ఆషాఢ శుద్ధ పౌర్ణమిని అనాది నుంచి వ్యాసపూర్ణిమగా, గురుపూర్ణిమగా పూజించడం భారతీయ సంప్రదాయంలో ఒక మహత్తర ఆచారం. ఆ రోజున గురుపూజ చేయడం పరిపాటి. ఈ తిథి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు; గురుతత్త్వాన్ని, శిష్యభావాన్ని, జ్ఞానప్రసారాన్ని గుర్తుచేసే పవిత్రమైన సందర్భం. వ్యాసమహర్షి జన్మదినమైన ఈ పర్వదినం, భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత విశిష్టమైనదిగా నిలిచిపోయింది.
వారణాశిలో వేదనిధి అనే ఒక బ్రాహ్మణుడు, అతని భార్య వేదవతి చాలా పేదరికంలో, సంతానలేమి బాధతో జీవించేవారు. అనేక వ్రతాలు, పుణ్యకర్మలు చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు. అప్పుడు ఒకరోజు వేదనిధికి ప్రతి రోజు మధ్యాహ్న సమయంలో వ్యాసమహర్షి గంగానదికి రహస్యంగా వస్తారు అనే వార్త తెలిసింది. అది విని అతడు ఆనందంతో గంగాతీరానికి వెళ్లి, సరిగ్గా మధ్యాహ్నం సమయంలో వచ్చిన ఒక భిక్షుకరూప దివ్యపురుషుని గుర్తించి ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఆ వ్యక్తి మొదట అసహనంగా ప్రవర్తించినా, వేదనిధి తన పట్టును విడువలేదు. చివరికి ఆయన వ్యాసమహర్షినే అని తెలుసుకుని ఆశ్రయించాడు.
వేదనిధి తన తండ్రిగారి శ్రాద్ధానికి బ్రాహ్మణ భోజనం చేయమని వ్యాసమహర్షిని ఇంటికి ఆహ్వానించాడు. వ్యాసుడు అంగీకరించి వెళ్లిపోయారు. తరువాత వేదవతి శుచిగా వంటలు సిద్ధం చేసింది. భిక్షుకరూపంలో మళ్ళీ వచ్చిన వ్యాసమహర్షి స్నానం చేసి, ఆచమనం చేసి, పుష్పాలతో, తులసితో సాలగ్రామాన్ని పూజించారు. ఆ సాలగ్రామ దర్శనమే వ్యాసమహర్షికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తరువాత శ్రాద్ధకర్మలు పూర్తయ్యాక, వేదనిధి తనకు సంతానం కలగాలని కోరగా, వ్యాసుడు పదిమంది తేజోవంతులైన కుమారులు కలుగుతారని, జీవితంలో సకల ఐశ్వర్యాలు ఉంటాయని, చివరికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు.
ఇంకా ముఖ్యమైన బోధ ఏమిటంటే, వేదనిధి మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు చూడగలను? అని అడిగినప్పుడు వ్యాసమహర్షి ఇచ్చిన సమాధానం.
శృణు విప్రరతేచ్ఛాతేత్ దర్శ్నార్థం తథా త్వయా
పూజనీయో విశేషేణ కాథావాచయితా స్వయం
ఓ బ్రాహ్మణోత్తమా! నీవు నన్ను మరల మరల దర్శించాలని కుతూహలంగా ఉన్నావు గనుకు విను! నువ్వు ఎప్పుడైనా సరే నన్ను చూడాలనుకుంటే పురాణకథలను, వేదగాథల యొక్క రహస్యాలను వ్యాఖ్యానం చేస్తూ ఇతిహాసాల యొక్క గూడార్థాలను ఎవరైతే ఉపదేశిస్తుంటారో వారే నా నిజస్వరూపము. ఎందుకంటే వారి యొక్క జ్ఞానమందు నేను నివసించి ఉంటాను అని చెబుతారు వ్యాసమహర్షి.
అప్పుడు వేదనిధి వ్యాసమహర్షిని "మహాత్మా! తమను ఏ విధంగా, ఏ రోజున పూజించాలి" అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు - "ఓ బ్రాహ్మణోత్తమా! నేను జన్మించిన ఆషాడ శుక్లపక్ష పూర్ణిమ నాడు నన్ను పూజించాలి. వస్త్రాలు, ఆభరణాలు, గోవులు దానం చేసి, పరిపూర్ణమైన అర్ఘ్యపాద్యాలుతో నా రూపాన్ని పూజించి ధ్యానించవలసింది. అలా చేసిన వారికి నా రూపం సాక్షాత్కారమవుతుంది" అని వ్యాసమహర్షి చెప్పారు.
అందుకే, వ్యాసదర్శనం అంటే కేవలం ఒక వ్యక్తిని చూడడం కాదు; ధర్మబోధను, జ్ఞానప్రకాశాన్ని, అంతరార్థాన్ని అనుభవించడం. పురాణాలలోని గూఢార్థాలు, గత కల్పాల చరిత్ర, సృష్టి రహస్యాలు, ఋషుల బోధలు ఇవన్నీ వ్యాసకృప లేకుండా అవగతం కావు.
అందువల్ల ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు వ్యాసపూజ చేయడం, గురుపూజ ఆచరించడం పరమార్థవంతమైన కార్యంగా చెప్పబడింది. ఈ రోజున గురువును వస్త్రాలు, ఆభరణాలు, ధేనువు, దక్షిణ, పాద్యార్ఘ్యాదులతో పూజించి, వ్యాసస్వరూపంగా భావించాలి. ప్రత్యేకించి ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారంతో కూడినప్పుడు ఈ పూజ మరింత విశేషమైనదిగా పరిగణించబడింది. ఈ విషయాన్ని వేదవాక్యాలు, పురాణశ్లోకాలు, తరువాతి సంప్రదాయగ్రంథాలైన బ్రహ్మాండపురాణం, స్వధర్మసింధు, నిర్ణయసింధు వంటి గ్రంథాలు కూడా సమర్థించాయని ఈ రచన సూచిస్తుంది.
వ్యాసమహర్షి భారతదేశానికి కేవలం ఒక మహాకవి కాదు, గురుతత్త్వానికి ప్రత్యక్ష రూపం. ఆయన జన్మతిథి అయిన వ్యాసపూర్ణిమ, శిష్యుడు గురువును స్మరించుకునే రోజు; పురాణకథలను, ఇతిహాసబోధను, ధర్మజీవనాన్ని పునఃస్మరించుకునే రోజు; వ్యాసకృపను కోరుకునే రోజు. వ్యాసపూజలో ఉన్న అసలు ఉద్దేశం, జ్ఞానం కంటే ముందు వినయం, పూజ కంటే ముందు శరణాగతి, కథ కంటే ముందు దాని అంతరార్థాన్ని గ్రహించడం.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి