25, జులై 2020, శనివారం

శృంగేరి శారదా పీఠం 12వ జగద్గురువులు విద్యారణ్య మహాస్వామి


అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా
విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం శ్రయే

అవిద్య (అజ్ఞానం) అనే అరణ్యంలో తిరుగాడే జీవికి ఎల్లప్పుడూ విద్యను ప్రసాదించి మార్గదర్శకులైన విద్యారణ్య గురువులకు నమస్కరించుచున్నాను.

విద్యారణ్య మహాస్వామి - శృంగేరి శారదా పీఠం 12వ జగద్గురువులు. వీరు శంకర భగవద్పాదుల తరువాత దాదాపు 500 ఏళ్ల తరువాత జన్మించిన వారు. శంకరుల తరువాత భారతదేశంలో ఆధ్యాత్మికంగా మహోన్నత శిఖరాలకు తీసుకు వెళ్లి ప్రజలకు పాలకులకు మార్గదర్శకమై నిలిచారు. వీరే విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర బుక్కరాయలకు గురువులు. సామ్రాజ్యంలో ధర్మం నిలబడటానికి, పాలకులు ధర్మబద్ధులై ఉండటానికి విద్యారణ్యుల వారే కారకులు. వీరు శృంగేరి మరియు హంపీలలో క్షేత్రాలను నిర్మించి అభివృద్ధి చేశారు. శృంగేరిలోని విద్యాశంకర మరియు శారదాంబ దేవస్థానాలు వీరి పీఠాధిపత్యంలో నిర్మించినవే. వీరు రచించిన వేదాంత పంచదశీ మరియు జీవన్ముక్త వివేక భాష్యాలు అద్వైత పరంపరలో గురువులకు మార్గదర్శకమై నిలిచాయి. శృంగేరిలో ఉన్న శాసనాల ప్రకారం వీరు ఏకశిలా నగరంలో (ఓరుగల్లు/వరంగల్ ప్రాంతం) జన్మించిన వారు. దక్కన్ సుల్తానులను తరిమి హైందవం నిలపటానికి హరిహర బుక్కరాయలచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేశారు విద్యారణ్యులు.

విద్యారణ్యుల అసలు పేరు మాధవ. వీరి తమ్ముడు జ్ఞానం కోసం దేశ సంచారం చేస్తూ శృంగేరి చేరుకుని అక్కడి పీఠాధిపతి అయిన విద్యాశంకర భారతీస్వామి వారి కలుస్తాడు. స్వామి అతనిలోని జిజ్ఞాసకు సంతోషించి సన్యాసమిచ్చి భారతీకృష్ణ తీర్థగా నామకరణం చేశారు. తమ్మునికై వెదకుతూ మాధవుడు శృంగేరి చేరుకుని విద్యాశంకర భారతీస్వామి వారిని కలిసి అక్కడే ఉంటాడు. కొన్నాళ్లకు పీఠాధిపతులు అతనికి మాధవ సన్యాస దీక్షనిచ్చారు. శ్రీవిద్యారణ్యులుగా నామకరణం చేశారు. గురువుల ఆదేశంతో విద్యారణ్యులు కాశీ వెళ్లి విద్యాధ్యయనం చేశారు. తరువాత బదరిలో శ్రీవిద్యా ఉపాసన చేశారు. అక్కడి నుండి హంపీ సమీపంలో ఉన్న మతంగ పర్వతంపై తపస్సు చేస్తున్నప్పుడు మాధవ మరియు శాయన అనే ఇద్దరు సోదరులు వారి వద్దకు వస్తారు. వారిని ఆశీర్వదించి తాను వ్రాస్తున్న వేద భాష్యాలను పూర్తి చేయవలసిందిగా చెబుతారు. అవే తదుపరి కాలంలో మాధవీయం, శాయనీయంగా పేరొందాయి. వీరిద్దరు హరిహర బుక్కరాయల వద్ద మంత్రులుగా పనిచేశారు.

విద్యారణ్యులు పరాశర మాధవీయ, సర్వదర్శనసంగ్రహ, జైమినీయ న్యాయమాల, పరాశరస్మృతి వ్యాఖ్యాన, స్మృతి సంగ్రహ, వ్యవహార మాధవ, శ్రీ విద్యాతీర్థ దీపిక, వివరణప్రమేయ సంగ్రహ, దృక్ దృశ్య వివేక, అపరోక్షానుభూతి టీకా, ఆరు ఉపనిషద్దీపికలు అనే అద్భుతమైన రచనలు కూడా చేశారు. వీరి పంచదశీ నేటికి ప్రామాణికమే. వివేక, దీప, ఆనంద అనే మూడు భాగాలు కలిగిన ఈ భాష్యం ఆదిశంకరుల తత్త్వాన్ని విశదీకరించి ఆధ్యాత్మిక జ్యోతులు శాశ్వతమై వెలిగేలా చేసింది. అలాగే, వీరు మాధవీయ శంకరవిజయమనే గ్రంథాన్ని రచించారు. అది సంక్షిప్తంగా ఆదిశంకరుల జీవితచరిత్ర. మిమాంస సూత్రములపై కూడా భాష్యం రచించారు. వీరే మాధవాచార్యులుగా కూడా పేరొందారు.

విద్యారణ్యుల సోదరులు భారతీకృష్ణ తీర్థులు తొలుత శృంగేరి శారదాపీఠాధిపతిగా ఉండి సిద్ధి పొందిన తరువాత విద్యారణ్యులు పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. అనేక దేవాలయాలు వీరి హయాంలోనే నిర్మించబడ్డాయి. ఆధ్యాత్మికంగా ఆదిశంకరుల తరువాత హైందవం మహోన్నతమైన ప్రాభవం పొందింది విద్యారణ్యుల పీఠాధిపత్యంలోనే అని చెప్పవచ్చు. నేడు ఉన్న శ్రీచక్రార్చన విధి విధానం విద్యారణ్యుల వారి చలవే. అందుకు ఈ జాతి వారికి ఎంతో ఋణపడి ఉంది.

(శృంగేరి శారదా పీఠం వారి వెబ్ సైట్ నుండి)

శ్రుతులెందుకు? - చంద్రశేఖర భారతీస్వామి వారు


ధర్మానుష్ఠానమే ఉత్తమ ప్రమాణాలు గల జీవితానికి మార్గం. ఆ అనుష్ఠానానికి, మంచి చెడుల విచక్షణకు సూచికలు ఈ వాఙ్మయం. స్మృతులు, శ్రుతులలో ఉన్నవి దైవసంకల్పితమైనవి, ఈ విశ్వానికి మార్గదర్శకమైనవి. అనంతకోటి విలక్షణమైన జీవరాశులతో ఉన్న ఈ అద్భుత విశ్వాన్ని చూస్తే మనకొక విషయం అర్థం కావాలి - పరమాత్మ అత్యంత శక్తిమంతుడు, అన్నిటా ఉన్నవాడు. ఆయన విచక్షణ అత్యుత్తమమైనది, సత్యమైనది అన్న దానికి ఒక చిన్న కథ.

ఒక యాత్రికుడు ఒకసారి దారిపక్కనే ఉన్న మఱ్ఱిచెట్టు నీడన నిద్రపోవాలనుకుని విశ్రమించాడు. ఆ పెద్ద చెట్టు, దానికున్న చిన్న చిన్న పండ్లు చూసి ఇలా అనుకున్నాడు - "ఒక చిన్న తీగ ఎంత పెద్ద గుమ్మడి కాయలనిస్తుంది, ఇంత పెద్ద చెట్టు చిన్న చిన్న పండ్లనివ్వటమేమిటి? వృక్షము, ఫలాలు సరైన నిష్పత్తిలో ఉండాలి కదా. దేవుడు ఈ సృష్టిని మరింత బాగా చేసి ఉండవచ్చు" అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే నిద్రపోయాడు. నిద్రలేచి చూసే సరికి ఆ చిన్న చిన్న పండ్లు రాలి తన శరీరం అంతా కప్పబడి ఉండటం చూసి పరమాత్మ సృష్టిలోని అద్భుతాన్ని గ్రహించాడు. నీడనిచ్చి సేదతీర్చే మఱ్ఱిచెట్టు గనుక తన పరిమాణానికి తగ్గ పండ్లిస్తే తన లాగా నిద్రబోయే యాత్రికుల గతి ఏమిటి? తన అజ్ఞానానికి సిగ్గుపడి పరమాత్మకు ప్రణమిల్లాడు.

ఇలాగ, ఈ సృష్టిలో ఎన్నో విషయాలు మానవుని మేధస్సుకు అందనివి, మంచి చెడు అనేవి మనం నిర్ణయించినంత తేలిగ్గా చెప్పబడేవి కావు. అటువంటి విచక్షణ చేసుకోవటానికి మార్గదర్శకానికే మనకు ఈ వాఙ్మయం అవసరం.

-శృంగేరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి వారు (1892-1954)

నాద తనుమనిశం శంకరం - త్యాగరాజస్వామి


నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా

మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం

సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమపదని వర సప్తస్వర
విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం

ప్రణవ నాదమునే తనువుగా గల ఓ శంకరా! నీకు ఎల్లప్పుడూ మనసా శిరసా నమస్కరించుచున్నాను. ఆనందకరమైన వేదములలో శ్రేష్ఠమైన సామవేద సారమైన సంగీతమునకు ఆత్మయైన శంకరా నీకు మరల మరల నమస్కరించుచున్నాను. సద్యోజాత వామదేవ ఈశాన తత్పురుష అఘోర ముఖములనుండి సాంబ పార్వతీ హృదయములనుండి వెలువడిన సప్తస్వరముల సారమైన సంగీత విద్యకు నీవులు లోలుడవు, యముని జయించినవాడవు, సాధు హృదయుడైన త్యాగరాజుని పాలించేవాడవు నీవు. నీకు ఎల్లప్పుడూ మనసా శిరసా నమస్కరించుచున్నాను.

(సాంబుని హృదయము నుండి షడ్జమము (స), శివుని తత్పురుష ముఖము నుండి రిషభము (రి), అఘోర ముఖము నుండి గాంధారము (గ), వామదేవ ముఖము నుండి మధ్యమము (మ), గౌరి హృదయము నుండి పంచమము (ప), శివుని సద్యోజాత ముఖము నుండి దైవతము (ద), ఈశాన ముఖము నుంది నిషాదము (ని) వెలువడినట్లు వేదోక్తము)

పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో - - భద్రాచల రామదాసు


పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో

ఇందిరా హృదయారవిందాధిరూఢ
సుందరాకారనానంద రామప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద రామప్రభో

బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్శితానంద రామప్రభో
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో

నీదు బాణంబులను నాదు శతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో

శ్రీరామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారెకును వింతగా చదువు రామప్రభో
శ్రీరామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో

కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో

పాహి శ్రీరామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైల రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో

ఓ భద్రాద్రి సీతారామచంద్ర ప్రభో! పాహి పాహి! లక్ష్మీదేవి హృదయమునకు అధిష్ఠానమై, సుందరాకారుడవైన ఆనందారామా! పాహి పాహి. ఏ సుందర రూపము కాంచినంత కన్నులకు అమితమైన ఆనందము కలుగునో ఆ రూపమును కలిగిన శ్రీరామా! పాహి పాహి. దేవతలు మొదలైన బృదములు పూజించే పాదారవిందములు కలిగి, సందర్శించే వారికి ఆనందము కలిగించే రామచంద్రప్రభో! మా తల్లి దండ్రి దాత మరియు సోదరుడవు నీవే రామచంద్ర ప్రభో! పాహి పాహి. నీ బాణములచేత మా శతృవులైన అరిషడ్వర్గములను పట్టి బాధించుకుండా యున్నావేమి రామ ప్రభో! ఆది, మధ్య, అంత్యము, బాహ్యము, అంతరాత్మ అన్నీ నీవే అని వాదించుచున్నాను రామచంద్రప్రభో! పాహి పాహి. శ్రీరామ రామ అనే శ్రేష్టమైన మంత్రమును మాటిమాటికి చదువుతున్నాము రామచంద్ర ప్రభో. ఓ శ్రీరామచంద్రా! నీ నామస్మరణ అనే అమృతమును పానము యొక్క సారమే నా మనసు కోరుచున్నది, పాహి పాహి. అందమైన రూపముతో ఈ కలియుగములో భద్రగిరిపై వెలసినావు రాంచంద్ర ప్రభో! నాశనములేని నీ అవతారముల వలన మునులందరూ దివ్యత్వమును పొందినారు, రామచంద్రప్రభో పాహి పాహి. ఓ శ్రీరామా! నీ పాదపద్మములను ఆశ్రయించినవారిని పాలింపుము,ఓ భద్రాద్రి సీతారామచంద్ర ప్రభో! పాహి పాహి!

ధర్మం - ఎందుకు?


ఆహార నిద్రా భయం మైథునం చ సమానమేతత్ పశుభిర్నరాణాం
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిస్సమానాః

ఆహారము, నిద్ర, భయము, దేహవాంఛలు పశువులకు, మానవులకు సమానమే. ధర్మాచరణ మాత్రమే ఈ రెండు రకాల జీవుల మధ్య తేడా. ధర్మ హీనుడైన మానవుడు పశువుతో సమానం.

- మహాభారతం

పశువులకు లేని ధర్మం మానవులకెందుకు? వివేకము, విచక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి, దానిని దుర్వినియోగం చేసి ఆత్మ మరింత హీనమైన దేహధారణ చేయకుండా, ఉన్నతివైపు అడుగులు వేయటానికే ధర్మం. ఆ ధర్మమే లేకపోతే సమాజంలో ఎంతటి అరాచకముండేదో ఊహించండి. బలవంతుడు, ధనవంతుడు అయిన వానిదే పైచేయిగా మిగిలి మానవత్వమనేది లేకుండా పోయేది. వివేక విచక్షణలను ఆత్మ అనునది పరబ్రహ్మమునకు భేదమైనది కాదని తెలుసుకొనుటకు వినియోగించాలి తప్ప, ఇతరులను అవమానించి హింసించి వాంఛలను తీర్చుకుని రాక్షసత్వం పెంచుకోవటానికి కాదు.

ఇప్పుడు సమాజంలో జరుగుతున్న దారుణాలకు కారణం ఈ ధర్మ భ్రష్టుత్వమే. పురుషులు విద్యావినయ సంపన్నులై ధర్మపరాయణులై కఠినమైన శ్రమతో స్వీయోద్ధరణ, సమాజోద్ధరణ చేయకుండా పూర్తిగా దేహవాంఛలకు, తాత్కాలికమైన ఆనందాలపై దుర్వినియోగం చేసి పతనమవుతున్నారు. స్త్రీలపై అత్యాచారాలతో పాటు సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకు పురుషులు ధర్మాన్ని నిర్వర్తించకపోవటమే కారణం.

ధర్మము సత్యము అనేవి విడదీయలేనివి. ఏది సమస్తభూతములకు హితమైనదో అదే సత్యమని, శిష్టులైన వారు, పెద్దల అభిమతమే ధర్మమని ఆదిశంకరుల అభిప్రాయం. మనకు ఋషిప్రోక్తమైనది అత్యంత శ్రేష్ఠమైనది. అవే వేదాలు. అందుకే వేదాచరణ చేస్తే ధర్మాచరణ జరిగినట్లే. సత్యాన్వేషణ అక్కడే ఆరంభం. ఇతర వాఙ్మయాలు ధర్మాచరణకు సాధనాలు.

ధర్మాన్ని విస్మరించి, పశువులలా హీనులమవుదామా? లేక వీలైనంత ఆచరించి మరింత ఉన్నతమైన జన్మను పొందుదామా? అన్నది మన చేతిలోనే ఉంది. ధర్మాచరణ ధర్మ రక్షణలో ముఖ్యమైన భాగం. ముందు ఆచరణ జరిగితే తరువాత ప్రచారం. ధర్మాచరణ చేస్తేనే పరధర్మాల నుండి కలిగే దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని ధర్మ పరిరక్షణకు తోడ్పడగలం. నేడు క్రైస్తవం పేరుతో, నాస్తికత్వం పేరుతో జరుగుతున్న దుష్ప్రచారం కొనసాగటానికి కారణం మనలో ధర్మాచరణ లేకపొవటం, ధర్మంపై విశ్వాసం లేకపోవటం.

యతో ధర్మస్తతో జయః - ధర్మమెక్కడో అక్కడే జయము. ఇక్కడ జయమంటే ప్రధానంగా కర్మాచరణలో అని కాదు, ఆత్మోద్ధరణలో అని.

గీత - పంచమవేదం


గీత పంచమవేదంగా పరిగణించబడటానికి కారణం మానవునికి సమస్త పరిస్థితులయందు దిశానిర్దేశం చేయడంలో ఈ బోధ అత్యంత ప్రభావవంతమైనది కాబట్టే. కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్యముల ద్వారా తానెవరో తెలుసుకునేందుకు రాచబాట భగవద్గీత. ఆచరించగలిగితే ప్రతి ఒక్క మానవుడూ శ్రీకృష్ణ పరమాత్మ కాగలడు. ఆచరించలేకపోయినా సత్యాసత్య విచక్షణ కొంతైనా కలిగియుండి సరైనా మార్గంలో మనలను నడిపించగలిగిన అద్భుతశక్తి ఈ జగద్గురు బోధ. పఠించగా పఠించగా విషయమవగతమై స్థితప్రజ్ఞత వైపు నడిపే మహోన్నత ఆధ్యాత్మిక సంపద భగవద్గీత. మనకు కావలసింది ఏమిటి? సుఖదుఃఖాల సమ్మేళనమైన జీవితంలో వీలైనంత ఆనందంగా ఉండగలిగే, వీగిపోని వ్యక్తిత్వమే కదా? అది 100% అందజేసేది ఈ బోధ.

పరమాత్మ చెప్పిన ఒక్క విషయం ఈ నాటి సమాజానికి చాలా ముఖ్యమైనది, మనందరిలోనూ లోటైనది - సమభావం. ఈ సమభావం కలిగిన వారు నాకు అత్యంత ప్రియులు అని ఆయన అనేక మార్లు గీతలో చెప్పారు. ఈరోజుల్లో సనాతన ధర్మ ఆచరిస్తున్నాము అనుకునే వారిలో మృగ్యమైనది ఈ సమభావం. నిరంతరము నేను గొప్ప వాడు తక్కువ అన్న వివక్షతో ఈ ప్రపంచంలో ఘోరమైన అసంతులన సృష్టిస్తున్నారు. అన్నీ ఆ సృష్టిలో ఓ ప్రత్యేకమైన పాత్ర కలవే అన్న సత్యాన్ని మారస్తున్నారు. అందుకే సనాతన ధర్మం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. ఆలోచించి సత్యం తెలుసుకుంటేనే ఈ జాతికి మనుగడ.

ఇహైవతైర్జితైః సర్గో యేషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః

ఎవరి మనసు సమభావమందు స్థిరమై యున్నదో అటువంటి వారు ఈ జన్మలోనే సమస్తమును జయించినవారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుకొందురు. పరమాత్మ సముడు, దోషరహితుడు కావున అట్టి వారియందే స్థితుడగును.

- కర్మసన్న్యాస యోగం 19వ శ్లోకం

ఈ ప్రపంచాన్ని పీడిస్తున్న మరో పెద్ద సమస్య - నేను, నా వల్ల, నా వల్లనే అని విర్రవీగే అహంకారము. దాని కారణంగా సుఖము, దుఃఖములకు కారణం తెలుసుకోలేని అజ్ఞాన పరిస్థితి. కర్మలను ఫలాపేక్ష లేకుండా ఆచరించమని పరమాత్మ చెప్పినా, మనం నిత్యమూ చేసేది ఫలాపేక్షతోనే. అందుకే అహంకారప్రేరితమైన అరిషడ్వర్గాలు పేట్రేగి మానవత్వం నశించి రాక్షసత్వం తాండవిస్తోంది. ఎందుకు ఫలాపేక్ష లేకుండా కర్మలనాచరించమన్నాడో గీత చదివితే అర్థమవుతుంది. పాపక్షయానికి అదొక్కటే మార్గము.

బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా!

ఎవడు కర్మలనన్నిటినీ భగవదర్పణము చేసి ఫలాసక్త రహితముగా కర్మలనాచరించునో వాడు తామరాకుపై నీటిబిందువు వలె పాపములచే నంటబడడు.

-కర్మ సన్న్యాస యోగం 10వ శ్లోకం

మూడవ విషయం: మనలో అరిషడ్వర్గాలు ప్రకోపించటానికి కారణం కృష్ణ పరమాత్మ చక్కగా తెలిపాడు - విషయములను ఎక్కువ చింతన. ఇది ప్రతి క్షణం మనం చేస్తూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. కొందరికి రాజకీయం, కొందరికి రంధ్రాన్వేషణ, కొందరికి జాతీయవాదం, కొందరికి మూఢభక్తి, మరికొందరికి నాస్తికత. కావలసిన దానికన్నా ఎక్కువ సమయం ఓ విషయంపై వెచ్చిస్తే కలిగేవే అరిషడ్వర్గాలు. తద్వారా నాశనము.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధి నాశాత్ ప్రణశ్యతి

-సాంఖ్యయోగం (62,63 శ్లోకాలు)

విషయ చింతన ఎక్కువ చేయటం వలన ఆసక్తి కలుగును. ఆ ఆసక్తి వలన వానిని పొందే కోరిక కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము కలుగును. ఆ క్రోధము అదుపు దాటినప్పుడు మోహము కలుగును. దాని ప్రభావముతో వివేకము నశించును, తద్వారా జ్ఞానశక్తి నశించును. దీని వలన మనుష్యుడు పతనమవుతున్నాడు. ఇది కఠోర సత్యం. తెలుసుకుంటే శాశ్వతానందం.

అన్నీ తెలిసిన సనాతన ధర్మవాదులు ఈ విషయాసక్తిలో చిక్కుకుని అసలు లక్ష్యానికి దూరమవుతున్నారు. జ్ఞానులు ధనకనక వస్తు వాహనములుపై ఆసక్తితో అధోగతి పాలవుతున్నారు. సన్న్యాసులు సామ్రాజ్యాలను ఏర్పరచుకునే వలలో చిక్కుకుని ప్రజల గౌరవాన్ని కోల్పోతున్నారు. మొత్తం సమాజమే భ్రష్టు పట్టే ప్రమాదం ఈ విషయాసక్తి మితి మీరడం వల్లన.

కృష్ణం వందే జగద్గురుం.🙏🏻🙏🏻

నామ స్మరణమెలా పనిచేస్తుంది?



కలియుగంలో పరమాత్మ నామ స్మరణం ముక్తికి మార్గం అన్నది ఆర్యోక్తి. నామం ఉచ్చరిస్తే పాపాలు తొలగుతాయా? అలా అయితే ఏ నామమైనా దేవుని నామమేగా? అలాంటప్పుడు ఏ పదాన్ని స్మరించి ఉచ్చరించినా పాపాలు పోవాలి కదా? ఇలాంటి ప్రశ్నలు నాస్తిక పిడివాదులు సనాతనధర్మాన్ని అనుసరించే వారిపై సంధిస్తూనే ఉంటారు. సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

అమ్మ - ఈ పదానికి ఉన్న పవిత్రత ఎక్కడి నుండి వచ్చింది? సగం దానిలోని అక్షరాల నుండి, మిగిలిన సగం ఆ పాత్రకు ఉన్న గొప్పతనం నుండి. అమ్మా అని పిలవకుండా ఆ మనిషిని ఇంకెంత గౌరవభావంతో పిలిచినా ఆ అమ్మదనానికి ఉన్న పవిత్రత రాదు కదా? అంటే ఏమిటి? ఇక్కడ భావనలో ఔన్నత్యానికి సాఫల్యతనిచ్చింది అమ్మ అనే పదం. ఆ పదంలోని అక్షరాల కూర్పు అలాంటిది. ప్రత్యక్ష దైవం అమ్మ కదా? అమ్మ అన్న పదంలో అంతటి మహత్తు ఉంటే, మరి విశ్వాంతర్యామి అయిన ఆయన నామంలో ఎంతటి మహత్తు ఉండాలి? వాటి రహస్యం ఏమిటి?

శబ్దం విశ్వజనీన శక్తికి ఓ అద్భుతమైన ప్రతిబింబం. శబ్దంతోనే ప్రకంపనలు, ప్రకంపనలతోనే భావాలు, భావాలతోనే సంకల్పం, సంకల్పంతోనే చూడలేనివి చూడగలగటం, అనుభూతి చెందలేనివి అనుభూతి చెందటం, ఊహకు అందనివి స్ఫురణకు రావటం. ఆ శబ్దాలు ఋషిప్రోక్తమైనప్పుడు వేదాలయ్యాయి. అలాగే దేవతా స్వరూపముల నామములు. అపురూపమైన, మహత్తరమైన, అర్థవంతమైన శబ్దాల కలయికతో ఏర్పడినవి నామాలు. నారాయణ కాని, రామ కాని, కృష్ణ కాని, గౌరి కాని, శివ కాని..మనకున్న దేవతాస్వరూపాల నామాలలోని శబ్దాల కలయికకు ఒక పరమార్థం ఉంది, వాటిని పఠించటం ద్వారా విలక్షణమైన ఫలితం కలిగి తీరుతుంది.

మరి విశ్వమంతటా పరమాత్మే ఉన్నప్పుడు కొన్ని శబ్దాలతో కూడిన నామాలకే ఎందుకా నామస్మరణ సాఫల్యం? అన్నిటికీ ఉండాలి కదా? అక్కడే భావం ముఖ్యం. దేవతా స్వరూపాన్ని, మనం తలచిన భావానికి, శబ్దానికి తీగలా అనుసంధానం చేసేది నామం. ప్రపంచంలో అన్ని శబ్దాలకూ అటువంటి శక్తి ఉండదు, తదనుగుణమైన భావం ఉప్పొంగదు. ఎలాగైతే అమ్మా అన్నప్పుడు అద్భుతమైన మాతృత్వం ఉప్పొంగి తల్లి హృదయం స్పందిస్తుందో, ఒసేయ్ అన్నప్పుడు దానికి పూర్తిగా విరుద్ధమైన భావనలు కలుగుతాయో, అలాగే నామాలు కూడా. ఇక్కడ సూక్ష్మం శబ్దాల ప్రకంపనలు మనలో ఎటువంటి భావాలను కలిగిస్తాయి అన్నది. ఎందుకలా? శబ్దాలు దేహంలోని కణాలను, గ్రంథులను జాగృతం చేస్తాయి. ఇది మనకు ఉచ్చ్వాస నిశ్శ్వాసలలోని సోహం శబ్దం ద్వారా నిరూపితమే. సోహం శబ్దం మనకు తెలియకుండా నిరంతరం దేహంలో ప్రయాణం చేస్తున్నంత వరకు దేహం ఆత్మకు ఆలవాలమవుతుంది, ఆగిన మరుక్షణం పార్థివమవుతుంది. అలాగే, దేవతల నామాల ఉచ్చరణ కూడా. ఆయా దేవతల లక్షణాలను బట్టి, నామాలను బట్టి విలక్షణమైన శబ్దాలు మన శరీరంలోని కణాలు, గ్రంథులు అంతే విలక్షణంగా జాగృతమై మన మనసులో పేరుకుని ఉన్న ఆలోచనలను కరగిస్తాయి, పొరలను పటాపంచలు చేస్తాయి. భావయుక్తమైన, పవిత్రమైన శబ్దాలతో కూడిన పదాలకు అంతటి శక్తి కలదు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

మరి నామస్మరణ సఫలమెలా అవుతుంది? నమ్మకంతో, అచంచలమైన విశ్వాసంతో, దృఢ సంకల్పంతో. ఇవన్నీ కూడా భావాన్ని పరిపుష్టం చేసి శబ్ద ప్రకంపనలను దేహమంతా ప్రసరింపజేసి దేహాన్ని జాగృతం చేస్తాయి, హృదయ జ్యోతి చుట్టూ ఉన్న పొరలను తొలగిస్తాయి. నామస్మరణ మొదట యాంత్రికంగా జరిగినా అది ఒక క్రమశిక్షణకు, ఏకాగ్రతకు నాంది అవుతుంది. ఆ తరువాత శబ్ద ప్రకంపనలు దేహంలో మార్పులు తీసుకు వస్తాయి. నిరంతర నామస్మరణ వలన దేహం దేవాలయంగా మారుతుంది. జీవాత్మ ఉద్ధరించబడుతుంది, జనన మరణ చక్రాల నుండి బయటపడే మహద్భాగ్యాన్ని పొందుతుంది.

మరి కలిలో నామస్మరణే మార్గమని ఎందుకన్నారు?

యజ్ఞ యాగాదుల సాఫల్యానికి అనువైన పరిస్థితులు సృష్టించటం చాలా కష్టం కాబట్టి. కార్య నిర్వహణ, కర్తలలో సంకల్పబలం, స్థల సామాగ్రిలో పవిత్రత, పంచభూతములలో శుద్ధి ఇవన్నీ కలియుగంలో మృగ్యం కాబట్టే మునుపటి యుగాలలో జరిగిన క్రతువుల వంటివి ఈ యుగధర్మానికి ఆచరణయోగ్యం కాదు. కలిపురుషుని ప్రభావం చేత సమాజంలొ వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకునే నామస్మరణమనేది ఈ యుగంలో ముక్తికి మార్గంగా చెప్పారు.

రోజులు మారాయి – 1955: చిత్ర విశేషాలు

1955లో విడుదలైన రోజులు మారాయి సారథి ఫిలిమ్స్ నిర్మించిన సామాజిక చిత్రం. 1939లో రైతుబిడ్డ ద్వారా రైతుల సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన సారథి సంస...