30, ఆగస్టు 2020, ఆదివారం

ఏకామ్రేశ నాయికే శివే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ఏకామ్రేశ నాయికే శివే శ్రీ కామాక్షి పాహి మాం

ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి శాతోదరి సద్భక్త వశంకరి

కామహరణ మోహిత పూర్ణ ఫలే కామకలే విమలే కరకమలే
పామర జన పాలిని గురుగుహ జనని శుద్ధ సావేరీ నుత నందిని

కాంచీక్షేత్రంలో ఏకామ్రేశ్వరుని నాయిక, శివాని అయిన శ్రీ కామాక్షీ! నన్ను రక్షింపుము. ఏకామ్రేశ్వరుని పత్ని, శంకరి, కృశించిన ఉదర భాగం కల, సద్భక్తుల వశమై యుండెడి శ్రీ కామాక్షీ నన్ను రక్షింపుము. మన్మథుని హరించిన శివునిచే మోహింపబడిన, పూర్ణ ఫలములనొసగే, కామకళారూపిణియైన, నిర్మలమైన, చేతిలో కలువ కలిగిన, పామర జనులను పాలిచే, కుమారునికి జననియైన, శుద్ధ సావేరి రాగంలో నుతించబడిన, హైమవతిగా పేరొందిన శ్రీకామాక్షీ నన్ను రక్షింపుము.

శుద్ధ సావేరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నిత్యశ్రీ మహదేవన్ గారు ఆలపించారు.

శ్రీరాజరాజేశ్వరి త్రిపురసుందరి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


 

శ్రీరాజరాజేశ్వరి త్రిపురసుందరి శివే పాహి మాం వరదే

నీరజాసనాది పూజితపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే

శౌరి విరించ్యాది వినుత సకలే శంకర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖ ప్రదే నిష్కళే పూర్ణ చంద్రికా శీతలే విమలే
పరమాద్వైత బోధితే లలితే ప్రపంచాతీత గురుగుహ మహితే
సురుచిర నవరత్న పీఠస్థే సుఖతర ప్రవృత్తే సుమనస్థే

ఓ రాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! పరమశివుని అర్థాంగీ! వరములనొసగే తల్లీ! నన్ను కాపాడుము. బ్రహ్మాది దేవతలచే పూజించబడే పరదేవతవు, సమస్త సంశయములను నాశనము చేసే నైపుణ్యము కలదానవు నీవు. విష్ణువు, బ్రహ్మ మొదలైన వారిచే నుతించబడి అంతటా ఉన్నావు, కలువ వలె మనోహరముగా ఉన్న శంకరునికి ప్రియసతివి నీవు. నిరుపమానమైన సుఖమునొసగే నిష్కళంకవు, పూర్ణచంద్రుని వలె చల్లదనమునిచ్చే విమలవు నీవు. పరమోన్నతమైన అద్వైతాన్ని బోధించే లలితవు, ప్రపంచాతీతమైన మహిమ కలదానవని సుబ్రహ్మణ్యునిచే నుతించబడినావు నీవు. రమణీయమైన నవరత్న పీఠముపై స్థితమై సచ్చిదానందము కలిగిస్తున్నావు, నిర్మలమైన మనసులలో నివసిస్తున్నావు నీవు. నన్ను కాపాడుము.

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అభిషేక్ రఘురాం గారు ఆలపించారు.


సౌందరరాజమాశ్రయే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కృతులలో సౌందరరాజమాశ్రయే అని బృందావన సారంగ రాగంలో కూర్చబడిన కృతి ఒకటి. ఇది తమిళనాడులోని నాగపట్టణంలో సౌందరవల్లీ సమేతుడై వెలసిన సౌందరరాజస్వామిపై రచించినది. ఈ క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్యదేశములలో ఒకటి. 8వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ దేవాలయాన్ని పల్లవులు, తంజావూరు నాయకులు పోషించి మరల మరల పునరుద్ధరించారు. 90 అడుగుల రాజగోపురంతో, అద్భుతమైన శిల్పసంపద కలిగిన దేవస్థానం ఇది. ఇక్కడ వైఖానస సాంప్రదాయంలో లక్ష్మీనారాయణుల రూపంగా మూలవిరాట్టులను పూజిస్తారు. ఈ దేవస్థానం ప్రత్యేకత ఇక్కడ ప్రహ్లాదవరదుడైన నారసింహుడు అష్టభుజములతో అభయముద్రలో వెలసి ఉండటం. తంజావూరు నాయకులు ఈ దేవస్థానంలో అద్భుతమైన మంటపాలు నిర్మించారు.

సౌందరరాజమాశ్రయే గజ బృందావన సారంగ వరదరాజం

నంద నందన రాజం నాగపట్టణ రాజం
సుందరి రమా రాజం సురవినుత మహి రాజం
మందస్మిత ముఖాంబుజం మందరధర కరాంబుజం
నందకర నయనాంబుజం సుందరతర పదాంబుజం

శంబర వైరి జనకం సన్నుత శుక శౌనకం
అంబరీషాది వినుతం అనాది గురుగుహ ముదితం
అంబుజాసనాది నుతం అమరేశాది సన్నుతం
అంబుధి గర్వ నిగ్రహమనృత జడ దుఖాపహం
కంబు విడంబమాన కంఠం ఖండీకృత దశకంఠం
తుంబురు నుత శ్రీకంఠం దురితాపహ వైకుంఠం

గజారణ్యములో గజేంద్రుని రక్షించిన సౌందరరాజస్వామి నేను ఆశ్రయించియున్నాను. నందుని కుమారుడు, నాగపట్టణంలో వెలసిన ప్రభువు, సౌందర్యవతి అయిన లక్ష్మీదేవికి నాథుడు, దేవతలచే పొగడబడిన భూనాథుడు, చక్కని చిరునవ్వుతో పద్మము వంటి ముఖము కలవాడు, తన కరపద్మములతో మందరపర్వతాన్ని ఎత్తిన వాడు, కలువలవంటి కన్నులతో ఆనందం కలిగించేవాడు, సుందరమైన కలువల వంటి పాదములు కలవాడు అయిన సౌందరరాజస్వామి నేను ఆశ్రయిస్తున్నాను. శంబరుని వైరి అయిన మన్మంథునికి జనకుడు, శుకశౌనకాదులు, అంబరీషునిచే నుతించబడినవాడు, పుట్టుకలేని వాడు, కుమారస్వామికి ఆనందం కలిగించినవాడు,బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే నుతించబడినవాడు, రామావతారంలో సముద్రుని గర్వాన్ని అణచినవాడు, అసత్యాన్ని, జడత్వాన్ని ఛేదించి దుఃఖాలను తొలగించేవాడు, శంఖమును మించిన సొగసున్న కంఠము కలవాడు, దశకంఠుని సంహరించినవాడు, తుంబురుడు నుతించిన శుభకరమైన కంఠము కలవాడు, పాపములను నాశనము చేసే వైకుంఠ స్వరూపుడైన సౌందరరాజస్వామిని నేను ఆశ్రయిస్తున్నాను.

కృతి విశేషాలు:

అద్భుతమైన యతిప్రాసలతో, పరిపూర్ణమైన భక్తి భావంతో అనుపమ సుందరరూపమైన సుందరరాజస్వామిని వర్ణించే కృతి ఇది. పల్లవిలో ద్వితీయాక్షర ఆది ప్రాసతో ఈ కృతి మొదలవుతుంది. రంగపుర విహార అని శ్రీరాముని వర్ణించిన దీక్షితుల వారు అదే రీతిలో, అదే రాగంలో ఈ కృతిని రచించారు. ఈ కృతి వింటుంటే అడుగడుగునా రంగపుర విహార సాహిత్యంతో సారూప్యం అవగతమవుతుంది. అద్భుతమైన ఉత్ప్రేక్షాలంకరములు, ద్వితీయాక్షర ప్రాసలు, రాజం, అంబుజం, కంఠం అన్న పదాలతో అంత్యప్రాసలు ఈ కృతికి ప్రత్యేక ఆకర్షణ. అటువంటి పదప్రయోగం వలన ఈ కృతి కర్ణోపేయమై ప్రకాశిస్తుంది. ప్రముఖ సంగీత శాస్త్రజ్ఞురాలు డాక్టర్ టీఎస్ సత్యవతి గారు కృతిని అద్భుతంగా వివరించారు. వీడీయో చూసి ఆనందించండి.

సిద్ధివినాయకం అనిశం - దీక్షితుల వారి కృతి


కర్నాటక సంగీత వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితుల వారి గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆయన మన పండుగలు, వ్రతాల ప్రస్తావన తన కృతులలో చేశారు. అటువంటి కృతులలో ఒకటి సిద్ధి వినాయకం అనిశం అన్నది. షణ్ముఖప్రియ రాగంలో కూర్చబడిన ఈ కృతిలో వినాయక చతుర్థి ప్రస్తావన ఉంది. దీక్షితులవారి కృతులలో ప్రత్యేకతలు - రాగ ప్రస్తావన, ఆయా దేవతల తంత్రము, స్వరూపమును ప్రస్తావించటం. ఈ కృతిలో చామర అన్న పదంలో రాగ ప్రస్తావన చేశారు. షణ్ముఖప్రియ రాగానికి చామరం అని కూడా పేరుంది. అలాగే, మూలపంకజ మధ్యస్థం అని అనుపల్లవిలో ప్రస్తావించి మూలాధార చక్రములో నివసించే గణపతి రహస్యాన్ని తెలిపారు. మోదక హస్తం, పాశాంకుశ ధరం, చతుర్భుజం అన్న పదాల ద్వారా గణపతి స్వరూపాన్ని ఆవిష్కరించారు. అలాగే, వినాయకచవితి ప్రస్తావన, అద్రిరాజ సుతాత్మజం అని గణపతి ఆవిర్భావం, రౌహిణేయనుజార్చితం అన్న పదం ద్వారా శ్రీకృష్ణునిచే పూజించబడిన వాడని శమంతకోపాఖ్యానం గురించి ప్రస్తావించారు. ఈ విధంగా మొత్తం గణపతి తత్త్వాన్ని దీక్షితుల వారు ఈ కృతి ద్వారా మనకు అద్భుతంగా తెలియజేశారు. వినాయకచవితి సందర్భంగా ఈ కృతి సాహిత్యం, భావం.

సిద్ధి వినాయకం అనిశం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్ధ దాయకం వరం

సిద్ధ యక్ష కిన్నెరాది సేవితమఖిల జగత్ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదక హస్తం

భాద్రపద మాస చతుర్ధ్యాం బ్రాహ్మణాది పూజితం పాశాంకుశ ధరం ఛత్ర చామర పరివీజితం
రౌద్రభావ రహితం దాస జనహృదయ విరాజితం రౌహిణేయానుజార్చితం ఈషణ వర్జితం
అద్రిరాజ సుతాత్మజం అనంత గురుగుహాగ్రజం భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం

గణాధిపతిగా ప్రసిద్ధుడై విశిష్టమైన ఫలములనొసగే సిద్ధి వినాయకుని నేను ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను. సిద్ధులు, యక్షులు, కిన్నెరులు మొదలైన వారిచే పూజించబడేవాడు, జగత్ప్రసిద్ధుడైనవాడు, మూలాధార చక్రములో నాలుగు దళముల పద్మములో స్థితుడైనవాడు, చేతిలో మోదకము కలిగిన సిద్ధి వినాయకుని నేను ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు బ్రాహ్మణులచే పూజించబడేవాడు, పాశము, అంకుశము ధరించినవాడు, ఛత్ర చామరములచే వీచబడేవాడు, రౌద్ర భావము లేనివాడు, భక్తుల హృదయములలో వెలసి ఉండేవాడు, బలరాముని సోదరుడైన కృష్ణునిచే పూజించబడినవాడు, రాగమును త్యజించినవాడు, హిమవంతుని కుమార్తె అయిన పార్వతి పుత్రుడు, నాశనము లేనివాడు, సుబ్రహ్మణ్యుని అగ్రజుడు, రక్షణనొసగే పాదపద్మములు కలిగినవాడు, నాలుగు హస్తములతో ప్రకాశించే సిద్ధివినాయకుని నేను ఎల్లపుడూ ధ్యానించుచున్నాను.

షణ్ముఖప్రియ రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

శ్రీ దుం దుర్గే శివ సంసర్గే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

ప్రముఖ వాగ్గేయకారులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు దుర్గాదేవిని శ్రీరంజని రాగంలో తిరువారూరు సమీపంలోని కధిరమంగళం వనదుర్గామాతను కొనియాడుతూ ఓ అద్భుతమైన కృతిని రచించారు. ఈ కృతి దుర్గాదేవి మూల మంత్రం యొక్క బీజాక్షరాలతో ఆరంభమవుతుంది. ముత్తుస్వామి దీక్షితుల వారు సిద్ధపురుషులు. మంత్రసాధన చేసి, అమ్మను దర్శించి ఎన్నో కృతులను రచించారు. ఇది కూడా అటువంటిదే. దాని వివరాలు:

శ్రీ దుం దుర్గే శివ సంసర్గే చిద్రస వర్గే స్థిరే ఆపవర్గే శ్రీ వనదుర్గే

దుందుభి వాద్య భేద నాద వినోదిని
మోదిని వీణా వాదిని సంవేదిని అభేదిని
సుందరి శ్రీరంజని నిరంజని జయ జనని

కరుణారసాలయే కలికల్మష విలయే
కర విధ్రుత కువలయే కానన నిలయే
చరణ కిసలయే చామీకర వలయే
స్వర సంగీత లయే సురుచిర మలయే
గురుగుహోదయే సదయే విజయే అభయే
సరసమయే షట్సమయే సమయే కలయే

ఓ వనదుర్గా మాతా! శివుని సహచారిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! శాశ్వతమైన సుఖాలను ప్రసాదించే తల్లీ! వివిధరకములైన వాద్యముల నాదములతో ఆనందించే తల్లీ! వీణావాదనము చేసే తల్లీ! నీవు సర్వాంతర్యామివి! భేదింప శక్యము కావు! మనోజ్ఞమైన రూపము కలదానవు! శ్రీమహాలక్ష్మిని అలరించే తల్లీ! దోషరహితవు! అమ్మా! నీకు జయము! కరుణకు నిలయము నీవు, ఈ కలిదోషాలను హరించే తల్లివి, చేతిలో వికసించిన కమలము కలదానవు, అడవులలో నివసించే తల్లివి! చిగురులవలె మృదువైన పాదములు కల తల్లివి! స్వర్ణకంకణములు ధరించిన మాతవు! కార్తికేయుని తల్లివి! దయామూర్తివి, విజయవు, మాకు అభయమునిచ్చే తల్లివి! మృదువైన స్వభావము కల అమ్మవు! ఆరు మతములకు మూలము మరియు కాలానివి నీవు! అంతటా ఉన్న అమ్మవు!

దీక్షితుల వారి సాహిత్యంలో ఉండే దేవతా వైభవం మహోన్నతమైనది. పూర్తిగా దేవతానుగ్రహం పొంది, ఆ దేవతా స్వరూపంతో అనుసంధానమై ఆయన సంకీర్తనలను రచించారు. అందుకే ఆయన రచనలలో పరిపూర్ణత్వం కనబడుతుంది. ప్రస్తుత కాలంలో వనదుర్గ ఆలలయాలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, మన సనాతన వాఙ్మయం ఈ వనదుర్గ మన కర్మభూమిలో అంతటా కొలువబడినదని చెబుతున్నాయి. తమిళనాడులోని కధిరమంగళం, తెలంగాణాలోని ఏడుపాయల, కర్ణాటకలోని దేంతడ్క, కేరళలోని పోయిల్కవే మొదలైన ప్రాంతాలలో వనదుర్గ వైభవంగా కొలువబడుతోంది. ఈ క్షేత్రాలు మహిమాన్వితమైనవి.

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక! శ్రీరంజని రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

ముత్తుస్వామి దీక్షితుల వారు - గురువులు చిదంబరనాథ యోగీంద్రులు



సంగీతత్రయంలో ఒక్కరైన ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి గారి పేరు రామస్వామి దీక్షితులు. వీరు సంగీతకారులుగా, శాస్త్రజ్ఞులుగా ఎంతో పేరు పొంది తంజావూర్ మహారాజా వారి ఆదరం పొందారు. తంజావూరు సమీపంలోని తిరువారూరు (సద్గురువులు త్యాగరాజస్వామి వారి జన్మస్థలం) త్యాగరాజస్వామి వారి దేవస్థానంలో నాదస్వర కచేరీలు చేయటానికి రామస్వామి దీక్షితుల వారిని నియమించారు. కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతమైన రాగం హంసధ్వనిని కనిపెట్టింది రామస్వామి దీక్షితుల వారే. ఈ రామస్వామి దీక్షితుల వారు చిదంబరనాథస్వామి అనే సన్న్యాసి వద్ద శ్రీవిద్యా ఉపదేశమును పొందారు. ఎన్నో ఏళ్లు రామస్వామి-సుబ్బలక్ష్మి అమ్మాళ్ దంపతులకు సంతానం కలుగకపోవడంతో వారి వైదీశ్వరన్ కోయిల్ వెళ్లి అక్కడ బాలాంబికాదేవికి ఆగమోక్తంగా నవావరణ పూజలు, భజనలు చేస్తూ మండల దీక్ష చేశారు. 40వ దినమున రాత్రి రామస్వామి దీక్షితుల వారికి స్వప్నములో అమ్మవారు స్వప్నసాక్షాత్కారమిచ్చి ముత్యాలహారాన్ని ప్రసాదించింది. ఎంతో సంతోషించి ఆ దంపతులు తిరిగి తిరువారూరుకు వచ్చారు. 1776వ సంవత్సరం మార్చి 24న కృత్తికా నక్షత్రములో తిరువారూరు త్యాగరాజస్వామి వారికి వసంతోత్సవములు జరుగుతుండగా ఆ దంపతులకు పుత్రసంతానం కలిగింది. బాలాంబిక అనుగ్రహంతో కృత్తికా నక్షత్రములో జన్మించాడు కాబట్టి ఆ బాలునికి కార్తికేయుని నామంగా వారు ముత్తుకుమారస్వామి దీక్షితులు అని నామకరణం చేశారు.


ఆ తరువాత కొంతకాలానికి రామస్వామి దీక్షితుల వారు చెన్నై సమీపంలోని మణలి సంస్థానం వారి వద్ద సంగీత విద్వాంసులుగా పనిచేయటానికి తరలి వెళ్లారు. అక్కడికి ఒకసారి వారి శ్రీవిద్యా గురువైన చిదంబరనాథ యోగీంద్రులు వచ్చారు. వారికి రామస్వామి దీక్షితుల వారు, ఆయన కుమారులు నిరంతర శుశ్రూష చేశారు. యోగీంద్రులు రామస్వామి దీక్షితులతో తన కామ్యమొకటి తీర్చమని కోరారు. ఏమిటో తెలుపమని రామస్వామి దీక్షితుల వారు అభ్యర్థించగా "నీ కుమారుడైన ముత్తుస్వామిని నాతో కాశీయాత్రకు పంపండి" అని వారు కోరారు. దానికి రామస్వామి వారు కొంత జంకగా మణలి జమీందారు వెంకటకృష్ణ మొదలియార్ గారు వారికి రామాయణంలో దశరథుడు-విశ్వామిత్రుడు-రామలక్ష్మణుల వృత్తాంతాన్ని గుర్తుచేసి యోగుల వెంట కుమారుడిని పంపమని చెప్పగా రామస్వామి దీక్షితుల వారు అంగీకరించి పంపారు.

ఆ చిదంబరనాథ యోగీంద్రులు అప్పట్లో ఎంతో ప్రసిద్ధులు. దేశమంతటా ఆయనకు శిష్యులుండేవారు. కాశీలో యోగీంద్రులు ముత్తుస్వామి దీక్షితుల వారికి శ్రీవిద్యోపదేశం చేశారు. అలాగే యోగాభ్యాసము కూడా నేర్పించారు. శంకరభగవత్పాదుల అద్వైత సిద్ధాంత గ్రంథాలను శ్రవణము చేయించారు. కాశీలో దీక్షితుల వారి దినచర్య చాలా కఠినతరంగా జరిగింది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గంగాస్నానం చేసి, యోగాభ్యాసము, అనంతరం శ్రీవిద్యార్చన చేసి యోగీంద్రుల వద్ద వేదాంత శ్రవణం చేశారు. తరువాత కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకునే వారు. అప్పుడు యోగీంద్రుల వారు శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడు వేదం పఠించటం, శాస్త్రీయ సంగీత జ్ఞానం చేయటం, వీణావాదనం చేయటం నిత్యవిధి. సాయంత్రం మరల దేవాలయ దర్శనం, వేద సంగీతాభ్యాసం, భజనలు. ఈ విధంగా కొన్నేళ్లు గడిచాయి.


ఒకరోజు చిదంబరనాథ యోగీంద్రులు దీక్షితుల వారిని అన్నపూర్ణాంబిక దేవాలయానికి తోడ్కొనివెళ్లి ఆదేవికి దీక్షితులవారిపై పరిపూర్ణమైన అనుగ్రహం కలిగినదని, ఆ తల్లి ఆతని కాపాడి తుదకు మోక్షము కూడా ఇస్తుందని, ఆమెను జీవితాంతం పూజించమని చెప్పారు. మరునాడు ప్రాతఃకాలమున దీక్షితులవారు గంగాస్నానం చేయుటకు వెళ్లే సమయంలో యోగీంద్రులు వారితో "మనం విడిపోయే సమయమాసన్నమైంది. నీవు స్వస్థలానికి వెళ్ళి తల్లిదండ్రులను, సోదరులను కలుసుకో" అని చెప్పి "గంగానదిలో దిగినప్పుడు నాలుగైదు అడుగులు వేసి అక్కడ నీకాలికేమి తగిలితే దానిని తీసుకుని రా" అని ఆజ్ఞ ఇచ్చారు. దీక్షితుల వారికి గంగానదిలో వీణ దొరికింది. దానిపై దేవనాగరిలో "రామ" అని రాసి ఉంది. దానిని తీసుకువచ్చి దీక్షితుల వారు యోగీంద్రులకిచ్చారు. యోగీంద్రులు ఆ వీణను తన ఆశీస్సులతో మరల దీక్షితులవారికిచ్చి "ఇది గంగాదేవి అనుగ్రహ ప్రసాదము. నువ్వు చాలా గొప్ప వైణికుడవు కాగలవు" అని ఆశీర్వదించారు. అవే ఆయన చివరి మాటలు. యోగీంద్రులు గంగానదిలో మునిగి ప్రాణత్యాగం చేశారు. ఆయన దేహాన్ని దీక్షితులవారు హనుమాన్ ఘాట్‌లో సమాధిచేశారు. అక్కడ దీక్షితుల వారు స్థాపించిన లింగం ఇప్పటికీ ఉంది. గంగానదీ జలాలలో లభించిన వీణ నేటికీ దీక్షితుల వారి వంశీకుల వద్ద ఉంది.

ఇదీ ముత్తుస్వామి దీక్షితుల వారు-చిదంబరనాథ యోగీంద్రుల అద్భుత వృత్తాంతం.

(చిత్రాలు దీక్షితుల వారికి గంగానదిలో లభించిన వీణ, కాశీలోని చిదంబరనాథ యోగి సమాధి)

సరసిజనాభ సోదరి - ముత్తుస్వామి దీక్షితుల వారు

సరసిజనాభ సోదరి! శంకరి! పాహిమాం!

వరదాభయ కరకమలే! శరణాగత వత్సలే!

పరంధామ ప్రకీర్తితే! పశుపాశ విమోచితే!
పన్నగాభరణయుతే! నాగగాంధారీ పూజితాబ్జపదే!
సదానందితే! సంపదే! వర గురుగుహ జనని! మదశమని!
మహిషాసురమర్దిని! మందగమని! మంగళవరప్రదాయిని!

కమలము నాభియందు గల విష్ణు సోదరియైన శంకరి! నీవే నాకు శరణు. వరద, అభయ ముద్రలతో కలువల వంటి కరములు కలిగి శరణు కోరిన వారి పాలిట వాత్సల్యము కలిగిన శంకరి! నీవే నాకు శరణు. శ్రీహరిచే నుతించబడి, జీవులకు బంధనాల నుండి విముక్తి కలిగించే, నాగాభరణుడైన శివునితో యుండే, నాగగాంధారి రాగంలో నుతించబడిన చరణకమలములు కలిగిన, ఎల్లప్పుడూ ఆనందములో నుండి సంపదలకు రూపమైన, గురుగుహుడైన సుబ్రహ్మణ్యునికి జననియైన, దుష్టుల మదమును అణచివేసే, మహిషాసురుని సంహరించిన, నిదానముగా నడచే, శుభకరమైన వరములను ప్రసాదించే శంకరి! నీవే నాకు శరణు.

నాగగాంధారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నిషా రాజగోపాలన్ గారి ఆలపించారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...