13, మార్చి 2016, ఆదివారం

అసమాన సాహస మహిళ నీరజ భనోత్


మానవత్వం కోసం, తన ధర్మం కోసం ప్రాణాలొడ్డి పోరాడి వందలాది మంది ప్రాణాలు కాపాడిన వీర వనిత, భరతజాతి గర్వంతో చెప్పుకోగలిగిన ధీర నారి, ఊహించలేని సంక్లిష్టకరమైన సమయంలో సమయస్ఫూర్తి, తెగింపు, ఓర్పు చూపి విలువైన ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన త్యాగమూర్తి....ఇలా ఆమె కనబరచిన ధైర్య సాహసాలను ఎన్ని రీతుల చెప్పినా అవి తక్కువే. ఎవరని ఆలోచిస్తున్నారా? స్త్రీ శక్తిని, మానవ జన్మ లక్ష్యాన్ని తన అసమాన సాహసోపేతమైన చర్యలతో ప్రపంచానికి చాటిన మహిళ నీరజ భనోత్. తీవ్రవాదులతో పోరాడి విమాన ప్రయాణికులను కాపాడి తన ప్రాణాలను కోల్పోయిన ఈ అసమాన మహిళ వివరాలు తెలుసుకుందాం.

1963 సెప్టెంబర్ 7న పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్‌లో హరీష్ మరియు రమా భనోత్ దంపతులకు నీరజ జన్మించింది. అప్పటికే అఖిల్ మరియు అనీష్ అనే ఇద్దరబ్బాయిలు వారికి పుట్టారు. నీరజ చండీగఢ్‌లోని సేక్రెడ్  హార్ట్ స్కూల్, ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్‌లో చదివిన తరువాత అక్కడే సెయింట్ క్సేవియర్స్ కళాశాలలో చదువు పూర్తి చేసింది. తరువాత మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది. అప్పుడే పాన్ ఆం ఎయిర్లైన్స్ వాళ్లు ఫ్లైట్ అటెండెంట్స్ పోస్టులకు పత్రికలలో ప్రకటన చేస్తే నీరజ అప్ప్లై చేసి అమెరికాలోని మయామీలో శిక్షణ పొందింది. ఆమె ప్రతిభకు మెచ్చి ఆ సంస్థ వాళ్లు ఆమెను ఛీఫ్ ఫ్లైట్ అటెండెంట్‌గా నియమించారు.

1986వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన పాన్ ఆం 73 విమానం 361 మంది ప్రయాణికులు 19 మంది సిబ్బందితో ముంబై నుండి కరాచీ మరియు ఫ్రాంక్‌ఫర్ట్ మీదుగా న్యూయార్కుకు బయలు దేరింది. ముంబై నుండి కరాచీ విమానాశ్రయం చేరుకున్న విమానాన్ని నలుగురు అబు నిదల్ సంస్థకు చెందిన తీవ్రవాదులు హైజాక్ చేశారు. దానిని సైప్రస్ మళ్లించాలని అనుకున్నారు. ప్రయాణికుల విడులకు బదులుగా తమ సంస్థకు చెందిన ఖైదీలను విడుదల చేయాలని వారి డిమాండ్లు.

నీరజ సమయస్ఫూర్తితో కాక్‌పిట్‌లో ఉన్న పైలట్లకు హైజాక్ గురించి తెలియజేసింది. విమానం ఇంకా రన్‌వే మీదనే ఉండటంతో పైలట్లు కాక్‌పిట్ నుండి సురక్షితంగా బయట పడ్డారు. దీనితో విమానాన్ని నడిపే పరిస్థితిని నీరజ వలన తప్పింది. కానీ, విమానంలో ఉన్న మిగిలిన ఉద్యోగులలో నీరజే సీనియర్ కావటంతో భారమంతా ఆమెపై పడింది. ఆ తీవ్రవాదులు తమ డిమాండ్లకై అమెరికా ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావటానికి నీరజను విమానంలో ఉన్న అమెరికన్ పౌరసత్వమున్న ప్రయాణికుల పాస్‌పోర్టులన్నీ సేకరించమని చెప్పారు. నీరజ చాలా తెలివిగా అమెరికన్ పాస్‌పోర్టులన్నీ సీట్ల కింద కొన్ని, చెత్త బుట్టలో కొన్ని దాచమని సిబ్బందిని నిర్దేశించింది. తాను కూడా అదే చేసింది. మొత్తం మీద 41 మంది అమెరికన్ ప్రయాణీకులు ఉన్నా నీరజ కనబరచిన సమయ స్ఫూర్తితో తీవ్రవాదులు వారిని వేరు చేయలేకపోయారు.

17 గంటలు దాటినా విమానం నడిపించటానికి విమానాశ్ర్య అధికారులు పైలట్లను పంపక పోవడంతో తీవ్రవాదులు పేలుడు పదార్థాలు, గన్లను ఉపయోఇంచటం మొదలు పెట్టారు. వారి వద్ద ఇక ఆయుధాలలో తూట్లు, పేలుడు పదార్థాల నిల్వలు నిండుకున్నాయి. అప్పుడు, ప్రాణాలకు తెగించి నీరజ ప్రయాణికుల సాయంతో ఎమెర్జెన్సీ డోర్లు తెరుస్తుంది. తన ప్రాణాలను కాపాడుకోవటానికి తాను ముందు దూకవచ్చు, కానీ ముగ్గురు చిన్నపిల్లలను ఆ తీవ్రవాదుల కాల్పులనుండి రక్షించటానికి వారితోనే ఉంటుంది. తీవ్రవాదుల కాల్పుల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు మరణించారు. అందులో 12 మంది భారతీయులు ఇద్దరు అమెరికన్లు మిగిలిన వారు పాకీస్తాన్, యూకే మరియు మెక్సికోకు చెందినవారు. మిగిలిన 340 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి నీరజ తన ప్రాణాలను కోల్పోయింది. పసిపిల్లల కోసం, తోటి ప్రయాణికుల కోసం సాహసోపేతంగా పోరాడి వీరమరణం పొందింది. పాకిస్తానీ సైన్యానికి చెందిన స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుకు చెందిన సైనికులు ఆ తీవ్రవాదులను చెరబట్టారు.

అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన నీరజకు భారత ప్రభుత్వం 1987లో మరణానంతరం ఆశోకచక్ర అవార్డును ప్రకటించింది. నీరజ తల్లి రమ అప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే నాడు ఆ అవార్డును స్వీకరించింది. అటు తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు తంఘా-ఎ-ఇన్సానియత్ అవార్డును, అమెరికా ప్రభుత్వం జస్టిస్ ఫర్ క్రైంస్ మరియు  స్పెషల్ కరేజ్ అవార్డును ప్రదానం చేసింది. 2004వ సంవత్సరంలో భారత తపాలా శాఖ ఆమె సంస్మరణార్థం ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుల చేసింది.


నీరజ తల్లిదండ్రులు ఆమె మరణాంతరం జీవిత భీమాతో వచ్చిన డబ్బుతో నీరజ భనోత్ -పాన్ ఆం అనే ట్రస్ట్ ఏర్పాటు చేశారు. విమానయానంలో డ్యూటీని మించి సేవాదృక్పథాన్ని కనబరచే వారికి ఒక అవార్డును, వరకట్నం వంటి సామాజిక అంశాలపై పోరాడే వారికి నీరజ భనోత్ అవార్డును ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. ఈ రెండవ అవార్డుకు కూడా కారణం ఉంది. నీరజకు 1985లో గల్ఫ్‌లో ఉన్న ఒక వ్యక్తితో వివాహమైంది. కానీ, వరకట్న వేధింపులతో రెండు నెలలకే నీరజ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చి తన కెరీర్‌పై దృష్టి పెట్టింది. ఆ దురాచారానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు ఈ అవార్డును ఇస్తున్నారు. నీరజ కాపాడిన పిల్లలలో ఒకరు ఇప్పుడు పైలట్. ఇది నీరజ చేసిన సాహసానికి ఉత్తమమైన సాఫల్యము మరియు సార్థకత.

నీరజ తండ్రి హరీష్ 2007లో, తల్లి రమ 2015 డిసెంబరులో మరణించారు. ఇటీవలే నీరజ సాహస చరిత్రను తెరకెక్కించారు.  సోనం కపూర్ నీరజగా నటించింది. ప్రఖ్యాత నటి షబనా అజ్మీ నీరజ తల్లి రమగా నటించారు. నీరజ సోదరులు అఖిల్ మరియు అనీష్ ఈ చిత్రాన్ని చూసి ఎంతో సంతోషించారు. వాస్తవాన్ని యథాతథంగా తీసినందుకు నిర్మాతను, దర్శకుడిని అభినందించారు. ఈ చిత్రం ప్రతి మహిళ, ప్రతి బాలిక చూడవలసినది. ఆడది అబల కాదు అని మరో సారి చాటి చెప్పిన నీరజ సాహస గాథ తరతరాల పాటు మార్గదర్శకం. ఆమె కథను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశాలలో చేర్చి దేశ పౌరులను మరింత సాహసవంతులుగా, దేశభక్తులుగా, మానవత్వంతో నిండిన మనుషులుగా తీర్చిదిద్దటానికి తోడ్పడాలి.

1 కామెంట్‌: