సంగీత త్రయంలో పెద్దవారు శ్యామశాస్త్రి గారు. ఆయన వాగ్గేయకారులు, దేవీ భక్తులు, ఉపాసకులే కాదు పారంపర్యంగా వచ్చిన తంజావూరు బంగారు కామాక్షీ అమ్మవారి దేవస్థానంలో అర్చకత్వం కూడా చేశారు. సనాతనమైన ఈ బంగారు కామాక్షీ విగ్రహం తొలుత కాంచీపురంలో ఉండగా ఆది శంకరులే శ్యామశాస్త్రి గారి పూర్వీకులకు ఆ విగ్రహ పూజా బాధ్యతలను అప్పగించారట. 16వ శతాబ్దం మధ్యలో రాజకీయ పరిస్థితుల వలన శ్యామశాస్త్రి పూర్వీకులు కాంచీపురం వదలి ఆ విగ్రహాన్ని తంజావూరు తీసుకు వచ్చి అక్కడ ప్రతిష్ఠించి అక్కడి రాజుల ఆదరణతో ఆ బంగారు కామాక్షి దేవాలయానికి వైభవం వచ్చేలా చేశారు. తంజావూరు మహారాజా తులజావారు మేల రాజవీధిలో ఆ గుడికై పెద్ద స్థలాన్ని కేటాయించి, అగ్రహారాలు, మాన్యాలు, ఆభరణాలు కానుకగా ఇచ్చారు. శ్యామశాస్త్రి తండ్రిగారైన విశ్వనాథశాస్త్రి గారు మరణించిన తరువాత శ్యామశాస్త్రి గారు అమ్మ కైంకర్య బాధ్యతలను స్వీకరించారు.
శ్యామశాస్త్రి కన్న ముందు వారి కుటుంబంలో ఎవ్వరికీ సంగీతంలో ప్రవేశం లేదు. ఆ బంగారు కామాక్షి కరుణతో ఆయన అద్భుతమైన గాయకునిగా, వాగ్గేయకారునిగా పేరొందారు. నిత్యపూజాదికాల తరువాత శ్యామశాస్త్రి వారు ఆ అమ్మ ముందు కూర్చుని ఆనందభాష్పాలు రాలుస్తూ తన కృతులను గానం చేసేవారు. ఎలా? ఆ తల్లిని తన కన్న తల్లిలా, తాను ఒక పసిబిడ్డవానిగా త్రికరణ శుద్ధిగా భావించి పాడేవారు. అమ్మను వేడుకోవడం, అమ్మను నుతించటం, అమ్మను ప్రశ్నించటం, అమ్మ లాలన పొందిన అనుభూతులు, అమ్మ ప్రేమను ఆస్వాదించిన వర్ణనలు...ఆయన కీర్తనలన్నీ మాతృభావనతో వ్రాసినవే.
ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆయనకు కలలో వచ్చి మదురై వెళ్ళి మీనాక్షీ అమ్మను ఆరాధించమని చెప్పగా, శ్యామశాస్త్రుల వారు అక్కడికి వెళ్ళి నవరత్నమాలికగా పేరొందిన తొమ్మిది అద్భుతమైన కృతులను రచించి అమ్మ ముంగిట ఆలపించారు. వాటిలో ఏడు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి - సరోజదళనేత్రి, దేవీ మీననేత్రి (శంకరాభరణం రాగంలో), మరివేరే గతి యెవరమ్మ (ఆనందభైరవి), నన్ను బ్రోవు లలిత (లలిత), మాయమ్మ (ఆహిరి), దేవీ నీ పద సారస (కాంభోజి), మీనలోచనా బ్రోవ (ధన్యాసి). తమాషా ఏమిటంటే శ్యామశాస్త్రి కుటుంబీకులు తమిళ అయ్యరు బ్రాహ్మణులైనా, ఆయన కృతులన్నీ తెలుగులో వ్రాసినవే. కాబట్టి శ్యామశాస్త్రి పూర్తిగా తెలుగు వారే అని చెప్పవచ్చు. చక్కని లయజ్ఞానంతో, మధురమైన భావసంపదతో, స్వరాక్షర మరియు ప్రాసల సౌందర్యంతో, రాగ అర్థ రస భావనలతో ఆయన కామాక్షీ, మీనాక్షీ పరదేవతలను తన కృతులతో కొలిచారు. శ్యామశాస్త్రి తన రచనలలో దేవీవైభవం పరిపూర్ణంగా ఆవిష్కరించారు. మాతృప్రేమను కురిపించి, అనుగ్రహించి, ఘనపాపములను తొలగించే అమ్మను 300కు పైగా కృతులలో నుతించారు. సంగీత త్రయంలో దేవీతత్త్వాన్ని ఒక కుమారునిగా అద్బుతంగా వర్ణించారు.
నాదోపాసనలో మాతృతత్త్వాన్ని, పరదేవతానుగ్రహాన్ని మనకు అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదగా కృతులను అందించిన శ్యామశాస్త్రుల వారు తంజావూరు బంగారు కామాక్షి సేవలోనే తరించి పరమపదించారు. వీరి కుమారులైన సుబ్బరాయశాస్త్రి గారు తండ్రి వద్ద, వారి సమకాలీకులైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితుల వారి వద్ద సంగీత శిక్షణను పొంది మంచి వాగ్గేయకారులుగా పేరొందారు.
స్వాంతంబులోన నిన్నే తలచిన సుజనులకెల్లనీ వేళ సంతోషము లొసగేవని నీవు మనోరథ ఫలదాయిని వని
కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము కాపాడిన తల్లి కదా నేడు నీదు బిడ్డను లాలించి
కనక గిరి సదన లలిత నిను భజన సంతతము సేయ నిజముగను
వినుము నిఖిల భువన జననీ ఇపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి
పాలించు కామాక్షీ! పావనీ! పాపశమనీ!

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి