11, మార్చి 2016, శుక్రవారం

పాత్రం, అపాత్రం - యోగ్యం, అయోగ్యం


దాత, గ్రహీత ఇద్దరూ అయోగ్యులైతే ఎన్నో చిక్కులు - సహాయం పొందిన వాడికి, చేసినవాడికి ఆ సహాయం యొక్క విలువ ఒకటిగా ఉండదు, ఒకరిపై ఒకరికి అభిప్రాయాలూ అంత గొప్పగా కూడా ఉండవు. చేసినవాడికి గోరంత కొండంతైతే పొందిన వాడికి కొండంత గోరంత అవుతుంది. ఊరికే చేయలేదు అని పొందిన వాడనుకుంటే, పొందిన వాడు కృతఘ్నుడు అని చేసినవాడనుకుంటాడు. ఒక్కసారి సాయం చేస్తే జీవితాంతం దాసోహం కావాలా అని పొందిన వాడు అనుకుంటే నేను చేయకపోతే వాడి బతుకు బస్‌స్టాండే అనుకుంటాడు చేసిన వాడు. నేను చేశాను కాబట్టి నేను మహనీయుడిని అని చేసినవాడు భావిస్తే అది ఆయన ప్రతిఫలాపేక్షతో చేశాడు అని పొందినవాడనుకుంటాడు. చూశారా? మంచి కోసం జరగాల్సిన కర్మలో ఎన్ని వికృతాలో? వీటన్నిటిలో మనిషి చాలా సార్లు మరచిపోయే విషయం - ఇవ్వటం ఉపకారం కాదు, అది మానవ జన్మ ఎత్తినందుకు ఒక కనీస ధర్మం. ఈ విశ్వంలో ఎక్కువ నుండి తక్కువకు, తక్కువ నుండి ఎక్కువకు నిరంతరం బదిలీ జరుగుతూ ఉండాల్సిందే. లేకపోతే విశ్వ పరిణామమే ఆగిపోతుంది. అది ఆలోచన కావచ్చు, ధనం, వస్తువు, బంగారం, వాహనం, ఏదైనా కావచ్చు. అందుకే చాలా సార్లు మేము జీవితమంతా ఇతరులకు మంచే చేశాము అనుకునే వాళ్లకు కూడా చెప్పుకోలేని కష్టాలు, బాధలు, వ్యాథలు. చేసినవారి మనసులు బరువులు, పొందిన వారి మనసులు చీడ పురుగులు...అందుకే పాత్రం, అపాత్రం అనే విచక్షణ ఉపయోగించకపోతే, యోగ్యం, అయోగ్యం అన్నది ఆలోచించకపోతే ఇద్దరికీ మిగిలేది పాపమే. మరి కావలసింది ఏమిటి?

1. సాయం చేసేటప్పుడు యోగ్యునికి, పాత్రమైనది చేయటం
2. ఫలాపేక్ష లేకుండా ఉండటం
3. సాయం పొందినందుకు భగవంతునికి కృతజ్ఞత తెలుపటం, మరొకరికి ఫలాపేక్ష లేకుండా చేయటం.
4. భగవంతుడంటే రాయో, ఆకాశమో, నేలో కాదు. యోగ్యమైనది ఏదైనా భగవంతుడే. కాబట్టి యోగ్యుడైన మానవుడు భగవంతుడే.
5. మనం చేసేది భగవంతుని కోసం అన్న భావన. అన్నీ చెందినవానికి, అన్నీ తానైన వానికి తిరిగి ఇవ్వటం లెక్క పెట్టకూడదు కదా? ఇది అదే.

మంచి జరిగిన తరువాత నకారాత్మకమైన ఆలోచనలు వచ్చి దగ్గర కావలసిన మనుషులు దూరమెందుకు అవుతున్నరు అని మీరు ఆలోచిస్తే చాలా సార్లు అపాత్రము, అయోగ్యత మరియు ప్రతిఫలాపేక్షే కారణాలు. ఇది బయట వాళ్లతోనే కాదు, రక్తసంబంధీకుల మధ్య కూడా ఉంటుంది. అందుకే కుటుంబాలు విడిపోతాయి. ఎప్పుడైతే ఈ మూడు కారణాలు రంగంలో ఉంటాయో అప్పుడు అసలు లక్ష్యం, అసలు ధర్మం పక్కకు నెట్టబడుతుంది. అందుకే సనాతన ధర్మం ఫలాపేక్షకు, అపాత్రమునకు పాప ప్రమాణము నిర్ణయించింది.

కలియుగంలో అధర్మం పాళ్లు, తద్వారా మనుషులలో అయోగ్యం, అపాత్రము పాళ్లు, ప్రతిఫలాపేక్ష ఎక్కువ ఉంటాయి కాబట్టి నిజాయితీతో సాయం చేయదలచుకుంటే పాత్రమును బాగా నిశింతంగా పరిశీలించి, ఫలాపేక్షలేకుండా చేయాలి. అప్పుడు పాప సంచయము మనకు రాదు. ఈ విచక్షణ చేయాలంటే మంచి-చెడు, ధర్మం-అధర్మం వివరాలు బాగా తెలియాలి. మనస్తత్త్వం అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి. వీటన్నిటికీ అంతర్ముఖమైన సాధన ఉండాలి. ఆచరంచి మరింత ముందుకు వెళ్లగలిగే ఓర్పు సహనం ఉండాలి. మొత్తం మీద శుద్ధమైన అంతఃకరణం ఉంటే ఈ పాత్రము-అపాత్రము విచక్షణ చేసే శక్తి వస్తుంది. మన పురాణ ఇతిహాసాలు, యోగుల చరిత్రలు, వారి రచనలు కూడా చాల ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి, కాలగమనం యొక్క పరీక్షలను తట్టుకొని ఎప్పటికీ సముచితంగా ఉండేలా రూపొందించబడినవి. ధర్మాధర్మ విచక్షణ నుండి పాత్రాపాత్ర విచక్షణ కలుగుతుంది. అప్పుడు అయోగ్యములైన వాటిని వీలైనంత త్వరగ మనకు దూరం చేసుకునే శక్తి కలుగుతుంది. యోగ్యములైన వాటిమీదే ధ్యాస ఉండి యత్నం సఫలమవుతుంది. కర్మ సాఫల్యం పొందుంతుంది. చేసే కర్మలు సఫలమైతే పాప పుణ్య సంచయం పటాపంచలై అకర్మ వైపు మనలను తీసుకువెళుతుంది.

ఇదం శరీరం ఖలు ధర్మ సాధనం. ఎంతో దుర్లభమైన మానవ శరీరాన్ని ఇతరులకు సాయపడేలా ఉపయోగించితేనే మానవ జన్మ సార్థకము. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి