22, జులై 2010, గురువారం

కోనసీమ అందాలు

కోనసీమ అందాల గురించి ఎంత చెప్పినా చాలదు. ఇదివరకు నాలుగు సార్లు తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో క్షేత్రాలు దర్శిస్తూ అక్కడ అందాల్ని ఆస్వాదించాను. ఈ మధ్య నేను నరసాపురం వెళ్లి, అక్కడనుంచి అంతర్వేది కారులో వెళ్లాను. దాదాపు గుడివాడనుండి మొదలయ్యింది మన కోస్తా అందాలు. కాలువలు, కొబ్బరి చెట్లు, పచ్చగా నాట్లు, నారు మళ్ళ నిండా నీరు, అరటి తోటలు..ప్రకృతి అందమంతా అక్కడే ఉంది అనిపించింది. నరసాపూర్ ఎక్ష్ప్రెస్స్ తెల్లవారేసరికి ఈ అందాల్ని చూపించటం మొదలు పెట్టింది. ఇక అక్కడనుంచి 9 గంటలకు నరసాపురంలో దిగేంత వరకు రైల్లోంచి మాకు నేత్ర పర్వమే. కొబ్బరి చెట్లు ఎంత ఎత్తు, పొడవు, మరియు దట్టంగా ఉన్నాయో అక్కడ. మీ కనుచూపు అందినంత మేర పచ్చని వరిపొలాలు, గట్లు, కొబ్బరి తోటలు. కొన్ని వందల ఎకరాలు అలా ఒక దృశ్యంలో కనిపిస్తూనే ఉన్నాయి.

గోదావరి జిల్లాల్లో ప్రవేశించగానే కనిపించేవి చక్కని కాలువలు, కాలువలు దాటటానికి కట్టిన వంతెనలు - వాటి చుట్టూ అల్లుకున్న జీవితాలు. కొన్ని వందల కిలో మీటర్ల దూరం ఇవి కనిపిస్తాయి. పొలాల మధ్యలో పెంకుటిల్లు, వసారాలు, శుభ్రంగా, హాయిగా జీవితాన్ని సాగిస్తూ, ప్రేమగా పలకరిస్తూ కనిపించే ప్రజలు అక్కడ. ఏ మాత్రం వాళ్ల జీవితాల్లో ఒత్తిడి లేదు అనిపిస్తుంది. కాలువలు దాటటానికి కొబ్బరి బోదెలు, రాళ్ళు, బండలు వేసుకుని, ఆ కాలువల్లో బట్టలు ఉతుక్కొనే జనాలు. కాలువ గట్టు పక్కనే మంచి పెంకుటిల్లు, గుడిసె, దాని చుట్టూ పాదులు, మొక్కలు, వృక్షాలు, మధ్యలో పశువుల కొష్టాలు, ఆరోగ్యంగా, పుష్టిగా ఉన్న పశువులు - ఇదీ ఆ గ్రామీణ జీవితం. గ్రామాల లాగా కనిపించినా అక్కడ ఉన్నంత ఆధునికత మనకు కూడా లేదేమో అనిపిస్తుంది. పచ్చని అరటి పండ్ల గెలలు, కుప్పలుగా పోసిన కొబ్బరి కురిడీలు అక్కడ సర్వ సామాన్యం. బాగా నీరుంటే కలువలు పెరుగుతాయి కదా. ఈ ప్రాంతాల్లో రంగు రంగుల కలువలు కనిపిస్తాయి చెరువుల్లో. ప్రతి ఊరు ఒక దృశ్య కావ్యమే.

నరసాపురం ఎక్ష్ప్రెస్స్ మందవల్లి, కైకలూరు, ఆకివీడు, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుతుంది. ఈ ప్రాంతాలన్నీ ప్రకృతి మాట అందాల నివాసాలే. హరిత శోభలు విశ్వరూపమై ఉన్నాయా ఇక్కడ అన్నంత ఆవేశం, ఆనందం కలుగుతుంది. కాలువలు, గట్లు, పిల్ల కాలువలు, వంతెననలు నిర్మించిన వారికి నా జోహార్లు. అవిలేకపోతే కోనసీమ లాంటి భూతల స్వర్గం మనకు ఉండేది కాదు. దేవుని దేశంగా పేరుపొందిన కేరళ రాష్ట్రంలో కన్నా మన కోన సీమ అందాలు మిన్న. ఇది మన భూమి, మన భాష, మన సంస్కృతి, మన ఆప్యాయతలు ఉన్న సువర్ణ భూమి. అన్నపూర్ణ అంటే ఈకోనసీమే. సంపద అనేది పట్టణాల్లో ఉంది అనుకుంటే పొరపాటు. నిజమైన సంపద ఈ ప్రకృతి. కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక మంచి జీవన విధానానికి పునాది వేసే ప్రకృతి అసలు లక్ష్మి. మళ్ళా హైదరాబాద్, మన కాంక్రీట్ అడవులు ఈ కోనసీమ పచ్చదనం ముందు వెలవెల పోయి జీవచ్చవాలుగా అనిపించాయి నాకు.

ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ పరమాత్మ అన్నది ఎంత సత్యమో ఈ ప్రాంతాలో తిరిగితే మేకు అర్థం అవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నన్ని అతి పురతాన, మహిమాన్విత పుణ్యక్షేత్రాలు ఆంధ్ర ప్రదేశ్లో ఎక్కడా లేవు . ఆ ప్రకృతి పురుషుల కలయిక, నదీ నాదాలు, చెరువులు, కాలువలు, తీరాలు భగవంతుని ప్రతిరూపాలు. అందుకే అక్కడ పంటలు, ప్రజలు, వృత్తులు బాగా వృద్ధిలో ఉన్నాయి. ప్రకృతి ఒడిలో భగవంతుడు నివసిస్తాడు అనటానికి కర్నాటకలోని పశ్చిమ కనుమలు, సహ్యాద్రి పర్వతాలు ఇంకొక తార్కాణం. వాటి వివరాలు ఇంకొక సంచికలో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి