3, జులై 2015, శుక్రవారం

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి - దీక్షితులవారి సంగీతామృతము

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి - దీక్షితులవారి సంగీతామృతము


అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి

ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి దురితాది నివారిణి
పన్నగాభరణ రాజ్ఞి పురాణి పరమేశ్వరి విశ్వేశ్వర భాస్వరి

పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృత కరే
కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే
తోయజాసనాది సేవిత పరే తుంబురు నారదాది నుత వరే
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత గురుగుహ సాదరే

ఓ అన్నపూర్ణ తల్లీ! విశాలమైన కన్నుల గల అమ్మా! సమస్త లోకాలకు సాక్షివి! కటాక్షాన్ని ప్రసాదించే తల్లీ!

ఉన్నతమైన గర్త తీరంలో విహారం చేసే, (తిరువారూర్ వద్ద కుళిక్కుళై అనే క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వనాథుల క్షేత్ర కీర్తన ఇది) ఓంకార రూపిణీ! సమస్త పాపములను తొలగించే, నాగాభరణములను ధరించే శివుని రాణీ! పురాణములలో పొగడబడిన పరమేశ్వరీ! శివుని ప్రక్కన ప్రకాశించే అమ్మా!

పాయసాన్నము కలిగిన పాత్ర ఒక చేత, బంగారు గరిటే ఒక చేత కలిగి శోభిల్లే, మన్మథుడు మొదలైన వాని రక్షించుటలో నైపుణ్యము కలిగిన, బంగారు వస్త్రములను, ఆభరణములను ధరించిన తల్లీ! కమలాసనుడైన బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన, నారదుడు, తుంబురుడు మొదలైన వారిచే నుతించబడే తల్లీ! ధర్మార్థ కామ్యములను దాటించి మోక్షమును ప్రసాదించటంలో చాతుర్యము కలిగిన, సత్-చిత్-ఆనందములచే శోభిల్లే, గురుగుహుని ఆదరించే తల్లీ! రక్షించుము! 

ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కీర్తనలలో ఈ అన్నపూర్ణే విశాలాక్షీ ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీవిద్యోపాసనలో సిద్ధులైన దీక్షితులవారు అమ్మను నిరంతరం దర్శించి ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. సామరాగంలో ఈ అన్నపూర్నే విశాలాక్షీ అన్న కీర్తన కుళిక్కుళైలో గల కాశీవిశ్వనాథుని దేవేరి అన్నపూర్ణమ్మను నుతిస్తూ రచించారు. 

అన్నపూర్ణ పార్వతీదేవి యొక్క స్వరూపము. సకల కామ్యములతో పాటు మానువుని జీవితానికి అత్యంత ముఖ్యమైన భోజ్యములను అనగా పాడి పంటల ద్వారా వచ్చే ఆహార పదార్థములను పుష్కలముగా అందించె కామితార్థ దాయిని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. స్వయంగా సదాశివుడే కాశీ క్షేత్రంలో అమ్మ వద్ద భిక్షను ప్రతిరోజూ తీసుకుంటాడని పురాణలు చెబుతున్నాయి. ఆది శంకరుల వారు తన గురువైన మండన మిశ్రుని వద్దే కాక గురుపత్ని అయిన ఉభయ భారతీదేవి వద్ద కూడా విద్యను నేర్చుకున్నాడు. ఆ తల్లి తన పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతతో అన్నపూర్ణాష్టకం రచించారు. 

దీక్షితులవారి సాహిత్యంలో అమ్మ వైభవాన్ని ఎన్నో కోణాలలో అద్భుతమైన సాహితీ సంపదతో ఆధ్యాత్మిక సుగంధంతో తెలియజేశారు. ఆయనలోని దైవశక్తి ఆయన కీర్తనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓంకార రూపిణి, పురాణి, త్రిపద శొభిత అని అన్నప్పుడు ఆయన ఆదిపరాశక్తిని ఏయే అనుభూతులలో ఏయే రూపాలలో దర్శించాడో అర్థమవుతుంది. నిగూఢార్థము కలిగిన పదాలు మనం అనుకుంటే రావు. పూర్తిగా ఆ దేవతా స్వరూపం ఆ కృతికర్తను అనుగ్రహించి పదాలను శక్తిపూరితం చేసి రచనలో వచ్చేలా చేస్తుంది. దీక్షితుల వారి ప్రతి కృతిలోనూ ఈ దైవానుగ్రహము, దైవబలము తేటతెల్లమవుతుంది. అందుకే ఆయన సంగీత త్రయంలో ఒక్కరైనారు. సంగీతం ద్వారా సనాతన ధర్మం పరిఢవిల్లటానికి, భారత దేశపు ఆధ్యాత్మిక శక్తి ప్రకాశించటానికి ఎంతో తోడ్పడ్డారు.

సామ రాగం అద్భుతమైన లాలిత్యము,కరుణ రసము కలిగినది. ఈ రాగంలో శాంతము లేక సౌఖ్యము లేదు, మానస సంచరరే మొదలైన మృదుభావాన్ని, పరిపూర్ణమైన ప్రశాంతతను ఒలికించే కీర్తనలు రచించ బడ్డాయి. దీక్షితులవారు అమ్మకు తనపై గల అపారమైన కరుణకు సూచికగా ఈ అన్నపూర్ణే  విశాలాక్షి కృతికి సామ రాగాన్ని ఎన్నుకొన్నారు. పాలు తేనె కలిసినట్లు భక్తిపూరితమైన సాహిత్యము, కరుణాపూరితమైన రాగలక్షణము కలిసి అమృతాన్ని కురిపించాయి.

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎమ్మెస్ షీలా గారి గాత్రంలో ఈ కీర్తన వినండి


1 కామెంట్‌:

  1. చక్కని కృతులను ఉంచుతున్నారు. చాలా సంతోషం ఇలాగే మరిన్ని అపురూపమైన కృతులను ఉంచ ప్రార్థన

    రిప్లయితొలగించండి