25, జులై 2020, శనివారం

ఇతడేనా ఈ లోకములో గల - భద్రాచల రామదాసు


ఇతడేనా ఈ లోకములో గల
పతితులనెల్లను పావనము చేయువాడు

పరిపూర్ణ కరుణచే బ్రహ్మాదుల గాచిన
నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు

ఇల లంకాపురమున అవనిజను బ్రోవ
బలుడైన రావణుని పరిమార్చిన వాడు

అలనాడు ద్రౌపదికి అక్షయ వలువలు
వలనొప్ప వొసగిన వైకుంఠ వాసుడు

ఈవేళ మునివరులు ఇతర చింతలు మాని
కేవలము మది నుంచి కొలువుగాచెడి వాడు

ప్రేమను దయతోనాపన్నుల బ్రోచుచు
రామదాసునేలు రామచంద్ర విభుడు

ఈ లోకములో ఉన్న పాపాత్ములను పావనము చేసేవాడు ఇతడేనా! పరిపూర్ణమైన కరుణతో బ్రహ్మాది దేవతలను కాపాడుటకు నరసింహావతారమునెత్తిన కలువల వంటి కన్నులు కలవాడు ఇతడే. ఈ భువిపై లంకానగరములో భూమిజయైన సీతను కాపాడుటకు బలవంతుడైన రావణుని సంహరించినవాడు ఇతదే. ఆనాడు ద్రౌపది మానరక్షణకై అక్షయముగా చీరలు ఎంతో ఒప్పుగా ఒసగిన వైకుంఠవాసుడితడే. ఈనాడు మునిశ్రేష్ఠులు ఇతర ఆలోచనలు మాని మనసులో నిలుపుకుని కొలిచెడి వాడు ఇతడే. ప్రేమతో దయతో ఆపన్నులను బ్రోచుచు రామదాసును కాపాడే రామచంద్ర ప్రభువు ఇతడే.

సరోజదళనేత్రి హిమగిరి పుత్రి - శ్యామశాస్త్రి


సరోజదళనేత్రి హిమగిరి పుత్రి!
నీ పదాంబుజములె సదా నమ్మినానమ్మ! శుభమిమ్మా! శ్రీ మీనాక్షమ్మా!

పరాకు సేయకు వరదాయని నీవలె దైవము లోకములో గలదా
పురాణి శుకపాణి మధుకరవేణి సదాశివునికి రాణి

కోరి వచ్చిన వారికెల్లను కోర్కెలొసగే బిరుదు కదా అతి
భారమా నన్ను బ్రోవ తల్లి కృపాలవాల నే తాళ జాలనే

ఇందుముఖి కరుణించుమని నిన్నెంతో వేడుకొంటిని నా
యందు జాగేలనమ్మా మర్యాదగాదు దయావతి నీవు

సామగాన వినోదిని గుణధామ శ్యామకృష్ణనుతే శుక
శ్యామలాదేవి నీవే గతి రతికామకామ్యద కావవే నన్ను

ఓ మధుర మీనాక్షమ్మా! కలువలవంటి కన్నులు గలిగి హిమవంతుని పుత్రిక అయిన నీ పాదపద్మములను నేను ఎల్లప్పుడూ నమ్మియున్నాను, నాకు శుభములు కలిగించుము. సనాతనమైన తల్లివి, చిలుకను కరమందు కలిగి, తేనెటీల సమూహంవలె దట్టమైన కురులు యున్న సదాశివుని రాణివి వరదాయినివి నీవు, నీ వంటి దైవము ఈ లోకములో లేదు, నా పట్ల నిర్లక్ష్యం చూపకుము. కోరి నీ వద్దకు వారికందరికీ కామ్యములను తీర్చే తల్లివని నీవు ప్రఖ్యాతి గాంచినావు, నన్ను బ్రోచుటకు అంత భారమా తల్లీ! కరుణామయి! నే తాళలేను నన్ను కాపాడుము. చంద్రుని వంటి ముఖము కలిగిన తల్లీ! నన్ను కరుణించమని ఎంతో వేడుకున్నాను, నన్ను బ్రోచుటకు ఆలస్యమెందులకు, నీవు దయావతివి కదా, ఇది నీకు మర్యాద కాదు. సామగానమును ఆనందించే తల్లివి, సమస్త శుభలక్షణములకు ఆలవాలము నీవు, శ్యామకృష్ణునిచే నుతించబడినావు, నల్లని ఛాయ గలిగిన శ్యామలాదేవీ! నీవే నాకు గతి. రతీమన్మథులను అనుగ్రహించినట్లు నన్ను బ్రోవుము.

దిబ్బలు వెట్టుచు తేలినదిదివో- అన్నమాచార్యుల వారు


దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస

అనువున కమలవిహారమె నెలవై ఒనరియున్నదిదె ఒక హంస
మనియెడి జీవుల మానస సరసుల వునికినున్నదిదె ఒక హంస

పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలాడెనిదె ఒక హంస
పాలుపడిన యీ పరమహంసముల ఓలినున్నదిదె ఒక హంస

తడవి రోమరంధ్రంబుల గ్రుడ్లనుడుగక పొదిగీనొక హంస
కడు వేడుక వేంకటగిరి మీదట ఒడలు పెంచెనిదె ఒక హంస

కుప్పలు కుప్పలుగా ప్రకాశిస్తూ అలలపై ఆనందంగా తేలినదదిగో వటపత్రశాయియనెడి హంస! కలువలు కొలనులో విహరిస్తూ అక్కడే నివసించేది హంస, మానవుల మనసులనే సరస్సులలో నివసించే వాడు ఈ పరమాత్మయనే హంస. పాలు నీళ్లు వేరు చేసి పాలలో ఓలలాడేది హంస, మంచి చెడుల విచక్షణతో స్వాధీనమైన మనసులు గల పరమహంసల హృదయములలో ఓలి యున్నది ఈ పరమాత్మయనే హంస. ఎంతో జాగ్రత్తగా తన రోమములలోని రంధ్రముల మధ్య గుడ్లను పొదిగేది హంస, ఎంతో వేడుకగా వేంకటాద్రిపై వెలసి భక్తులకు ఆధారమై యున్నది ఈ పరమాత్మయనే హంస.

ప్రళయ విలయం తరువాత ప్రశాంత కడలిపై వటపత్రశాయియై చిరునవ్వులతో తేలి పునః సృష్టిని చేసిన వాడు శ్రీహరి. ఆ సృష్టిక్రమంలోనే కలియుగంలో ఏడుకొండలపై పరమాత్మ వెలశాడు. మంచి చెడుల విచక్షణలో నిరంతరం ధ్యానంలో ఉండే జీవి హంసతో సారూప్యంగా పరమాత్మ తత్త్వాన్ని ఆవిష్కరించారు అన్నమాచార్యుల వారు. మానససరోవరములో నివసించే హంసను పరమహంసలైన యోగుల మానస సరోవరములలో నివసించే పరమాత్మను పోల్చి మానవులకు పరమాత్మ యొక్క విశ్వవిరాట్ రూపాన్ని సూక్షంగా తెలియజేశారు. పాలు నీళ్లను విచక్షణ చేసి పాలను స్వీకరించేది హంస అయితే పాపపుణ్యముల విచక్షణ చేసి పుణ్యములను స్వీకరించి, పాపములను హరించి ముక్తినిచ్చేవాడు శ్రీనివాసుడు. తన శరీరములో గుడ్లను జాగ్రత్తగా పొదిగి సృష్టి క్రమాన్ని ముందుకు నడిపేది హంస ఐతే తన రోమ రోమము నుండి ప్రాణికోటిని పరిపుష్టం చేస్తూ అద్భుతమైన సృష్టిని కొనసాగించేవాడు పరమాత్మ అయిన శ్రీనివాసుడు. ఎంత మహత్తరమైన సారూప్యం కదా? అందుకే అన్నమాచార్యుల వారు సద్గురువులైనారు.

ఓం నమో వేంకటేశాయ!

గోపికలకు శ్రీకృష్ణుని సందేశం


కృష్ణుడు గోకులం వీడిన తరువాత మరల గోపికల చెంతకు భౌతికంగా వెళ్లలేదు. ఆ స్వామి సందర్శనముకై వేచి యున్న గోపికలు ఉద్ధవుని వద్ద స్వామి గురించి నిష్ఠూరాలు పలుకుతారు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుని సందేశం వినిపిస్తాడు.

ఎల్ల కార్యములకు నేను ప్రధాన కారణముగావున మీకు రమణులార
కలుగదు మద్వియోగ చరాచర రూపములలో మహాభూతములు వసించు
కరణి నుండుదు సర్వగతుడనై నే మనః ప్రాణబుద్ధి గణేందిర్యాశ్రయుండ
నాత్మయందాత్మచేనాత్మ బుట్టింతు రక్షితును ద్రుంతు హృషీక భూత

గణ గణాకారమాత్మకు గొమరు మిగులు
నిబిడ మాయానుభవమున నిత్య శుద్ధ
మాత్మ విజ్ఞానమయమునై యమరు గుణము
బ్రకృతి కార్యమనోవృత్తి బట్టిపొందు

జగత్తులో జరిగే సమస్త కార్యాలకు తానే కారణమంటూ ప్రతి కార్యములోనూ తనను దర్శించమని తెలిపాడు. చరాచర రూపాలన్నిటిలోనూ అంతర్గతంగా జీవం ఎలా ఉంటుందో అదే విధంగా తాను అన్నిటా చర్మచక్షువులకు కనిపించకుండా మనస్సు, ప్రాణము, బుద్ధి, గుణములు, ఇంద్రియములను ఆశ్రయించి ఉన్నానని చెబుతాడు. ఆత్మలో ఆత్మ ద్వారా ఆత్మను పుట్టించి రక్షించి త్రుంచెదనని తెలిపాడు. బాహ్యదృష్టి వీడి ఇంద్రియ నిగ్రహులై అంతర్ముఖులైనట్లయితే ఆత్మనే అంటి ఉన్న తనను దర్శించగలుగుతారని స్పష్టం చేశాడు.

ఒక విధంగా గోపికలకు కంటికి దూరమైన తనను ఆత్మలో దర్శించమనడంలో సగుణారాధనం నుండి నిర్గుణారాధనకు చేరుకునే స్థాయిని, స్థితిని తెలియజేశాడు. సాధకులు ఆరంభంలో తమ దృష్టికి ఆకర్షణీయమైన దేవతా స్వరూపాలను ఎంచుకుని దానిపై దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ ఆలయాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆయా రూపాలను దర్శిస్తూ ఉండి రాను రాను కేవలం బాహ్య దృష్టికి మాత్రమే పరిమితం కాక ఆంతర్యంలో పరమాత్మ రూపాన్ని దర్శించగలిగే స్థాయికి చేరుకునే విధానం గోపికలు శ్రీకృష్ణుడు ఇచ్చాడు. కంటికి కనబడుతున్న వెలుగును అంతరాంతరాలలో నింపుకోగలగాలి. కంటికి కనబడేది సత్యమే అయినా అది శాశ్వతం కాదు. ఆ శాశ్వతం కాని దానిని అంతరంగంలో నిలుపుకుని శాశ్వతం చేసుకోవచ్చు. కనుకనే గోపికలతో ఎన్నో లీలలు చూపి మధురకు వెళ్లిన కృష్ణుడు తిరిగి ఎన్నడూ శారీరికంగా గోపికల దగ్గరకు బృందావనానికి రాలేదు.

ఎప్పుడూ నన్ను మీరలు చింతించుచునుండ గోరి యిటు దూరస్థత్వముంబొందితిం దలకం బోలదు నన్ను గూడెదరు నిత్యధ్యాన పారీణలై అని కృష్ణుడు గోపికలకు బోధిస్తాడు. కృష్ణుని సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు కనుకనే గోపికలు కృష్ణలీలలను మననం చేసుకుంటూ గడిపారు. అంతరంగంలో భగవంతుని ఏనాటికీ బంధించకపోతే సాధకుల సాధనకు అర్థం లేదు. అది సాధించిన వారు గోపికలు.

శ్రీకృష్ణపరమాత్మను ఊరకే జగద్గురుం అని బోధించలేదు. తల్లిదండ్రులకు, మిత్రులకు, సఖులకు, సతులకు, బంధుగణానికి, శత్రువులకు, సమస్త మానవాళికి ఎలా జీవించాలో ఎలా తరించాలో అద్భుతంగా బోధించి జగద్గురువైనాడు.

కులుకక నడవరో కొమ్మలాలా - అన్నమాచార్యుల వారు


అన్నమాచార్యుల వారు అమ్మవారిపై ఎన్నో కృతులను రచించారు, అందులో ఒకటి కులుకక నడవరో కొమ్మలాలా అన్నది ఒకటి. డాక్టర్ శోభారాజు గారు అద్భుతంగా ఆలపించిన కృతి ఇది. కుసుమ కోమలి అయిన అమ్మను జాగ్రత్తగా మోయమని అద్భుతంగా వర్ణించారు అన్నమయ్య.

కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీనీ జాజులు మాయమ్మకు

ఒయ్యనె మేను కదలీనొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాద తాకు కాంతలాలా
పయ్యెద చెరగు జారి భారపు గుబ్బల మీద
అయ్యో చెమరించీ మాయమ్మకు నెన్నుదురు

చల్లడి గందవొడి మైజారి నిలువరో
పల్లకి పట్టిన ముద్దు పణతులారా
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
ఘల్లనుచు కంకణాలు కదలీ మాయమ్మకు

జమళి ముత్యాల తోడి చమ్మాళిగలిడరో
రమణికి మణుల ఆరతులెత్తరో
అమరించి కౌగిట అలమేలుమంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు

సఖులారా, అలమేలుమంగమ్మ ధరించిన జాజులు జల జలా రాలుతాయి, ఎక్కువగా కులుకకుండా నిదానంగా నడవండి. మృదువైన అమ్మ దేహమును నొప్పించకుండా మెల్లగా నడవండి. అమ్మ పాదాలను తాకే కాంతలారా,ఆమె పాదాలు నొచ్చుకుంటాయి,స్తన్యములపై నుండి చీర తొలగుతుంది, ఇప్పటికే అమ్మకు అలసటతో చెమటలు పట్టాయి,నెమ్మదిగా నడవండి. అమ్మ పల్లకీని మోసే ఓ అందమైన స్త్రీలారా! అమ్మపై చల్లని గంధపు పొడి చల్లి అలరించండి, అమ్మ ధరించిన బంగారు మరియు ముత్యాల సరులు కలిగిన చీర కుచ్చెలు అదరకుండా జాగ్రత్తగా మోయండి. అమ్మకు ముత్యాల వరుసలు కలిగిన పాదరక్షలు ధరింపజేసి, మణులతోటి హారతులు ఇవ్వండి, ఎంతో అందముగా అమ్మను శ్రీనివాసుడు కౌగిట చేర్చుకున్నాడు, కులుకకుండా నడవండి!

24, జులై 2020, శుక్రవారం

నను పాలింప నడచి వచ్చితివో - త్యాగరాజస్వామి


నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణనాథ

వనజ నయన మోమును జూచుట జీ
వనమని నెనరున మనసు మర్మము దెలసి

సురపతినీలమణినిభ తనువుతో
ఉరమున ముత్యపు సరుల చయముతో
కరమున శర కోదండ కాంతితో
ధరణి తనయతో త్యాగరాజార్చిత

నా ప్రాణేశ్వరుడవైన శ్రీరామా! కలువల వంటి కన్నులు గలిగిన నీ మోమును జూచుటే నా జీవనమని నమ్మిన మనసులోని మర్మమును తెలుసుకొని నా పై దయతో నన్ను పాలించుటకు నడచి వచ్చితివా! శివునిచే అర్చించబడిన శ్రీరామా! ఇంద్రనీలమణి కాంతితో మెరిసే శరీరముతో, వక్షస్థలములో ముత్యాల హార సమూహముతో, చేతిలో కోదండము, బాణముల కాంతితో, సీతమ్మతో కూడి నన్ను పాలించుటకు నడచి వచ్చితివా!

త్యాగరాజస్వామి వారి కుమార్తె వివాహ సమయంలో శిష్యులు కొందరు సీతారాముల చిత్రపటాన్ని బహుకరించగా ఆయన ఆనందంతో ఆలపించ కృతి ఇది. మోహన రాముని మోహన రాగంలో నుతించారు త్యాగరాజస్వామి.

(చిత్రం వడ్డాది పాపయ్య గారు గీచినది)

గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు - త్యాగరాజస్వామి


గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు

కరుకైన హృద్రోగ గహనమును గొట్ట సత్

తనువు సుత ధన దార దాయాది బాంధవులు
జనియించి చెదరు జాలిని కరుణతో
మనసునంటక మంచి మందనుచు తత్వబో
ధన చేసి కాపాడు త్యాగరాజాప్తుడగు

ఎంతటి సద్గుణ సంపన్నుడైనా గురువు లేకుండా పరతత్త్వము బోధపడదు. హృదయములో జన్మించిన కర్కశమైన అజ్ఞానపు ఆలోచనలనే అరణ్యమును ఛేదించుట గురువులు లేకుండా సాధ్యము కాదు. శరీరము, బిడ్డలు, ధనము, భార్య, దాయాదులు మొదలైన బంధువులు ఇవన్నీ శాశ్వతము కాదు అనే సత్యాన్ని మనపై కరుణతో, ఆ సంసార వాసనలను మన మనసులకు అంటకుండా మంచి మందు లాగా తత్త్వబోధ చేసి కాపాడే సుజ్ఞానము గురువు లేకుండా ఎంతటి సద్గుణ సంపన్నునికైనా బోధపడదు.

శ్రీగురుభ్యోనమః _/\_

రోజులు మారాయి – 1955: చిత్ర విశేషాలు

1955లో విడుదలైన రోజులు మారాయి సారథి ఫిలిమ్స్ నిర్మించిన సామాజిక చిత్రం. 1939లో రైతుబిడ్డ ద్వారా రైతుల సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన సారథి సంస...