16, జనవరి 2021, శనివారం

చిదంబర నటరాజమాశ్రయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో నటరాజస్వామి, శివకామసుందరీ అమ్మ వారు, ఈ క్షేత్రంలోనే ఉన్న గోవిందరాజస్వామిపై నాదజ్యోతి ముత్తుస్వామి దీక్షితుల వారు ఎన్నో కృతులను రచించారు. చిదంబర క్షేత్రం విశ్వానికి హృదయస్థానంగా, చిత్సభలో నటరాజస్వామి చేసే నాట్యం యొక్క లయే విశ్వానికి హృదయస్పందంగా చెప్పబడింది. ఎంతో నిగూఢమైన సందేశం కలిగిన కృతులను ఆయన ఈ క్షేత్ర దేవతలపై రచించారు. వాటిలో ముఖ్యమైనవి ఆనందనటనప్రకాశం, చిదంబరేశ్వరం, శివకామీపతిం చింతయేऽహం, శివకామేశ్వరీం చింతయేऽహం, శివకామేశ్వరం చింతయామ్యహం, చింతయేऽహం సదా చిత్సభా నాయకం, గోవిందరాజాయ నమస్తే, సతతం గోవిందరాజం మొదలైనవి. వీటితో పాటు చిదంబర నటరాజమాశ్రయేऽహం అన్న కృతిని కూడా రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

చిదంబర నటరాజమాశ్రయేऽహం శివకామీపతిం చిత్సభాపతిం

చిదంబరవిహారం శంకరం చిదానందకరం గురుగుహవరం
కేదారేశ్వరం విశ్వేశ్వరం కమలాపతి నుత పదం శశిధరం

భావం
=====

చిత్సభకు ప్రభువు, శివకామసుందరికి పతియిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. ఆకాశలింగ రూపములో చిదంబరంలో విహరించేవాడు, శాశ్వతమైన ఆనందమును కలిగించేవాడు, సుబ్రహ్మణ్యునికి వరములొసగినవాడు, కేదారేశ్వరునిగా కేదారనాథ్‌లో వెలసినవాడు, విశ్వమునకు ప్రభువు, లక్ష్మీపతి యైన శ్రీహరిచే నుతించబడిన పదములు కలవాడు, చంద్రుని తలపై ధరించినవాడు అయిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. 

శ్రవణం
======

కేదారం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఐశ్వర్యా శంకర్ గారు ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి