30, ఆగస్టు 2020, ఆదివారం

జయ మహిషాసురమర్దిని - ముత్తయ్య భాగవతార్ కృతి


 

జయ మహిషాసురమర్దిని! శ్రితజన పాలిని!

జయజయేంద్ర పూజితే! జయ జయ జయ జగన్మాతే!

జయ జయ మధురిపు సోదరి జయ జయ శ్రీ శాతోదరి
జయ గణేశ గుహ జనని జయ జయ హరికేశ భామిని

ఆశ్రితులను రక్షించే తల్లి, మహిషాసుని సంహరించిన ఆదిపరాశక్తికి జయము జయము. ఇంద్రునిచే పూజించబడిన జగన్మాతకు జయము జయము. శ్రీహరి సోదరి, సన్నని కటిప్రదేశము కలది, గణపతి సుబ్రహ్మణ్యులకు జనని, పరమశివునికి రాణియైన జగన్మాతకు జయము జయము.

హంసధ్వని రాగంలో కూర్చబడిన ఈ కృతిని సులోచనా పట్టాభిరామన్ గారు ఆలపించారు

రామనామమత్యద్భుతం - భద్రాచల రామదాసు కీర్తన

అబ్బబ్బ రామనామమత్యద్భుతం
గొబ్బున యే భాగ్యశాలికబ్బునో శ్రీరామ నామం

సారహీన సంసార సాగరమీదే నామం
పారద్రోలు మున్నూటరువది పాప జాలం
చేరి పంచేంద్రియములన్ని చేరక పోద్రోలు నామం
ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం రామ నామం

దిన దినమును జిహ్వకింపై తియ్యగనుండే నామం
ధన కనక వస్తువులు దయసేయు నామం
అనలు కొనలు నెక్కను శమాభివృద్ధి సేయు నామం
తనువును రెండనుచు మదిని తలపించు నామం

ముక్కంటి సతికి శాశ్వత ముక్తినిచ్చే రామ నామం
ఎక్కువైన వాల్మీకికి యెప్పుడనుష్థానం
ఒక్కసారి రామాయంటే ఓం భూ స్వాహా పాపములన్ని
మ్రొక్కి రెండుమారులంటే మోక్షమిచ్చే రామ నామం

దబ్బరాడు మన్మథుని దౌలనుంచు నామం
గొబ్బున మోహపాశముల కోసేటి నామం
మబ్బుదూది కొండవంటి మైబుట్టిన పాపములన్ని
అబ్బ మిణుగురువలె గాల్చునా రామ నామం

కామక్రోధలోభమోహ గర్వమడచే నామం
స్వామి భద్రాద్రీశుని తోడి సద్గతి నామం
నీమముతో పలికితేను నిత్యమోక్షపదవి నామం
రామదాసునేలినట్టి నామం శ్రీరామ నామం

అబ్బా! రామనామెంత అద్భుతమైనది! శీఘ్రముగ ఈ నామము అబ్బినవారు భాగ్యశాలురు. సారము లేని సంసార సాగరాన్ని దాటించేది, మూడువందల అరవై రకాల పాపములను పారద్రోలేది, పంచేంద్రియములకు అంటిన పాపములను పోగోట్టేది, భయానకమైన మృత్యుదూతలను తరిమి కొట్టేది ఈ రామ నామం. రోజురోజుకూ నాలుకకు మరింత తీయగా రుచించేది, సంపదలు, బంగారము, వస్తువులనొసగేది, కొండల శిఖరము వరకు ఎక్కేంతటి ఓర్పునిచ్చేది, దేహాన్ని మనసును పరమాత్మతో అనుసంధానం చేసేది రామ నామం. పార్వతీదేవికి శాశ్వతానందాన్నిచ్చేది, మహాత్ముడైన వాల్మీకికి నిత్యానుష్ఠానమైనది, ఒక్కసారి పలికితే పాపములన్నిటినీ దహించేది, నమస్కరించి రెండు మార్లు పలికితే మోక్షమిచ్చేది రామ నామం. మాయావి అయిన మన్మథుని ప్రభావాన్ని దూరం చేసేది (అనగా కామాన్ని అదుపులో ఉంచేది), వేగంగా మోహములు, భవబంధములనుండి ముక్తిని కలిగించేది, దూదికొండల వంటి శరీరములో పుట్టిన పాపములను మిణుగురు పురుగులా కనిపించేలా కాల్చేది రామనామం.కామక్రోధాధి అరిషడ్వర్గములను, గర్వమును అణచేది, భద్రాద్రీశ్వరుడైన రామునితో కూడి ఉండి సద్గతినొసగేది, నియమముతో పలికితే నిత్యము మోక్షపదవినిచ్చేది, భద్రాచల రామదాసును కాపాడినది శ్రీరామ నామం.

ధన్యాసి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఉన్నికృష్ణన్ గారు ఆలపించారు

కంటి నేడు మా రాముల - భద్రాచల రామదాసు కీర్తన

కంటి నేడు మా రాముల కనుగొంటి నేడు మా రాముల

కంటి నేడు భక్త గణముల బ్రోచు మా
ఇంటి వేలుపు భద్రగిరినున్న వాని

చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువు తీరిన మా కోదండరాముని

తరణికుల తిలకుని ఘననీలగాత్రుని
కరుణారసము గురియు కనుదోయి గలవాని

హురుముంజి ముత్యాల సరములు మెరయగ
మురిపెంపు చిరునవ్వు మోము గల్గినవాని

కరకు బంగారు చేల కాంతి జగములు గప్ప
శర చాపములు కేల ధరియించు స్వామిని

ధరణిపై శ్రీరామదాసునేలెడి వాని
పరమపురుషుడైన భద్రగిరి స్వామిని

మా రాముని నేడు కనుగొని కాంచినాను. భక్త సమూహములను బ్రోచే మా యిలవేలుపైన వాని, భద్రగిరిపైన వెలసిన శ్రీరాముని నేడు కాంచినాను. సీతాసమేతుడై ఎంతో అందముగా కొలువైయున్న కోదండరాముని నేడి కాంచినాను. సూర్యవంశతిలకుడు, నీలమేఘశ్యాముడు, కరుణారసమును కురిపించే కన్నులు కల శ్రీరాముని నేడు కాంచినాను. ఎర్రని కాంతి గల మేలైన ముత్యాల హారములతో మెరయుచు, మురిపించే చిరునవ్వు ముఖము కల శ్రీరాముని నేడు కాంచినాను. కరుకైన బంగారు వస్త్రముల కాంతి లోకాలను కప్పగా, ధనుర్బాణములు చేత ధరించిన స్వామిని నేడు కాంచినాను. ఈ భూమిపై రామదాసును బ్రోచేవాడు, పరమపురుషుడైన భద్రాద్రి రాముని నేడు కాంచినాను.

బౌళి రాగంలో కూర్చబడిన ఈ కృతిని శేషులత బృందం ఆలపించారు

ఇతడేనా ఈ లోకములో- భద్రాచల రామదాసు కృతి


 ఇతడేనా ఈ లోకములో గల పతితులనెల్లను పావనము చేయువాడు

పరిపూర్ణ కరుణచే బ్రహ్మాదుల గాచిన నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు

ఇల లంకాపురమున అవనిజను బ్రోవ బలుడైన రావణుని పరిమార్చిన వాడు

అలనాడు ద్రౌపదికి అక్షయ వలువలు వలనొప్ప వొసగిన వైకుంఠ వాసుడు

ఈవేళ మునివరులు ఇతర చింతలు మాని కేవలము మది నుంచి కొలువుగాచెడి వాడు

ప్రేమను దయతోనాపన్నుల బ్రోచుచు రామదాసునేలు రామచంద్ర విభుడు

ఈ లోకములో ఉన్న పాపాత్ములను పావనము చేసేవాడు ఇతడేనా! పరిపూర్ణమైన కరుణతో బ్రహ్మాది దేవతలను కాపాడుటకు నరసింహావతారమునెత్తిన కలువల వంటి కన్నులు కలవాడు ఇతడే. ఈ భువిపై లంకానగరములో భూమిజయైన సీతను కాపాడుటకు బలవంతుడైన రావణుని సంహరించినవాడు ఇతదే. ఆనాడు ద్రౌపది మానరక్షణకై అక్షయముగా చీరలు ఎంతో ఒప్పుగా ఒసగిన వైకుంఠవాసుడితడే. ఈనాడు మునిశ్రేష్ఠులు ఇతర ఆలోచనలు మాని మనసులో నిలుపుకుని కొలిచెడి వాడు ఇతడే. ప్రేమతో దయతో ఆపన్నులను బ్రోచుచు రామదాసును కాపాడే రామచంద్ర ప్రభువు ఇతడే.

శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది - భద్రాచల రామదాసు కృతి



శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది
శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది

ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము
జేరకుండ ఆపదలను చెండేనన్నది

దారి తెలియని యమదూతల తరిమేనన్నది శ్రీమ
న్నారాయణ దాసులకు చెలువై యున్నది

మాయావాదుల పొందు మానుమన్నది యీ
కాయమస్థిరమని తలపోయుచున్నది

వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది నా
మదిలో హరి భజన సంపత్కరమై యున్నది

ముక్తి మార్గమునకిది మూలమన్నది వి
రక్తుడు భద్రాచల రామదాసుడన్నది

శ్రీరాముని నామమే నా నాలిక యందు స్థిరమైయున్నది. శ్రీరాముని కరుణయే నాకు సమస్త శుభకరమై యున్నది. ఆ రామనామమే ఘోరమైన పాపములను హరించేది, ఆపదలను దరి చేరనీయకుండా పారద్రోలేది, దారి తెలియకుండా ఉన్న యమదూతలను దరికి రానీయకుండా చేసేది, శ్రీహరి దాసులకు మహత్వమై యున్నది, మాయలలో మునిగితేలే వారి సాంగత్యము మానమని చెప్పేది, ఈ దేహము అస్థిరమని తెలియజేసేది, మనలను వదలని చెడు విషయాల పట్ల కోరికను వదలమని చెప్పేది, నా మనసులో హరిభజన రూపములో శ్రేయస్కరమై యున్నది, మోక్షమార్గానికి ఇది మూలమైనది, భద్రాచల రామదాసు అనురాగము లేని వాడని తెలిపేది.

అఠాణా రాగంలో కూర్చబడిన ఈ కృతిని మల్లాది సోదరులు మరియు బృందం ఆలపించారు.

దశావతార కృతులు - భద్రాచల రామదాసు కీర్తన

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలిగి అధర్మం పేత్రేగుతుందో, అప్పుడు నేను అవతరిస్తాను. దుష్టులను నాశనం చేసి సాధువులను రక్షించటం ద్వారా ధర్మ సంస్థాపన చేయుటకు ప్రతి యుగములోనూ నేను అవతరిస్తాను.

- శ్రీకృష్ణ భగవానుడు భగవ్దగీత నాలుగవ అధ్యాయం జ్ఞానయోగంలో.

ఈ కర్మభూమిపై జన్మించిన వాగ్గేయకారులు కొంతమంది శ్రీహరి దశావతారాలను ఆవిష్కరించే కృతులను రచించారు. వారిలో అన్నమాచార్యులు ప్రముఖులు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి అవతారములను ఎన్నో కీర్తనలలో ఆయన నుతించారు. అదే విధంగా ఇతర దీక్షితుల వారు, భద్రాచల రామదాసు, స్వాతి తిరునాళ్ మొదలైన వారు ఇటువంటి సాహిత్యాన్ని మనకు అందించారు. కంచెర్ల గోపన్నగా జన్మించిన వాగ్గేయకారులు రామదాసు గారు రచించిన అటువంటిదే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనే కృతి. రామదాసు కృతుల ప్రత్యేకత భజన సాంప్రదాయంలో ఉండటం. పల్లెలలో, వీథులలో, భజన బృందాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చక్కగా అందరూ పాడుకునే విధంగా ఉంటాయి. తక్కువేమి మనకు అనే కీర్తన ఆ కోవకు చెందినదే. భద్రాచల రామదాసు కీర్తనలను బాలమురళీకృష్ణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మల్లాది సోదరులు మొదలైన సంగీత కళాకారులు ప్రచారంలోకి తీసుకు వచ్చారు. బాలమురళీకృష్ణ గారు ఓ నాలుగు దశాబ్దాల క్రితం పాడిన భద్రాచల రామదాసు కీర్తనలు అనే ఆల్బం ద్వారా ఈ కృతి తెలుగునాట బహుళ ప్రాచుర్యం పొందింది. అవతారాలను ప్రస్తావిస్తూ ఆ పరమాత్మ మన ప్రక్కనే యుండగా మనకింకేమి తక్కువ అన్న భావాన్ని రామదాసు ఈ కీర్తన ద్వారా అద్భుతంగా వ్యక్త పరచారు. మనకు కావలసినది ఆ శ్రీమనారాయణుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసము, సర్వస్య శరణాగతితో కూడిన భక్తి. మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నది రామదాసు అంతరార్థం. బాలమురళి గారు అన్ని చరణాలను పాడలేదు, అయినా వారు ఆలపించినదే మధురంగా ఉంటుంది. విని ఆనందించండి.

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనె యుండగ

మ్రుచ్చు సోమకుని మును జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షమునుండగ

సురల కొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృప మనకుండగ

దురాత్ముడా హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ

హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి పక్కనె యుండగ

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ

ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముడు మన పాలిటనుండగ

దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ

ఇలలో యదుకుల మందుదయించిన
బలరాముడు మన బలమై యుండగ

దుష్ట కంసుని ద్రుంచినట్టి
శ్రీకృష్ణుడు మనపై కృపతో యుండగ

కలియుగాంతమున కలిగెడి దైవము
కలికి మనలను కావగనుండగ

రామదాసుని గాచెడి
శ్రీమన్నారాయణు నెరనమ్మి యుండగ

శ్రీ సరస్వతి నమోస్తుతే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే

శ్రీపతి గౌరీపతి గురుగుహ వినుతే విధి యువతే

వాసనాత్రయ వివర్జిత వర ముని భావిత మూర్తే
వాసవాద్యఖిల నిర్జర వర వితరణ బహు కీర్తే దర
హాసయుత ముఖాంబురుహే అద్భుత చరణాంబురుహే
సంసార భీత్యాపహే సకల మంత్రాక్షర గుహే

ఓ సరస్వతీ దేవీ! వరములనొసగే పరదేవతవు, విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యునిచే నుతించబడేవు, బ్రహ్మకు పత్నివి, నీకు నమస్సులు. లోకవాసన, దేహవాసన, శాస్త్ర వాసనలను వర్జించిన మునిశ్రేష్ఠులచే భావించబడిన రూపానివి, ఇంద్రాది దేవతలచే ఉదారముగా వరములొసగే దేవతగా అనేక విధాల కీర్తించబడినావు, చిరునవ్వుతో కూడిన ముఖకమలము, అద్భుతమైన చరణకమలములు కలిగినదానవు, సంసార భీతులను తొలగించే తల్లివి, సకల మంత్రాక్షరముల రహస్యము నీవు, నీకు నమస్సులు.

ఆరభి రాగంలో కూర్చబడిన ఈ కృతిని సుధా రఘునాథన్ గారు ఆలపించారు


భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవిత విశేషాలు

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆధునిక భారతదేశంలో ఆధ్యాత్మిక సందేశాన్ని విద్య, వైద్యం, తాగునీరు, సేవా కార్యక్రమాలతో ముడిపెట్టిన మహనీయులు. ఆయన 1926...