19, జులై 2010, సోమవారం

బాబ్లీ ప్రాజెక్టు - రాజకీయం - మొదటి అంకం

చంద్రన్నకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలను ఇరకాటంలో పెడదాం అని ఆ చాణక్యుడి బుర్ర అనుకుంది. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లిలో "అక్రమంగా" కడుతున్న ప్రాజెక్ట్ పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులకు గాజులు తొడుక్కొని కూర్చుందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యిందని అసెంబ్లీలో అగ్గి రగిల్చారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు ఈ ఆందోళన టీడీపీ నుంచి?.
  1. తెలంగాణలో ఉపఎన్నికలు 26వ తేదీ జరుగనున్నాయి. గత ఏడాదిగా తెలంగాణా సెంటిమెంట్ ఉధృతమైన నేపథ్యంలో ఆయనకు తెలంగాణలో ప్రవేశించి ప్రచారం చేసే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రచారానికి వెళ్ళటానికి జంకిన చంద్రన్న ఈ అంశం లేవనెత్తారు. బాబ్లి వల్ల తెలంగాణా జిల్లాలకు తీరని నష్టం అని, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎండిపోతుందని, లక్షలాది ఎకరాలు బీడు పోతాయని ఈ ఆందోళన సారాంశం. ఈ సాకు చూపించి తెలంగాణా లో సానుభూతి పొంది బాబ్లి యాత్ర పేరుతొ ప్రచారం, పేరు సంపాదిన్చుకుందామని చంద్రన్న కుతంత్రం. మొత్తానికి ఇంతమటుకు బాబ్లి సందర్శన యాత్ర పేరుతొ కొంతమంది ఎమ్మెల్యేలను కూడబెట్టుకుని బస్సులో బయల్దేరారు బాబు గారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అరెస్ట్ చేసింది ఆ బృందాన్ని. నిజంగా బాబ్లిలో మోసం లేకపొతే సందర్శన ఎందుకు ఆపాలన్నది బాబు వాదన. అది సరైనదేనేమో?.
  2. తెలంగాణా ఉపఎన్నికల్లో టీఆరెస్ , కాంగ్రెస్, టీడీపీ మధ్య త్రిముఖ పోటీలో మూడో స్థానం టీడీపీది అని మనకు బానే తెలుసు. ఈ పరిస్థితి మార్చి టీడీపీకి వోట్లు తేవాలి అంటే తెలంగాణా రాష్ట్రం గురించి మాట్లాడలేని దుస్థితిలో బాబు ఉన్నారు. అందుకని టీఆరెస్, కాంగ్రెస్ లను బాబ్లి అంశం మీద ఎండగట్టి వారికి నిజంగా తెలంగాణా అభివృద్ధి, ప్రయోజనాల మీద చిత్తశుద్ధి లేదు అని చాటటానికి ఈ యత్నం. వింత ఏంటంటే - ఊదరగొట్టి, అదరగొట్టి మాట్లాడే మన కేసీఆర్ ఈ విషయంపై మౌనమేలనో?. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వారే పోగొట్టుకున్నారు. మరి ముందుగానే చొరవ తీసుకొని బాబ్లి విషయాన్ని టీఆరెస్ ప్రయోజనానికి ఎందుకు వాడుకోలేదు?. కాంగ్రెస్ తో ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా?.
  3. మహా జాగ్రత్తగా ఉండే కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయం ముందే ఊహించి ప్రధానమంత్రితో ఒక మీటింగ్ పెట్టించి నిప్పు రాజుకోక  ముందే మీద నీళ్ళు ఎందుకు పోయలేదు?. చంద్రన్న ఇచ్చిన ఈ ఝలక్ కి తెలంగాణా కాంగ్రెస్ నేతలకు దిమ్మి తిరిగి, కళ్ళు బైర్లు కమ్మి తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కొందరేమో బాబు తెలంగాణాలో తిరిగే దమ్ము లేక బాబు ఈ నాటకమాడుతున్నారని, కొందరేమో ఇది ఉపఎన్నికల్లో లబ్ధికి టీడీపీ నాటకమని, ఇక ముఖ్యమంత్రిగారైతే నేను పీ.ఎం. తో మాట్లాడాను, ఆయన అఖిలపక్షాన్ని కలవటానికి అంగీకరించారు, శాంతి భద్రతల దృష్ట్యా మనం సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరిద్దాము అని ఢిల్లీ మాట వినిపించారు. ఎందుకు అంత నిర్లిప్తత కాంగ్రెస్ పార్టీలో?. ఒక పక్క జగన్ ప్రజాదరణలో ముందుకు దూసుకు వెళ్తున్నాడు,  మరొక పక్క చంద్రన్న బాబ్లి అంశంతో రాజకీయ లబ్ది పొంది తన మనుగడకు జీవం పోయాలని ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్ర విషయాలను, రాజకీయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని నివేదికలు పంపే నరసింహన్ లాంటి మేధావి మన గవర్నర్. రాజకీయాల్లో ఎదుటివాళ్ళను తన నోటితో అణగదొక్కే దూకుడు మనస్తత్వం మన రోశయ్య గారిది.అయినా ఎందుకింత అలసత్వ, నిర్లక్ష్య ధోరణి?.
మరి ఏమవుతుందో ఈ బాబ్లి అంశం?. ఇది ఇంకొక అంతర్రాష్ట్ర  ప్రజల మధ్య మనోభావాల అంశంగా మారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందా?. ఉపఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చెయ్యబోతోంది?. తెలంగాణలో టీడీపీకి జీవం పోస్తుందా?. వేచి చూడాల్సిందే మరి...

1 కామెంట్‌: