలను డబ్బుతో ప్రలోభ పెట్టి తప్పుడు మాటలతో పక్కదోవ పట్టించే వారా?

లేక

నిరంతరం యజ్ఞ యాగాదులతో, పశు సమృద్ధి, ధాన్య సమృద్ధిని కాక్షించి, పవిత్రమైన అనుష్ఠానంతో, మంచిని పలికి మంచిని పంచిన వారా? శబ్ద ప్రకంపనలతో లోకంలో సకారాత్మకతను నింపుతున్న సనాతన ధర్మ పరాణయులను అతివాదులుగా చిత్రీకరిస్తుంటే, ఆ ధర్మాన్ని దారుణంగా అపహాస్యం చేస్తుంటే కనీసం స్పందించలేని పరిస్థితులను సృష్టిస్తుంటే మనం కళ్లు మూసుకుని కూర్చోవాలా?

సత్యం సుస్పష్టం, కానీ దాని వైపు నిలబడేందుకు ధైర్యం కావాలి, నిబద్ధత కావాలి, ధర్మం యొక్క గొప్పతనం అవగతం కావాలి. సనాతనధర్మమంటేనే శాంతి, సౌభ్రాతృత్వం, సమభావం. ఇక్కడ హింసకు తావులేదు, వివక్షకు అవకాశం లేదు. వక్రీకరించే వారిని ఎదిరించవలసిన సమయం.

ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత!
క్షురస్య ధారా నిశితా దురత్యయా పథస్తత్కవయో వదంతి!!

లేవండి, మేల్కోనండి, జ్ఞానులను ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకోండి. పదునైన కత్తివలె ఇది చాలా దుర్గమమైన మార్గము అని సత్కవులు చెబుతున్నారు. అయినా వెనుకడుగు వేయకండి.

- కఠోపనిషత్తు.

శ్రీగురుభ్యోనమ

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

గాయత్య్రష్టకం

విశ్వామిత్ర తపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం
నిత్యానిత్య వివేకదాం స్మితముఖీం ఖండేందు భూషోజ్జ్వలాం
తాంబూలారుణ భాసమాన వదనాం మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయా
తత్వార్థాత్మికవర్ణపంకిసహితా తత్వార్థబుద్ధిప్రదాం
ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీం
జప్తుః పాపహరాం జపాకుసుమనిభాం హంసేన సంశోభితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

కాంచీచేల విభూషితాం శివమయీం మాలార్ధమాలాదికాన్బి
భ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదాం
భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం
సాయంకాల సుసేవితాం స్వరమాయీం దూర్వాదళశ్యామలాం
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం
తారాహీరసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరాం
రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదాశోభితాం
తత్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధద్భ్రమద్భ్రామరీం
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలధ్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదాం
వీణావేణుమృదంగకాహలరవాన్ దేవైః కృతాంఛృణ్వతీం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

ఫలశ్రుతిః

హత్యాపానసువర్ణతస్కరగుర్వంగనాసంగమాన్దో
షాన్ఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛింధ్య సూర్యోపమాః
గాయత్రీ శృతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా
జప్త్వా యాంతి పరాం గతిం మునిమిమం దేవ్యాః పరం వైదికాః

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం గాయత్య్రష్టకం సంపూర్ణం

తాత్పర్యం:

విశ్వామిత్రుని తపఃఫలముగా వచ్చి, బ్రాహ్మణులు, ఋషులచే పూజించబడి, అనంతమైన, నిత్యమైన వివేకాన్ని ఇచ్చే, నెలవంకను ఆభరణముగా కలిగి శోభిల్లుతున్న, ఎర్రని వదనముతో భాసిల్లుతున్న, సూర్యుని మధ్యలో నివసిస్తున్న, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

మల్లెలు, కలువలు, మొగలి పూలమాలలతో శోభిల్లు పాదములు కలిగిన, తత్వార్థజ్ఞానాన్ని సంకేతించే బీజాక్షరాలు కలిగిన, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే, ప్రాణాయామములో నిష్ణాతులైన పండితులచే పూజించబడే, ఎల్లప్పుడు శుభాన్ని కలిగించే, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

కాలియందెల మృదువైన ధ్వనితో సమస్త జగత్తులో మృదుత్వాన్ని పెంచే, బ్రాహ్మణుల అర్పించిన అర్ఘ్యాలు,తర్పణాలతో రాక్షసులను అణచే, జపం చేసే వారి పాపాలను తొలగించే, ఎర్రని శరీర ఛాయ కలిగి, హంసవాహినియై, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

పట్టువస్త్రములు ధరించి, పూల మాలలతో అలంకరించబడిన, అనంతమైన శుభాన్ని కలిగించే, శరణును ప్రసాదించే, బుద్ధినుంచి మోహాన్ని విడగొట్టే, భూర్భువస్సువయై (కింద వివరణ చూడండి), మూడులోకాలకు మాతయై, ఆధ్యాత్మికశాఖలచే నుతింపబడే, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

తనను ధ్యానము చేసేవారి తాపాగ్ని నాశనము చేసే, ఎల్లప్పుడు సంయమనము కలిగి, శాంతమూర్తియై, సుస్వరయై, దూరముగా ఉన్న దర్భ (గడ్డిపోచ) వలె నల్లని ఛాయకలదై, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

సాయంకాల సమయంలో కాషాయవస్త్రధారిణియై బ్రాహ్మణులచే పూజింబడి, నక్షత్రాలవలె మెరుస్తున్న వజ్రహారములు ధరించిన, స్తనముల మధ్య చంద్రునివలె ప్రకాశించుచున్న రత్నాభరణములు కలిగిన, పూర్ణచంద్రునివలె ప్రకాశిస్తున్న ముఖము కలదై, రామునిచే పూజింపబడి, శంఖము మొదలగు హస్తాలంకారములతో, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

చుట్టూ భ్రమరములు తిరుగుతు ఉన్న పూలమాలలు కేశములలో అలంకరించబడిన, భ్రమరము వలె ధ్వని చేయుచు, నాలుకయందు తత్వజ్ఞానమనే రసము కలిగి, నాసికాభరణమునుండి వెలువడే ప్రకాశముతో చీకటిని ఛేదించే, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

పదకమలములయందు ఉన్న కుంకుమ, పుప్పొడి రేణువులనుండి వెలువడే కిరణాలతో ప్రకాశిస్తున్న, రంభ నృత్యాన్ని తిలకిస్తూ ఆనందించే, వేదాంతజ్ఞానాన్ని ప్రసాదిస్తూ, వీణ, వేణువు, మృదంగాది వాద్యముల నాదమును వింటూ, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

ఫలశ్రుతి:

హత్య, మధిరాపానము, బంగారం దొంగిలించటం, గురుపత్నిని మోహించటం వంటి మహాపాపాలను నాశనం చేసే, ఇంద్రుడు, సూర్యులకు సమమైన మంత్రమును సంధ్యా సమయంలో బ్రాహ్మణులు జపించుటవలన వారి ఆత్మలకు అత్యుత్తమైన వైదిక గతి కలుగుతుంది.

గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు:

1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.

2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.

3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.

మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.

గాయత్రీ ఆవాహన మరియు వినియోగ మంత్రాలు

ఓజోऽసి సహోऽసి బలమసి భ్రాజోऽసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయురభిభూరోం గాయాత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి ఛన్దర్‌షీనావాహయామి శ్రియమావాహయామి

గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతాః

అగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్ హృదయగ్‌ం రుద్రశ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపానవ్యానోదానసమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యానసగోత్రా గాయత్రీ చతుర్విగ్ంశత్యక్షరా త్రిపదా షట్కుక్షిః పఞ్చశీర్‌షోపనయనే వినియోగః

ఓ దేవీ! నీవు మా యింద్రియముల యొక్క శక్తివై యున్నావు, శత్రువులను తిరస్కరించే శక్తివి, శరీరమునకు బలమగుచున్నావు, తేజస్సువగుచున్నావు. అగ్నీంద్రాది దేవతల నివాసము నీవు, వారి నామములు కలదానవు (అనగా ఆయాదేవతలు నీవే), సర్వజగద్రూపవు, సంపూర్ణ ఆయుస్స్వరూపవు, నిఖిల చేతన సమూహము నీవే, జీవరాశి ఆయుష్యము నీవే, సకల పాపములను తిరస్కరించెడి తల్లివి నీవు, ప్రణవ ప్రతిపాదితమైన పరమాత్మ స్వరూపవు నీవు. ఇటువంటి అమ్మను గాయత్రిగా సావిత్రిగా సరస్వతిగా త్రికాలములందు నా మనసునందు ఉపాసన చేయుటకు ఆయాదేవతాస్వరూపముగా ఆవాహన చేయుచున్నాను.

ఈ గాయత్రికి గాయత్రి అనే ఛందస్సు, విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత, ముఖమగ్ని, శిరస్సు బ్రహ్మ, విష్ణువు హృదయము, శిఖ రుద్రుడు, యోని భూమి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచప్రాణాత్మికయైనది, దేవదత్త కూర్మ ధనంజయ నాగ కృకరములనెడి ఉపప్రాణములతో కూడినది, శ్వేతవర్ణము కలది, సాంఖ్యాయనుడను ఋషితో సమానమైన గోత్రము కలది, ఇరువది నాలుగు అక్షరములు కలది, ఋగ్యజుస్సామవేదములనెడి మూడు పాదములు కలది, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వ దిశ, అధో దిశ అనే ఆరు దిక్కులు ఉదరముగా కలది, శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్త్మము, జ్యోతిషము అనేవి శిరస్సులుగ కలది అగు గాయత్రిని వేదాధ్యయనము కొరకు గురువు వద్ద వినియోగించుచున్నాను.

శ్రీగురుభ్యోనమః

గాయత్రీ వైశిష్ట్యం

యావేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీ మహేశ్వరీ
ఋగ్యజుస్సామాధర్వైశ్చ తన్మేమనశ్శివ సంకల్పమస్తు

అన్ని వేదములలో ప్రతిపాదించబడిన గాయత్రి సర్వ మానవుల బుద్ధులయందు మంగళకరములైన సంకల్పములను కలిగించును
(మహన్యాసము)

గాయత్రీం చింతయేద్యస్తు హృత్పద్మే సముపస్థితాం
ధర్మాధర్మ వినిర్ముక్తస్సయాతి పరమాంగతిమ్

గాయత్రిని హృదయములో ఉపాసన చేయువాడు ధర్మాధర్మ విచికిత్స చేత బంధింపబడకుండా మోక్షమును పొందుతాడు
(వేదవ్యాసుడు)

గాయత్రీ వేదజననీ గాయత్రీ లోకపావనీ
న గాయత్య్రాః పరం జప్యం ఏతద్విజ్ఞానముచ్యతే

గాయత్రియే వేదమాత, ముల్లోకవాసులకు జ్ఞానమును ప్రసాదించు పావని. గాయత్రీమంత్ర జపమును మించినది మరొకటి లేదు.
(కూర్మపురాణం)

గాయత్రీంచైవ వేదాంశ్చ తులయో సమతోలయన్వే
దా ఏకత్ర సాంగాస్తు గాయత్రీచైకత స్థితా

నాలుగు వేదములను, ఆరు వేదాంగములను త్రాసు యొక్క ఒక పళ్లెమునందు, గాయత్రీ మంత్రమును రెండవ పళ్లెమునందు ఉంచి తూచినచో గాయత్రి వైపే త్రాసు మొగ్గు చూపును
(యాజ్ఞవల్క్యుడు)

న గాయత్య్రాః పరమ్ మంతం న మాతుః పరదైవతమ్

తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు
(ఆర్షసూక్తి)

చత్వారో వేదాస్సంగాऽస్యోపనిషదస్సేతిహాసాః సర్వే గాయత్య్రాః ప్రవర్తంతే

వేదము, వేదాంగములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు అన్నియు గాయత్రి వలననే ప్రవర్తించును
(గాయత్రీ ఉపనిషత్తు)

గాయత్రీ మాత్రనిష్ఠస్తు కృతకృత్యో భవేద్విజః

ఒక్క గాయత్రీ మంత్రమును ఉపాసించుటచే ఇతర మంత్రముల ప్రమేయము లేకనే ద్విజుడు కృతార్థుడగును.
(గాయత్రీ రహస్యం)

సర్వాత్మనాహి యా దేవీ సర్వభూతేషు సంస్థితా
గాయత్రీ మోక్షహేతుర్వై మోక్షస్థానక లక్షణమ్

సమస్తభూతముల యందు అంతర్యామినియై వర్తించు గాయత్రియే మోక్షస్వరూపము, మోక్షప్రసాదిని అయి ఉన్నది.
(ఋష్యశృంగుడు)

మంత్రము - అర్థము - గురువు - మంత్ర చైతన్యము

మంత్రము శబ్ద విశేషము. దేనిని మననము చేయుటచే పరిత్రాణము కలుగునో అదే మంత్రము. మంత్రములో ప్రతిపాదించబడిన శ్రేష్ఠమైన అర్థమే గురువు. ఈ అర్థము వల్ల కలుగు అనుభవమే చైతన్యము. అదే ఇష్ట దేవత. ఈ విధముగా మంత్రము, గురువు, ఇష్ట దేవతను మూడిటిని ఏకము చేయుటచే మంత్రచైతన్యమగును. చిన్న ఉదాహరణలు రెండు:

చింతపండు అని ఒక మాట ఉంది. ఇదే మంత్రము అనుకుందాం. ఆ పదానికి అర్థం తెలియనంత వరకూ, చింతపండేమిటో మనకు తెలియదు. కాబట్టి అది మృతశబ్దంగానే పరిగణించబడుతుంది. నోటితో లక్షల మార్లు చింతపండు అని పఠించినా దాని గురించి అవగాహన రాదు. తరువాత ఎవరైనా (గురువు) వచ్చి చింతపండు రూపము, రుచి, ఉపయోగాలు మొదలైనవి చక్కగా తెలియజేసినప్పుడు "చింతపండు" అనే దాని అర్థజ్ఞానము మనకు కలుగుతుంది. ఈ అర్థము పేరే గురువు. తరువాత "చింతపండు" అన్నమాట ఉచ్చరించగానే దాని రూపము, దాని పులుపు రసము మొదలైనవి జ్ఞానము మనలో పెల్లుబుకుతుంది. ఇంకెప్పుడైనా సరే చింతపండు అనగానే, దానిని చూడగానే, దాని రుచి మొదలైన వాని జ్ఞానము అనుభవపూర్వకమై వికసించి మన నోరూరుతుంది. అదే చైతన్యము. ఇదే విధముగా అంతటా.

"అమ్మ దయామయి" అన్న పదములు పరిశీలిద్దాం. ఈ పదములు పలుకగానే దయానుభవముతో మన హృదయము నిండిపోయినప్పుడు ఆ దయామయి అన్న పదము యదార్థముగా పలుకబడినదని గ్రహించాలి. మనము అమ్మ అనుచున్నాము కానీ అమ్మ ఎవరో తెలియకున్నాము ఎందుకంటే అమ్మ అనే మాటకు అర్థము తెలియదు. ఈ బాల్యావస్థలో అమ్మ అనునది ఒకరకంగా మృతశబ్దమే. వేరే వ్యక్తి, అనగా గురువు, అమ్మ అనగా పరిపూర్ణ స్నేహమునకు ఆధారమైన జగద్వ్యాపి చైతన్యము, ఆమెయే ఆత్మ అని చెప్పగానే, ఆ గురు కృపచేత అమ్మ అన్న శబ్దం ఉచ్చరించగానే స్నేహఘనమును, చైతన్యమయమైన ఆత్మానుభవము మనలో ఏనాడు పెల్లుబుకుతుందో ఆనాడే మనకు ఆ మాతృ మంత్రము (అమ్మా అని మనము ఉచ్చరించేది) చైతన్యమయమైనదని తెలుసుకుంటాము.

అర్థముననుసరించి అనగా గురువుననుసరించి రసముతోను, భావముతోను మనము రసికులము, భావుకులము అవుతాము. మంత్ర స్తుతిని స్వయంగా, యాంత్రికంగా ఉచ్చరించటం వలన మనకు యథార్థ ఫలము లభించదు. పైన చెప్పబడిన మంత్ర చైతన్యమనెడి వస్తువు లేకపోవటం చేతనే సాధన మార్గము దుర్గమము, అంధకార బంధురముగా తోచును. కాబట్టి ఏ స్తోత్రమైనా, విశిష్ట మంత్ర జపమైనా, నామ సంకీర్తనైనా చేయు వేళ మనము ఆధ్యాత్మిక ప్రగతికి సాయపడే సదర్థము (అనగా గురువును) ఎఱిగి అర్థానురూప భావముతో స్వయం సంవేదితులమగుటకు ప్రయత్నించాలి.

శ్రీగురుభ్యోనమః.

శర్మ-శాస్త్రి-వేదలక్షణాలు-వేదాధ్యయనం

బ్రాహ్మణంలోని పురుషులను సంబోధించేవి శర్మ, శాస్త్రి. పేరు చివరన వీటిని కలిగిన వారు సాధారణంగా బ్రాహ్మణులుగా పరిగణించబడతారు. ఏమిటి వీటికి తేడా?

శర్మ - ఉపనయన సమయంలో కృష్ణాజినం ధరించటం ద్వారా వటువు శర్మ అవుతాడు. కృష్ణాజినానికి మామూలు అర్థం జింకచర్మం అయినప్పటికీ, దానిలో గూడార్థం ఉంది. అది త్రయీ విద్యాస్వరూపమని విశ్వాసం. త్రయీవిద్యా అనగా మూడు వేదములను అభ్యసించటం. జింక చర్మం ధరించినవారు ఈ వేదవిద్యలో ప్రతిష్ఠులై, చిత్తశుద్ధి కలిగి క్రమంగా శర్మ అవుతారు. అనగా శాశ్వతానంద అనుభూతికి యోగ్యులవుతారు. వేదవిద్యలు గురుముఖత నేర్చుకోవలసినవి. ప్రవర, సంకల్పం చెప్పే సమయంలో ఈ శర్మను పేరు చివర జోడించటంలో పరమార్థం ఆ అనందానికే సమస్త కర్మలు, అధ్యయనాలు అని సూచించటానికి, నిరంతరం సాధకులకు గుర్తు చేయటానికి. ఈ వేద విద్యల అధ్యయనం, సంధ్యావందనం మొదలైనవి చేయని వారికి శర్మ అని చెప్పుకునే అర్హత లేదు.

శాస్త్రి - శాస్త్రములు తెలిసినవారు వారు శాస్త్రిగా పిలువబడతారు. ఏమిటా శాస్త్రాలు? ఇవి ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. ఈ శాస్త్రాలు కూడా గురుముఖత నేర్చుకోవలసినవి. ఈ శాస్త్రాల అధ్యయానికి ఉపనయనము జరిగి కొంత క్రమశిక్షణ ఏర్పడి, సంధ్యావందనాది నిత్యానుష్ఠానములు చేసే వారు అర్హులు. ఆ ఆరు శాస్త్రాలను షడంగాలు/వేదాంగాలు అంటారు.

ఈ విధంగా శర్మ, శాస్త్రి అన్న సంబోధనలు వచ్చాయి. ఇవి రెండూ కూడా జన్మతో ఆపాదించేవి కాదు, సంస్కారముల తరువాత సాధనతో, అధ్యయనంతో సంపాదించుకోవలసినవి.

వేదాల యొక్క లక్షణాలు ఏమిటి?

మంత్రాల ఓజస్సును, శక్తిని కాపడేవి ఈ లక్షణాలు. వర్ణక్రమం అనే ఓ గొప్ప సాంప్రదాయం ఈ మంత్రాలను సురక్షితం చేశాయి. వేదమంత్రోచ్ఛారణలో ధ్వని, స్థాన,కరణ, ప్రయత్న, మంత్ర, స్వర, దేవతా జాతులనే ఎనిమిది లక్షణాలను సాధకులు పాటించవలసి ఉంటుంది. ఎలా పడితే అలా నేర్చేసుకుని పఠించటం సరైన పద్ధతి కాదు.

అసలు వేదాధ్యయనానికి ఎంత సమయం పడుతుంది?

వేదంలో ఎన్నో శాఖలు. ఒక్కొక్క వేదం నేర్చుకోవటానికి దాదాపుగా 12 సంవత్సరాలు పడుతుంది. అంటే, నాలుగు వేదాలు సరైన పద్ధతిలో నేర్చుకోవాలంటే 48 ఏళ్లు లేదా అంతకు పైగా సమయం పడుతుంది. కాబట్టి వేదాల శాఖలను అధ్యయనం చేసే సాంప్రదాయం వచ్చింది. గతంలో ఈ వేదాధ్యయన సమయంలో శిష్యులు గురుకులంలోనే నివసించేవారు. చాలా మార్లు వంశానుక్రమంగా ఏ శాఖలనైతే అధ్యయనం చేశారో వానినే శిష్యులు ముందుకు కొనసాగించటం ఓ పద్ధతి. శిష్యుని యొక్క సామర్థ్యం, శ్రద్ధాసక్తులను బట్టి వేదాధ్యయన సమయం, ఉత్తీర్ణత అనేవి నిర్ణయించబడతాయి. వాక్శుద్ధి, శుద్ధ అంతఃకరణం కలిగి, పైన చేప్పిన వేదలక్షణాలను పాటించే గురువులవద్దే అధ్యయనం చేయాలి.

ఈ సృష్టిలో బ్రాహ్మణత్వం ఎందుకు వర్ధిల్లాలి?

మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యం సత్యాన్ని తెలుసుకోవటం, అనగా ఈ విశ్వంలో అణువణువునా నిండి ఉన్న విశ్వజనీన శక్తిలో మనమూ ఒక అణుభాగమని ఎఱిగి దానితో అనుసంధానం చేసుకోవటం. అది తెలిసిన వాడే బ్రాహ్మణుడు. అనితర నిత్య సత్యాన్వేషణ బ్రాహ్మణునికి ఉపాధి, జీవితము, పరమార్థమూను. ఈ సత్యాన్వేషణకే విద్య, ఆధ్యాత్మికత, స్థితప్రజ్ఞత, ఫలాపేక్షలేని జీవన విధానం. మరి సత్యం ఎందుకు కావాలి? మా జీవితమే మాకు సత్యం అని మిగిలిన మూడు వర్ణాల వారు, నాస్తికులు, వితండవాదులు ప్రశ్నించవచ్చు. స్వానుభవంలో విలువైన సమయం గడిచిపోతుంది, మనస్సాక్షి మనలను చాలా సందర్భాలలో తప్పుదారి పట్టిస్తుంది. కారణం? సత్యం కానిది ప్రపంచం. అనాదిగా ఋషిప్రోక్తమైన వేదవాఙ్మయం,అనేక దార్శనికుల అనుభూతుల ద్వారా రచించబడిన పురాణేతిహాసాలు, పెద్దల నడవడిక మనకు అత్యంత సులభమైన మార్గాలను తెలియజేశాయి. ఇవి కాలపరీక్షను తట్టుకున్నవి. ప్రతి ఒక్కరికీ వీటిని తెలుసుకునే సమయం, అవకాశాలు, పరిస్థితులు ఉండటం అసంభవం, ఉన్నా సఫలం కాకపోవచ్చు కూడా. ఎందుకంటే సత్యాన్వేషణకు ఒకరకమైన జీవనశైలి కావాలి, ఎంతో త్యాగం చేయాలి. ప్రతి అడుగులోనూ సత్యాన్ని ఆచరించగలిగే సంకల్పం ఉండాలి. ఇవి బ్రాహ్మణత్వానికి కావలసిన అర్హతలు, నియమావళిలో, శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుందాం:

1. పూర్తిగా సాత్వికమైన ఆహారం
2. ఉపనయన సంస్కారం, త్రికాల సంధ్య
3. వేదాధ్యయనం
4. నిరాడంబరమైన గృహస్థ జీవితం, సంయమనం
5. ఫలాపేక్ష లేని కర్మానుష్ఠానం

పైవి ఎందుకు అన్నవి అనేకమార్లు చెప్పుకున్నాం. ఐదూ కూడా ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవే. ధర్మానికి మూలము, వెన్నెముక అయిన సత్యాన్ని నిరంతరం తెలుసుకునే ప్రయత్నంలో ఉండే బ్రాహ్మణుని మించిన సమాజ శ్రేయోభిలాషి మరొకడుండడు. అందరు బ్రాహ్మణులు ఇలానే ఉంటారా అని ప్రశ్నించే వారికి సమాధానం ఉండేవాడే, ఆ ప్రయత్నం చేసేవాడే బ్రాహ్మణుడు. సత్యాన్వేషణ ద్వారా ధర్మాచరణ అనేది ప్రతి ఒక్క ఉపాధిలోనూ చాలా ముఖ్యం. అది కొంతైనా పాటించబడుతుంటేనే ఈ మానవ ప్రపంచంలో శాంతి మిగిలేది. లేకపోతే ప్రతిక్షణము అల్లకల్లోలమే. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకునే ధీరత, జ్ఞానం, ప్రశాంతమైన వ్యక్తిత్వం బ్రాహ్మణత్వం ద్వారా సమాజంలో పెంపొందించబడుతుంది, తద్వారా పాలకులకు, ప్రజలకు మార్గదర్శకమవుతుంది.

ఎలాగైతే, ఒక బిడ్డకు తల్లి తండ్రి ఇద్దరి ఆలంబన కావాలో, ఎలాగైతే ఒక చెట్టుకు ఎండ గాలి నీరు కావాలో, ఎలాగైతే ప్రకృతిలో పంచభూతాలు సృష్టి క్రమానికి అవసరమో, అలాగే సమాజంలో సత్యాన్వేషకుడు, ధర్మపరాయణుడు, సత్యబోధకుడు అయిన బ్రాహ్మణుడు ముమ్మాటికీ కావాలి. అందుకే బ్రాహ్మణత్వం వర్ధిల్లాలి.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...