7, ఫిబ్రవరి 2026, శనివారం

శృంగేరి శారదా పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి చరిత్ర



సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాఙ్ముఖం
నౌమి శాస్త్రేషు నిష్ణాతం చన్ద్రశేఖరభారతీం


ఇంద్రియ విషయములకు అతీతులై నిరంతరం ధ్యానమగ్నులై వేదవిద్యా నిష్ణాతులై జీవించిన చంద్రశేఖర భారతీస్వామి వారికి నమస్సులు.

ఈ కర్మభూమిపై గత శతాబ్దకాలంలో జీవన్ముక్తులైన మహాత్ములు కొద్దిమందిలో శృంగేరి శారదాపీఠం 34వ అధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ తీర్థ స్వామి వారు ఒకరు. మహాలయ ఆమావాస్య, వారి పుణ్యతిథి. మన పుణ్యభూమిపై నడయాడిన ఆ మహనీయుని వివరాలు సంక్షిప్తంగా:

శృంగేరి పుణ్యక్షేత్రంలో ఈశ్వరి గోపాలశాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులు ఉండేవారు. వారికి 11 మంది బిడ్డలు జన్మించినా ఒక్కరూ బతకలేదు. అప్పటి శృంగేరి శారదా పీఠాధిపతులైన సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారిని ఆశ్రయించగా స్వామి వారు వారిని అనుగ్రహించి సత్సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. ఆ సంతానం వల్ల తల్లిదండ్రులతో పాటు శృంగేరి సంస్థానానికి, భరతభూమికి మేలు కలుగుతుందని, కాబట్టి అతనిని శారదాంబ సేవకు అంకితం చేయమని సూచించారు. గోకర్ణం తీర్థయాత్ర వెళుతున్న దంపతులకు మహాబలేశ్వరుడు స్వప్న సాక్షాత్కారమిచ్చి పురుష సంతానం కలుగుతుందని చెబుతాడు. 1892వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన, నందన నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు వారికి మగబిడ్డ జన్మించాడు. స్వామి వారి అనుగ్రహంతో ఆ తల్లిదండ్రులు బాలునికి నరసింహశాస్త్రి అని నామకరణం చేశారు.

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు దైవానుగ్రహంతో జన్మించిన నరసింహశాస్త్రి చిన్ననాటి నుండే ప్రాపంచిక విషయాల పట్ల నిరాసక్తితో, పూర్తిగా అంతర్ముఖుడై జ్ఞాన సముపార్జనలోనే ఉండేవాడు. శృంగేరి శారదాపీఠం కార్యనిర్వాహకులైన శ్రీకంఠ శాస్త్రి గారి వద్ద నివసిస్తూ విద్యాభ్యాసం చేశాడు. చిన్ననాటి నుండి నరసింహకు మూకపంచశతి అంటే మహా ప్రీతి. దానిని పఠిస్తూ తన్మయత్వంలో ఉండేవాడు. అలా ఒకసారి దానిని పఠిస్తూ బాహ్యప్రపంచాన్ని మరచి శృంగేరి పరిసరాలను దాటి కూడా వెళ్లాడు. నరసింహశాస్త్రికి బాలమేధావి, అమితమైన జిజ్ఞాస మరియు జ్ఞాపకశక్తి కలవాడు. ఆంగ్లభాషను పాఠశాలలో, సంస్కృతాన్ని ఇంట్లో తండ్రి వద్ద అభ్యసించాడు. నరసింహునికి ఎనిమిదవ ఏట బ్రహ్మోపదేశం హరిగింది. త్రికాల సంధ్య, ద్వికాల అగ్నికార్యం చేసే క్రమశిక్షణకు ఆ వయసులోనే నరసింహుడు అలవాటు పడ్డాడు. 11వ ఏట పీఠాధిపతుల సూచనతో నరసింహుడు శృంగేరిలోని సద్విద్యా సంజీవని సంస్కృత పాఠశాలలో చేరారు. ఆ స్వామి వారే బెంగళూరులో స్థాపించిన భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యా అభివర్ధని పాఠశాలలో మీమాంస మరియు వేదాంతములలో ఉన్నత విద్యనభ్యసించారు. ఆ గురువుల మనోసంకల్ప ఫలంగా నరసింహుడు అద్భుత విద్యా ప్రావీణ్యంతో చంద్రశేఖర భారతీస్వామిగా 1912లో ఉత్తరాధికారిగా నియమించబడ్డారు. ఆ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో శివాభినవ నృసింహభారతీ స్వామి వారు విదేహముక్తి పొందగా చంద్రశేఖర భారతీస్వామి వారు శృంగేరి శారదా పీఠం 34వ అధిపతిగా పీఠాన్ని అధిరోహించారు.

వీరి హయాంలోనే శృంగేరి శారదా పీఠ నవీకరణ, శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి స్మృతిగా నృసింహవనం రూపొందాయి. 1916వ సంవత్సరంలో మైసూరు మహారాజా వారి సమక్షంలో శారదా క్షేత్రానికి కుంభాభిషేకం జరిగింది. 1924 వారు మైసూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో విజయ యాత్ర చేశారు. 1927లో ఆదిశంకరుల జన్మస్థలమైన కాలడిలో వేదాంత పాఠశాలను స్థాపించారు. మైసూరు ట్రావంకోర్ సంస్థానాలలో పర్యటించిన తరువాత శృంగేరి తిరిగి వచ్చారు. దీని తరువాత స్వామి వారు పూర్తిగా తపోమగ్నులై, అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి శిష్యులకు భాష్యములు బోధించేవారు. 1931లో పీఠం యొక్క నిర్వహణకై తన శిష్యుడైన శ్రీనివాసశాస్త్రికి సన్యాసమిచ్చి అభినవ విద్యా తీర్థ స్వామిగా నామకరణం చేసి ఉత్తరాధికారిగా ప్రకటించారు. దాదాపుగా అప్పటి నుండి పీఠం బాధ్యతలను అభినవ విద్యాతీర్థులే నిర్వహించారు. దీనికి మైసూరు రాజాస్థానం కూడా ఎంతో తోడ్పడింది. 1938 ప్రాంతంలో చంద్రశేఖర భారతీ స్వాముల వారు బెంగళూరు, మైసూరు, కాలడిలలో పర్యటించారు. తరువాత పూర్తిగా అవధూత స్థితిని పొంది ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉన్నారు. కేవలం శిష్యులకు వేదాంత బోధలో మాత్రమే మాట్లాడే వారు. 1945 నుండి స్వామి వారు పూర్తి అవధూత జీవితాన్ని గడిపారు. సత్యాన్వేషులకు, పాలకులకు మాత్రమే దర్శనమిచ్చే వారు, మిగిలిన సమయమంత తపోదీక్షలోనే. 1954లో భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు శృంగేరి పర్యటించి స్వామి వారితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించి వారి ఆశీర్వాదం పొందారు.

అవధూతగా స్వామి వారు తమ తపోశక్తితో అద్భుతమైన దేహకాతిని పొంది శారదాంబ ప్రత్యక్ష రూపంగా భక్తులకు గోచరించేవారు. 1954 సంవత్సరంలో స్వామి వారు దేహత్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. మహాలయ అమావాస్య, అనగా, 1954 సంవత్సరం సెప్టెంబర్ 26న తుంగా నదిలోకి వెళ్లి పద్మాసన స్థితిలో, దేహానికి ఎటువంటి కష్టమూ లేకుండా, ఆత్మకు ఎటువంటి క్షోభ లేని సచ్చిదానంద స్థితిలో దేహత్యాగం చేశారు. దీనికి ఆనాటి శిష్యులే ప్రత్యక్ష సాక్షులు. డాక్టర్లు దేహపరీక్ష చేసి పరిపూర్ణమైన ఆరోగ్యస్థితిలోనే స్వామి వారు సంకల్ప మాత్రంచే దేహత్యాగం చేశారు అని ఆశ్చర్యపోయారు. అభివన విద్యాతీర్థుల వారు వీరి గురువుల సమాధి పక్కనే శివలింగంతో స్మారకం నిర్మించారు.

చంద్రశేఖర భారతీస్వామి వారు గురురాజ సూక్తి మాలిక మరియు వివేకచూడామణి భాష్యం రచించారు. వీరు కంచి పరమాచార్యుల వారికి సమకాలీకులు. భరతజాతి అదృష్టం ఇద్దరు చంద్రశేఖరేంద్రులు ఒకే సమయంలో రెండు మహోన్నతమైన పీఠాలను అధిరోహించి సనాతన ధర్మ పరిరక్షణకు విశేషంగా తోడ్పడ్డారు. 42 ఏళ్ల పీఠాధిపత్యంలో తమ తపోశక్తిని పూర్తిగా ఆ క్షేత్ర పవిత్రతను కాపాడటానికి, ధర్మ రక్షణకు ధారపోశారు చంద్రశేఖర భారతీస్వామి వారు.

ఆ అవధూతకు పాదాభివందనములు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి