4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సాంగోపాంగ సంధ్యావందనం - ఎందుకు?


ఉద్యంతమస్తంయంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వణ్ బ్రాహ్మణో విద్వాన్ సకల భద్రమశ్నుతేऽసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద

ప్రొద్దున సూర్యుడుదయించుటకు ముందు, సాయంకాలము సూర్యుడస్తమించుటకు ముందు, సూర్యమండలమందు బ్రహ్మరుద్రవిష్ణు రూపములతో వెలయుచున్న పరబ్రహ్మచైతన్య స్వరూపిణి యగు సంధ్యాదేవతను ద్విజుడు అసావాదిత్యో బ్రహ్మ+సాऽహమస్మి అనే మంత్రములతో సంధ్యాదేవతను నేనే అనుకొనుచు ధ్యానింపవలెను. దానికి ముందు ఆ మంత్రముల యొక్క అర్థము చక్కగా తెలిసికొని, ఆ అర్థమును ఆ ధ్యానములో భావింపవలెను. ఈ విధముగా సంధ్యాదేవతను ధ్యానము చేసినచో బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానమును పొందును.

ఎలా?

బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అన్న మంత్రములో దీనికి సమాధానం ఉంది. మానవుడు వాస్తవములో తాను పరబ్రహ్మయే అయియున్నను మాయచేత (అజ్ఞానమే మాయ) తాను జీవుడని దృఢమైన భ్రాంతిలో యుంటాడు. కానీ, సంధ్యాధ్యాన మంత్రము యొక్క అర్థము చక్కగా తెలుసుకొన్నచో ఆ అజ్ఞానము సగము తొలగి పోవును. ధ్యానము చేయగా చేయగా ఆ అజ్ఞానము పోయి, తాను పరబ్రహ్మ స్వరూపుడనే దృఢమైన జ్ఞానం కలిగి, తద్వారా మరింత తీవ్రముగా ధ్యానము చేయగా పరిపూర్ణ శుద్ధ అంతఃకరణముతో ఏదో ఒకనాడు పూర్వపుణ్యపరిపక్వము చేత హఠాత్తుగా బ్రహ్మసాక్షాత్కారము కలుగును. అదే జీవబ్రహ్మైక్యము అనగా మరుజన్మ లేని మోక్షం.

అసావాదిత్యో బ్రహ్మ సాऽహమస్మి అన్న మంత్రములో అసౌ+ఆదిత్యః, బ్రహ్మ, సా+అహం+అస్మి అన్న ఆరు పదముల యొక్క అర్థం తెలుసుకున్నందువలన తప్పక అజ్ఞానము తొలగి పోవును. మన అంతఃకరణము అనేకానేక పూర్వజన్మలలో చేసిన పాపములతో నిండియుంది కాబట్టి ధ్యానములో ఏకాగ్రత, మంత్ర భావము గోచరించుట కష్టం. అందుకే అంతఃకరణములోని పాపాలు పోవుటకు సంధ్యాదేవత ఉపాసనలో ధ్యానమునకు ముందు తరువాత ఆంగిక కర్మలను ప్రతిపాదించారు. దీనినే సాంగోపాంగ సంధ్యావందనమంటారు. దీని ప్రధాన ఉద్దేశం మన పాపములను తొలగించుకొని అంతఃకరణమును శుద్ధి చేసుకొనుట, తద్వారా సంధ్యాదేవత ధ్యానమును సాఫల్యము చేసుకొనుట, జీవబ్రహ్మైక్యము సాధించుట.

ఈ సాంగోపాంగములు రెండు రకాలు 1. పూర్వాంగములు 2. ఉత్తరాంగములు.

పూర్వాంగములు ఐదు 1. ప్రథమ మార్జనము 2. అబ్భక్షణము 3. పునర్మార్జనము 4. పాపపురుషదహనము 5. అర్ఘ్య ప్రక్షేపము.

పూర్వాంగ  కర్మల వివరాలు
-----------------------------------

సంధ్యావందనములో సంధ్యాదేవత ఉపాసన ముందు వెనుకల చేయబడే కర్మలను అంగములంటారు. ముందు చేయబడేవి పూర్వాంగములు, తరువాత చేయబడేవి ఉత్తరాంగములు. పూర్వాంగములు అయిదు 1. ప్రథ మార్జనము 2. అబ్భక్షణము (మంత్రాచమనము) 3. పునర్మార్జనము 4. పాపపురుష దహనము 5. అర్ఘ్య ప్రక్షేపము

1. ప్రథమ మార్జనము - ఓం ఆపో హి ష్ఠా మయో భువః తా న ఊర్జే దధాతన మొదలైన మంత్రములు చెప్పుచు తలమీద నీళ్లు చల్లుకొనుట. దీని వలన రజస్తమోగుణములచేత చేసిన పాపములము చాలామటుకు తొలగి పోవును.

2. అబ్భక్షణము (మంత్రాచమనము) - సూర్యశ్చ మామన్యుశ్చ మొదలైన మంత్రములచేత అభిమంత్రించిన జలమును త్రాగుట వలన లోపల సూక్ష్మ శరీరము చేత చేసిన పాపములు నాశనమగును.

3. ద్వితీయ మార్జనము - ఈ రెండవసారి చేయు మార్జనము చేత వెలుపలి శరీరము పూర్తిగా శుద్ధమగును.

4. పాపపురుష దహనము - లోపలి సూక్ష్మ శరీరములోని పాపములను ఒక పురుషాకృతితో వెలుపలకు తెచ్చి ఆ పాపపురుషుని దహించి వేయుట ఈ కర్మ. దీనిచేత లోని పాపములు నశించిపోవును.

5. అర్ఘ్య ప్రక్షేపము - ఈ విధముగా, లోపల మరియు బయట శుద్ధుడై మందేహ రాక్షసులతో సూర్యునకు కలిగిన యుద్ధోపద్రవమును పోగొట్టుటకు మూడు మార్లు అర్ఘ్యములు విడువవలెను. గాయత్రీ మంత్రము చేత అభిమంత్రించుట వలన బ్రహ్మాస్త్రముతో సమానమైన అర్ఘ్యములు ఆ రాక్షస నాశనము చేయగా సూర్యుని ఉపద్రవము తీరి సూర్యుడు స్వస్థ్యుడగును.

(మందేహారుణులు బ్రహ్మనుగూర్చి తపము ఆచరించి సూర్యునితో పోరాడునట్లు వరము పొందినవారు. వీరి సంహారార్థము త్రిసంధ్యలయందును బ్రాహ్మణులు గాయత్రిచే అభిమంత్రించిన అస్త్రములను అర్ఘ్యమూలముగా విడుతురు. వారు ఆయస్త్రములచేత సంహరింపబడినా వరదానమహిమచే పునర్జీవితులు అగుదురు)

తరువాత ప్రదక్షిణాచమనములు చేసి ఆ విధముగా స్వస్థమైన సూర్యమండలము లోపల హంసవాహన బ్రహ్మరూపముతోను, మధ్యాహ్న సమయమున వృషభవాహన రుద్రరూపముతోను, సాయంకాల సమయమున గరుడవాహన విష్ణు రూపముతోను, స్త్రీయాకారముతో వెలసే బ్రహ్మచైతన్య స్వరూపిణి యగు సంధ్యాదేవతను "అసావాదిత్యో బ్రహ్మ సऽహమస్మి" అనే మంత్రములతో మంత్రార్థమును బాగా భావన చేసుకొనుచు, ధ్యానించవలెను. ఈ ధ్యానమునే ఉపాసన అందురు. సంధ్యాదేవత పరబ్రహ్మస్వరూపిణి కనుక ఈ ధ్యానము బ్రహ్మ ధ్యానమగును. ఇది బ్రహ్మ ధ్యానము కాబట్టే ఈ ధ్యానము వలన బ్రహ్మజ్ఞానము కలిగి పరబ్రహ్మ సాక్షాత్కారమగును.

ఇక్కడ విశేషమేమిటంటే, ప్రతి కర్మలోని మంత్రానికి ఒక ఋషి, దేవత, ఛందస్సు, ఆ కర్మ యొక్క వివరములు కలిగిన వినియోగమును ముందు పఠించటం.

తొలుత మార్జన మంత్రానికి "ఆపోహిష్ఠేతి త్యచస్సాంబరీషః సింధుద్వీపఋషిః ఆపోదేవతా గాయత్రీ ఛందః మార్జనే వినియోగః: అన్నది,

తరువాత మంత్రాచనమునకు "సూర్యశ్చేతస్య మంత్రస్య యాజ్ఞవల్క్య ఉపనిషద్ ఋషిః సూర్యమన్యు మన్యుపతిరాత్రయో దేవతాః ప్రకృతిశ్ఛందః మంత్రాచమనే వినియోగః" అన్నది,

తరువాత పునర్మార్జనమునకు "ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య సింధుద్వీపో అంబరీషో వా ఋషిః ఆపో దేవతా గాయత్రీ ఛందః ద్వనుష్ఠుబంతం పంచమీ వర్ధమానా సప్తమీ ప్రతిష్ఠా అంతే ద్వే అనుష్టుభౌ మార్జనే వినియోగః" అన్నది,

తరువాత పాపపురుష దహనమునకు "ఋతంచ సత్యంచేత్యస్య మంత్రస్య అఘమర్షణ ఋషిః భావవృత్తో దేవతా అనుష్టుప్ ఛందః మమ పాపపురుష జల విసర్జనే వినియోగః" అన్నది,

తదుపరి అర్ఘ్యప్రదానానికి "ఓం తత్సవితురిత్యస్య మంత్రస్య గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా గాయత్రీ ఛందః ప్రాతః సంధ్యార్ఘ్య ప్రదానే వినియోగః"

అని వినియోగాలు ఋషులు, దేవతలు కర్మలతో స్పష్టంగా నిర్వచించబడ్డాయి. ఈ ఋషులు, మంత్రాలు ఆయా వేద శాఖలను బట్టి, ప్రాతః, మధ్యాహ్న, సాయం సంధ్యా కర్మ సమయమును బట్టి మారతాయి. ఉదాహరణకు నేను మాది ఋగ్వేదం కాబట్టి ఋగ్వేద మంత్రాలను ప్రస్తావించాను.

వీటి అర్థం ఏమిటి? నిత్యము - ఋషిప్రోక్తమైన మంత్రములను ఆయా దేవతలను తలచుకుంటూ, మనలను మనం శుద్ధి చేసుకుని ఉపాసనకు సిద్ధం చేసుకోవటమే. ఈ విధంగా, సంధ్యోపాసనలో మంత్రార్థము గ్రహించి, సాంగోపాసనలోని పూర్వభాగ కర్మలను శుచిగా అనుష్ఠించటం వలన మనలోని అంతర్బహి పాపములను తొలగించుకొని, సూర్యమండలమున సంధ్యాదేవతను ఉపాసన చేయటంతో బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, పరబ్రహ్మ సాక్షాత్కారమునకు అర్హత కలుగుతుంది.

ఉత్తరాంగ కర్మల వివరాలు
----------------------------------

సంధ్యాదేవి ధ్యానము తరువాత పాపనివృత్తి కొరకు, దేవతల అనుగ్రహము కొరకు ఉత్తరాంగములను ఆచరించవలెను. ఇవి ఐదు.

1. గాయత్రీ జపము 2. సూర్యోపస్థానము 3. దిగ్దేవతా నమస్కారము 4. భూమ్యాకాశ వందనము 5. అభివాదనము.

1. గాయత్రీ మంత్ర జపము
====================

గాయత్రీ మంత్రమంతటి గొప్ప మంత్రం ఇంకొకటి లేదు అని అనేక శ్రుతి స్మృతి పురాణములు చెప్పుచున్నవి. ఈ గాయత్రీ మంత్ర జపంచేత పంచమహా పాతకములు కూడా పోతాయని శాస్త్రములు చెప్పుచున్నాయి. పగటి పాపములను పగలే, రాత్రి పాపములు రాత్రియే పోతాయని గాయత్రీ హృదయమే చెప్పుచున్నది. గాయత్రీ మాత సంధ్యాదేవతకు ప్రధానమంత్రిణి వంటిది. గాయత్రీదేవి ప్రసన్నురాలైనచో సంధ్యాదేవత శీఘ్రముగా ప్రసన్నురాలగును. బ్రహ్మవిష్ణు శివాత్మాత్మకమైన గాయత్రీ ధ్యానము అత్యంత శ్రేష్ఠము, సమస్త పాపహరణము.

ఈ గాయత్రీమంత్ర జపం అంగన్యాస కరన్యాసములతో 24 అక్షరాలకు 24 ముద్రలతో అనుస్ఠానం చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక సంపత్తిగా మనకు ఋషులు అందించారు. న్యాసము చేసేటప్పుడు బ్రహ్మాది దేవతలను తలచుకొనుచు మన దేహములో ఆ శక్తిని ఆయ స్థానములలో ఉంచి జపం చేస్తే వచ్చే ఫలితాలు అనుభవైకవేద్యం. బ్రహ్మచేత గ్రహింపబడిన ఋగ్యజుస్సామవేదములనే మూడు వేదములను మూడు పాదములుగా జేచి త్రిపాద గాయత్రీ మంత్రము కూర్చబడింది. అందుకే గాయత్రీ మంత్రము మూడు వేదముల సారము, గాయత్రీ మాత వేదమాతగా శ్రుతులు చెబుతున్నాయి.

గాయత్రీ మంత్రార్థమేమిటి? ఏ సూర్యుడైతే మా బుద్ధులను ప్రచోదనము చేయునో, ప్రకాశించేవాడైన ఆ సూయుని యొక్క శ్రేష్ఠమైన తేజస్సును ధ్యానము చేసెదము.అనగా, ప్రత్యక్ష దైవమైన సూర్యుని మన బుద్ధిని ప్రేరేపించుటకు ధ్యానించి మనలను సరైన మార్గమును అనుసరించేలా కోరుకోవటం.

2. సూర్యోపస్థానం
=============

మిత్రస్య చర్షణీ (ప్రాతః సంధ్యలో) అన్న మంత్రములతో కూడినది సూర్యోపస్థానము.

ఇది సూర్యదేవుని స్తుతి. ఇందులో సూర్యుని మహిమ అపారముగా వర్ణించబడింది. సూర్యమండలములో సంధ్యాదేవతను ఉపాసించుచున్నాము కాబట్టి సూర్యుని అనుగ్రహము వలన సంధ్యాదేవత అనుగ్రహము కలుగును. సూర్యుడు ప్రత్యక్ష దైవము, కర్మసాక్షి. ఈ ఉపస్థానము వలన ఆరోగ్యము, ఆయుష్యము, పాపనాశనము, అంతఃకరణశుద్ధి మొదలైన ఉత్తమ ఫలములు కలుగును.

3. దిగ్దేవతా నమస్కారము
===================

ఓ నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యే తాభ్యశ్చ నమో నమః అని తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర,ఊర్ధ్వ, అధో దిక్కులలో ఉన్న దేవతలకు, గంగ, యమున నదుల మధ్య నుండే నిర్మలమైన మనస్సు గలవారికి, మునులకు, సావిత్రికి, గాయత్రికి, సరస్వతికి, సకల దేవతలకు ఋషులకు, మునులకు, గురువులకు, పితృదేవతలకు నమస్కారములు సమర్పించి మన ఆయుష్షును పెంచేవారికి కృతజ్ఞత తెలుపుకోవటం ఈ దిగ్దేవతా నమస్కారములు.

దిగ్దేవతలకు, దిక్పతులకు భక్తి శ్రద్ధలతో నమస్కరించటం వలన సాధకుడు వారి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలగు దిక్పతులు గొప్ప బ్రహ్మవేత్తలు. వీరి అనుగ్రహము వలన అంతఃకరణము శుద్ధమై శీఘ్రముగా బ్రహ్మజ్ఞానము కలుగును.

4. భూమ్యాకాశవందనము
===================

ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు అనే మంత్రముతో పితృమాతృ వందనం చేస్తాము. సమస్త ప్రాణులకు భూమ్యాకాశములు తల్లిదండ్రులు. వీరి అనుగ్రహము వలన సుఖజీవనము కలుగును. సుఖమయమైన జీవితముంటేనే కదా సంధ్యోపాసనాది కర్మలను శాంతమైన మనసుతో చేయగలిగేది. అందుకే ఆ జనని పృథివికి, జనకుడు ఆకాశునికి మన కృత్జతలు తెలియజేసుకుంటాము.

5. అభివాదనము
=============

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు అనే వాక్యములు అభివాదనము. దీనిలో తొలుత సమస్తమైన వారియొక్క క్షేమమును కోరుకుంటాము. సర్వేజనాస్సుఖినోభవంతు అన్నది మన భారతీయ సత్సాంప్రదాయం. ఆ విధంగా అభివాదములో మన గోత్రమును స్థాపించిన మహర్షులను, మన వేదమును, వేదశాఖను, మన సూత్రకర్తయగు మహర్షిని భక్తిశ్రద్ధలతో తలచుకుంటాము. ఇలా చేయటం వలన మన మహోన్నతమైన పరంపర జ్ఞాపకమునకు వచ్చి మనకు ఉత్సాహము కలుగును. ఆ తరువాతా ఆ బ్రహ్మలోకాదాశేషాత్ అనే శ్లోకాన్ని పఠిస్తాము. పదునాలుగు లోకములలోనున్న దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరిస్తాము.

ఈ విధంగా పూర్వాంగ ఉత్తరాంగ కర్మలతో కూడిన సంధ్యోపాసన ద్వారా వేద సారమును గ్రహించే అర్హతను పొంది, నిరంతర గాయత్రీ మంత్రానుష్ఠానము ద్వారా సంధ్యాదేవత అనుగ్రహము పొంది, సమస్త దేవతల అనుగ్రహము పొంది బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అందుకే సంధ్యోపాసన అత్యంత ఆవశ్యకమైనది.

శ్రీగురుభ్యోనమః

(తైత్తరీయ బ్రాహ్మణము, ఇతర మూలాల నుండి సారం)

శ్రీ రమ్య చిత్తాలంకార స్వరూప - త్యాగరాజస్వామి కీర్తన

రామభక్తి సామ్రాజ్యంలో త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన నడవడిక, కీర్తనలు రాముని వైభవాన్ని, ఆయన భక్తిని చాటినవే. అటువంటి ఒక కీర్తన శ్రీరమ్య చిత్తాలంకార స్వరూప.

శ్రీ రమ్య చిత్తాలంకార స్వరూప బ్రోవుము

మారారి దేవేంద్ర పితామహాద్యష్ట దిక్పాల సేవ్య

సురేశారి జీవాపహర వర సోదర ధరాప శ్రీప
వరానంద నే నీవలె గానరా త్యాగరాజార్చిత పద

సీతాదేవి చిత్తమును అందముగా అలంకరించే రూపము గల శ్రీరామా! నన్ను బ్రోవుము. మన్మథుని వైరి అయిన శివుడు, దేవేంద్రుడు, బ్రహ్మాది దేవతలు, అష్టదిక్పాలకులచే సేవించబడే శ్రీరామా! నన్ను బ్రోవుము. దేవేంద్రుని శత్రువైన మేఘనాధుని సంహరించిన లక్ష్మణుని సోదరుడవు, భూమండలమునకు చక్రవర్తివి, సీతాదేవికి పతివి, సచ్చిదానందస్వరూపుడవు, నీవంటి దైవమును నేను కానలేను, పరమశివునిచే అర్చించబడిన పదములు గల శ్రీరామా, నన్ను బ్రోవుము.

జయమనోహరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణగారు ఆలపించారు.

హెచ్చరికగా రారా హే రామచంద్ర - త్యాగరాజస్వామి కీర్తన


హెచ్చరికగా రారా హే రామచంద్ర
హెచ్చరికగా రారా హే సుగుణ సాంద్ర

పచ్చవిల్తుని కన్న పాలిత సురేంద్ర

కనకమయమౌ మకుట కాంతి మెరయగను
ఘనమైన కుండల యుగంబు కదలగను
ఘనమైన నూపుర యుగంబు ఘల్లనగ
సనకాదులెల్ల గని సంతసిల్లగను

ఆణిముత్యాల సరులల్లలాడగను
వాణీపతీంద్రులిరు వరుస పొగడగను
మాణిక్య సోపానమందు మెల్లగను
వీణ పలుకులు వినుచు వేడ్క చెల్లగను

నిను జూడ వచ్చు భగిని కరంబు చిలుక
మనసు రంజిల్ల నీ మహిమలను బలుక
మిను వాసులెల్ల విరులను చాల జిలుక
ఘన త్యాగరాజు కనుగొన ముద్దు గులుక

సుగుణములకు నెలవైన ఓ శ్రీరామచంద్రా! హెచ్చరికగా వేంచేయుము. మన్మథుని కన్న తండ్రివి, ఇంద్రాదులను పాలించే వాడవు, హెచ్చరికగా వేంచేయుము. బంగారు కాంతులతో కిరీటము మెరయగా, శ్రేష్ఠమైన కుండలములు కదలగా, గొప్పవైన కాలి యందెలు ఘల్లనగా, సనకాదులు నిన్ను జూసి సంతోషించగా హెచ్చరికగా వేంచేయుము. మేలైన ముత్యాల సరులు అల్లలాడగా, బ్రహ్మేంద్రులు ఇరువైపుల పొగడుచుండగా, మాణిక్యములు పొదగబడిన మెట్లు ఎక్కి మెల్లగా వీణావాయిద్యములు వినుచు ఎంతో వేడుకగా హెచ్చరికగా వేంచేయుము. నిన్ను చూచుటకు నీ కొలువుకు వచ్చిన సోదరి పార్వతీదేవి కరమున చిలుక మనసునకు మోదము కలిగించేలా నీ మహిమలను పలుకుచుండగా, ఆకాశములో దేవతలు నీపై పుష్పవర్షము కురిపించగా, ఈ మనోహరమైన దృశ్యమును పరమేశ్వరుడు కాంచగా ముద్దులొలుకుచు హెచ్చరికగా వేంచేయుము శ్రీరామచంద్రా!

(శ్రీరామచంద్రమూర్తి తన కొలువునకు వచ్చే సమయములో ఇరువైపుల వంధిమాగధులు స్వామికి జయము పలుకుచు హెచ్చరికగా రమ్మని స్వాగతమిచ్చే అద్భుతమైన ఘట్టాన్ని త్యాగరాజస్వామి అనుభూతి చెంది ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేశారు)

యదుకుల కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

రఘు వంశ సుధాంబుధి చంద్ర - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్

 రఘు వంశ సుధాంబుధి చంద్ర! శ్రీ రామ! రాజరాజేశ్వర!

అఘ మేఘ మారుత! శ్రీకర! అసురేంద్ర మృగేంద్ర వర జగన్నాథ!

జమదగ్నిజ గర్వ ఖండన! జయ రుద్రాది విస్మిత భండన!
కమలాప్తాన్వయ మండన! అగణితాద్భుత శౌర్య! శ్రీ వేంకటేశ్వర!

రఘువంశమనే అమృత సాగరానికి చంద్రుని వంటి, రాజులకు రాజైన శ్రీరామా! నీవు పాపములనే మేఘములను పారద్రోలే వాయువు వంటి వాడవు, సమస్త శుభములను కలిగించేవాడవు, అసురేంద్రుడైన బలిపై, గజేంద్రునికిపై కరుణ చూపిన జగన్నాథుడవు నీవు! శివధనుస్సును ఎక్కుపెట్టి దేవతలకు ఆశ్చర్యము కలిగించి, జమదగ్ని కుమారుడైన పరశురాముని గర్వమును అణచినావు! నీవు సూర్యవంశ కీర్తిని ఇనుమడింపజేశావు, శౌర్యంతో లెక్కించలేనన్ని అద్భుతములను కావించినావు! కలియుగములో శ్రీవేంకటేశ్వరుడవు నీవు!

(గమనిక: ఇక్కడ మృగేంద్రుడు అంటే సింహము కదా అన్న ప్రశ్న తల ఎత్తుతుంది. మృగము అనగా అడవి ఏనుగు అని కూడా అర్థముంది, అందుకే మృగేంద్రుడు అనగా గజేంద్రుడన్న అర్థమే సముచితము అని నా భావన. ఈ పంక్తికి వేరే అర్థము తెలిస్తే తప్పక తెలుపగలరు)

కదనకుతూహల రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.

నాలం వా తవ నయవచనం - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అన్నమాచార్యుల వారు రచించిన అద్భుతమైన శృంగార సంకీర్తనలలో ఒకటి ఈ సంస్కృత భాషలో వెలువడిన "నాలం వా తవ నయ వచనం". ప్రఖ్యాత కర్ణాటక శాస్త్రీయ సంగీత మరియు లలిత సంగీత విదుషీమణి శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు ఎంతో అందంగా ఆలపించి బహుళ ప్రాచుర్యం కలిగించగా ఇటీవల విదుషీమణి శ్రీమతి శ్వేతా ప్రసాద్ గారు పాడితే మళ్లీ విన్నాను. పైకి శృంగార సంకీర్తన అనిపించినా, మధురభక్తిలోని ఆధ్యాత్మిక తత్త్వం ఈ కృతిలో నిబిడీకృతమై ఉంది. జయదేవుని అష్టపదులలోని భావానికి పరిపూర్ణమైన సారూప్యత ఈ అన్నమాచార్యుల వారి కృతిలో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. చాలా పరిమితమైన సంస్కృత భాషా అవగాహనతో యథాతథం అనువదించే ప్రయత్నం చేశాను. తప్పులుంటే పెద్దలు మన్నించి సరిదిద్దగలరు.

నాలం వా తవ నయవచనం
చేలం త్యజతే చేటీ భవామి

చలచలమమ సం సద్ఘటనే కిం?
కులిశ హృదయ బహుగుణ విభవ
పులకిత తను సంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి

భజభజ తే ప్రియభామాం సతతం
సుజనస్త్వం నిజ సుఖనిలయ
భుజరేఖా రతిభోగి భవసి కిం?
విజయీభవ మద్విధిం వదామి

నయ నయ మామనునయనవిధం తే
ప్రియ కాంతాయాం ప్రేమభవం
భయహర వేంకటపతే త్వం మ
త్ప్రియో భవసి శోభితా భవామి

స్వామీ! నీ మోసపు మాటలు చాలు, నా కొంగు విడిచిపెట్టు, నేను నీకు దాసినై ఉన్నాను. వజ్రము వలె కఠినమైన హృదయము కలవాడా! ఈ విధంగా దగ్గర వస్తావెందుకు? దూరంగా వెళ్లు. నీ అనేక గుణ వైభవములతో నా తనువు పులకరించి, చెమటలను విసర్జిస్తూ మలినమైపోయింది. సజ్జనుడువైన నీవు నీకు ప్రియమైన సతుల వద్దకే వెళ్లు. నీవు వారితో ఎంతటి రతి సుఖములను అనుభవించావో నీ భుజాలపై గోటికొనలతో ఏర్పడిన రేఖలే చెబుతున్నాయి. రతిభోగములో నీకు విజయము కలుగుగాక. ఈ విరహం నా విధి అని నన్ను నేను సమాధాన పరచుకుంటాను. చేసినదంతా చేసి ఎంత బాగా నన్ను ఓదార్చుతున్నావు? ఈ నీ పద్ధతులు నీ ప్రియసతులకు బాగా నచ్చి వారిలో ప్రేమను కలుగ జేస్తాయి. నా భయాలను తొలగించే శ్రీనివాసా! నీవు నాకు మాత్రమే ప్రియుడవు అయితే నేను సంతోషిస్తాను. నీ మోసపు మాటలు చాలు, నా కొంగు విడిచిపెట్టు, నేను నీకు దాసినై ఉన్నాను.

బృందావన సారంగ రాగంలో కూర్చబడిన ఈ కృతిని శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించారు

సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం గారు

ప్రచార మాధ్యమాల విప్లవం రాక మునుపు ఆకాశవాణిలో కొందరు విద్వాంసులు ఆకాశవాణి ద్వారా అద్భుతమైన సంగీత ప్రస్థానం చేశారు. వారిలో బాలమురళీకృష్ణ గారు, వోలేటి వేంకటేశ్వర్లు గారితో పాటుగా శ్రీరంగం గోపాలరత్నం గారు కూడా ఉన్నారు. ఆవిడ గళంలో ఉండే మాధుర్యం అంతా ఇంతా కాదు. ఆవిడ గాత్రసౌరభం తేనె జాలువారినట్లే ఉంటుంది. ఎంతో విలక్షణమైన గాత్ర ధర్మం ఆవిడను సంగీత ప్రపంచంలో ప్రత్యేకమైన కళాకారిణిగా నిలిపింది. ఆవిడ స్వరాలు పలికించే రీతి, బహుభాషా పటిమ, శృతిలయలపై పట్టు అనుపమానం. అంతటి ప్రతిభ ఉన్న సంగీత విద్వాంసురాలు మళ్లీ తెలుగుగడ్డపై ఇంకా పుట్టలేదనటంలో అతిశయోక్తి లేదు. పెళ్లి పాటలు, అన్నమయ్య సంకీర్తనలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజనలు, తరంగాలు, లలిత భక్తి గీతాలు, కూచిపూడి నాట్య సంగీతం, యక్షగానాలు, జావళులు, యెంకిపాటల రూపంలో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాలను తన అసమానమైన ప్రతిభతో మురిపించారు గోపాలరత్నం గారు.

1939వ సంవత్సరంలో విజయనగరం జిల్లాలో సుభద్రమ్మ, వరదాచార్యులు దంపతులకు గోపాలరత్నం జన్మించారు. వరదాచార్యుల వారి పూర్వీకులు శ్రీరంగం నుండి విజయనగరానికి తరలివచ్చారు. తల్లికి మేనమామ అయిన అప్పకొండమాచార్యులు రాసిన రెండు హరికథలను పాలకొల్లు సభలో తొమ్మిదేళ్ళ వయసులో గానం చేయడమే వీరి తొలి ప్రదర్శన. కవిరాయని జోగారావు గారు వీరి ప్రధాన సంగీత గురువు. ద్వారం వెంకటస్వామి నాయుడు, శ్రీపాద పినాకపాణి వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు. 17 ఏళ్ల పిన్న వయసులోనే కర్నాటక శాస్త్రీయ సంగీత గాత్రంలో డిప్లొమా పూర్తి చేశారు. తొలిసారిగా విజయవాడ ఆకాశవాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటినుండి రెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమాలను సమర్పించారు. భామా కలాపం యక్షగానం, నౌకా చరితం ఆవిడ ప్రతిభకు గీటురాళ్ళు. ఆవిడకు అత్యంత కీర్తిని తెచ్చినది సంగీత ప్రధానమైన రేడియో నాటకం మీరాబాయి.ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారిణిగా, విజయనగరం మహారాజా కళాశాల మరియు హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలల ప్రధానాధ్యాపకురాలిగా తన సేవలను అందించారు. ఆకాశవాణిలో భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారమైన అనేకానేక గీతాలను ఆవిడ ఆలపించారు. ఎన్నో అన్నమాచార్యుల వారి సంకీర్తనలను స్వరపరచారు కూడా. గోపాలరత్నం గారు పాడిన తిరుప్పావై, నారాయణ తీర్థుల వారి తరంగాలు ఆరోజుల్లో తెలుగు లోగిళ్లలో మారుమ్రోగాయి. ఆవిడ తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా కూడా పనిచేశారు. ఆవిడ గాత్రంలో గమకాలు, భావానికి సముచితమైన ఉచ్చారణ ఆవిడ ప్రత్యేకతలు.

గోపాలరత్నం గారు సినీ గీతాలు కూడా ఆలపించారు. శ్రీవేంకటేశ్వర వైభవం చిత్రంలోని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా పాట ఆంధ్రద్దేశమంతటా పేరొందింది. బికారి రాముడు చిత్రంలో ఆవిడ పాడిన నిదురమ్మా నిదురమ్మా గీతం బహుళ పాచుర్యం పొందింది. గోపాలరత్నం గారు 1969లో తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా సేవలందించారు. 1977లో హైదరాబాదు లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్బావంతో లలిత కళా పీఠానికి ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. మధుర గాయకి, గాన కోకిల, సంగీత రత్న మొదలైన ఎన్నో బిరుదులను పొందారు. 1992వ సంవత్సరంలో భారత ప్రభుత్వం గోపాలరత్నం గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1993 మార్చి 16న చిన్న వయసులోనే పరమపదించారు.

ప్రముఖ రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల గారు సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం (జీవితం- సంగీతం) అన్న పుస్తకం ద్వారా గోపాలరత్నం గారి జీవిత విశేషాలను తెలీయజేశారు. ఆవిడ ఆలపించిన కొన్ని అద్భుతమైన గీతాలు - సకలం హే సఖి జానామి, ఎవ్వడెరుగును నీ ఎత్తులు, కస్తూరి రంగయ్య కరుణించవయ్య, శరణం భవ కురు దీనదయాళో, అలమేలుమంగా నీ అభినవ రూపము, నల్లని మేని నగవు చూపులవాడూ, నమో నారాయణా, కలయ యశోదే తవ బాలం, ఏమని పొగడుదు ఇట్టి నిపుణము...ఇలా కొన్ని వందలు. ఈనాటి కళాకారులతో పోలిస్తే ఆవిడ ప్రతిభకు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఎమ్మెల్ వసంతకుమారి, డీకే పట్టమ్మాళ్ మొదలైన వారి స్థాయికి ఏ మాత్రం తగ్గని ప్రతిభ శ్రీరంగం గోపాలరత్నం గారిది. తెలుగునాట పుట్టడం ఒకరకంగా కొందరు అసమాన ప్రతిభ గల కళాకారుల పట్ల శాపమేమో అనిపిస్తుంది.

మనుజుడై పుట్టి మనుజుని సేవించి - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినము దుఃఖమొందనేల?

జుట్టెడు కడుపుకై చొరని చోట్లు చొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి
పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి
వట్టి లంపటము వదల నేరడు గాన

అందరిలోపుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పదమందెనటు గాన

మనిషిగా పుట్టి ఇంకొక మనిషిని సేవించి ప్రతి రోజు దుఃఖము పొందుట ఎందుకు? జానెడు కడుపుకోసం పనికిమాలిన పనులు చేసి, పిడికిలి అన్నము కోసం ఇతరులను బతిమాలి, కామముతో మనం జన్మించిన స్థానంపైనే ధ్యాస కలిగి,  వట్టి బంధనములను వదలలేడు ఈ మనిషి. అందరిలో జన్మించి, అందరిలోనూ తానే ఉండి, అందరి రూపములు కూడా తానేయై, అందమైన శ్రెవేంకటేశ్వరుని సేవిస్తే దుర్లభమైన మోక్షపదము కూడా అందగలదు. 

జుట్టెడు కూటికోసం మనం పడే పాట్లు, శారీరిక సుఖాలకోసం తపన, పనికిమాలిన లంపటాలను వదిలించుకోలేని దుస్థితి..... మనం ఏం చేస్తున్నామో, దేనికోసం వెంపర్లాడుతున్నామో, ఏమి చేస్తే మంచిదో అన్నీ చక్కగా చెప్పేశారు అన్నమయ్య. చేయాల్సింది చేస్తే అందరాని పదములు అందుబాట్లోకి వస్తాయి అని ఒక్క వాక్యంలో తెలిపారు. ఆభోగి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...