31, జులై 2020, శుక్రవారం

సీతారామ కల్యాణం - లోకకల్యాణార్థం విశ్వామిత్ర జనకుల పాత్ర


శ్రీమద్రామయణంలో సీతారామ కల్యాణం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే, అది లోకకల్యాణార్థం రాముని అయనానికి నాంది. అందులో ముఖ్యమైన పాత్రలు విశ్వామిత్ర మహర్షి, రాజర్షి జనకుడు. వివరాలను పరిశీలిద్దాం.

విశ్వామిత్రుడు
===========

పిల్లలకు పెండ్లి చేస్తే బాగుండునని దశరథుడు అనుకుంటూ ఉండే సమయంలో విశ్వామిత్రుడు ప్రవేశిస్తాడు. సీతారాముల వివాహమైన మరునాడే విశ్వామిత్రుడు ఉత్తరగిరికి బయలుదేరి వెళతాడు. ఆ తరువాత మరల విశ్వామిత్రుని ప్రసక్తి రాదు. దీనిని బట్టి సీతారాముల కలయికకు, విశ్వామిత్రుని యాగసంరక్షణకు ఏదో అలౌకికమైన సంబంధం ఉన్నట్లు తోచుతుంది. యాగం అనే నెపంతో ఆయన రామకార్యార్ధమై వచ్చాడని కులగురువులు వశిష్ఠుల వారు దశరథునికి సూచనప్రాయంగా ఈ విషయం చెబుతాడు. ఈ రహస్యాన్ని తనంతట తాను విప్పి చెప్పటం ఇష్టం లేకనే విశ్వామిత్రుడు దశరథునితో అంటాడు - "మీ కుమారుడు ఎంతటి మహనీయుడో నాకు తెలుసు, అతనిలో దాగియున్న సత్య పరాక్రమాన్ని మీ వాత్సల్యం అవగాహనం చేసుకోలేకుండా ఉన్నది. కావాలంటే వశిష్ఠుణ్ణి లేదా మరో తపస్సంపన్నుణ్ణి అడుగు. వాళ్లకు తెలుసు" అని అంటాడు.

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం
వశిష్ఠశ్చాపి ధర్మాత్మా యేచేమే తపసి స్థితాః

సీతారాముల కల్యాణమే విశ్వామిత్రుని ధ్యేయం. మధ్యలో యాగ సంరక్షణ, రాక్షస వధ, అహల్యా శాపవిమోచనం అన్నీ ఈ పరమ కల్యాణ సంరంభానికి హంగులు. తమోగుణ ప్రధానమైన తాటకను సంహరించి, రజోలీనయై అదృశ్యగానున్న అహల్యను ఆవిష్కరించి, నిత్య సత్య సందీప్తమైన సాత్త్విక తేజస్సుతో అయోనిజగా జనకుని వాత్సల్యంతో పెరుగుతున్న జానకిని చేపట్టటమే రామభద్రుడు విశ్వామిత్రుని అనుసరించటంలో సాధించిన సత్త్వసిద్ధి. విశ్వామిత్రుడు గాయత్రీమంత్ర ద్రష్ట. రామాయణం గాయత్రీ బీజ సంహిత. ఇరవై నాలువు వేల శ్లోకాలలో వేదమాతను బీజరూపంగా ప్రతిబింబింపజేసిన వాల్మీకి రచనకు మూలాధారం విశ్వామిత్రుని పాత్ర. ఈ మహర్షి సాధించిన సీతారామ సమాగమం సీతాసమేత అయిన రాముని అయనానికి మొదటి మెట్టు.

జనకుడు
=======

ఈ సమాగంలో రహస్యం, దీనికి గల ప్రాశస్త్యం జనకుడు పాణిగ్రహణ సందర్భంలో సూత్రప్రాయంగా సూచిస్తాడు. రామభద్రునికి సీతమ్మను అప్పగిస్తూ, ఆ రాజర్షి అన్న మాటలు మంత్రభావంతో మననం చేయదగినవి.

ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా

ఇదిగో మా అమ్మాయి సీత, నీకు ధర్మకార్య నిర్వహణలో సహచరిగా ఉపకరిస్తుంది. ఈమెను స్వీకరిస్తే నీకు శుభం చేకూరుతుంది, ఈమెను పాణిగ్రహణం చేసి చేదోడు వాదోడుగా జీవితం సాగించండి. ఇదీ జనకుని సందేశ సారం. ఇందులో రామాయణ మహాయనమంతా సూక్షంగా గోచరిస్తుంది. వాల్మీకి వర్ణించిన సీతాకల్యాణ ఘట్టానికి ప్రాణప్రాయమైనది ఈ శ్లోకం. మొదటి పంక్తిలో ఇయం (ఈమె), మమ (నా), తవ (నీ) మూడు సర్వనామాలున్నాయి. ఇవి కేవలం సీత, జనకుడు, రాముడికే కాక జీవధానిలోని జీవధారులందరికీ వర్తించే సర్వనామాలు. మా అమ్మాయి సీత, మా ఇంట్లో పెరిగి మీ ఇంటికి వెళుతున్నది, ఎందుకు? ధర్మం నిలబెట్టేందుకు. ఈమె యందు నీకు పరిపూర్ణమైన అనురాగం (ఇచ్ఛ) ఉంటే నీకు శుభం కలుగుతుంది. ఎన్ని చిక్కులు వచ్చినా, ఎన్ని ఆపదలు ముంచుకు వచ్చినా మీ యిరువురి మధ్య ఈ ఇచ్ఛాశక్తి దృఢంగా ఉంటే మీకేమి అపాయం లేదు, ఇచ్ఛకు, ప్రతీచ్ఛకు మధ్య చిన్న పెద్దలు, హెచ్చు తగ్గులు, హాని వృద్ధులు ఉండేందుకు అవకాశం లేదు. సమరస భావం సహచరుల జీవితానికి సంతోషం, సార్థకత సమకూర్చగలుగుతుంది అని జనకుని భావం. సాక్షాత్తూ జగన్మాత తన యింట పెరిగినందుకు, అలాంటి సీతమ్మను పరమేష్ఠి స్వరూపుడైన రాముని చేతుల్లో పెడుతూ జనకుడు ఎంతగా ఏ దిక్కున పొంగిపోయి ఉంటాడో "మమ సుతా" అనే వాక్యం చెబుతుంది. "ఇయం సీతా" అనటంలో సీతాదేవి పుట్టుపూర్వోత్తరాలు, "తవ" అన్న మాటలో దశరథనందనుని ఘనత వేయి విధాల వ్యక్తమవుతున్నట్లు భావించాలి.

శ్రీ గురుభ్యోనమః. శ్రీసీతారామచంద్ర పరబ్రహ్మణే నమః.

25, జులై 2020, శనివారం

సారసాక్షిసదా పాహి మాం - శ్యామశాస్త్రి


సారసాక్షి! సదా పాహి మాం! కుమార జనని! సరస హృదయే!
పరాశక్తి! బాలే! సుశీలే! అపార మహిమా స్ఫూర్తే! శివే!

కోటి సూర్య ప్రభే! కోమలే! త్రికోణ నిలయే! కనక సదృశే!
కటి ధృత కాంచే! సలీలే! ప్రకాశ సుగుణ కీర్తే! ఉమే!

శ్యామ కృష్ణ నుతే! శ్యామలే! శ్రీ కామకోటి పీఠ సదనే!
సామగానలోలే! సుశోభే! విశాల హృదయ మూర్తే! శుభే!

కలువల వంటి కన్నులు గల కుమారస్వామి జననీ! కరుణా హృదయము కల పరాశక్తీ! బాలాత్రిపురసుందరీ! సుగుణవతీ! అపారమైన మహిమలను కురిపించే శివానీ! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము. కోటి సూర్యకాంతులతో, కోమలమై, త్రికోణములో నివసిస్తూ బంగారు కాంతితో యున్న, కటి భాగమున మ్రోగే గజ్జలను ధరించిన, లీలావినోదినియైన, సుగుణములు కలదానిగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఓ ఉమా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము. నల్లని కృష్ణునిచే నుతించబడిన, కామకోటి పీఠములో నివసించే, సామగానమును ఆనందించే, అద్భుతముగా ప్రకాశించే, విశాలహృదయమునకు రూపమై సమస్త శుభములను కలిగించే శ్యామలా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము.

లలితాంబికాం చింతయామ్యహం - దీక్షితుల వారు



లలితాంబికాం చింతయామ్యహం
శ్రీ గురుగుహ పూజిత పరాంబికాం

త్రిలోక రాజ్ఞీం దీన రక్షిణీం
త్రికోణ వాసినీం భండ మర్దినీం

కలా రూపిణీం కాత్యాయనీం
కంజ లోచనీం కనక మాలినీం
పాలిత మంత్రిణ్యాది సమూహాం
పశుపతి హృదయానందకర మోహాం

కుమారస్వామిచే పూజించబడిన, పరదేవతయైన లలితాంబికను నేను ధ్యానించుచున్నాను. ముల్లోకములకు మహారాజ్ఞియైన, దీనులను రక్షించే, త్రికోణములో నివసించే, భండాసురుని వధించిన లలితాంబికను నేను ధ్యానించుచున్నాను. సకల కళలకు రూపమైన, కాత్యాయని అయిన, కలువల వంటి కన్నులు గల, బంగారు ఆభరణములు గల, మంత్రిణి మొదలైన దేవతా సమూహమును పాలించే, పరమశివుని హృదయానికి ఆనందం కలిగించి మురిపించే లలితాంబికను నేను ధ్యానించుచున్నాను.

- ముత్తుస్వామి దీక్షితుల వారు

కాత్యాయని అన్న అమ్మ నామానికి అద్భుతమైన వివరణ ఇచ్చారు కందాళై రామానుజాచార్యుల వారు. కతి అయనాని అస్య కాత్యాయని. కతి అంటే ఎన్ని, అయనము అంటే మార్గము. కతి అయనాని అంటే మోక్షానికి ఎన్ని దారులు? కర్మ, భక్తి, జ్ఞాన మార్గములలో ఉపాసన అనేవి ప్రధాన మార్గాలు. ఏ మార్గములలో ఆరాధించినా, నన్ను ఆరాధించి దుఃఖనివృత్తిచే ఆనందాన్ని పొందవచ్చు అన్న దానికి సంకేతం కాత్యాయని నామం.

సరసిజనాభ సోదరి - దీక్షితుల వారు


సరసిజనాభ సోదరి శంకరి పాహి మాం

వరదాభయ కరకమలే శరణాగత వత్సలే

పరంధామ ప్రకీర్తితే పశుపాశ విమోచితే
పన్నగాభరణ యుతే నాగగాంధారీ పూజితాబ్జపదే
సదానందితే సంపదే వర గురుగుహ జనని మద శమని
మహిషాసుర మర్దిని మందగమని మంగళవర ప్రదాయిని

శ్రీహరి సోదరివైన శంకరీ! నన్ను రక్షింపుము. వరద అభయ ముద్రలతో కమలములవంటి హస్తములు కలిగిన, శరణు కోరిన వారిపట్ల వాత్సల్యము చూపించే శంకరీ నన్ను రక్షింపుము. శ్రీహరిచే నుతించబడే, భవబంధముల నుండి విముక్తి కలిగించే, నాగాభరణమును ధరించే శివునితో కూడి యుండే, నాగగాంధారి రాగములో పూజించబడిన పాదములు కలిగిన, సచ్చిదానందమనే సంపదను కలిగించే, శ్రేష్ఠుడైన కుమారస్వామి జనని అయిన, రాక్షసులలో మదమును తొలగించే, మహిషాసురుని వధించిన, నెమ్మదిగా నడచే, మంగళకరమైన వరములను ప్రసాదించే శంకరీ నన్ను రక్షింపుము.

పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి - మహావైద్యనాథ అయ్యరు


పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కృపాకరి శంకరి

ఏహి సుఖం దేహి సింహవాహిని దయాప్రవాహిని మోహిని

భండ చండ ముండ ఖండని మహిష భంజని రంజని నిరంజని
పండిత శ్రీ గుహదాస పోషణి సుభాషిణి రిపు భీషణి వర భూషణి

కృపను ప్రసాదించే ఓ శాంకరీ! రాజరాజేశ్వరీ! నన్ను రక్షింపుము. సింహవాహినివై దయను ప్రవహింపజేసే మోహినీ, నాకు సుఖమును ప్రసాదించుము. భండ, చండ, ముండాసురులను, మహిషాసురుని సంహరించి లోకములకు ఆనందము కలిగించిన నిర్మలమైన తల్లీ! పండితుడైన శ్రీగుహదాసుని పోషించే తల్లీ! మంచి వాక్కు గలిగిన మాతా! శత్రువులను పారద్రోలి వరములనొసగే రాజరాజేశ్వరీ! నన్ను రక్షింపుము.

- మహావైద్యనాథ అయ్యరు

అద్భుతాలు - పరమాచార్యుల అభిప్రాయం



సనాతన ధర్మంలో అనేకులైన మహనీయులు, గురువులు, సన్యాసులు ఎన్నో అద్భుతాలను లీలలుగా చేసి చూపించారు. నేటి కాలంలో చాలామందిని వేధించే ప్రశ్న ఆ అద్భుతాలు అవసరమా? అవి నిజమా? ప్రజలను మోసం చేసేవా? దీని గురించి పరమాచార్యుల వారి అభిప్రాయమేమిటి? ఎస్. బాలకృష్ణన్ గారు 1930 దశకం నుండి పరమాచార్యుల వారి భక్తులు. ఆయన ఒకసారి ఒక చిన్న సమూహంలో దీని గురించి చెప్పిన సమాధానాన్ని మనకు వివరించారు.

"ప్రజలకు అనేకానేక కామ్యములు. అవి తీర్చుకోవటానికి ఇలాంటి అద్భుతాలు చేసే వారి వద్దకు వెళుతూ ఉంటారు. అసలు అద్భుతాలు ఎవరు చేయగలరు? సిద్ధి పొందిన వారు మాత్రమే. ఇక్కడ రెండు ప్రయోజనాలున్నాయి - ఒకటి ఆ వ్యక్తి తాను ఉపాసన చేసిన దేవతపై మరింత మందికి నమ్మకం కలిగించటం, రెండవది ఆర్తులైన వారి కామ్యము/సమస్యను తీర్చటం. రెండూ కూడా మానవ జన్మ ఎత్తినందుకు సహజమైనవే, అద్భుతాల ద్వారా అటువంటివి తీరటం కూడా సబబే. సమస్యల్లా 1. అది ఆ వ్యక్తులు చేశారనుకోవటం 2. ఆ వ్యక్తులు అలా సిద్ధుల ప్రదర్శన వద్దే ఆగిపోవటం.

మరి దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?

1. ఎవరు ఏ సిద్ధిని ఉపయోగించి ఎటువంటి అద్భుతాలు చేసినా, అది పూర్తిగా పరమాత్మ లీలగానే భావించాలి. ఒక వ్యక్తి యొక్క గొప్పతనంగా భావించరాదు. ఆ వ్యక్తి రూపంలో పరమాత్మ ఉన్నాడని, ఒక పెద్ద కారణం చేతనే అలా అద్భుతాలు చేయబడుతున్నాయని భావించి తీరాలి. అప్పుడే మానవీయ పరిధిని దాటి ఆ అద్భుతాలను పరిశీలించగలము.

2. సిద్ధులు అనేవి ఆధ్యాత్మిక మార్గంలో సహజంగా కలిగే ఫలితాలు. వాటిలోనే మునిగిపోతే ఆధ్యాత్మిక ప్రయాణం ఆగిపోయినట్లే. సమాజ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని, దాని శ్రేయస్సు కోసం, వ్యక్తిగత అభ్యున్నతి కోసం సిద్ధులను దాటి ప్రయాణించగలగాలి, అటువంటి వ్యక్తుల వద్దకు వెళ్లే వారికి కూడా అదే ప్రధాన ఆకర్షణ కారాదు. ఒక వ్యక్తి సిద్ధులను సాధించగలిగాడంటే అతను మరింత ఎంత సాధించగలడో అన్నది ఆలోచించి శాశ్వతమైన ఆనందం కోసం పాటుపడే పరిస్థితులను ఆ వ్యక్తి, అతని వద్దకు సమస్యలతో వెళ్లే వారు కలిగించాలి. తప్పకుండా సిద్ధులు కలిగిన మానవులు ఇతరుల కన్నా ఆధ్యాత్మికంగా ముందున్నట్లే. కానీ, అక్కడే ఆగిపోకూడదు, అవే పరమావధి కారాదు. "

మరి పరమాచార్యులు ఏమి చేశారు? అద్భుతాలను అర్హులైన వారికి అనుభూతులుగా అందజేశారు, వాటిని స్వయంగా బహిర్గతం చేయలేదు, ప్రచారం కూడా చేయలేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక స్త్రీ ఎన్నో సమస్యలలో ఉండి స్వామి వారి వద్దకు వచ్చి వేడుకుంది. స్వామి ఆమెకు ఒక గంధపు ముద్దనిచ్చి దానిని కామాక్షీ అమ్మ రూపంగా నమ్మకంతో, విశ్వాసంతో ఆరాధించమన్నారు. ఆమె అలాగే చేసింది. ఆమె చూపిన నమ్మకానికి, భక్తికి ఆ గంధపు ముద్ద కొన్నాళ్లకు అమ్మ రూపంగా పరిణామం చెందసాగింది, ముఖము, చెవులు, ముక్కు, కాళ్లు, చేతులు ఆకృతులు ఆ గంధంలో ఉద్భవించాయి. ఆమె సమస్యలు తీరాయి. ఇక్కడ అద్భుతం ఎవరిది? ఆలోచిస్తే మనం నేడు ఎదుర్కుంటున్న విపరీతాలకు సమాధానం దొరుకుతుంది.

శ్రీ చంద్రశేఖర గురోర్భగవాన్ శరణ్యే!

(కామకోటి పీఠం వెబ్‌సైట్ మరియు ఇతర మూలల నుండి అనువాదం)

అంతయు నీవే హరి పుండరీకాక్ష - అన్నమాచార్యుల వారు


అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ

కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ

తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన
వినికియు నీవే విఠ్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా

పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ
ఇట్టే శ్రీవేంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే

కలువలు వంటి కన్నులు గల శ్రీరామా! ఈ విశ్వమంతా నీవే, నాకు చెంతననున్నది నీవే. కరుణకు నెలవైన ఓ గోవిందా! నా కులము, నీవే. భూదేవిని ధరించే శ్రీహరీ! నా తలపులు నీవే. కమలనాభా! నీవే నా నెలవు. ఓ దామోదరా! నా శరీరము నీవే. మధుసూదనా! నా నివాసము నీవే. ఓ విఠ్ఠలుడా! నా మాటలు ఆలకించేది నీవే. విష్ణుదేవా! నా ముందు వెనుక రక్షణ నీవే. ఓ పురుషోత్తమా! పుట్టుక నీవే. ఓ నారాయణా! జీవనము, అంతము నీవే. ఓ శ్రీవేంకటేశ్వరా! నాకు పరమగతి ఇంక నీవే!

- తాళ్లపాక అన్నమాచార్యుల వారు

రోజులు మారాయి – 1955: చిత్ర విశేషాలు

1955లో విడుదలైన రోజులు మారాయి సారథి ఫిలిమ్స్ నిర్మించిన సామాజిక చిత్రం. 1939లో రైతుబిడ్డ ద్వారా రైతుల సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన సారథి సంస...