15, జులై 2026, బుధవారం

స్థితప్రజ్ఞురాలు జానకమ్మ



ఒక స్త్రీ ఎన్నని ఆటుపోట్లను తట్టుకోగలదు? జానకి గారు 59 ఏళ్ల వయసులో అమితంగా ప్రేమించే భర్త రాం ప్రసాద్ గారు హఠాత్తుగా చనిపోయారు. ఏదో విశ్రాంతిగా వృద్ధాప్యం గడుపుదామనుకుంటే కొడుకు, కోడలు విడాకులు తీసుకున్నారు, 2023లో మనవరాలు అమృతవర్షిణి మరణించింది, ఈ ఏడాది జనవరిలో ఒక్కగానొక కొడుకు మరణించాడు...ధైర్యానికి, మనసు దిటవు చేసుకోవటానికి కూడా ఒక పరిధి ఉంటుంది, ఎందుకు ఇంక జీవించటం అన్న భావన కలిగి తీరుతుంది. ఎంతటి సకారాత్మక ధోరణి ఉన్నా ఇన్ని ఎదురుదెబ్బలు తట్టుకొని నిలబడటం చాలా కష్టం. మూడు తరాల వారు - తనకు నిరంతరం వెన్నుదన్నుగా నిలిచి అద్భుతమైన గాయనిగా విజయం సాదించటంలో ప్రధాన పాత్ర పోషించిన భర్త, తను కన్నబిడ్డ, తను అమితంగా ప్రేమించే మనవరాలు తన ముందు దాటిపోవటం చాలా బాధాకరం. విధి చాలా కర్కశమైనది.


అయినా కూడా చివరి వరకూ నవ్వుతూ, సంగీతాన్ని ఆస్వాదిస్తూ జానకమ్మ జీవించారు. బాధ మనకు కనబడదు, ఎందుకంటే ఆవిడ ఆధ్యాత్మికతను ఒంటబట్టించుకున్నారు. ఆవిడ నలుగురి ముందు బాధపడితే అభిమానులు ఆస్వాదించలేరు కూడా. అందుకే పోరాటంలా కాకుండా సుఖదుఃఖాలను సమదృష్టితో చూడటం అలవరచుకున్నారు.

ప్రజాజీవితంలో ఉండటం వల్ల వ్యక్తిగత జీవితంలో ప్రతిదీ మీడియాలో చెప్పుకోనక్కర్లేదు అన్నది జానకి గారి సిద్ధాంతం. జానకమ్మ వ్యక్తిత్వంలోని ఈ కోణాన్ని అర్థం చేసుకుంటే ఆవిడ ఎందుకు గొప్ప మహిళో అర్థమవుతుంది. మహిళలందు పుణ్యమహిళలు వేరయా!

కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్లలో ఉన్న నీరు కళ్లకెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు

తానే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చెలరేగు తాపం
నే వెళ్లు దారి ఓ ముళ్ల దారి
రాలేరు ఎవరూ నాతో చేరి

వేసవిలోనూ వానలు రావా
కోవెల శిలకూ జీవం రాదా
జరిగే నాడే జరుగును అన్నీ
జరిగిన నాడే తెలియును కొన్ని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి