13, ఆగస్టు 2010, శుక్రవారం

రాజకీయ ముఖ చిత్రం



ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మారుతోంది, స్పష్టమవుతోంది. మన రాష్ట్ర రాజకీయ చతుర్ముఖ పారాయణం ఎలా ఉందంటే:
  1. కాంగ్రెస్: అంతర్గతంగా, జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని అణచివేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం దాదాపు నిర్ణయించినట్టే.  వారిని అన్ని విధాల పరీక్షించి, ముప్పతిప్పలు పెట్టి, అవినీతి, అక్రమాల కేసులు త్రవ్వి వాటి ద్వారా వారిని చెక్ లో పెట్టాలన్నది వారి వ్యూహం. ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్ తో పది-పదిహేను కన్నా ఎమ్మెల్యేలు వెళితే గొప్ప అని రాజకీయ వర్గాల ఉవాచ. ఒక వేళ జగన్ ఓర్పు నశించి పార్టీ నుంచి బయటకు వెళ్లినా రోశయ్య ప్రభుత్వానికి ముప్పు లేకుండా ప్రజారాజ్యం పార్టీని తమవైపు తిప్పుకోవటంలో సఫలమయ్యారు కాంగ్రెస్ అధినేతలు.  ఇక రెండోవైపు,  ప్రతిపక్షమైన తెలుగుదేశాన్ని బలహీన పరచటానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని వైపులనుంచి వ్యూహం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. తెలంగాణా రావటం దాదాపు ఖాయం కాబట్టి ఆ విషయంలో పైపైన తప్ప పెద్దగా  తాము మాట్లాడటం అనవసరం అనే ధోరణిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్లు. ఇక రోశయ్యగారి పాలన ఉప్పు వెయ్యని ముద్ద పప్పులా చప్పగా ఉంది. ప్రజల వ్యతిరేకం ఇప్పుడు లేకపోయినా నాలుగేళ్లలో గట్టి నాయకత్వం లేకపొతే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవటం కష్టమే. 
  2. తెలుగుదేశం: దిక్కుతోచని, అయోమయం పరిస్థితిలో ఈ పార్టీ ఉంది. ఒకపక్క చంద్రబాబుగారు తెలంగాణా మీద ఏమి మాట్లాడలేక, పార్టీలో చీలిక రాకుండా త్రాసును అటు ఇటు  బ్యాలెన్స్ చెయ్యటంలో సతమతమవుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ + ప్రజారాజ్యం లోపాయకారి ఒప్పందంతో దెబ్బతిన్న తర్వాత ఆ పార్టీ ఆ ఓటమి నుంచి ఇంకా బయటకు రానట్టే. బాబ్లీ గోల, బాబు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. పార్టీలో ఆత్మ విశ్వాసం దెబ్బ తిని మళ్లీ వలస మొదలవ్వకుండా బాబు ఎన్నాళ్లు ఆపగలరో సమయమే చెప్పాలి.
  3. టీ.ఆర్.ఎస్: తెలంగాణ ఉపఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చూసిన తెలుగుదేశం పార్టీని ఇంకా దెబ్బతీయటానికి టీ.ఆర్.ఎస్ మాటల తూటాలు పేల్చి టీ.డీ.పీ నాయకుల్లో నిరాశ నిస్పృహలు సృష్టించి వారిని ఆ పార్టీ లోనుంచి బయటకు లాగాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఉపఎన్నికల విజయాలతో తన వ్యూహరచన ఫలించినట్టే అని కే.సి.ఆర్ భావన. టీ.డీ.పీ, కాంగ్రెస్ నాయకుల మీద పదునైన మాటల దాడి ప్రయత్నంలో ఉన్నారు ఆయన. మొత్తానికి ఉద్వేగ పూరిత పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనం టీ.ఆర్.ఎస్ పునరుత్థానానికి కారణమయ్యాయి.
  4. ప్రజారాజ్యం: టీ.డీ.పీ వోటుబ్యాంకును చీల్చి తన ఉనికిని నిలుపుకోవాలని తహ తహలాడుతున్న ప్రజారాజ్యం పార్టీ దీని కోసం కాంగ్రెస్ జట్టు కట్టి వారి సాయంతో ఈ కార్యంలో ముందుకు సాగాలని ఆశ.   విమర్శలే కాదు ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చుకొని ప్రతిపక్షమనే పదానికి కొత్త అర్థం ఇస్తున్నాము అని చిరంజీవి గారు ఎంత చెప్పినా, ఆయనకు రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతపు ముఖ్యమంత్రి కుర్చీపై కన్ను ఉంది, దాని కోసం కాంగ్రెస్ నాయకత్వంతో అపవిత్రమైన లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు అన్నది గట్టి ఊహాగానం. అది నిజం అయ్యే అవకాశాలు ఎక్కువే.

మొత్తం మీద:

కాంగ్రెస్: ఎక్కడి గొంగళి అక్కడే, వర్గాలు, కుమ్ములాటలు;
టీ.డీ.పీ: అయోమయం, నిరాశ;
ప్రజారాజ్యం: కలల ఊహల్లో ఆశావహం;
టీ.ఆర్.ఎస్: సమరోత్సాహం, ప్రత్యేకరాష్ట్ర దిశలో స్పష్టమైన అడుగు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి