19, జులై 2010, సోమవారం

శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం - పిఠాపురం

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా


పవిత్రమైన గోదావరీ పరీవాహక ప్రాంతంలో పిఠాపురం పూర్వం ఋషులచే, యోగులచే సవితృ కాఠక చయనం వంటి ఎన్నో గొప్ప యాగాలకు, పవిత్రమైన కార్యాలకు సాక్షి. పీఠికాపురంగా చరిత్రలో చెప్పబడిన ఈ పిఠాపురం రాజుల కళాపోషణకు, సాహితీకారులకు ఆలవాలం. పచ్చని పొలాలు, రమణీయ దృశ్యాలకు నెలవైన ఈ పిఠాపురం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా, కుక్కుటేశ్వరుల దేవస్థానానికి నిలయం. ఇక్కడే దత్తావతారులైన శ్రీపాదశ్రీవల్లభులు జన్మించారు.

శ్రీపాద శ్రీవల్లభులు:

శ్రీపాద శ్రీవల్లభులు కలియుగంలో దత్తాత్రేయుని ప్రథమ అవతారం. ఘండికోట అప్పల లక్ష్మీనరసింహరాజ శర్మ, సుమతి దంపతులకు 14వ శతాబ్దములో దైవసంకల్పముతో శ్రీపాదశ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించారు. విద్యాధరి, రాధ, సురేఖ అనే ముగ్గురు సోదరీమణులు, శ్రీధరరాజ శర్మ, రామరాజ శర్మ అనే ఇద్దరు సోదరులు.  ఆ దత్తావతారునికి.  మాతామహులు మల్లాది బాపనార్యులు-రాజమాంబ దంపతులు. పూర్ణ దత్తావతారులైన శ్రీపాద వల్లభులు చిత్తా నక్షత్రమున వినాయక చవితి నాడు అవతరించారు. 

పిఠాపురంలో ఎన్నో మహిమలు చూపించి పదహారేళ్ల ప్రాయంలో కురువరపురంలో (ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున గల దత్తక్షేత్రం) వెళ్లి అక్కడ తన అవతార మహిమలను పరిపూర్ణంగా, విశేషంగా చూపించారు.

శ్రీపాద శ్రీవల్లభుల మాతామహులైన మల్లాది బాపనర్యుల వంశంలో జన్మించిన మల్లాది గోవింద దీక్షితులు గారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే పుస్తకాన్ని శ్రీపాదుల ఆజ్ఞ మేరకు తెలుగులోకి అనువదించారు. సంసృత మూలం శంకర భట్టు అనే ఆయన రచించినది. శ్రీపాదుల తదుపరి దత్తావతారం గాణుగాపురంలో నివసించిన నృసింహ సరస్వతి. వాసుదేవానంద సరస్వతి (టెంబే స్వామి) రచించిన శ్రీ గురు చరిత్ర మొదటి అధ్యాయాల్లో శ్రీపాదుల గురించి వివరంగా ఉంది.

చరితామృతం:

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథంలో శ్రీపాద శ్రీవల్లభుల జీవిత విశేషాలతో పాటు మనకు తెలియని, ఆశ్చర్యపరిచే కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు, సంబంధాలు ఉన్నాయి. ఈ పుస్తకం సంస్థానంలో కానీ, పోస్ట్ ద్వారా గానీ, హైదరాబాదులో టాగోర్ బుక్ హౌస్ లో కానీ పొందవచ్చు. ఈ గ్రంథ పారాయణ మహాత్మ్యం, ఇందులో ఉన్న వివరం, విశిష్టత చదివితేనే అర్థం అవుతుంది.  తప్పక వెంటనే పారాయణం చేయండి. 



క్షేత్రం:

పీఠికాపురంగా  అప్పట్లో పిలవబడిన ఈ పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 18  కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే లోని చెన్నై-హౌరా మార్గంలో పిఠాపురం స్టేషన్ ఉంది. ఈ ఊళ్ళో  శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉంది. కుక్కుటేశ్వర స్వామి గుడి ముందుగా వెళ్లి అక్కడ వేణుగోపాలస్వామి గుడి వీధి అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ ప్రస్తుతం పీఠాధిపతి శ్రీ సజ్జనగడ రామస్వామి గారు. వీరు సమర్థ రామదాసు శిష్యులైన కర్ణాటకలోని వరదహళ్లిలో సిద్ధి పొందిన భగవాన్ శ్రీధర స్వామి శిష్యులు. రామస్వామిగారు చాలా సమర్థవంతంగా ఈ పీఠాన్ని నడిపిస్తున్నారు. వారి ఆశీస్సులు, ఆధ్వర్యంలో ఈ పీఠం బాగా వృద్ధి చెంది శ్రీపాద శ్రీ వల్లభుల మహత్మ్యం, సందేశం మనకు అందేలా కృషి జరుగుతోంది. ఇక్కడ ఉండటానికి ఉచిత వసతి, ఉచిత భోజన వసతి ఉన్నాయి. సంస్థానం కార్యాలయానికి ముందుగా ఫోన్ చేసి రూం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నపూర్ణ భోజనశాలలో మధ్యాహ్నం 12 నుంచి  2   వరకు భోజనము, రాత్రి 8:30 నుంచి 9:00 వరకు అల్పాహారము ఉంటుంది.  రుచి, శుచి ఉన్న ఆహారాన్ని ఉచితంగా భక్తులకు అందిస్తున్నారు సంస్థానం వారు.

ఈ పీఠంలో అడుగు పెట్టగానే ఎడమ వైపు కార్యాలయము, దానిపైన వసతికి గదులు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళితే  కుడివైపు ఔదుంబరం (మేడి చెట్టు), పాదుకలు, ఆవులు కనిపిస్తాయి. వీటికి ఎదురుగా తూర్పు ముఖంగా గర్భగుడి. ఈ గర్భగుడిలో పాలరాతి విగ్రహ రూపంలో దత్తాత్రేయుడు, వారికి కుడివైపు శ్రీపాద శ్రీవల్లభులు, ఎడమవైపు నృసింహ సరస్వతి ప్రతిష్ఠించబడి ఉన్నారు.  గర్భగుడికి ఎడమవైపు  పాదుకలు,మేడి చెట్టు, దాని పక్కనే దత్తాత్రేయుల పురాతన విగ్రహం ఉంటాయి. గర్భ గుడి వెనుక ధ్యాన మందిరం ఉంది కానీ వాడుకలో లేదు.

ఈ పీఠంలో మూర్తులకు నిత్యం అభిషేకం (పాదుకలకు), పల్లకి సేవ, అర్చన చేయించుకోవచ్చు. ప్రతి మాసం చిత్త నక్షత్రం రోజున, చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు వసంత నవరాత్రులు, శ్రీరామ నవమి, ఆషాఢ పౌర్ణమి (గురు పౌర్ణిమ), శ్రావణ బహుళ పంచమి (వాసుదేవానంద సరస్వతి జయంతి) , శ్రీపాద శ్రీవల్లభుల జయంతి సప్తాహం (శ్రావణ బహుళ త్రయోదశి నుండి  భాద్రపద శుద్ధ చవితి వరకు), గురు ద్వాదశి (శ్రీపాద శ్రీవల్లభుల అవతార సమాప్తి - ఆశ్వయుజ బహుళ ద్వాదశి), గురు ప్రతిపాద (నృసింహ సరస్వతి అవతార సమాప్తి - మాఘ బహుళ పాడ్యమి), నృసింహ సరస్వతి జయంతి (పుష్య శుద్ధ తదియ), ప్రతి నెల బహుళ ద్వాదశి రోజులలో సంస్థానంలో విశేష పూజలు జరుగుతాయి.   భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఈ రోజుల్లో.

సంస్థానం వాళ్ల బుక్ స్టాల్ ఇక్కడ ఉంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో దొరుకుతుంది. అలాగే శ్రీ గురుచరిత్ర తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దొరుకుతుంది -  వాసుదేవానంద సరస్వతి మరాఠీ మూలాన్ని తెలుగులోకి పన్నాల భట్ట శర్మ గారు అనువదించారు. ఇంకా గురు గీత, దత్తాత్రేయ పూజా విధానము, ఫోటోలు, పోస్టర్లు, సీడీలు, సంక్షిప్త గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుల సిద్ధ మంగళ స్త్రోత్రం, దత్త మంత్ర కరుణార్ణవం లాంటి పుస్తకాలు చాలా సంస్థానం వాళ్లు ప్రచురించి ఇక్కడ విక్రయిస్తున్నారు.

సిద్ధ మంగళ స్తోత్రము:

వారి మాతామహులైన బాపనార్యులు స్తుతించిన సిద్ధ మంగళ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. మీకోసం ఆ స్తోత్రం:
  1. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
  2. శ్రీ విద్యాధరి రాధా సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
  3. మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
  4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీ చరణా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
  5. సవిత్రకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
  6. దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘనసంఖ్యా బోధిత శ్రీ చరణా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
  7. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
  8. సుమతీనందన, నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
  9. పీఠికాపుర నిత్యవిహారా, మధుమతి దత్తా, మంగళరూపా!
    జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!

పిఠాపురం చేరటం ఎలా?
  • విమానంలో వచ్చేవాళ్ళు రాజమండ్రి కానీ, విశాఖపట్నంలో కానీ దిగి రావచ్చు. రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్లు,  విశాఖనుంచి 180 కిలోమీటర్లు.
  • ట్రైన్లో: సామర్లకోట పిఠాపురం నుంచి 10 కిలోమీటర్లు. ఇది జంక్షన్. ఇక్కడ ఆగే రైళ్లు: ఫలక్నుమ, కోణార్క్, నిజాముద్దీన్ లింక్, ఒఖ లింక్, నవజీవన్, ప్రశాంతి, యశ్వంతపూర్, శేషాద్రి, షిర్డీ ఎక్స్ ప్రెస్లు. సామర్లకోట స్టేషన్ నుంచి బస్సు, ఆటో, కార్ వసతి చాలా బాగా ఉన్నాయి. సామర్ల కోట గుండా వెళ్లే రైళ్ళ రాకపోకల లైవ్ వివరాలు.
  • మెయిన్ లైన్లో వెళ్లే పిఠాపురంలో ఆగే రైళ్లు:  గోదావరి, ఈస్ట్ కాస్ట్, బొకారో ఎక్స్ ప్రెస్లు. పిఠాపురం గుండా వెళ్లే రైళ్ళ రాకపోకల లైవ్ వివరాలు.
  • కాకినాడకు గౌతమి ఎక్ష్ప్రెస్స్ లో/బస్సులో వెళ్లి అక్కడనుంచి కూడా రావచ్చు. కాకినాడ పిఠాపురం మధ్య దూరం 18 కిలోమీటర్లు.

సంస్థానం అడ్రస్, ఫోన్ నెంబర్:

శ్రీపాద  శ్రీవల్లభ మహా సంస్థానం,  వేణుగోపాలస్వామి గుడి వీధి,
పిఠాపురం  - 533450,
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. 
కార్యాలయం పని వేళలు : ఉదయం 9 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు.
ఫోన్  - (08869) 250300
ఫ్యాక్స్ - (08869) 250900
ఇమెయిల్ : info@sripadasrivallabha.org
వెబ్ సైటు: http://www.sripadasrivallabha.org  http://sreepadasreevallabhapithapuram.org/home1.html

పిఠాపురంలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు:
  1. పాదగయా క్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శివుడు,  ఈ ఆలయంలోనే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి పురుహూతిక అమ్మ వారి గుడి, దత్తాత్రేయుల గుడి (గురు స్థానం, శ్రీపాద శ్రీవల్లభుల మూర్తి, ఔదుంబరం), షిర్డీ సాయి గుడి, ఇంకా చాలా విగ్రహాలున్నాయి (వినాయకుడు, దుర్గ, నవగ్రహాలు, సీతారాములు వగైరా). ఇక్కడ లింగం అష్ట దిగ్బంధనం చేసి ఉంది.
  2. కుంతీమాధవస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం - చాలా పురతానమైన దేవస్థానం. ఇక్కడ విగ్రహాలు అపురూపంగా ఉన్నాయి.
  3. గణపతి సచిదనంద స్వామి దత్తపీఠం వారి శ్రీపాద శ్రీవల్లభ అనఘాలక్ష్మి దత్తాత్రేయ క్షేత్రం ఎంతో ప్రశాంతంగా, మనోజ్ఞంగా ఉంటుంది.
  4. కాకినాడ పిఠాపురం రోడ్లో పరిపూర్ణానంద సరస్వతి వారి శ్రీపీఠం (ఐశ్వర్యాంబిక ఇక్కడ ప్రధాన దేవత)
  5. కాకినాడ పిఠాపురం రోడ్లో సర్పవరం భావనారాయణ స్వామి - చాలా పురాతనమైన వైష్ణవ సాంప్రదాయ దేవస్థానం. ఇక్కడ అందమైన కలువల కొలను ఉంది.
  6. ఉప్పాడ బీచ్ ఇక్కడికి 15 కిలో మీటర్లు. 
 దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

    2 కామెంట్‌లు: