12, జులై 2026, ఆదివారం

జానకమ్మ ప్రతిభ మరియు జీవిత విశేషాలు


1. పుట్టుకతో వచ్చింది పాట అనేది. మాడ్యులేషన్‌తో సహా అన్ని మెలకువలు మూడేళ్ళ చిన్నవయసులోనే జానకమ్మకు అబ్బాయి.

2. పదేళ్ల వయసులో తల్లి ప్రోద్బలంతో అక్కలతో పాటు రాజమండ్రిలో అయిష్టంగానే పైడిస్వామి గారి వద్ద ఒక ఏడాది పాటు సంగీతం నేర్చుకున్నారు. నీకు నేను కొత్తగా సరిగమలు నేర్పక్కర్లేదు అని నగుమోము గనలేని కీర్తనను ఆయన నేర్పించారు.

3. చిన్నతనంలో సినిమా పాటలు పాడాలన్న అభిలాష తప్ప శాస్త్రీయ సంగీతం మీద ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు.

4. తెలుగులో నీ లీల పాడెద దేవా అనే పాట మురిపించే మువ్వలు చిత్రంలోది. ఇది డబ్ చేయబడిన చిత్రం. తమిళంలో నాదస్వరానికి జోడీగా పాడటానికి ఎందరో గాయనీమణులను వెదికినా సుబ్బయ్యనాడు గారికి తృప్తి కలగలేదు. చివరకు లీల గారు స్వరాల స్థాయికి పాడగలిగేది ఒక్క జానకి మాత్రమే అని ఆవిడ పేరు సూచించారు.

5. తెలుగులో సిరిమల్లె పూవా అనే పాట పదహారేళ్ల వయసు చిత్రంలోనిది. ఈ ట్యూన్ తమిళంలో పదినారు వయదినిలె అనే చిత్రంలో సెందూర పూవే అనే పాట. ఈ పాటకు జానకమ్మ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు వచ్చింది.

6. తెలుగులో జయప్రద తొలిచిత్రం అంతులేని కథ. అందులో కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు అన్న పాట తమిళ మూలం అవళ్ ఒరు తోడర్ కథై అన్న తమిళ చిత్రంలో కన్నిలే ఎన్న ఉందు అన్న పాట. రెండు చిత్రాలకు సంగీతం ఎం ఎస్ విశ్వనాథన్ గారే. రెండూ కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి.

7. 24 ఏళ్ల వయసు నుండే దుమ్ము ఎలర్జీ వల్ల విపరీతమైన ఆయాసం ఉన్నా శివదీక్షాపరురాలనురా వంటి ఎన్నో గీతాలను జానకమ్మ పాడారు. అలాగే, శంకరాభరణంలో సామజవరగమన పాడే సమయంలో ఒక మందు వల్ల ఎలర్జీ వచ్చినా గుండె బిగబట్టి బాలు గారితో రిహర్సల్ చేసి పాడారు.

8. వాయిస్ మాడ్యులేషన్ ఆవిడ ప్రత్యేకత. చాలా సార్లు పురుష కళాకారులకు వాయిసోవర్ ఇచ్చారు.

9. జానకి గారి గొంతులో సన్నాయి మోగుతుంది, సామవేదం పలుకుతుంది, పండు ముసలి వణుకుతుంది, పసిపాప పలవరిస్తుంది అన్నారు కళాతపస్వి విశ్వనాథ్ గారు. గోవులు తెల్లన, చిన్నారి పొన్నారి కిట్టయ్యా...ఈ ప్రతిభకు ఉదాహరణలు.

10. అభిలాష చిత్రంలో సందెపొద్దుల కాడ, బంతీ చామంతీ సూపర్ డూపర్ హిట్ పాటలు. ఇళయరాజా గారి సంగీతం పతాక స్థాయికి వెళ్లటానికి ఉన్న కారణాల్లో జానకి గారి వాయిస్ మాడ్యులేషన్, సృజనాత్మకత ముఖ్యమైనవి. అలాగే, రాక్షసుడు చిత్రంలో నీ మీద నాకు ఇదయ్యో అనే పాటలో జానకమ్మ గారి మాడ్యులేషన్ న భూతో న భవిష్యతి.

11. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో ప్రతి ఒక్క పాట కూడా జానకమ్మ పతాక స్థాయి ప్రతిభకు ఉదాహరణలే. అందాలలో అహో మహోదయం, ప్రియతమా నను పలకరించు ప్రణయమా, యమహో నీ యమా యమా అందం..ఇళయరాజా గారి సంగీతాన్ని అజరామరం చేశారు జానకమ్మ, బాలు గారు.

12. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం అన్నక్కిళి (తమిళం). అందులో అన్నక్కిళి ఉణ్ణై అనే పాట పెద్ద హిట్ అయ్యింది, అదే ట్యూన్‌లో తెలుగులో రామచిలుక చిత్రంలో సత్యం గారు రామచిలుక పెళ్ళికొడుకెవరే అనే పాటను జానకి గారి చేత పాడించారు. తెలుగులో కూడా అంతే హిట్ అయ్యింది పాట.

13. కొంజుం సాలంగై చిత్రంలోని సింగార వేలనే దేవా అనే పాట విని జానకి గారి గాత్రం నచ్చి మేటి దర్శకులు బీ ఎన్ రెడ్డి గారు పూజాఫలం చిత్రంలో పట్టుబట్టి మూడు పాటలు పాడించుకున్నారు - పగలే వెన్నెల, శివదీక్షాపరురాలనురా, మదనా మనసాయెరా అనే పాటలు.

14. ఆమె గొంతు స్వరకర్తలకు కల్పవృక్షం లాంటిది, ఆవిడ ఉచ్చారణ కానీ, భావం కానీ కవి ఎలా రాశాడో అలాగ యథాతథంగా పాడగల ప్రతిభ అని నమ్మి కళాతపస్వి విశ్వనాథ్ గారు తన చిత్రాలలో జానకమ్మ గారి చేత ఎన్నో పాటలు పాడించారు - ఓంకార నాదాను సంధానమౌ గానమే, సారిగరీగపదాపా, సామజవరగమన, సప్తపది చిత్రంలో నెమలికి నేర్పిన నడకలివి, భామనే సత్యభామనే, గోవులు తెల్లన, సాగరసంగమంలో ఓం నమశ్శివాయ, మౌనమేలనోయి వంటి ఎన్నో పాటలను పాడించుకున్నారు.

14. ఒకమ్మాయి ఒకబ్బాయిని వలలో వేసుకోవాలంటే మరి పాట సాహిత్యం అలా ఉన్నప్పుడు సాహిత్యానికి తగిన ధ్వనులు చేయాలి అన్నది ఆవిడ నమ్మకం. అందుకే ఆవిడ అప్పట్లో బూతు పాటలు అనుకున్న కొన్ని శృంగారగీతాలను పాడారు, అవి హిట్ అయ్యాయి. వృత్తి రీత్యా వీరు ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాలలో పని చేశారు, కొన్నాళ్లు రాజమండ్రిలో కొన్నాళ్లు సిరిసిల్లలో ఉన్నారు.

15. జానకి గారి తండ్రి శిష్ట్లా శ్రీరామమూర్తి గారు. ఆయన ఆయుర్వేదం డాక్టర్. వీరు ప్రస్తుతం బాపట్ల జిల్లా రేపల్లె దగ్గరలోని పల్లపట్ల గ్రామంలో జానకి గారు 1938వ సంవత్సరం ఏప్రిల్ 23న జన్మించారు.

16. హైదరాబాదులో ఉన్నప్పుడు మోనో యాక్టర్‌గా జానకమ్మ మామయ్య గారు అనేక పాత్రలను ధరించే వారు, మధ్యలో లతా మంగేష్కర్ పాటలు జానకమ్మ చేత పాడించుకునే వారు. ఆయన పాత్రలను మార్చుకునే సమయంలో ఆయన జేబులో నుండి రాంప్రసాద్ గారి ఫోటో కిందపడగా, దాన్ని దాచుకుని ఆయనపై ప్రేమలో పడ్డారు. వీళ్ల ప్రేమాయణం కొన్నళ్లు సాగింది. 1959లో వీరి వివాహం జరిగింది. రాంప్రసాద్ గారి ప్రోద్బలంతోనే ఆయన తండ్రి జానకి గారిని ఏవీఎం స్టూడియో అధినేతకు సిఫారసు చేశారు. ఆ తరువాతే ఆవిడకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగ, జానకి గారిది ప్రేమ వివాహం. తాను మరణించేంత వరకు జానకి గారి పరిపూర్ణమైన సహకారం, ప్రోత్సాహం అందించారు రాం ప్రసాద్ గారు. వీరికి ఒక అబ్బాయి మురళీకృష్ణ. కోడలు ఉమ కూచిపూడి మరియు భరత నాట్య కళాకారిణి. చెన్నైలో నాట్యశిక్షణా సంస్థను నడుపుతున్నారు. వీరి కుమార్తే వైద్యుల అప్సర బెంగళూరులో యోగా టీచర్. మురళీకృష్ణ గారు 2026లో మరణించారు.

17. ప్రముఖ సంగీత విద్వాంసులు, అన్నమాచార్యుల వారి కీర్తనలను ప్రచారం చేసిన వారిలో ప్రముఖులైన గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు జానకమ్మ గారి అక్కయ్య కొడుకు. అలాగే అలనాటి గాయకులు మాధవపెద్ది సత్యం గారి తల్లి శిష్ట్లా వారి ఆడపడుచు. ఆ విధంగా వీరిద్దరికి బంధుత్వం ఉంది.

18. 1997లో రాంప్రసాద్ గారి మరణం జానకి గారికి తీరని లోటుగా నిలిచింది. అయినా పాడటం మనలేదు,తరువాతి తరం కళాకారులను తల్లిలా ప్రోత్సహించారు.

19. భారతదేశంలోని 17 భాషలలో (హిందీతో సహా) జానకమ్మ గారు 48 వేలకు పైగా పాటలు పాడారు. హిందీలో యార్ బినా చైన్ కహారే (సాహెబ్), హోజా రంగీలా రే (రంగీలా) వంటి ఎన్నో హిందీ పాటలు ప్రజాదరణ పొందాయి. చెన్నై-ముంబై మధ్య తిరుగుతూ పాడిన రోజులు ఉన్నాయి.

20. జానకమ్మకు ఉత్తమ గాయనిగా 4 మార్లు జాతీయ అవార్డులు, 10 మార్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డు, 6 మార్లు తమిళనాడు రాష్ట్ర అవార్డు, 11 మార్లు కేరళ రాష్ట్ర అవార్డు, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 30కు పైగా ఇతర ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి