30, ఆగస్టు 2020, ఆదివారం

పరదేవతే భక్త పూజితే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

పరదేవతే భక్త పూజితే భద్రం దేహి ఆశు మాం పాహి

చిరతర సంపత్ప్రద శ్రీ విద్యే చిదగ్ని కుండోదయ శుభ నిత్యే
హరిహయాది నుత గురుగుహ విదితే హిరణ్య మణిమయ మందిర స్థితే

పరదేవతగా భక్తులచే పూజించబడే ఓ పార్వతీదేవీ! నాకు రక్షణనొసగి శీఘ్రముగా కాపాడుము. శాశ్వత సంపదలనొసగే శ్రీవిద్యవు నీవు, చిదగ్ని కుండము నుండి ఉద్భవించి నిత్యము శుభములు కలిగించే తల్లివి, విష్ణువు, ఇంద్రాదులచే నుతించబడి సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడినావు, రత్నములచే అలంకరించబడిన బంగారు మంటపములో స్థితమై యున్నావు, నాకు రక్షణనొసగి శీఘ్రముగా కాపాడుము.

రామచంద్రం భావయామి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

 రామచంద్రం భావయామి రఘుకుల తిలకం ఉపేంద్రం

భూమిజా నాయకం భుక్తి ముక్తి దాయకం
నామ కీర్తన తారకం నరవరం గత మాయికం

సాకేత నగరే నివసంతం సామ్రాజ్య ప్రద హనుమంతం
రాకేందు వదనం భగవంతం రమణీయ కళ్యాణ గుణవంతం
కాకుథ్సం ధీమంతం కమలాక్షం శ్రీమంతం
నాకేశ నుతమనంతం నర గురు గుహ విహరంతం

రఘుకుల తిలకుడు, శ్రీహరి అయిన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. భూమిజయైన సీతాదేవి నాయకుడు, భుక్తిని ముక్తిని ప్రసాదించేవాడు, నామకీర్తనతో తరింపజేసేవాడు, నరవరుడు, మాయాతీతుడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానించుచున్నాను. సాకేత నగరంలో నివసించేవాడు, హనుమంతునికి భక్తి సామ్రాజ్యాన్ని ఒసగిన వాడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు, భగవంతుడు, మనోజ్ఞమైన రూపము కలవాడు, శుభకరమైన గుణములు కలవాడు, కాకుథ్స కులమునందు జన్మించిన వాడు, కలువలవంటి కన్నులు కలవాడు, శ్రీమంతుడు, ఇంద్రునిచే నుంతించబడిన అనంతుడు, నరరూపములో గురుగుహుని మనసులో విహరించే వాడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానించుచున్నాను.

వసంత రాగంలో కూర్చబడిన ఈ కృతిని గాయత్రి వెంకటరాఘవన్ గారు ఆలపించారు

మహాలక్ష్మి కరుణారస లహరి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి



మహాలక్ష్మి కరుణారస లహరి మామవ మాధవ మనోహరి శ్రీ

మహావిష్ణు వక్షస్థల వాసిని మహదేవ గురుగుహ విశ్వాసిని
మహాపాప ప్రశమని మనోన్మని మారజనని మంగళ ప్రదాయిని

క్షీరసాగర సుతే వేదనుతే క్షితీశాది మహితే సురహితే
భారతీ రతీ శచీ పూజితే భక్తి యుక్త మానస విరాజితే
వారిజాసనాద్యమర వందితే నారదాది ముని బృందానందితే
నీరజాసనస్థే సుమనస్థే సారస హస్తే సదా నమస్తే

శ్రీహరి మనోహరివైన ఓ మహాలక్ష్మీ! నాపై కరుణారసమును ప్రవహింపజేయుము. శ్రీమహావిష్ణు వక్షస్థలమున నివసించెదవు, శివుడు, కుమారస్వామి విశ్వసించే అమ్మవు, ఘోరపాపములను తొలిగించెదవు, నీ మనసు నిరంతరం పరమాత్మ భావనలో ఉంచెదవు, మన్మథునికి తల్లివి, సమస్త శుభములనొసగెదవు, నాపై కరుణారసమును ప్రవహింపజేయుము. సముద్రుని కుమార్తెవు, వేదములచే నుతించబడినావు, మహారాజులచే నుతించబడినావు, దేవతలకు హితురాలవు, సరస్వతి, రతీదేవి, శచీదేవిలచే పూజించబడినావు, భక్తుల మనసులలో నిలిచి ప్రకాశించెదవు, బ్రహ్మాది దేవతలకు పూజనీయురాలవు, నారదాది ముని సమూహమునకు ఆనందము కలిగించెదవు, కమలమున స్థిరమై యున్నావు, సహృదయములలో నిలచి యుండెదవు, కమలమును కరములో కలదానవు, ఎల్లప్పుడూ నీకు నమస్కరించెదను, నాపై కరుణారసమును ప్రవహింపజేయుము.

మాధవమనోహరి రాగంలో కూర్చబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

నీరజాక్షి కామాక్షి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


నీరజాక్షి కామాక్షి నీరద చికురే త్రిపురే

శారద రమా నయనే సారస చంద్రాననే
వారిజ పాదే వరదే తారయ మాం తత్వ పదే

గౌరీ హిందోళ ద్యుతి హీర మణిమయాభరణే
శౌరి విరించి వినుత శివశక్తిమయ నవావరణే
నారీమణ్యాద్యర్చిత నవనాథాంతఃకరణే
సూరి జన సంసేవిత సుందర గురుగుహ కరణే

ఓ కామాక్షీ! నీవు కలువల వంటి కన్నులు గల దానవు, నల్లని మేఘములు కురులు కల త్రిపురసుందరివి! లక్ష్మీ సరస్వతులను కన్నులుగ గలదానవు, శరదృతువులో చంద్రుని వంటి ముఖము కలదానవు, కమలముల వంటి పదములు కలిగి వరములనొసంగే తల్లివి, జ్ఞానమునొసగి నన్ను తరింపజేసెదవు! హిందోళ రాగములో నుతించబడే గౌరివి! వజ్రములు, మణులుతో పొదగబడిన ఆభరణములు ధరించినదానవు, విష్ణువు, బ్రహ్మలఏ నుతించబడినావు, శివశక్తిమయమై నవావరణములు కలిగిన శ్రీచక్రములో భాసిల్లుచున్నావు, నారీమణులచే అర్చించబడే తల్లివి, నవనాథుల అంతఃకరణములో నివసించేదానవు, పండితులచే పూజించబడేదానవు, సుందరుడైన సుబ్రహ్మణ్యునికి జననివి!

హిందోళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు.

పార్వతీ కుమారం భావయే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

ముత్తుస్వామి దీక్షితుల వారు తిరుత్తణి సుబ్రహ్మణ్యుని ఉపాసనలో సిద్ధిపొందిన నాదయోగి. వారు ఇక్కడ వల్లీ దేవసేనా సమేత శక్తిధరుని అనుగ్రహం పొంది తన నాదోపసనలో అద్భుతమైన పురోగతిని పొందారు. దీక్షితుల వారు తిరుత్తణి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు సుబ్రహ్మణ్యుడు వృద్ధుని రూపంలో మెట్లు దిగి వచ్చి తన చేతితో దీక్షితుల వారి నాలికపై ప్రసాదాన్ని తాకించి అదృశ్యమవుతాడు. ఆ అనుభవానికి ఆశ్చర్యపోయి, స్వామి అనుగ్రహాన్ని గ్రహించి దీక్షితుల వారు ఆ స్వామిపై ఎనిమిది కృతులను రచించారు. అవే తిరుత్తణి కృతులుగా పేరొందాయి. ఈ కృతుల పల్లవులన్నీ కూడా గురుగుహ పదంతో అలంకరించబడినవే. తిరుత్తణి కృతులనే కాదు, దీక్షితుల వారు మరెన్నో కృతులను కూడా సుబ్రహ్మణ్యస్వామి వైభవాన్ని తెలిపే విధంగా రచించారు. గురుగుహ అన్న పదాన్ని తన కృతులలో ముద్రగా ఉపయోగించారు. అంతటి సుబ్రహ్మణ్య ఉపాసకులు వారు. గురుగుహ అని స్వామిని సంబోధించటంలో దీక్షితుల వారి అంతరార్థం తనకు గురువుగా భావించటమే. ఆయన రచించిన సుబ్రహ్మణ్య కృతులలో ఒకటి పార్వతీ కుమారం భావయే. వివరాలు:

సాహిత్యం
=======

పార్వతీ కుమారం భావయే సతతం శరవణభవ గురుగుహ శ్రీ

మార్గసహాయ ప్రియసుతం మాధవాద్యమర సేవితం
మాణిక్య మకుట శోభిత మానిత గుణ వైభవం

భావం
=====

గురుగుహుడు, శరవణభవుడు (రెల్లుగడ్డిలో జన్మించిన వాడు), పార్వతీపుత్రుడైన కుమారస్వామిని ఎల్లప్పుడూ ధ్యానించెదను. విరించిపురంలో వెలసిన మార్గబంధీశ్వరుని ప్రియకుమారుడు, శ్రీహరి మొదలైన దేవతలచే సేవించబడిన వాడు, మాణిక్యములతో పొదిగిన కిరీటముతో శోభిల్లేవాడు, పొగడబడిన గుణవైభవములు కలవాడు అయిన కుమారస్వామిని ఎల్లప్పుడూ ధ్యానించెదను.

శ్రవణం
=======

నాటకురంజి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలాజీ శంకర్ గారు  ఆలపించారు

ఆనందామృతాకర్షిణి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ఉపాసనా బలం ఎంత గొప్పదో తెలుసుకోవటానికి ఈ కర్మభూమిపై జన్మించిన అనేక మహనీయుల అద్భుత గాథలు చదవాలి. ఈ పుణ్యభూమిలో లోక కల్యాణార్థం తమ తపోశక్తిని ధారపోసిన సత్పురుషులలో వాగ్గేయకారులు కూడా ఉన్నారు. వారిలో ముత్తుస్వామి దీక్షితుల వారు ఒకరు. సుబ్రహ్మణ్య మరియు శ్రీవిద్యోపాసనలో భారతదేశంలోనే అగ్రగణ్యులుగా పేరొందిన దీక్షితుల వారు తమ సాధనలో భాగంగా అనేక క్షేత్రాలను సందర్శించి అక్కడ కొన్ని రోజులు గడుపుతూ తీవ్రమైన సాధన చేశారు. అలా ఒకసారి ఆయన తిరునల్వేలి వెళ్లి అక్కడ సాధన చేసుకోదలచారు. తిరునల్వేలిలో నెల్లియప్పార్ దేవాలయం చాలా సనాతనమైనది, సుప్రసిద్ధమైనది. అక్కడ పార్వతీదేవి రూపమైన కాంతిమతి అమ్మవారిని దీక్షితుల వారు అంతకు మునుపే ఉపాసన చేసి మంత్రసిద్ధి పొందారు. ఆయన మరల తిరునల్వేలి వెళ్లినప్పుడు అక్కడ కరువు వలన తామ్రపర్ణి నది ఎండిపోయి, ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన నిత్యానుష్ఠానానికి కూడా ప్రవహించే నీరు దొరకని పరిస్థితి. ఆ కరువు యొక్క తీవ్రత చూసి చలించిన దీక్షితుల వారు కాంతిమతి అమ్మవారిని ఆర్తితో వర్షం కురిపించమని కృతి ద్వారా ప్రార్థించారు. అమృతవర్షిణి రాగంలో కూర్చబడిన ఈ కృతి సార్థకత పొంది, వెంటనే అమ్మవారు కరుణించి మూడు రోజుల పాటు తిరునల్వేలిలో సువృష్టి కురిపించిందట. సద్య సువృష్టి హేతవే త్వాం సంతతం చింతయే సలిలం వర్షయ వర్షయ వర్షయ అని దీక్షితుల వారు కాంతిమతి అమ్మవారిని నుతిస్తున్నప్పుడు ఆయనలోని ఆర్తి చూసినవారు నిశ్చేష్టులైపోయారట. ఎక్కడ లేని మబ్బులు రావటం, ఒకటి కాదు, రెండు కాదు, మూడు రోజులు ఏకధాటిన అమ్మ వర్షం కురిపించి అక్కడి ప్రజలను కరుణించటం దీక్షితుల వారి ఆధ్యాత్మిక యానంలో ఓ మహత్తరమైన ఘట్టం.

ఆనందామృతాకర్షిణి! అమృతవర్షిణి!
హరాది పూజితే! శివే! భవాని!

శ్రీనందనాది సంరక్షిణి!
శ్రీ గురుగుహ జనని! చిద్రూపిణి!
సానంద హృదయ నిలయే సదయే!
సద్య సువృష్టి హేతవే!
త్వాం సంతతం చింతయే అమృతేశ్వరి!
సలిలం వర్షయ! వర్షయ! వర్షయ!

భవుని అర్థాంగి అయిన ఓ పార్వతీ! నీవు అమృతమనే వర్షాన్ని కురిపించే తల్లివి, ఆనందమనే అమృతానికి కారణానివి, శివాది దేవతలచే పూజించబడిన అమ్మవు! లక్ష్మీ దేవి పుత్రుడైన మన్మథుని కాపాడిన తల్లివి, కుమారస్వామి జననివి, జ్ఞాన స్వరూపిణివి. సచ్చిదానందములో తన్మయులైన వారి హృదయములో నివసించే దేవతవు. నిశ్చయముగా నీవు మంచి వర్షములకు కారణానివి. అమృతేశ్వరివైన నిన్ను నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తాను. మంచి వర్షాలు కురిపించు తల్లీ!

అమృతవర్షిణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని అరుణా సాయిరాం గారు ఆలపించారు

మీనాక్షి మే ముదం దేహి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


 

మీనాక్షి మే ముదం దేహి మేచకాంగీ రాజమాతంగీ

మానమాతృమేయే మాయే మరకతచ్ఛాయే శివజాయే
మీనలోచనీ పాశమోచనీ మానినీ కదంబవన వాసినీ

మధురాపురి నిలయే మణివలయే మలయధ్వజ పాండ్యరాజ తనయే
విధు విడంబన వదనే విజయే వీణాగాన దశగమక క్రియే
మధు మద మోదిత హృదయే మహాదేవ సుందరేశ ప్రియే
మధు ముర రిపు సోదరి శాతోదరి విధి గురు గుహ వశంకరి శంకరి

నల్లని శరీరము కలిగి, దశమహావిద్యలలో రాజమాతంగి రూపమైన ఓ మధుర మీనాక్షీ! నాకు ఆనందమును ప్రసాదించుము. నీవు చిత్స్వరూపిణివి, జ్ఞానమునకు మూలము, మాయాస్వరూపిణివి, పూజనీయురాలవు, మరకతము వలె ఆకు పచ్చని ఛాయకల దానవు, శివుని అర్థాంగివి, చేపలవంటి కన్నులు కలిగిన దానవు, భవబంధముల నుండి విముక్తి కలిగించే తల్లివి, మాన్యురాలవు, కదంబవనములో నివసించే అమ్మవు, నాకు ఆనందము కలిగించుము. మధురై నగరమును నివాసముగా కలిగిన దానవు, మణులతో పొదిగిన గాజులు ధరించిన దానవు, పాండ్యరాజైన మలయధ్వజుని కుమార్తెవు, చంద్రుని పోలిన ముఖము కలిగిన గౌరివి, వీణావాదనములో పది గమకముల ప్రక్రియను సృష్టించినదానవు, తేనెయొక్క తీయదనంతో ఆనందించే హృదయము కలదానవు, మహాదేవుని రూపమైన సుందరేశ్వరునికి ప్రియురాలవు, మధు మరియు మురాసురుల శత్రువైన శ్రీహరి సోదరివి, సన్నని నడుము కలదానవు, బ్రహ్మ మరియు కుమారస్వామికి అధిదేవతవు, సమస్త శుభములు కలిగించే తల్లివి, నాకు ఆనందమును కలిగించుము.

పూర్వీకల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...