24, జనవరి 2011, సోమవారం

త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు - ఘన రాగ పంచ రత్న కీర్తన - కన కన రుచిరా

శ్రీ రఘురామ చారు తులసీ దళదామ శమక్షమాది శృం
గార  గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో 
త్తారక నామ భద్ర గిరి దాశరథీ! కరుణా పయోనిధీ!

భద్రాచల రామదాసు ఈవిధముగా వంద శ్లోకములతో దాశరథి శతకము రచించి ఆ భద్రాద్రి రాముని నుతించాడు. అదే విధముగా, పంచరత్న కీర్తనలలో నాలుగవది అయిన కన కన రుచిరా పూర్తిగా శ్రీహరి అవతారమైన శ్రీరాముని గుణ రూప మహిమా వర్ణనలో సాగుతుంది. వరాళి రాగం ఆది తాళంలో కృతి చేయబడినది.


సాహిత్యం:

కన కన రుచిరా కనక వసన నిన్ను

దిన దినమున మనసున చనువున నిన్ను (కన)

పాలుగారు మోమున శ్రీయపార మహిమ దనరు నిన్ను (కన)

కళకళమను ముఖకళ గలిగిన సీత కులుకుచు నోర కన్నులను జూచే నిన్ను (కన)

బాలార్కాభ సుచేల మణిమయ మాలాలంకృత కంధర
సరసిజాక్ష వరకపోల సురుచిర కిరీటధర సంతతంబు మనసారగ (కన)

సాపత్ని మాతయౌ సురుచిచే కర్ణ శూలమైన మాట వీనుల
జురుక్కన తాళక శ్రీ హరిని ధ్యానించి సుఖింపగ లేదా అటు (కన)

మృగమదలలామ శుభనిటల వర జటాయు మోక్ష ఫలద
పవమానసుతుడు నీదు మహిమ దెల్ప సీత దెలిసి వలచి సొక్కలేదా ఆరీతి నిన్ను (కన)

సుఖాస్పద విముఖాంబుధర పవన విదేహ మానస
విహారా ఆప్తసురభూజ మానిత గుణాంగ చిదానంద!
ఖగ తురంగ ధృత రథాంగ పరమ దయాకర
కరుణారస వరుణాలయ భయాపహరా శ్రీ రఘుపతే (కన)

కామించి ప్రేమమీర కరముల నీదు పాద కమలముల
బట్టుకొను వాడు సాక్షి, రామనామ రసికుడు, కైలాస
సదనుడు సాక్షి మరియు నారద పరాశర శుక శౌనక
పురందర నగజా ధరజ ముఖ్యులు సాక్షి గాదా
సుందరేశ సుఖ కలశాంబుధి వాసాఽశ్రితులకే (కన)

సతతము ప్రేమ పూరితుడగు త్యాగరాజనుత ముఖజిత కుముదహిత వరద నిన్ను (కన)

అర్థము:



బంగారు వస్త్రములు (పీతాంబరములు) ధరించిన ఓ రామా! నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి. నీ యందము ప్రతి దినము నీ యందు గల చనువుతో ఎంత చూసినాను తనివి తీరదు.పాలు గారు మోము గల, అపారమైన మహిమ కలిగిన నీ మోము ఎంత చూస్తే అంత రుచి.కళ కళలాడు సుందరమైన ముఖ కళ కలిగిన సీతా దేవి నిన్ను వాలు చూపుల చూసినప్పుడు నీ సౌందర్యం ఎంత చూస్తే అంత రుచి. ఉదయ సూర్యుని ప్రకాశము కలిగి, పట్టు వస్త్రములు ధరించి, మణులతో పొదిగిన హారములు ధరించి, కమలముల వంటి కన్నులు, అందమైన బుగ్గలు కల, మెరిసే కిరీటమును ధరించిన శ్రీరామా! నిను సంతోషముతో మనసారా ఎంత చూస్తే అంత రుచి. ఉత్తానపాదుడి రెండవ భార్యయైన సురుచి తన సవతి కుమారుడైన ధ్రువుడు తన తండ్రి తొడపై కూర్చొని నందుకు 'నీకు ఆ అర్హత లేదు' అని దుర్భాష లాడెను. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని గూర్చి తపస్సు చేసెను. ఆ తపస్సుకు మెచ్చి నీవు శాశ్వతమైన ధ్రువ పదమును ప్రసాదించితివి. ఆ నీ శ్రీ హరి సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. ఓ శ్రీ రామా! నీవు శుభప్రదమైన నుదురుపై కస్తూరి తిలకము ధరించి యున్నావు. రావణుని చేతిలో హతుడైన జటాయువుకు మోక్షము ప్రసాదించినావు. హనుమంతుడు దూతయై లంకకు వెళ్లి నీ మహిమను సీతకు తెలపగా, ఆమె అది తెలుసుకొని, ప్రేమతో బాధ పడెను. ఆ విధముగా నిన్ను ఎంత చూస్తే అంత రుచి. ఓ రామా! సౌఖ్యములకు నిలయమా! రాక్షసులను హతమార్చిన వాడా! సీతాదేవి మనసునందు విహరించే వాడా! భూసురులైన బ్రాహ్మణులకు ఆప్తుడా! సాటిలేని సౌందర్యము, సుగుణములు కలవాడా! చిదానంద స్వరూపా! గరుత్మంతుని వాహనముగా కలవాడా! చక్రమును ధరించిన వాడా! పరమ దయాకరా! కరుణా రసమును వర్షించే మేఘము వలె కురిపించే వాడా! భయమును పోగొట్టే వాడా! రఘు వంశములో శ్రేష్ఠుడా! నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. నీపై భక్తి ప్రపత్తులతో బ్రహ్మానందము పొంద వచ్చును అనుటకు భక్తితో నీ పాదములు పట్టుకున్న హనుమంతుడు సాక్షి, రామ నామాన్ని రమించే కైలాస వాసి శివుడు సాక్షి, నారద, పరాశర, శుక, శౌనక మహర్షులు సాక్షి, ఇంద్రుడు సాక్షి, పార్వతీ దేవి సాక్షి. నీ పత్ని సీతా దేవి సాక్షి. ఈ మహాభక్తులు, దేవ ఋషి సమూహము సాక్షి గాదా! ఓ సుందరేశా! ఆనందమనే సాగరములో నివసించే వాడా! నీ ఆశ్రితులకు నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి. అన్ని వేళల పరిపూర్ణమైన ప్రేమగల శంకరునిచే నుతించబడిన ఓ శ్రీరామా! చంద్రుని మించిన నీ ముఖ సౌందర్యమును, చూచుట, వరదుడవగు నిన్ను చూచుట, తనివితీరా ఆనందించుట భక్తుల అదృష్టము. నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి.

నీపై భక్తి ప్రపత్తులతో బ్రహ్మానందము పొంద వచ్చును అనుటకు భక్తితో నీ పాదములు పట్టుకున్న హనుమంతుడు సాక్షి, రామ నామాన్ని రమించే కైలాస వాసి శివుడు సాక్షి, నారద, పరాశర, శుక, శౌనక మహర్షులు సాక్షి, ఇంద్రుడు సాక్షి, పార్వతీ దేవి సాక్షి. నీ పత్ని సీతా దేవి సాక్షి. ఈ మహాభక్తులు, దేవ ఋషి సమూహము సాక్షి గాదా! ఓ సుందరేశా! ఆనందమనే సాగరములో నివసించే వాడా! నీ ఆశ్రితులకు నీ సౌందర్య రూపము ఎంత చూస్తే అంత రుచి.

అన్ని వేళల పరిపూర్ణమైన ప్రేమగల శంకరునిచే నుతించబడిన ఓ శ్రీరామా! చంద్రుని మించిన నీ ముఖ సౌందర్యమును, చూచుట, వరదుడవగు నిన్ను చూచుట, తనివితీరా ఆనందించుట భక్తుల అదృష్టము. నీ సౌందర్యము ఎంత చూస్తే అంత రుచి.


పరిశీలన: 


ఈ కీర్తన పూర్తిగా రాముని సాకారమును వర్ణనలా కనిపించినా ఆ శుద్ధ చైతన్య స్వరూపుని అగణిత గుణ గణములను, అపార కరుణా రసమును, దయావ్రుష్టిని, ఆశ్రిత జన వాత్సల్యమును ఉదాహరణలతో చెపుతుంది. ధ్రువుని చరిత ఒక చరణంలో ఎంతో అందముగా చెప్పారు త్యాగయ్య వారు. తన భక్తునికి శాశ్వతమైన ధ్రువ పదము ప్రసాదించిన ఆ శ్రీహరి వాత్సల్యము భాగవతములో పోతనగారు అద్భుతముగా వర్ణించారు. ఆ భక్త శిరోమణి ధ్రువుని ప్రస్తావించటం ఈ కీర్తన ద్వారా త్యాగయ్య వ్యక్తపరచిన సందేశానికి పతాకం.

తన భక్తుడైన జటాయువు రావణునితో వీరోచితముగా పోరాడి, కీలకైన ఆ రావణుని వృత్తాంతము రామునికి తెలిపే వరకు కోన ప్రాణములు నిలుపుకొని ఉంటాడు. రెక్కలు తెగి మరణ శయ్యపై ఉన్న ఆ జటాయువుపై రాముడు కరుణించి ఆ పక్షిరాజుకు మోక్షము ప్రసాదిస్తాడు. ఎంతటి అదృష్టము ఆ జటాయువుది?

సీతా మనోహరుడు అయిన శ్రీరాముడు ఆయన సీత కొరకు వెదుకుతూ దుఃఖిస్తూ అడవుల తిరుగుతుంటే ఆయన భక్తుడైన హనుమ ఆయన పాదములను ఆశ్రయించి సీతాదేవిని వేడుకు బృహద్కార్యమును స్వామి ఆశీర్వాదముతో చేపడతాడు. అనన్యసామాన్యమైన సాగర తారకాన్ని రాముని భక్తితో వాయువేగముతో పూర్తి చేసి అరి వీర భయంకరులైన రాక్షసులను ఎదిరిస్తాడు. ఆ సందర్భంలో రెండు మహత్తు గల శ్లోకాలను హనుమంతుని నోట మనకు వాల్మీకి మహాముని వినిపిస్తారు.

జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహా బలః 
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః 

దాసోహం కోసలేన్ద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః 
హనుమాన్ శత్రు సైన్యానం నిహంత మారుతాత్మజః 

ఆ రాముని పై భక్తి ఆ హనుమంతునికి కొండంత బలము ఇచ్చి ఆ రామ కార్యమును సాధించుటలో ముందుకు నడిపింది. ఆ కార్యములో భాగముగా ఆ హనుమంతుడు సీతామాతను చూచుటే గాక, మహా వీరులైన అక్ష కుమారుడు మొదలగు రావణ సంతతిని సంహరించి ఆ రాక్షస రాజుకు రాముని బల పరాక్రమాల రుచి చూపుతాడు. ఇక తరువాత శత్రు జన సంహారము, అరి వీర భయంకర రామ రావణ యుద్ధము. అట్టి మహత్తు కలది రామ భక్తి.

సీతామాత రాముని నుండి దూరము తాళలేక రావణుడు పెట్టే బాధలు భరించ లేక ప్రాణ త్యాగానికి సిద్ధమైనప్పుడు హనుమంతుడు వచ్చి ఆ రాముని మహిమను కీరిస్తాడు. ఆ మాట రామునితో తన గుర్తులను చెపుతూ కాకాసురుడు మొదలగు విషయాలను ప్రస్తావిస్తుంది. ఆ సందర్భముగా ఆమె చెప్పిన మాటలు రామునిపై ఆమెకు గల అవ్యాజమైన ప్రేమానురాగములకు నిదర్శనము. ఈ మొత్తాన్ని త్యాగయ్య వారు అందముగా ప్రస్తావించారు.

ఈ కీర్తన ద్వారా భక్త జన పరిపాలన, ధర్మ సంరక్షణ, దాసుల పాలిటి దయ, కరుణ, ధర్మ పత్ని పై ప్రేమ ఇలా ఎన్నో ఎన్నలేని గుణములకు నిలయమైన రాముని ఎంతో అందముగా నుతించారు త్యాగరాజు.

ఆ కోదండరాముని స్తుతులతో వేల కృతులు రచించి రామభక్తి సామ్రాజ్యములో తనకు శాశ్వత స్థానం ఏర్పరచు కున్నారు త్యాగ బ్రహ్మ. ఆ మహానుభావునికి మరొకమారు నీరాజనములు.

ఈ పంచరత్న కృతి బాలమురళీకృష్ణ గారి గళంలో వినండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి