14, జులై 2020, మంగళవారం

మరి మరి నిన్నే మొరలిడ - త్యాగరాజస్వామి


భాగవతంలోని గజేంద్ర మోక్షం గురించి ప్రస్తావించని వాగ్గేయకారులు లేరు. వారు ఎన్నో కీర్తనల్లో కరిరాజుని శ్రీహరి కాపాడిన రీతి గురించి వ్రాశారు. కారణం - ఆ గజరాజు మనందరి లాగానే ముందు అహంకారం, తరువాత నిస్సత్తువ, తరువాత భయం, తరువాత అంతర్మథనం, శరణాగతి....ఈ సోపానాలు చేశాడు, నీవే తప్ప ఇతఃపరంబెరుగ అన్న స్థితికి వచ్చినప్పుడు ఆ పరమాత్మ బిరాన వచ్చి మోక్షమిచ్చాడు. ఆ కరి రాజును బ్రోచినవాడివి నన్ను బ్రోవలేవా అని పరి పరి విధాలా వేడుకున్నారు. నిందాస్తుతి కూడా చేశారు. అటువంటి ఒక కీర్తన త్యాగరాజస్వామి వారిది మరి మరి నిన్నే. భాగవత ఘట్టలు వాగ్గేయకారుల గీతలలో అంతర్భాగం అన్న దానికి ఇటువంటి కృతులు ఉదాహరణ.

మరి మరి నిన్నే మొరలిడ నీ మనసున దయ రాదు

కరి మొర విని సరగున చన నీకు కారణమేమి సర్వాంతర్యామి

కరుణతో ధ్రువునికెదుట నిల్చిన కథ విన్నానయ్యా
సుర రిపు తనయునికై నరమృగమౌ సూచనలేమయ్యా
మరచియున్న వనచరుని బ్రోచిన మహిమ దెలుపవయ్యా
ధరను వెలయు త్యాగరాజ సన్నుత తరము గాదిక నే విననయ్యా

ఓ రామచంద్రా! మళ్లీ మళ్లీ నిన్నే మొరలిడుతున్నాను, అయినా నాపై నీ మనసులో దయ ఎందుకు రావటం లేదు? ఆ గజేంద్రుని మొర విని వేగంగా వచ్చావే! నీవు సర్వాంతర్యామివి కదా మరి నా మొరలు వినకపోవటానికి కారణమేమిటి? నీవు కరుణతో బాలుడైన ధ్రువుని తపము మెచ్చి బ్రోచిన కథను విన్నాను, దేవతలకు శత్రువైన హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుని కోసమై నరహరి రూపంలో రావటంలో భావమేమిటయ్యా! వనచరుడైన సుగ్రీవుని బ్రోచిన మహిమ అంతరార్థమేమిటయ్యా? ఈ భూమిపై వెలసి పరమశివునిచే నుతించబడిన రామా! నీవెన్ని చెప్పినను వినుట నా తరము కాదు, త్వరగా నాపై దయ చూపుము. 

13, జులై 2020, సోమవారం

ఉమాసహస్రం - కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని - రమణ మహర్షి


సమస్త వేద ఉపనిషత్ ఆగమ తంత్ర శాస్త్ర రహస్యాలు నిక్షిప్తమై యున్న ఈ ఉమాసహస్రం గణపతిముని భగవాన్ రమణ మహర్షుల వారి మార్గదర్శకంలో కేవలం 20 రోజుల దీక్షలో రచించారు. ఈ దీక్ష పేరు ఉమాసహస్ర స్తబక బంధ దీక్ష. 20-11-1907 నాడు రమణులకు తన సంకల్పాన్ని విన్నవించుకుని చూత గుహలో దీక్ష బూనారు. రమణులు ప్రతి సాయంత్రం గణపతిముని ఆరోజు రచన ముగిసే సమయానికి ఆ గుహ వద్దకు వచ్చి ఆనాటి రచనను ముని నోట విని కాసేపు కూర్చుని వెళ్లేవారు. ఆ విధంగా ముని స్తవకార్య భారం నిర్విఘ్నంగా కొనసాగటానికి రమణుల అనుగ్రహం తోడ్పడింది. ఈ స్తోత్ర కర్మ ఫలంగా గణపతిముని రమణుల సుబ్రహ్మణ్య తత్త్వ దర్శనాన్ని ఆశించారు. ఓ నాలుగైదు రొజుల్లో దీక్ష ముగుస్తుంది అనగా గణపతిమునికి గోరుచుట్టు వచ్చింది. గ్రంథరచన ముందుకు సాగనీయలేదు. 19వ రోజు సాయంత్రానికి 1/4 వంతు గ్రంథం మిగిలి ఉంది. 20వ రోజు వైద్యుడు వచ్చి దానికి చికిత్స చేశారు. ఆ రాత్రి ఐదుగురు లేఖకులను, వ్రాత సామాగ్రిని సమకూర్చుకున్నారు. రమణ మహర్షుల వారు కూడా వచ్చి కూర్చున్నారు. 10 స్తబకములు, ఒక్కొక్కదానిలో 25 శ్లోకములు, అనగా మొత్తం 250 శ్లోకాలు...ఒకే సమయంలో వేర్వేరు వృత్తాలను వ్రాయమని 5 స్తబకాలను పూరించసాగారు. 200 నిమిషాలు, అనగా, 3 గంటల 20 నిమిషాలలో ఆశువుగా 250 శ్లోకాలు పూర్తి చేశారు. అందరూ గణపతిముని ప్రతిభను, ఆయనలోని ఆధ్యాత్మికతను వేనోళ్ల పొగుడుచుండగా అప్పటివరకు గాఢసమాధిలో ఉన్న రమణులు మేల్కొని "నేను చెప్పినదంతా వ్రాసుకున్నారా" అని ప్రశ్నించి అక్కడున్న వారందరికీ గగుర్పాటు కలిగించారు. గణపతిముని మాత్రం ఆశ్చర్యపడకుండా తాను ఆశించిన గుహేశ (సుబ్రహ్మణ్యం తత్త్వం గుహ్యమైనది, అది ఆయనకు ఆ గుహలో రమణుల ద్వారా ఆ విధంగా బోధపడింది) తత్త్వము అవగతమైనదని సంతోషపడి "చిత్తము, నేను మీరు చెప్పినది శ్రద్ధగా గ్రహించి, వెంటనే శిష్యులకు చెప్పి,యిప్పుడే గ్రంథమును ముగించాను" అని మహర్షులకు సమాధానం చెప్పారు. "సరే, మంచిది" అని రమణులు ఆశీర్వదించి ఆ ఆమ్ర గుహను వీడారు. తమాషా ఏమిటంటే గణపతిముని మొదటి 19 రోజులలో వ్రాసిన 750 శ్లోకాలను ఎన్నో మార్లు సరిదిద్దగా, చివరి రోజున వ్రాసిన 250 శ్లోకాలను ఒక్కసారి కూడా దిద్దవలసిన అవసరం రాలేదు. దానికి కారణం గురువరేణ్యులు, గుహావతారి అయిన రమణులే. ఆ విధంగా గురు శిష్య ద్వయం కలిసి తల్లియైన ఉమకు చేసిన స్తోత్రమాలిక, నీరాజనమే ఉమాసహస్రం. ఇది రమణ గణపతుల సమష్టి రచన.

అఖిల జగన్మాతోమాతమసాతాపేనచాకులానస్మాన్
అనుగృహ్ణాత్వనుకంపాసుధార్ద్రయాహసితచన్ద్రికయా

అఖిలజగత్తులకును మాతయైన ఉమాదేవత - తమస్సు చేతను, తాపము చేతను బాధించబడుతున్న మమ్ములను దయామృతస్రవముచే చల్లని వెన్నెల వంటి చిరునవ్వుతో సమనుగ్రహించు గాక!

- గణపతి ముని ఉమాసహస్రం (పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి వ్యాఖ్యానము) నుండి.

11, జులై 2020, శనివారం

నాదసుధారసంబిలను నరాకృతాయెరా - త్యాగరాజస్వామి



నాదసుధారసంబిలను నరాకృతాయెరా! ప్రణవ

వేద పురాణాగమ శాస్త్రాదులకాధారమౌ

స్వరములు యాఱొక ఘంటలు వరరాగము కోదండము
దుర నయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరమురా
సరస సంగతి సందర్భములు గల గిరములురా
ధర భజనే భాగ్యమురా త్యాగరాజు సేవించు

ఓ మనసా! ప్రణవనాదమనే అమృతము యొక్క సారము ఈ భూమిపై నరుని రూపములో శ్రీరామునిగా అవతరించినది. ఈ నాదమే వేదశాస్త్ర పురాణములకు ఆధారము. ఆ శ్రీరాముని విల్లులో గల ఏడు ఘంటలు సప్తస్వరములు. శ్రీరాముని కోదండము రాగమునకు సమానమైనది. ఆ విల్లునకు గల మూడు తీగెలు దుర నయ దేశ్యములనే రాగ విభజనలు, నిరాటంకమైన లయ శ్రీరాముని శరములు. శ్రావ్యమైన సంగతులు మరియు నెరవులు శ్రీరాముని మధురమైన పలుకులు. కాబట్టే, పరమేశ్వరునిచే నుతించబడిన శ్రీరాముని భజనే ఈ భువిపై మహాభాగ్యము.

- సద్గురువులు త్యాగరాజస్వామి

రాముడు పరబ్రహ్మ స్వరూపము అని తెలుపటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ప్రణవనాదామృత సారం శ్రీరాముడు అని పలికిన త్యాగరాజస్వామి దానికి కావలసిన ప్రాతిపదికలను అనుపల్లవి మరియు చరణంలో ఆవిష్కరించారు. శ్రీరాముని కోదండము, అందులోని భాగములు, ఆయన పలుకులకు సప్తస్వర రాగ లయాన్వితమైన సంగతులు, నెరవులకు సారూప్యత కనబరచి ఈ సంగీతానికి దివ్యత్వాన్ని చేకూర్చారు త్యాగరాజస్వామి. సమస్తమునకు రాముడే ఆధారము అన్న సంగతి వేద శాస్త్ర పురాణములకు ఆధారమైన ప్రణవ నాదంతో ఉపమానంగా అందరికీ అర్థమయ్యేలా పలికారు త్యాగరాజస్వామి. ఓంకారము నుండి జన్మించిన సప్తస్వరములు, ప్రణవ మంత్ర సారమైన శ్రీరాముడు - ఈ రెండిటినీ ఎంత చక్కగా అనుసంధానం చేసి నాదసుధారసం యొక్క గొప్పతనాన్ని మనకు రామతత్త్వం ద్వారా తెలియజేశారు. ఈ కృతిని మనోజ్ఞమైన ఆరభి రాగంలో స్వరపరచి లోకాభిరాముని తత్త్వాన్ని మన ముంగిట నిలిపారు.

10, జులై 2020, శుక్రవారం

కోరి వచ్చితినయ్యా కోదండపాణి - త్యాగరాజస్వామి


కోరి వచ్చితినయ్యా కోదండపాణి నిన్ను

చూచుటకెంతో సుందరమూర్తివనుచు కోరి వచ్చితినయ్యా

చిత్తానికి నీ కృప విత్తమనుచు చాల కోరి వచ్చితినయ్యా

మెండు గుణములచే నిండు కుండయనుచు కోరి వచ్చితినయ్యా

రాజాధి రాజ త్యాగరాజనుత చరిత కోరి వచ్చితినయ్యా

ఓ కోదండరామా! నిన్ను చూడాలన్న కోరికతో వచ్చితిని. నువ్వు చూచుటకు ఎంతో సుందరమైన వాడవని కోరి వచ్చితిని. ఈ మనసుకు నీ అనుగ్రహమే సంపదలనుకొని చాలా కోరి వచ్చితిని. సమస్త సద్గుణములను కలిగియున్న నిండుకుండవని నిన్ను చూడ కోరి వచ్చితిని. చక్రవర్తివి, శంకరునిచే నుతించిబడిన నీ చరిత్ర తెలుసుకొన కోరి వచ్చితిని. నన్ను అనుగ్రహింపుము.

చాతుర్మాస్యం


నాలుగు మాసాలు దీక్షగా గడిపే ఒక కర్మ. మతాచార్యులు, గురువులు, పీఠాధిపతులు వర్ష శరదృతువులున్న నాలుగు నెలలు ఒకేచోట గడపటానికి ఉద్దేశించిన వ్రతం. గృహస్థులు కూడా దీనిని పాటించవచ్చు. ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ మాసాలు వానలు కురిసే సమయం కాబట్టి సన్న్యాసులు ఈ నాలుగు నెలలు ఒక చోట స్థిరంగా ఉండటం మంచిదని ఇలా నాలుగు నెలల దీక్షా సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు అని ఒక వివరణ. ఇప్పుడు చాలా మంది దీనిని రెండు నెలలకు తగ్గించి పాటిస్తున్నారు.

శృంగేరి శారదాపీఠం వారి ప్రకారం ఇది ఒక వ్రతం. వేదాల ప్రకారం పక్షా వై మాసాః అనగా ఒక పక్షాన్ని మాసంగా పరిగణించి ఈ వ్రతాన్ని రెండు నెలలు చేస్తారు. దీనిని వర్షఋతువులో పాటిస్తారు. ఈ సమయంలో గురువులు పరబ్రహ్మను ధ్యానిస్తూ శిష్యులకు ఉపనిషత్తులు, సాంఖ్యమును బోధిస్తారు.

సమాగతేభ్యోऽన్తేవసద్భ్యః ఔపనిషదం సాంఖ్యం ప్రతిపాదయంతో వర్తామహే

చాతుర్మాస్య సంకల్పం చేసే ముందు వ్యాసపూజ నిర్వహించి, దక్షిణామూర్తిని, శివుని, ఆచార్య పరంపరను, బ్రహ్మవిద్యా ప్రతిపాదకులకు, గురువులను, బోధకులను స్మరించుకుంటరు. సాధారణంగా సన్న్యాసులకు ఏ విషయముపైనా అనురాగము కలుగకుండా అనేక ప్రదేశాలు తిరుగమని నారద పరివ్రాజకోపనిషద్ నిర్దేశించింది. కానీ, వర్ష ఋతువు సమయంలో దానికి భిన్నంగా ఒకేచోట ఉండి చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించాలి.

ఏకరాత్రం వసేద్ గ్రామో నగరే పంచరాత్రకం
వర్షాభ్యోऽన్యత్ర వర్షాసు మాసాంశ్చ చతురో వసేత్
ద్విరాత్రం న వసేద్ గ్రామో భిక్షుర్యది వసేత్తదా
రాగాదయః ప్రసజ్యేరంస్తేనాసౌ నారకీ భవేత్
గ్రామాన్తే నిర్జనే దేశే నియతాత్మాऽనికేతనః
పర్యటేత్ కీటవద్ భూమౌ వర్షాస్వేకత్ర సంవసేత్

సన్యాసి, వర్హ ఋతువులో తప్ప, ఒక గ్రామంలో ఒక్క రాత్రి, నగరంలో రెండు రాత్రుల వరకు ఉండవచ్చు. వర్షఋతువులో గ్రామంలో కానీ, నగరంలో కానీ, నాలుగు మాసములు ఉండవచ్చు. గ్రామంలో ఒక రాత్రి కన్నా ఎక్కువ ఉంటే అనురాగ్రము, కామము మొదలైనవి ఆతని దృష్టిని మరల్చవచ్చు. గ్రామం యొక్క చివర, జనులెవరూ నివసించని ప్రదేశంలో నివాసముండి నియమంగా, నేలపై తిరిగే కీటకములా భిక్షాటన చేయవలెను. వర్షఋతువులో ఒక్క చోట ఉండవచ్చు.

వర్షఋతువులో ప్రదేశాలు తిరుగుట వలన సన్యాసులకు క్రిమికీటకాదులనుండి ఆపదలు, వ్యాధులు కలిగే అవకాశముంది కాబట్టి ఒకే చోట ఉండవచ్చు అన్న వ్రతం. నిరంతర పర్యటన వల్ల బ్రహ్మ విచారమునకు ఆటంకము కలుగుతుంది కాబట్టి ఈ నాలుగు మాసాలు వారు ఒక చోట ఉండి పరబ్రహ్మను ధ్యానిస్తూ, గురు శిష్యుల సాంగత్యములో ఉండి ఆధ్యాత్మిక శాస్త్ర విషయాదులను చర్చించుకునే అవకాశం కలుగుతుంది. శృంగేరి శారదా పీఠాధిపతులు చాతుర్మాస్య సమయంలో అనేక వ్రతాలను ఆచరిస్తారు. అవి 1. శ్రావణ సోమవార వ్రతము 2. వరమహాలక్ష్మీ వ్రతము 3. గోకులాష్టమీ వ్రతము 4. వామన జయంతి 5. అనంత పద్మనాభ వ్రతము 6. ఉమామాహేశ్వర వ్రతం. ఈ ఆఖరి వ్రతంతో చాతుర్మాస్య దీక్ష ముగుస్తుంది.

మన దేశంలో ఈ వ్రతాన్ని అన్ని సాంప్రదాయాలలోని సన్యాసులు కూడా ఆచరిస్తారు. జ్ఞాన సముపార్జనకు ధ్యానానికి వారికి ఇది అత్యుత్తమమైన సమయం, శిష్యకోటికి గురువులను ఒకే చోట సందర్శించుకునే మహదవకాశం.

8, జులై 2020, బుధవారం

గురువు యొక్క కృప


చాలా సార్లు గురువంటే మన సమస్యల పరిష్కారానికో లేక మన ప్రశ్నల సమాధానానికో అనుకుంటాము. కానీ, తాబేలు బిడ్డలకు దూరంగా ఉండి గమనిస్తూ ఉన్నట్లు శిష్యుల ప్రగతిని, పరిణతిని నిత్యం గమనించి సరిదిద్దే వారు గురువులు. ఈ గురు తత్త్వం అనుభవైకవేద్యం. స్కాందపురాణంలోని బ్రహ్మ సంహితలో శివపార్వతుల సంవాదంలోని గురుగీత గురువు యొక్క గొప్పతనాన్ని 27 శ్లోకాల ద్వారా తెలిపింది. దాని సారాంశం.

గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆయనే ఆ పరబ్రహ్మము. అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే అంజనముతో తొలగించే వారు గురువులు. అనంతమైన, అఖండమైన, సృష్టిలోని కదిలే, కదలని ప్రతి ప్రాణి/వస్తువు లో ఉండే బ్రహ్మ యొక్క నిజాన్ని తెలిపే వారు గురువులు. సృష్టిలో, కదిలే కదలని ప్రతి వస్తువులో ఉండే జీవాత్మ నిజాన్ని తెలిపే వారు గురువులు. చరాచారాలతో కూడిన మూడులోకాలను వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మ గురించి తెలిపే అసి శబ్దాన్ని వివరించే వారు గురువు. ఆత్మజ్ఞానమనేది ఎవరి ద్వారా అయితే ఒకనిమిషములోని అత్యంత అల్పమైన భాగములో కలుగుతుందో వారే గురువులు. దైవము, గురువు పట్ల అత్యంత ఉన్నతమైన భక్తి కలిగిన వానికే శాస్త్రాలు తమ నిగూఢ అర్థాన్ని పూర్తిగా తెలుపుతాయి. తల్లి, తండ్రి, దైవమై సంసార భయాన్ని పోగొట్టే వారు గురువ్లు. ఎవరి వలన ప్రపంచము సత్యముగా, ప్రకాశముగా, ఆనందముగా కనిపించి, తెలుస్తుందో వారే గురువులు. మూడు అవస్థలు (జాగృతము, స్వప్నము, సుషుప్త) - వీటి యందు చేతనను కలిగిన వారు గురువులు. జ్ఞానమనే శక్తిని అధిరోహించి, తత్వము (నిజము) అనే మాలతో అలంకరించబడి, మనకు భుక్తిని, ముక్తిని ప్రసాదించే వారు గురువులు. జ్ఞానమనే అగ్ని ద్వారా అనేక జన్మల నుంచి సంప్రాప్తించిన కర్మ అనే బంధములను దహించే వారు గురువులు.

ఎవరి పాదములు కడిగిన నీరు ఈ సంసారమనే సాగరాన్ని దాటించి, అసత్యాన్ని నాశనం చేస్తుందో వారే సద్గురువులు. గు అనే అక్షరము అంధకారాన్ని, రు అనే అక్షరము తొలగించడానికి ప్రతీక. అందుకనే గురు అనే పదము అంధకారాన్ని తొలగించేదిగా పిలవబడింది. కర్మలు, మనసు, వాక్కు - మూడింటి ద్వారా గురువును ఆరాధించాలి. గురువుకు పూర్తి సాష్టాంగ నమస్కారము చేయుటకు వెనుకాడ కూడదు. గురువుకు ప్రతి నిత్యం సాష్టాంగ నమస్కారము చేసి పూజించవలెను. అలా చేయటం వలన స్థైర్యము, ఆత్మ జ్ఞానము (తాను ఎవరు అని తెలిపేది) కలుగుతాయి.గురువును మించిన తత్వము (నిజము), తపస్సు, జ్ఞానము లేదు. గురువే కారణము, ఆది (మొదలు). కానీ ఆయనకు అవి లేవు. గురువు ఉత్తమమైన దైవము. గురు మంత్రాన్ని మించిన మంత్రము లేదు. నిజమైన వివేకము జాగృతమైనప్పుడు గురువే అత్యంత హితుడని తెలుస్తుంది. అన్ని ధర్మములకు మూలము గురువే. విశ్వము గురువు యందు స్థితమైయున్నది. గురువు విశ్వవ్యాప్తమై యున్నాడు. సంసారమనే అడవిలో చిక్కుకున్న వారికి, భ్రాంతిలో జీవించే వారికి ముక్తిని కలిగగించే వారు గురువు. మూడు రకాల తాపముల(శరీరము, ప్రాణులు,దైవికము) అగ్ని నుంచి ఉపశమనము కలిగించే గంగా నది వంటి వారు గురువు. సాక్షాత్తు శివుడే అయిన గురువు ఈ జగత్తులో మనకు ఏకైక హితుడు. సర్వ విద్యలకు ప్రభువు ఆయన.ధ్యానానికి మూలము గురువు యొక్క రూపము, పూజకు మూలము గురువు యొక్క పాదములు, గురువు యొక్క పలుకులు మంత్రానికి మూలము. గురువు యొక్క కృప ముక్తికి మూలము.

ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః

తస్మై శ్రీ గురవే నమః

పరమాత్మ, పరమేశ్వర స్వరూపాలు


పరమాత్మ అనగా?

నిర్వచించలేకపోయినా ఈ సృష్టి ప్రవాహంలో సనాతన ధర్మ సాంప్రదాయంలో అనేక నిర్వచనాలు వచ్చాయి 1. స్వయంప్రకాశం కలిగి జ్ఞానరూపమైన ఆత్మ 2. కార్యాకారణాలకు భిన్నమై, క్షరాక్షరములకు అతీతమై, స్వాభావికంగా నిత్యమై, శుద్ధమై, ఋద్ధమై, ముక్తమైన పదార్థం 3. అవిద్య వల్ల ఆత్మగా తలచిన దేహం మొదలు బుద్ధి వరకు ఉన్న తత్త్వాలకు అతీతమైనది, సర్వోత్కృష్టమైనదీ, ఉపద్రష్టృత్వాది విశేషణ విశిష్టమై ప్రకాశించే ఆత్మ 4. ఆత్మగా కల్పితాలైన పంచకోశాలకు, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత తత్త్వాలకు అతీతమై బ్రహ్మకు పూర్వము నుంచి ఉన్న పదార్థము 5. సమస్త భూతాలలోని ప్రత్యక్చేతనము 6. మాయాశక్తికి ఆశ్రయం 7. సర్వానికి అధిష్ఠానమైనది 8. పరదేవత 9. దైవం లేదా పరబ్రహ్మం.

మరి ఆ పరమాత్మ/పరమేశ్వర స్వరూపాలు ఏమిటి?

సనాతన ధర్మం ప్రకారం పరమాత్మ ఇందుగలడందులేడు, చక్రి సర్వోపగతుండు, మనం చూడటాన్ని బట్టి అని ఎన్నో శాస్త్ర పురాణాలు తెలిపాయి. వీటికి ఓ ప్రాతిపదిక ఉంది. పరమేశ్వరుడు నిరాకారుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి అయినా, మనం కొలిచే రూపాలు ఐదు విధాలు:

1. పర స్వరూపం - దృష్టి, గోచరము కలిగిన సృష్టికి అతీతమైనది దివ్యమంగళ స్వరూపం. అనగా విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపం. ఇది సృష్టి స్థితిలయాదుల ఆధీనములో ఉండదు. శాశ్వతము, పరమానందకరమైంది. అవాఙ్మానసగోచరమైనది అని అర్థం.

2. వ్యూహ స్వరూపం - ఉపాసకులకు అనుకూలమైన రూపము. అనగా ఉపాసకులకు సాధనలో గోచరమైన రూపము. ఈ రూపము వేర్వేరు సాధకులకు ఒకేలా కనిపించవచ్చు. ఆ రూపానికి వారి సాధనకు గట్టి లంకె ఉంటుంది. విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ రూపాలుగా వ్యక్తమని వైఖానస శాస్త్రం చెబుతుంది.

3. విభవ స్వరూపం - అనాదిగా అత్యంత వైభవం పొందిన రూపాలు - రాముడు, కృష్ణుడు, సీత మొదలైన రూపాలు. ఇవి వేద శాస్త్ర పురాణాదులలో వర్ణించబడి, నుతించబడి కాలగమనంలో అత్యంత వైభవంగా కొలువబడిన రూపాలు.

4. అంతర్యామి స్వరూపం - అనగా బాహ్యేంద్రియములకు గోచరము కాని స్వరూపం. జ్ఞాననేత్రంతో మాత్రమే చూసే స్వరూపం. ఆయా సూక్తాలు చెప్పినట్లు హృదయ స్థానంలో ఉండే సూక్ష్మరూపం ఈ అంతర్యామి స్వరూపం. సిద్ధులకు, ముముక్షువులకు ఇచ్ఛామాత్రమున కనిపించే రూపము.

5. అర్చా స్వరూపం - అనగా ఆలయాలలో విగ్రహ రూపంలో ప్రతిష్ఠితమై కనిపించే స్వరూపం. ఇవి విభవ స్వరూపానికి మరింత వివరమైన రూపము. గుణ విభవాలను బట్టి కాస్త రూపాంతరము చెంది స్థపతుల చేతిలో రూపొందుకునేవి. వీనికి ప్రాతిపదిక దేవాలయ ఆగమ శాస్త్రం మరియు పీఠాధిపతులు/మఠాధిపతుల అనుభూతులకు రూపము. కోదండరాముడు, పట్టాభిరాముడు, శక్తి గణపతి, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుడు, సిద్ధి వినాయకుడు మొదలైనవి.

ఈ విధాలను గమనిస్తే ప్రధానంగా మన ధర్మంలోని దేవతా స్వరూపాలన్నీ అనుభవైకవేద్యమైనవి, అవతార సంబంధమైనవి, శాస్త్రప్రమాణవైనవి. మనం వర్ణించలేని పరమాత్మకు ఓ రూపం ఇవ్వటంలో ధ్యాత, ధ్యేయం, ధ్యాస కలిగి అవ్యక్తానందం వేగవంతంగా కలిగే అవకాశం ఉంటుంది అని మనకు విగ్రహారాధనను ప్రతిపాదించారు. మనలను మనం ఇష్టపడినట్లే ఒక రూపాన్ని మనకు రక్షకునిగా ఆరాధిస్తే ఈ జనన మరణములతో కూడిన దేహాన్ని ఓ అద్భుతమైన సాధనంగా ఉపయోగించుకోవచ్చు అని విగ్రహారాధనను ఈ ధర్మంలో ప్రోత్సహించారు. దృగ్గోచరము కాని పరమ స్వరూపాన్ని, అంతర్యామి స్వరూపాన్ని దర్శించాలంటే ఎంతో తీవ్రమైన సాధన చేయాలి, అది అందరికీ ఒక జన్మలో సాధ్యం కాకపోవచ్చు కాబట్టే విభవ, అర్చా స్వరూపాలు, బహుళ ప్రయోజనానికి దేవాలయాలు, స్వప్రయోజనానికి నిత్య పూజాయతనాలు ప్రతిపాదించబడ్డాయి. దేహము, గృహము, దేవాలయము...అన్నీ ఈ రూపాలకు నివాసము అన్నది మరల మరల చెప్పి మనలను ఆ మార్గంలో నిరంతరం నడిపించటానికే స్వరూపాలు.

పరమేశ్వరార్పణమస్తు

చెంచులక్ష్మి – 1958: చిత్ర విశేషాలు

1958లో విడుదలైన చెంచులక్ష్మి బి.ఏ.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై బి.ఏ. సుబ్బారావు నిర్మించి, దర్శకత్వం వహించిన పౌరాణిక-జానపద చిత్రం. 1943లో వచ్చి...