30, జూన్ 2015, మంగళవారం

వరాల బేరమయా వనరౌ బేరమయా - గోమాత ప్రాశస్త్యం


వరాల బేరమయా వనరౌ బేరమయా - గోమాత ప్రాశస్త్యం



వరాల బేరమయా వనరౌ బేరమయా
పరాకు చేయకు పదే పదే దొరుకదయా

ఓ.......అయ్యా
దేవతలు దీవించి పంపిన పశరమయ్యా
కొన్నవారికన్ని సిరులు కూర్చు గంగిగోవయ్యా

మనిషికున్న తెలివున్నది మనిషిలోని చెడులేనిది
కొందామని అందరు కొమ్ము కడితే కుమ్ముతుంది
కోరుకున్నవారి వెంట గోవులాగే వస్తుంది వరాల బేరమయా

పచ్చని లచ్చిమికి పసుపు కుంకుమ పెట్టి దినము
ప్రొద్దునే మొక్కుకుంటే పోతుంది పాపము
పాత్ర చూసి పాలను మనసు చూసి మంచిని
ఇచ్చేది ఈ ఆవు ఇదే కామధేనువు వరాల బేరమయా

గోవు ఈ భూలోకములో మానవులను ఉద్ధరించే కామధేనువు. ఈ సందేశాన్ని మనకు ఆర్యులు వేదవేదాంగాల ద్వార, ఉపనిషత్తుల ద్వారా యజ్ఞయాగాది క్రతువులు ద్వారా, పురాణముల ద్వారా మనకు తెలియజేశారు. గోవును పూజిస్తే వచ్చే ఫలితాలు, గోపంచకము (పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ) దివ్యౌషధములుగా ప్రాణికోటిని అనాదిగా కాపాడుతునే ఉన్నాయి. ఇటీవలి శాస్త్రపరిశోధనలు కూడా ఈ విషయాన్ని నిర్థారించాయి. 

శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం చిత్రంలో తపస్సు చేస్తున్న శ్రీనివాసుని కోసం బ్రహ్మ రుద్రులు లక్ష్మీదేవితో కలసి ధరించిన రూపాలు ఈ గీతం యొక్క సందర్భం. పౌరాణిక చిత్రాలలో మంచి సందేశమున్న గీతాలను తెలుగు సినీదర్శకులు అప్పట్లో రూపొందించేవారు. గోమాత ప్రాధాన్యతను, వైశిష్ట్యాన్ని జానపద తెలుగు భాషలో, వేషభూషణములతో ఈ గీతం పొందుపరచబడినది. అర్హత కలిగిన యజమాని కోసం లక్ష్మీదేవి ఈ గోవును వీధుల తిప్పుతూ పాడే పాట ఈ వరాల బేరమయా. 

ఎస్ వరలక్ష్మి గారి గొంతులో గాంభీర్యము, మాధుర్యము, తెలుగు భాషపై పట్టు చక్కగా పండేవి. ఒక ప్రత్యేకమైన గొంతు ఆవిడది. తన పాత్రలకు తానే పాడుకునే బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్ వరలక్ష్మి గారు. అద్భుతమైన నటనా కౌశలంతో పాటు సంగీతప్రవేశం కలిగి ఎన్నో చలనచిత్రాలలో నేపథ్యగాయనిగా ఆమె పాడారు. 

ఈ గీతంలో ఆచార్య ఆత్రేయ గారు గోమాత ప్రాశస్త్యాన్ని అద్భుతంగా తెలిపారు. 

వరాలను కురిపించే ఆవు, మంచి వనరులను (పాలు మొదలైనవి) ఇచ్చే దీనిని నిర్లక్ష్యం చేయద్దు, ఇటువంటి ఆవు పదే పదే దొరకదు. దేవతలు దీవించి పంపిన పశువు ఇది. కొన్నవారికి సకల సంపదలను ఇచ్చే గంగిగోవు ఇది. మనిషికున్న తెలివి ఆ గోవుకు ఉంది. కానీ, మనిషిలో ఉన్న చేదులేనిది. (ఎటువంతి స్వార్థం లేకుండా   మానవాళి మంచికోసం అద్భుతమైన పంచకాలను ప్రపంచానికి ఇస్తుంది). ఎవరు పడితే వారు కొందామని ముందుకు వస్తే కుమ్ముతుంది. సరైన అర్హత కలిగిన యజమాని వెంట అతి సాధుస్వభావంతో నడుస్తుంది. ఈ గోవు లక్ష్మీ దేవి ప్రతిరూపం. ఈ గోవును ప్రతి రోజు ఉదయం పసుపుకుంకుమలతో పూజించి మ్రొక్కితే పాపాలు తొలగిపోతాయి. పాత్రను చూసి పాలను, కొలిచే వాని మంచిని చూసి వారికి మంచిని ఇచ్చేది ఈ ఆవు. ఇది కామధేనువు.  వరాలను, వనరులను ఇచ్చే మంచి బేరము. అవకాశం పోగొట్టుకోకుండా కొనండి. 

ఆత్రేయగారి సాహిత్యంలో గోవు వైభవాన్ని మనకు సందర్భోచితంగా అందించారు. సమస్త పాపనాశిని, సకల కామితార్థ దాయిని, సమస్త పుణ్యదేవతా నివాసిని అయిన గోవును కాపాడుకోవటం సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి భారతీయుని కర్తవ్యం. మాంసం పేరిట పరమపూజనీయమైన, అతి పవిత్రమైన సాధుజంతువులను నిర్దాక్షిణ్యంగా, అతి దారుణంగా హింసించి వధించి భారతదేశ గోసంపదను నాశనం చేయటమే కాక, ఈ పవిత్రభూమికి అతి నికృష్టమైన పాపాన్ని అంటగడుతున్నారు ఈరోజు. గోవులను పెంచి, వాటి ఉత్పత్తుల వలన కలిగే అద్భుతాలను ప్రపంచానికి అందించేలా చేయవలసిన సమాజం వాటిని వధిస్తుంటే చూస్తూ ఊరుకోవటం మహాపాపం. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి గోమాతకు రక్షణ కలిపిద్దాం. 

పెండ్యాల సంగీతం, ఆత్రేయ సాహిత్యం, ఎస్ వరలక్ష్మి గారి నటన మరియు గాత్రంలో ఈ గోమాత గీతం చూడండి.

గావో రక్షతి రక్షితః!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి