17, సెప్టెంబర్ 2020, గురువారం

దేవ దేవం భజే దివ్య ప్రభావం - సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యులు

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణ పుంగవం రామం

రాజ వర శేఖరం రవి కుల సుధాకరం
ఆజానుబాహుం నీలాభ్ర కాయం
రాజారి కోదండ రాజ దీక్షా గురుం
రాజీవ లోచనం రామచంద్రం

పంకజాసన వినుత పరమ నారాయణం
శంకరార్జిత జనక చాప దళనం
లంకా విశోషణం లాలిత విభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం

దేవదేవుడు, దివ్యమైన మహిమలు కలవాడు, రావణాసురుని శత్రువు, యుద్ధములో శ్రేష్ఠుడు అయిన రాముని భజింపుము. రాజాధిరాజు, సూర్యవంశానికి చంద్రునివంటి వాడు, ఆజానుబాహువు, నీలమేఘ శరీరుడు, క్షత్రియుల శత్రువైన పరశురాముని కోదండమును ధర్హించిన ఘనుడు, కలువలవంటి కన్నులు కలవాడు అయిన రామచంద్రుని భజింపుము. బ్రహ్మచే నుతించినబడిన శ్రీహరి, జనకుని వద్ద ఉన్న శివుని విల్లును ఎక్కుపెట్టి విరిచిన వాడు, లంకను జయించినవాడు, విభీషణుని అనుగ్రహించిన వాడు, సాధువులు, జ్ఞానులచే నుతించబడిన వేంకటేశ్వరుని భజింపుము.

హిందోళ రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు పాడగా వినండి.

పితృపక్షాలు

రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం
అర్థీనాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠతు

నరకంలో అపుణ్యలోకాలలో పద్మార్బుదములో నివసించే, ఈ నీటి బిందువులను అర్థిస్తూ ఉన్న ఆత్మలకు ఉదకాన్ని సమర్పిస్తున్నాను. అవి అక్షయమగుగాక, వారు శాంతులగుదురు గాక.

ఒక్క శ్రాద్ధం రోజే కాకుండా ప్రతి నిత్యమూ పితృదేవతలను తలచుకోవలసిన విధి మానవునిది. పై మంత్రం అందుకే నిత్యం భోజనానంతరం నీటిని విడిచే విధిలో చెప్పబడింది. ఇవి పితృదేవతల ద్వారా మన పెద్దలకు చేరాలన్నది సారం.

మహాలయ పక్షాలు - మానవాళి అభివృద్ధికి, వంశాభివృద్ధికి, సృష్టి క్రమంలో సహజ పరిణామంగా వచ్చే మరణ బాధ నుండి ఆత్మలకు విముక్తి కలిగి ఉన్నతస్థానం లభించటానికి ఈ పక్షంలో చేసే కర్మలు ఎంతో తోడ్పడతాయి. కర్మ ఫలాలను బట్టి, వాటిని అనుభవించేందుకు అనువైనా పరిస్థితులు దొరికేంత వరకు ఆత్మలు పునర్జన్మ పొందవు. కర్మఫలాలు మంచివైతే ఉన్నత స్థానం, లేకపోతే నీచస్థానంలో వేర్వేరు జీవరాశులుగా జన్మనెత్తుతుంది ఆత్మ. అది మనిషి మరణించిన ఏడాదికి కావచ్చు, ఎన్నో ఏళ్లకు కావచ్చు, దశాబ్దాలకు కావచ్చు. సంవత్సరీకముల వరకు ఉన్న ఏడాది ప్రస్థానం ముగిసిన పిమ్మట ఆ ఆత్మ తిరిగి దేహాన్ని వెంటనే ధరించ గలిగినా, శ్రాద్ధ కర్మ, తర్పణాలు, పిండ ప్రదానాలు ఆ ఆత్మోద్ధరణకు తోడ్పడతాయి. దానిని వెసులుబాటు చేసే వారు పితృ దేవతలు. ఇది పూర్తిగా శాస్త్రీయమైనది.

సృష్టి క్రమంలోని జనన మరణాలనే చక్రంలో చిక్కుకున్న ప్రతి ఆత్మకూ ఉన్నతిని కలిగించేవి మనం సముపార్జించుకున్న పుణ్యఫాములతో పాటు, ఆ ఆత్మలను పితృదేవతలు ఏ విధంగా నడిపిస్తారు అన్నది కూడా. కాబట్టి పితృదేవతలు ఆత్మోద్ధరణకు గేట్‌కీపర్లు. మరి వారు సంతుష్టులైతే కదా ఆత్మోద్ధరణ జరిగేది. ఉద్ధరించబడని ఆత్మ అనేక అసంతులనలకు గురవుతూ ఉంటుంది. కొన్ని మార్లు ప్రేతరూపంలో, ఇతర రూపాలలో సంచరిస్తుంది. అన్నిటికీ కర్మఫలాలే ముఖ్య ప్రాతిపదిక. ఆ ఆత్మకు ఎక్కడో ఒక చోట ఊతం అందాలి కదా? అది మనకు నిర్దేశించబడిన అనేక విధి విధానాల ద్వారా జరుగుతుంది. ఒకటి పైన చెప్పబడిన భోజనకాల ఉదకదానం. అలాగే, నిత్యానుష్ఠానంలో మరెన్నో. వీటిలో మరొక ముఖ్యమైనది మహాలయ పక్షం.

ఈ మహాలయ పక్షంలో పితృదేవతలని సంతృప్తి పరచటానికి అత్యంత అనువైన కాలం. సృష్టిలో ఉత్తరాయణ దక్షిణాయనాలకు వాటి వాటి ప్రాధాన్యతలున్నాయి. దక్షిణాయన కాలంలో సృష్టిక్రమాన్ని సూచించే వర్షఋతువు ముగిసే సమయంలో, అనగా పొలాలు దున్నబడి, తొలకరి వానలు కురిసి, గింజలు నాటబడి, మరల వానల వలన అవి మొలిచి మనకు ఆహారం అందించటానికి పంటలు వేగంగా పెరుగుతాయి. ఈ సమయంలో వచ్చే ఋతువు మార్పునకు కూడా సంకేతం మహాలయపక్షం. వర్షములు ఆగే సమయం, శరదృతువు ఆగమనమునకు ముందు రెండు వారాలు ఈ పక్షం. మానవుని శరీరానికి సంబంధించి చైత్ర మాసం మొదలయ్యే సమయం, అలాగే ఆశ్వయుజం మొదలయ్యే సమయం మధ్య ఉన్న ఆరునెలల సమయమనేది కాలగమనంలో ఓ పెద్ద మైలు రాయి. అలాగే సృష్టిక్రమంలో కూడా మైలురాయి. అందుకే ఈ శరదృతువు ఆరంభానికి మునుపు వచ్చే పక్షాన్ని ఆత్మగమనాన్ని నిర్దేశించే పితృదేవతలకు సంబంధించినదిగా శాస్త్రం నిర్ణయించింది.

మరి ఈ సమయంలో ఏం చేయాలి?

సృష్టి క్రమాన్ని గౌరవిస్తూ, జనన మరణ చక్రంలో చిక్కుకుని క్లేశాల బారిన పడుతున్న ఆత్మలను ఉద్ధరించేందుకు దేహధారణ చేసి ఆ అత్మలతో ముడిపడి ఉన్న మనం మనవంతు ప్రయత్నం చేయాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశం - జననమనేది కర్మఫలాలను బట్టి అన్నది. అనగా ఒకేరకమైన కర్మఫలాలను అనుభవించవలసిన ఆత్మలు ఒకే రకమైన పరిస్థితులలో దేహాన్ని ధరిస్తాయి. అనగా ఒక కుటుంబంలో, ఒక వంశంలో, ఒక సామాజిక పరిస్థితులలో. అందుకే మనవాళ్లు భార్య బిడ్డలు, మనతో ఉండే పశువులు ఋణానికి రూపాలు అంటారు -

ఋణానుబంధ రూపేణ పశు పత్నీ సుతాలయా రుణక్షయే క్షయయంతి తత్ర పరివేదనా

పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు అన్నవి పూర్వజన్మ ఋణములకు రూపములు. ఈ రుణములు తీర్చుకున్న తరువాత ఆత్మకున్న క్లేశములు నశిస్తాయి.

వీటన్నిటినీ పరిశీలించే శ్రాద్ధ కర్మ, పితృపక్షాలు, తర్పణాలు, పిండప్రదానాలు, దానాలు నిర్వచించబడ్డాయి. ఆత్మోద్ధరణకు ఆ దేహానుబంధమైన వారందరూ ఋణాలను తీర్చుకుని, ఆ ఆత్మలను ఉద్ధరించే పితృదేవతలకు కృతజ్ఞత తెలుపుతూ ప్రాణశక్తికి సంకేతమైన అన్న, ఉదక, తిలములను వినియోగించి ఈ మహత్కార్యానికి తోడ్పడతాం.

సారాంశం: మరణానంతరం కర్మఫలాల ద్వారా బాధలు పడుతూ మరు జన్మ కోసం వేచి ఉన్న, జన్మ పొందిన ఆత్మల ఉద్ధరణకు పితృదేవతలను ప్రీతి పరచి వారి ద్వారా సృష్టి క్రమంలో ఓ ముందడుగు పడేందుకు మనవంతు ప్రయత్నం పితృకార్యాలు. దానికి అత్యంత అనువైన సమయం కాలగమనంలో అతి ముఖ్యమైన మైలురాయైన పితృపక్షం. కావలసింది నమ్మకం, శ్రద్ధ, కృతజ్ఞత. పూర్వీకులు లేనిదే మనం లేము, మన జన్మకు కారణమైన వారి ఆత్మలను ఉద్ధరించేందుకు మనవంతు ప్రయత్నం చేయటం మన ధర్మం.

అక్షయ్యముపతిష్ఠతు!

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

సుగుణములే చెప్పుకొంటి - త్యాగరాజస్వామి కృతి

సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామా!

వగలెరుంగలేక ఇటు వత్తువనుచు దురాశచే

స్నానాది సుకర్మంబులు దానాధ్యయనంబులెరుగ
శ్రీనాయక క్షమియించుము శ్రీత్యాగరాజవినుత

సుందర స్వరూపుడవైన ఓ రఘురామా! నీవు నాపై కరుణించి దర్శనమిచ్చెదవను ఆశతో నీ మాయలను తెలుసుకోలేక నీ సుగుణములనే చెప్పుకొనుచున్నాను. పుణ్యతీర్థములలో స్నానములు మొదలైన మంచి కర్మలు, దానములు, వేదాధ్యయనములను నేను ఎరుగను. సీతాదేవికి నాయకుడవు, పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీవే నన్ను క్షమించి దర్శనమిచ్చి కాపాడుము. 

చక్రవాకం రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు


11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఏమయ్య రామ - -భద్రాచల రామదాసు కృతి

ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియ వశమా

కామారి వినుత గుణ ధామ కువలయదళ శ్యామ నను గన్న తండ్రీ! శ్రీరామా!

సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతిబలుడనుచు కపులు 
క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరి గాని పతితపావనుడనుచు మతి తెలియలేరైరి

నరుడనుచు నరులు తమ దొర వనుచు యాదవులు వరుడనుచు గోప సతులు 
కరి వరద భద్రాద్రి పుర నిలయ రామ దాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి

ఓ రామ్మా! నీ మాయ బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలకైన తెలియ వశము కాదు. శ్రీరామా! మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడవు, సకల గుణములకు నిలయమైన వాడవు, కలువరేకుల వంటి కన్నులు కలిగిన నీలమేఘ శరీరుడవు, నీవే కదా నా కన్న తండ్రివి! నీవు తన కుమారుడవని దశరథుడు, శ్రేయోభిలాషివని సుగ్రీవుడు, మహావీరుడవని వానరులు, చక్రవర్తివని రాజులు కొలిచారు, కానీ, నీవు పాపాత్ములను పావనము చేసే వాడవని గ్రహించలేకపోయారు. మానవులు నీవు వారితోటి మానవుడవని, యాదవులు తమ దొరవని, గోపస్త్రీలు తమ వరుడవని భావించారు. గజేంద్రుని రక్షించి భద్రాద్రి యందు వెలసిన రామా! నీవు దాసుల పాలిట పరమాత్ముడవని వారు భావించలేకపోయారు. 

కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని నేదునూరి కృష్ణమూర్తి గారు ఆలపించారు

ఏ తావునరా నిలకడ నీకు - త్యాగరాజస్వామి కృతి

ఏ తావునరా నిలకడ నీకు? ఎంచి చూడనగపడవు

సీతా గౌరి వాగీశ్వరియను స్త్రీ రూపములందా గోవిందా

భూకమలార్కానిలనభమందా లోకకోటులందా
శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత శివ మాధవ బ్రహ్మాదులయందా

శ్రీరామా! నీవు ఎక్కడ నిలకడగా ఉండెదవు? ఎంత తరచి చూచినా కనబడనివాడవు. సీత, పార్వతి, సరస్వతి అనే స్త్రీ రూపములలోనా? శ్రీకృష్ణుని రూపములోనా? భూమి, నీరు, సూర్యుడు, వాయువు, ఆకాశములయందా? కోట్లాది లోకములయందా? త్యాగరాజు అర్చించిన శుభములను కలిగించే బ్రహ్మ విష్ణు శివులయందా? నీవు ఎక్కడ నిలకడగా ఉండెదవు? 

కల్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

దుర్గా పఞ్చరత్నమ్ - కంచి పరమాచార్యుల వారు

కామాక్షీ పరదేవత స్వరూపమైన కంచి పరమాచార్యుల వారు గురు ఆరాధన రోజున ముల్లైవాసల్ కృష్ణమూర్తిశాస్త్రి గారికి ఆశువుగా చెప్పినవి దుర్గాపంచరత్న శ్లోకాలు. అమ్మవారు గీత ఎలా ఉపదేశించింది అన్న మీమాంసలో ఉన్న ఆ శిష్యునికి వెంటనే గీతాభాస్యం పుస్తకాలు తెప్పించి, భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకం వినిపించి అర్థం చెప్పి పరబ్రహ్మ తత్త్వానికి మాయా స్వరూపిణి ప్రతిష్ఠ - అనగా అనేకానేక లోకములుగా వ్యాపించేది, అనగా కామాక్షీ పరదేవత పరబ్రహ్మశక్తి అన్న సత్యాన్ని పలికి ఆ శిష్యుని సందేహ నివృత్తి చేశారు. ఆ తరువాత శిష్యుని చేత ఛందోబద్ధంగా ఐదు శ్లోకాలను పూర్తి చేయించి దానిని దుర్గాపంచరత్నం అని మనకు అందించారు. ఈ పంచరత్నం స్వామి వారి ఆధ్యాత్మిక శక్తిని, జ్ఞానాన్ని, ఔన్నత్యాన్ని మనకు పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. దీనిని అత్యంత మహిమాన్వితమైన స్తోత్రంగా నిరంతరం పఠించిన శిష్యకోటి చెప్పుకుంటారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు దీనిని రాగయుక్తంగా గానం చేశారు.

తే ధ్యానయోగానుగతా అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢామ్
త్వమేవ శక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా
గుహాపరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే
శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే
స్వాభావికీ జ్ఞానబలక్రియా తే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్యవచోవివృత్యా
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మప్రతిష్ఠాస్యుపదిష్టగీతా
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

మోక్ష ప్రదాత్రివైన సర్వేశ్వరీ! త్రిగుణాతీతమైన స్వగుణములో నిగూఢమైన నీ రూపమును యోగులు ధ్యానములో దర్శించుచున్నారు. పరమేశ్వరుని యొక్క శక్తివి నీవే. నన్ను కాపాడుము.

మోక్ష ప్రదాత్రివైన సర్వేశ్వరీ! నీవు దివ్యమైన ఆత్మశక్తివి, వేదవాక్యములలో నుతించబడినావు. ఋషిలోకమును అనుగ్రహించినావు. అత్యంత రహస్యమైన సంచారము నీది. సత్ అనే పదార్థములో నీవు ప్రతిష్ఠమై ఉన్నావు. నన్ను కాపాడుము.

మోక్ష ప్రదాత్రివైన సర్వేశ్వరీ! శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పబడిన పరాశక్తివి నీవు, అనేకులచే అనేక విధములుగా చెప్పబడి అనేక రూపములలో దర్శించబడుతున్నావు. జ్ఞాన బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. నన్ను కాపాడుము.

దేవాత్మ శబ్దముచే చెప్పబడిన నీవు కూర్మ వాయు పురాణముల వాక్య వివరణములతో శివాత్మవైనావు. ఈ భవపాశ బంధములను నాశనము చేసే శక్తిగా ప్రసిద్ధి పొందినావు. నన్ను కాపాడుము.

మోక్ష ప్రదాత్రివైన సర్వేశ్వరీ! నీవు బ్రహ్మమే పుచ్ఛముగా వివిధ రూపములలో నుండు మయూరానివి. అనేక గీతలనుపదేశించుచు బ్రహ్మమునందు ప్రతిష్ఠమై యున్నావు. అందరిలోని జ్ఞానస్వరూపానివి, దయాస్వరూపానివి నీవే. నన్ను కాపాడుము.

- కాంచి పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీస్వామి వారు

గురువర దీజో చరణ తుమ్హారే - కంచి పరమాచార్యుల వారిపై గీతం

గురువర దీజో చరణ తుమ్హారే! సద్గురు దీజో చరణ తుమ్హారే!
కాంచీ నగరీ కామ పీఠ వాసీ! తుమ్ హీ హమారే సబ్ కుఛ్ స్వామీ!
మన్ మందిర్ మే బసో హమారే! బందీ బనే హమ్ సబ్ తుమ్హారే!
దూర్ కరో తుమ్ మన్శా మన్ సే! పార్ కరో ఇస్ భవ సాగర్ సే!

ఓ సద్గురు దేవా! మాకు నీ చరణముల వద్ద ఆశ్రయాన్ని ప్రసాదించు. కాంచీ నగరంలోని కామకోటి పీఠవాసివైన స్వామీ! మా సర్వస్వం నీవే! మా మనసులనే మందిరములలో నీవు నివసించుము, మేము నీకు బద్ధులమై ఉంటాము. మా మనసుల నుండి కోరికలను తొలగించుము, ఈ సంసార సాగరాన్ని దాటించుము.

- కే వేంకట్రామన్ గారు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...