17, ఆగస్టు 2017, గురువారం

అలనాటి మధుర గాయని పీ లీల విశేషాలు


"నా తండ్రే నేను గాయనిగా స్థిరపడటానికి కారణం" అని చెప్పారు పొరయాతు లీలమ్మ గారు. రెండు దశాబ్దాల పాటు దక్షిణ భారత దేశపు భాషలలో మధురమైన గాత్రంలో శ్రోతలను మైమరపించిన కంఠం పీ లీల గారిది. 1934 మే 19న  కేరళలోని పాలక్కాడ్ జిల్లా చిత్తూరులో జన్మించిన పీ లీల కుంజమీనన్-మీనాక్షి అమ్మ దంపతులకు మూడవ బిడ్డ. తండ్రి ప్రోత్సాహంతో త్రిభువనమణి భాగవతార్, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి మేటి గాయకుల వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణను పొందారు. కూతురిని గాయనిగా చూడాలనుకున్న మీనన్ గారు ఆమెను చెన్నై తీసుకువెళ్లి గురుకుల పద్ధతిలో వడక్కన్‌చెర్రి రామభాగవతార్ గారి వద్ద శాస్త్రీయ సంగీతాన్ని నేర్పించారు. చెన్నైలో మహామహులైన అరైకుడి, చెంబై, జీఎన్‌బీ వంటి వారి సంగీతం వినే అవకాశం లీలకు దక్కింది. విన్న వెంటనే నేర్చుకోగలిగిన ప్రతిభ కలిగిన లీలకు చిన్ననాటినుండే పోటీలలో బహుమతులు వచ్చాయి. దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారు ఆమెకు ఆంధ్ర మహిళా సభ ద్వారా తొలి కచేరీ అవకాశం కలిగించారు. కొలంబియా రికార్డింగ్ సంస్థ ద్వారా నేపథ్య గాయనిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన లీల ఇక వెను తిరిగి చూడలేదు.

తమిళ, తెలుగు భాషలు రాకపోయినా, మళయాళంలో ఆ పాటలు రాసుకొని అద్భుతమైన ఉచ్చారణతో ఆ రెండు భాషలలో పేరొందారు. అలా 1948లో ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగులో మొట్టమొదటి సారిగా 1949లో మనదేశం, కీలుగుర్రం, గుణసుందరి కథ చిత్రాలలో పాడారు. ఘంటసాల గారు ఆమెకు మనదేశం చిత్రంలో పాడే అవకాశం కలిగించారు. గుణసుందరి కథ చిత్రంలో శ్రీరంజని గారిపై "శ్రీతులసి జయతులసి" అనే భక్తి గీతం ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక వరుసగా పాతాళభైరవి మొదలు పాండవవనవాసం వరకు ఓ 15-16 ఏళ్ల పాటు లీల గారు తెలుగు నేపథ్య గాయనీమణుల్లో అగ్రశ్రేణిలో నిలిచారు. 1960 దశకం చివరి భాగానికి ఆవిడ గొంతులో మాధుర్యం తగ్గింది. అప్పటికి సుశీలమ్మ, జిక్కి, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి మొదలైన వారు బాగా నిలదొక్కుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే నేపథ్య గాయని అంటే సుశీలమ్మే అనే పరిస్థితి అప్పటికి వచ్చేసింది. ఆపైన లీల గారు తెలుగులో పెద్దగా పాడలేదు. కాకపోతే ఆమె భక్తి పాటల ప్రపంచంలో ప్రైవేట్ ఆల్బంస్ ఎన్నో చేసి చాలా పేరుపొందారు, తన సంగీత ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆమె పాడిన నారాయణీయం, మూకాంబిక శతకం, అష్టపదులు దక్షిణాదిన ఎంతో పేరుపొందాయి.

లీలగారి తెలుగు సినీ జీవితంలో మరువలేని మైలురాయి లవకుశ చిత్రం. 1963లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె సుశీలమ్మ కలిసి లవకుశులకు అందించిన గాత్రం అజరామరమై నిలిచింది. ప్రతి ఒక్క పాట చాలా పేరొందింది. ఒకరకంగా తెలుగు నేపథ్య సంగీత జీవితంలో లీల గారికి  ఈ చిత్రం పతాక స్థాయి అని చెప్పుకోవచ్చు. 1968లో మహానటి సావిత్రి అందరూ మహిళలతో నిర్మించిన చిన్నారిలోకం చిత్రానికి లీలగారు సంగీత దర్శకత్వం వహించారు.

పాతాళభైరవి, బ్రతుకుతెరువు, జయసింహ, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, సువర్ణసుందరి, బబ్రువాహన, అప్పుచేసి పప్పుకూడు, పెళ్లినాటి ప్రమాణాలు, శాంతినివాసం, రాజమకుటం, జగదేకవీరుని కథ, పాండురంగ మహాత్య్మం, వేంకటేశ్వర మహాత్య్మం, లవకుశ, గుండమ్మ కథ, పరమానందయ్య శిష్యుల కథ, తిరుపతమ్మ కథ, దక్ష యజ్ఞం, సీతారామకళ్యాణం, పెళ్లి సందడి, మాంగల్య బలం  వంటి ఎన్నో చిత్రాలలో పాడారు. మొత్తం మీద దక్షిణాది భాషలలో 5000కు పైగా పాటలు పాడారు. 1984లో విడుదలైన ఎన్‌టీరామారావు గారి శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రంలో నీవెవరో నీ జన్మం ఏదో అనే పాట ఆవిడ తెలుగు చిత్రాలలో పాడిన ఆఖరిది. లీలగారికి 1992లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డును, భారత ప్రభుత్వం 2006లో మరణానంతరం పద్మభూషణ్ అవార్డులను ప్రదానం చేశారు. వారికి  హృదయపూర్వకమైన నివాళి.

ఆవిడ పాటిన పాటలలో నాకు అత్యంత ప్రియమైనది రాజమకుటం చిత్రంలోని సడి చేయకో గాలి సడి చేయబోకే.

దేశమును ప్రేమించుమన్నా - మహాకవి గురజాడ




107ఏళ్ల క్రితం గురజాడ అప్పారావు గారు రచించిన ఆ దేశభక్తి పద్య సంపుటి ఇప్పటికీ ఎంత సముచితమో గమనించండి. కాలం ధాటిని తట్టుకునే శక్తి కొంత మంది కవుల రచనలకు మాత్రమే ఉంటుంది. వాటిలో గురజాడ ఈ రచన ఒకటి.

దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వట్టి మాటలుకట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయ్!

పాడి పంటలు పొంగి పొర్లే
దారిలో నువు పాటు పడవోయ్
తిండి కలిగితె కండ గలదోయ్
కండ గలవాడేను మనిషోయ్ !

ఈసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుపడునోయ్?
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
దేశి సరుకులునించవోయ్!

అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్
దేశి సరుకుల నమ్మవలెనోయ్
డబ్బు తేలేనట్టి నరులకు
కీర్తి సంపద లబ్బవోయ్ !

వెనక చూసిన కార్యమేమోయ్?
మంచి గతమున కొంచెమేనోయ్
మందగించక ముందు అడుగేయ్
వెనక పడితే వెనకేనోయ్ !

పూను స్పర్ధను విద్యలందే
వైరములు వాణిజ్యమందే
వ్యర్ధ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్!

దేశాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పుకోకోయ్
పూని యేదైనను వొక మేల్
కూర్చి జనులకు చూపవోయ్!

ఓర్వలేమి పిశాచి, దేశం
మూలుగులు పీల్చేసెనోయ్
ఒరుల మేలుకు సంతసిస్తూ
ఐకమత్యం నేర్చవోయ్ !

పరుల కలిమికి పొరలి యేడ్చే
పాపికెక్కడ సుఖం కద్దోయ్ ?
ఒకరి మేల్ తన మేలనెంచే
నేర్పరికి మేల్ కొల్లలోయ్ !

స్వంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడు పడవోయ్
దేశ మంటే మట్టి కాదోయ్,
దేశ మంటే మనుషులోయ్ !

చెట్ట పట్టాల్ పట్టుకొని
దేశస్థు లంతా నడవ వలెనోయ్
అన్న దమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగ వలెనోయ్ !

మతం వేరైతేను యేమోయ్?
మనసు లొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
లోకమున రాణించునోయ్!

దేశమనియెడి దొడ్డ వృక్షం
ప్రేమలను పూలెత్త వలెనోయ్
నరుల చమటను తడిసి మూలం
ధనం పంటలు పండ వలెనోయ్!

ఆకులందున అణగి మణగి
కవిత కోయిల పలుక వలెనోయ్
పలుకులను విని దేశమందభి
మానములు మొలకెత్త వలెనోయ్ !!

నక్కలోళ్ల సిన్నదాన్ని - వింజమూరి అనసూయాదేవి జానపద గీతం


వాలుకొప్పు పెట్టుకొని కట్టమీద పోత ఉంటే
వాడు సూచే సూపులకు వాలుకొప్పు జారిపోయే

శిద్దలయ్య కొండ మీద సిన్ని కూర కోసే దాన్ని
ఊరు చూడు దుమ్ము చూడు దున్నపోతుల బారు చూడు
బెంగులూరి కోనేట్కాడ రాయి కోసే చిన్నవాడ!

సూదులో దబ్బనాలో ఏస్కోలేదా హాయో తీస్కోలేదా హాయో
పాలపూసలు పగడాల పూసలు ఏస్కోలేదో హాయో తీస్కోలేదా హాయో
ఆరికోళ్లు నెమలికోళ్లు ఏస్కో లెదా హాయో తీస్కో లేదా హాయో

వింజమూరి అనసూయాదేవి గారు జానపద సంగీత ప్రపంచానికి చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఒక ప్రాంతం కాదు, తెలుగు మాట్లాడే అన్ని ప్రాంతాల మాండలికాలను పరిశీలించి అక్కడి గ్రామీణ జీవితాలను ప్రతిబింబించే గీతాలను సంపాదించి వాటికి సంగీతం కూర్చి తాను పాడి ఇతర గాయకుల చేత పాడించారు. అటువంటి వాటిలో ఒకటి ఈ నక్కలోళ్ల సిన్నదాన్ని అనే గీతం. అనసూయాదేవి గారు, వసంత గారు పాడిన గీతానికి సంగీతం అనసూయ గారు, బీ గోపాలం గారు అందించారు. అమెరికాలో టెక్సాస్‌లో తన కూతురు ప్రఖ్యాత నాట్య కళాకారిణి రత్నపాప గారి దగ్గర స్థిరపడిన అనసూయ గారు ఇటీవాలే 97వ పుట్టినరోజు జరుపుకున్నారు. వారిలో ఉన్న ప్రతిభకు, వారు కళారంగానికి చేసిన సేవకు కనీసం పద్మభూషణ్ ఇవ్వాల్సిన మాట. ఆవిడ బ్రతికుండగా ఆ అవార్డు వస్తుందని ఆశిద్దాం. అవార్డులదేముందండీ అనే అల్లాటప్పా ప్రతిభ కాదు వీరిది. దాదాపు 85 ఏళ్ల సుదీర్ఘ సంగీత యానం అనసూయ గారిది. భారత ప్రభుత్వం వీరి ప్రతిభను గుర్తించాలి. అది చారిత్రాత్మక అవసరం. లేకపోతే ప్రతిభ అన్న పదానికి అర్థం లేదు.


16, ఆగస్టు 2017, బుధవారం

క్షీరాబ్ది కన్యకకు - అన్నమాచార్యుల అమ్మ వారి నీరాజనం

అమ్మ వారి నీరాజనం ఒకటైన  అన్నమాచార్యుల వారు రచించిన క్షీరాబ్ది కన్యకకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు పాడగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అన్నమాచార్యుల వారికి సంకీర్తనలలో అమ్మ అలమేల్మంగను ఎన్నో కృతులలో కొనియాడారు. ఈ నీరాజనం సంకీర్తన తెలుగిళ్లలో, ముఖ్యంగా వివాహాది శుభకార్యాలలో ఎక్కువగా వినబడుతుంది.


క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని 
నీరజాలయకును నీరాజనం 

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు 
నెలకొన్న కప్పురపు నీరాజనం 
అలివేణి తురుమునకు హస్త కమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

పగటు శ్రీ వేంకటేశు పట్టపురాణియై 
నెగడు సతి కళలకును నీరాజనం 
జగతినలమేల్మంగ చక్కదనములకెల్ల 
నిగుడు నిజ శోభనపు నీరాజనం

- సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు

క్షీర సాగర మథనంలో ఆవిర్భించింది కాబట్టి మహాలక్ష్మిని క్షీరాబ్ది కన్యక అంటారు. ఆ అందమైన పదసంపుటిని అన్నమాచార్యుల వారు తన సంకీర్తనా నీరాజనంలో పల్లవి ఆరంభంలోనే ఉపయోగించారు. ఆ తల్లి అలా ఆవిర్భవించిన వెంటనే శ్రీమహావిష్ణువును వరించింది. నీటీలో పుట్టినది కాబట్టి తామరపూవుకు నీరజ అని పేరు వచ్చింది. ఆ తామరపూవులో నివసించే తల్లిని నీరజాలయగా అన్నమాచార్యుల వారు అభివర్ణించారు. కలువలవంటి కన్నులు గల తల్లికి, చక్కనైన ఆకృతి కలిగియున్న తల్లికి కర్పూరపు నీరాజనమట, నల్లని కురులతో ఉన్న ఆమె కొప్పుకు, కమలముల వంటి హస్తములకు మాణిక్యాలతో నీరాజనంట. ప్రకాశించే లావణ్యము కల శ్రీవేంకటపతికి పట్టపురాణియై వర్ధిల్లే ఆ తల్లికి యున్న కళలకు నీరాజనమట. ప్రపంచమంతా వ్యాపించే ఆ అలమేలుమంగ చక్కదనాలకు పాటలతో నీరాజనమట. అన్నమాచార్యుల వారి కృతులలో ప్రత్యేకత వారి అనుభూతులు పదములై జాలువారటం. తిఉర్చానూరులో వెలసిన ఆ పద్మావతీ దేవిని చూస్తే ఈ సంకీర్తన ఎటువంటి అనుభూతితో సద్గురువులు రచించారో అర్థమవుతుంది. ఆరాత్రికముగా చెప్పబడి, తరువాత ఆరతిగా రూపాంతరం చెందిన అర్చనా విధి హారతి. పగటి పూట కూడా వెల్గిచించబడి చేయునది కాబట్టి ఆరాత్రికము అయింది. ఇవి ఏక హారతి, దీప హారతి, ధూప హారతి, కర్పూర హారతి, కుంభ హారతి వంటి అనేక రకములు. ఈ కృతిలో అన్నమాచార్యుల వారు కర్పూర నీరాజనంతో పాటు, నవరత్నాలతో, గానముతో నీరాజనం పలికారు.

ఈ సంకీర్తన గురించి ప్రస్తావించినప్పుడు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గాత్ర వైభవం గురించి చెప్పుకోవాలి. అన్నమాచార్యుల వారి కీర్తనలకు కొన్నింటికి ఆవిడ మరింత వెలుగులు దిద్దారు అనిపిస్తుంది. అన్నమయ్య కృతులను శాశ్వతం చేయటంలో సుబ్బులక్ష్మి గారు తనవంతు కృషి చేశారు. ఆవిడలోని పవిత్రత, భక్తి భావాలు ఆమె గానంలో ప్రకటితమవుతాయి. ఆవిడ పాడిన ఈ సంకీర్తన వీడియో చూస్తే అది అర్థమవుతుంది. 

గోపాలకృష్ణుడు నల్లన - రావు బాలసరస్వతీదేవి గారి లలిత గీతం

గోపాలకృష్ణుడు నల్లన గోకులములో పాలు తెల్లన
కాళిందిలో నీళ్లు చల్లన పాట పాడవే నా గుండె ఝల్లన

మా చిన్ని కృష్ణయ్య లీలలు మంజుల మధు మురళి ఈలలు
మా కీరసారికల గోలలు మాకు ఆనంద వారాశి ఓలలు

మా ముద్దు కృష్ణుని మాటలు మరువరాని తేనె తేటలు
మా పూర్వ పుణ్యాల మూటలు మమ్ము దరిచేర్చు తిన్నని బాటలు

ఎంత చక్కని లలిత గీతమో కదా! లలిత గీతాలలో కృష్ణభక్తికి, గోపికల మనోభావనలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ గోపస్త్రీల హృదయాలలోని భావఝరులను లలిత గీతాలు చక్కగా ఆవిష్కరిస్తాయి. నల్లనయ్య, గోకులంలోని దధి క్షీర నవనీతాలు, యమునా నది, కాళింది, కృష్ణయ్య వేణు గానం, ముద్దు ముద్దు మాటలు, గోపకులం ఆనందడోలికలు..ఇవి లలిత సంగీతంలో పండినంతగా శాస్త్రీయ సంగీతంలో పండవేమో అని నా అభిప్రాయం. ఇక ఈ గీతానికి వస్తే - 1947లో విడుదలైన రాధిక అనే చిత్రంలో వెంపటి సదాశివబ్రహ్మం గారు రచించగా సంగీతం సాలూరి హనుమంతరావు గారు అందించారు. లలిత సంగీత సామ్రాజ్ఞి రావు బాలసరస్వతీదేవి గారు ఆలపించారు. లలితగీతాల కోసమే బాలసరస్వతి గారు జన్మించారా అన్నట్లు ఈ గీతాలు వారి గళంలో జాలువారుతాయి. సదాశివబ్రహ్మం గారు ఎంతో ప్రతిభ ఉన్న రచయిత. వారి చలనచిత్ర గీతాలు అజరామరమైనవి. ఈ గీతంలో రచయిత గోపెమ్మ మనసును అద్భుతంగా ఆవిష్కరించారు. ఆయన ఉపయోగించిన పదాలు తెలుగుదనం ఉట్టిపడుతూ భావాన్ని లలితంగా ప్రవహింపజేశాయి. మంజులు మధు మురళి ఈలలు, కీరసారికల గోలలు, ఆనంద వారాశి ఓలలు, దరిచేరు తిన్నని బాటలు...ఇవన్నీ భావంతో పాటూ తెలుగు భాషా వైభవాన్ని ఇనుమడింపజేశాయి. అంతే చక్కగా హనుమంతరావు గారు సంగీతం అందించారు. బాలసరస్వతి గారి గానం మాధుర్యభరితమైన ప్రవాహమే.

నేటి తరం వారికి ఈ ప్రముఖులు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. వారి కోసం ఈ అలనాటి ప్రజ్ఞాశాలుల విశేషాలు కొన్ని.

1.రావు బాలసరస్వతీదేవి గారు


తెలుగు సినీ పరిశ్రమలోని తొలి తరం గాయనీమణుల్లో బాలసరస్వతి గారు అగ్రగణ్యులు. లలిత గీతాల గానంతో ఆకాశవాణిలో, నేపథ్య గీతాల గానంతో చలనచిత్ర పరిశ్రమలో తొలి గాయనిగా పేరొందారు. 1928లో ఇప్పటి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో జన్మించిన వీరు చిన్నతనంలోనే చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో విడుదలైన సతీ అనసూయ, భక్త ధ్రువ చిత్రాలలో పాడారు. సంగీతం ఆలత్తూరు సుబ్బయ్య గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రముఖ హిందీ గాయకులు సైగల్ గారి ప్రభావం బాలసరస్వతి గారిపై ఉండేది. సైగల్ గారి లలితమైన శైలే బాలసరస్వతి గారి గాత్ర ధర్మమైంది. బాలనటిగానే పేరొందిన వీరు తొలుత తమిళం, తరువాత తెలుగు చలనచిత్రాలలో నటించారు. మొత్తం 15 చిత్రాలకు పైగా నటించారు. నటన తగ్గించి గాయనిగా స్థిరపడ్డారు. 1940 నుండి 67 వరకు గాయనిగా 85కు పైగా చిత్రాలలో పాడారు. వారి సినీ మరియు లలిత గీతాలు ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి. హాయమ్మ హాయి, తానే మారెనా, ధరణికు గిరి భారమా, తలుపు తీయునంతలోనే, కనుగొంటి కనుగొంటి వంటి ఎన్నో గీతాలు ప్రజల మనసులను దోచుకున్నాయి. మహామహులైన తెలుగు తమిళ సంగీత దర్శకులకు తమ గానం అందించారు. అందరు మేటి గాయకులతోనూ పాడారు. ఆకాశవాణిలో 65 ఏళ్లు పాడిన ఘనత వీరిది. 90 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ వారి గాత్రంలోని లాలిత్యం ఏ మాత్రమూ తగ్గలేదు. కోలంకి రాజా వారిని వివాహం చేసుకున్న వీరు ఆయన మరణించిన తరువాత ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రాజావారి భూముల వివాదంలో కోర్టుల చుట్టూ తిరగలేక బాధ పడ్డారు. ప్రస్తుతం హైదరాబాదులో వారి మనుమడి దగ్గర ఉంటున్నారు.

2. సాలూరి హనుమంతరావు గారు:


సాలూరి సన్యాసిరాజు గారి కుమారుడైన వీరు ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారి అన్నగారు. వీరు 1944-78 మధ్య దక్షిణాదిన చలనచిత్రాలకు సంగీతం అందించారు. అందులో ఒకటి రాధిక చిత్రం. 1917లో విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని శివరామపురంలో వీరు జన్మించారు. వీరు ద్వారం వేంకటస్వామి నాయుడు గారి వద్ద శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారు. కర్ణాటక మరియు హిందూస్థానీ శాస్త్రీయ సంగీతాలలో నైపుణ్యం పొందారు. వీరు మొట్టమొదట 1947లో చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో, అంజలీదేవి నాయికగా విడుదలైన గొల్లభామ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం, చరణదాసి, ఉషా పరిణయం, దక్ష యజ్ఞం, చంద్రహాస, బాంధవ్యాలు, రైతుబిడ్డ, ఆరాధన మొదలైన 75 చిత్రాలకు సంగీతాన్ని అందించి 1980లో మరణించారు.

3. సదాశివబ్రహ్మం గారు:


వెంపటి సదాశివబ్రహ్మం గారు అలనాటి కథలు, పాటలు, సంభాషణల రచయిత. 1905లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన వీరు తొలుత 1941లో విడుదలైన చూడామణి అనే చిత్రానికి సంభాషణలు, పాటలు, కథ అందించారు. తరువాత తెనాలి రామకృష్ణ (1941,56), పల్నాటి యుద్ధం (1947), రాధిక (1947), కీలుగుర్రం, సంసారం, పక్కింటి అమ్మాయి, కన్యాశుల్కం, చరణదాసి, భలే రాముడు, సువర్ణ సుందరి, శారద, అప్పు చేసి పప్పు కూడు, చెంచులక్ష్మి, ఇల్లరికం, లవకుశ, పరమానంద శిష్యుల కథ మొదలైన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు సాహిత్యాన్ని అందించారు. భలే రాముడు చిత్రంలోని ఓహో మేఘమాల, అవకుశ చిత్రంలో లేరు కుశలవుల సాటి అన్న పాట ఎంత ప్రజాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. లవకుశ మరియు రహస్యం చిత్రాలలోని పద్యాలు చాలమటుకు వీరు రచించినవే. గీత రచయితగా కన్నా, సంభాషణలు, కథా రచయితగా వీరు పేరొందారు. సదాశివబ్రహ్మం గారు 1968లో చెన్నైలో మరణించారు. 

15, ఆగస్టు 2017, మంగళవారం

కంట జూడుమి - త్యాగరాజ స్వామి కృతి


కంట జూడుమి ఒక పరి క్రీగంట జూడుమి! 

బంటుడై వెలయు బాగుగాని తప్పు 
తంటలెల్ల మానుకొన్న నన్ను క్రీగంట జూడుమి! 

అలనాడు సౌమిత్రి పాద సేవ 
చెలరేగి సేయు వేళ సీతతో 
పలికి చూచినంత పులకాంకితుడై 
పరగిన యటు త్యాగరాజుని క్రీగంట జూడుమి!

ఓ రామా! నీ బంటునైన నన్ను ఒకసారి క్రీగంట చూడుము! నా తప్పు పనులన్నీ మానుకొన్నాను. ఆ నాడు నీకు ఎంతో సేవ చేసిన లక్ష్మణుని గురించి సీతతో పొగడగా ఆ సౌమిత్రి ఎంతో సంతోషించాడు. నన్ను కూడా ఆ విధంగా కంట పెట్టుకొని చూడుము.

రామలక్ష్మణుల మధ్య ఉన్న అనుబంధాన్ని త్యాగరాజస్వామి ఎన్నో కృతులలో ప్రస్తావించారు. లక్ష్మణునికి అన్న మాటే వేదం. ఎందుకు? రాముడు అన్న పాత్రలో అలా వ్యవహరించాడు కాబట్టి. నారాయణునికి ఆదిశేషుడు శయ్యగా నిలిచి సౌఖ్యం కలిగించిన రీతి ఆ శేషుని అంశ అయిన లక్ష్మణుడు రామావతారంలో అదే శ్రీహరి రూపమైన రామునికి నిరంతరం సేవ చేసుకున్నాడు. రాముడికి లక్ష్మణుడు బహిర్ప్రాణం ఐతే లక్ష్మణునికి రాముడు తండ్రి తరువాత తండ్రి. సీతారాముల సేవలో తరించిన లక్ష్మణుని నిబద్ధతను చూసి రాముడు ఆ విషయాన్ని సీతతో ప్రస్తావించిన విషయాన్ని త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా మనకు మరల గుర్తు చేసి, లక్ష్మణుని కనిపెట్టుకుని ఉన్న రీతి తనను కూడా గమనించి బ్రోవమని వేడుకున్నాడు. భక్తునికి-భగవంతుని మధ్య సంభాషణలలో ఎన్ని రకాలో కదా? ఆ వైవిధ్యాన్నే త్యాగరాజస్వామి ఈ కృతి ద్వారా తెలియజేశాడు. వాచస్పతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెల్ వసంతకుమారి గారు గానం చేశారు.

శ్రీరామపట్టాభిషేకం - శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గ


శ్రీరామనవమి అనంతరం దశమి నాడు శ్రీరామపట్టాభిషేకం చేయటం భద్రాద్రిలో ఆనవాయితీ. శ్రీరామ పట్టాభిషేకానికై జరిగిన సన్నాహాలు, పట్టాభిషేక మహోత్సవాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం యుద్ధకాండ 128వ సర్గలో వర్ణించారు.

రామన్న తన తల్లి కైకకు తండ్రి దశరథుడిచ్చిన మాట ప్రకారం వనవాసానికి వెళ్లి, ఆ సమయంలో రావణునిచే అపహరించబడిన సీతను కాపాడటానికి అధర్మానికి ఒడిగట్టిన రావణుని సంహరించి ధర్మ స్థాపన చేస్తాడు. వనవాస సమయంలో భరతుని పాలన చేయమనగా, ఆతడు అన్న పాదుకలనుంచి 14 ఏళ్లు ఆయన దాసునిగా రాజ ధర్మాన్ని నిర్వర్తించాడు. యుద్ధం తరువాత రాముడు అయోధ్యకు తిరిగి రాగా, రామన్నను రాజ్యాన్ని స్వీకరించవలసిందిగా భరతుడు కోరాడు. రాముడు తిరిగి రాజ్యాన్ని చేపట్టడానికి అంగీకరించాడు.

వనవాసం వలన పెరిగిన జటాఝూటములమును ముడివిప్పి మంగళ స్నానం చేశాడు. అనేక రకాల సుగంధ లేపనాలను ఆయనకు అలదగా ఆయన అద్భుతంగా ప్రకాశించాడు. శతృఘ్నుడు రామలక్ష్మణులను అలంకరించారు. దశరథుని పత్నులు సీతమ్మను అలంకరించారు. కౌసల్య వానర పత్నులను అలంకరించింది. సుమంత్రుడు రథాన్ని తీసుకురాగా రాముడు దానిని అధిరోహించాడు. సుగ్రీవుడు, హనుమంతుడు కూడా మంగళ స్నానములు చేసి తమను తాము అలంకరించుకున్నారు.

భరతుడు పగ్గాలు చేపట్టగా, లక్ష్మణుడు వింజామర వీచగా, శతృఘ్నుడు ఛత్రము పట్టగా రాముడు అయోధ్య వీధులలో రధముపై విహరించాడు. సుగ్రీవుడు శత్రుంజయమను ఏనుగునెక్కాడు. వానరులందరూ మానుష రూపము ధరించారు. ప్రజలందరూ రామునికి జయ జయ ధ్వానాలు పలికారు. సంగీత వాద్యములతో నృత్యములతో ఆ రాముడు అయోధ్యాపురాన్ని కలయబెట్టాడు. తన మంత్రులతో సుగ్రీవ విభీషణాదులతో తన మైత్రిని గురించి ప్రస్తావించాడు. రాముని పలుకులతో హర్షించిన ప్రజలు తమ ఇళ్లపై పతాకాలను ఎగురవేశారు.

రాముడు రాజప్రాసాదాన్ని చేరుకొని తొలుత ముగ్గురు మాతలకు నమస్కరించాడు. సుగ్రీవాదులకు ఉచితమైన వసతులు చూడమని భరతునితో చెప్పాడు. భరతుడు సుగ్రీవుని రామ పట్టాభిషేకానికై ఏర్పాట్లను ఆరంభించవలసిందిగా కోరాడు. తదనుగుణంగా సుగ్రీవుడు జాంబవంతుని, హనుమంతుని, వేగదర్శిని, ఋషభుని నాలుగు సాగరములనుండి పవిత్ర జలాలను తీసుకు రావలసిందిగా ఆదేశించాడు. వానరులు వారి ఆదేశాల మేరకు 500 నదుల నీరు తీసుకు వచ్చారు. శతృఘ్నుడు రాజ గురువైన వశిష్ఠుల వారితో ఆ జలాల గురించి తెలిపాడు.

వశిష్ఠుడు నవరత్న ఖచితమైన సింహాసనం మీద సీతారాములను ఆసీనులు కావలసిందిగా కోరాడు. వశిష్ఠ, జాబాలి, వామదేవ,కాశ్యప,కాత్యాయన, సుయజ్ఞ, గౌతమ, విజయ మహర్షులు రాముని పవిత్రమైన సుగంధ జలాలతో అభిషిక్తుని చేశారు. మనువును అలంకరించిన నవరత్న ఖచితమైన కిరీటముతో రాముని అలంకరించి రాముని ఆశీర్వదించారు.  శతృఘ్నుడు తెల్లని ఛత్రము పట్టుకోగా, విభీషణుడు, సుగ్రీవుడు వింజామర వీచారు. వాయుదేవుడు ఇంద్రుని బహుమతిగా వంద కలువలున్న స్వర్ణమాలను బహుకరించాడు. వాయుదేవుడు ముత్యాల మరియు ఇతర రత్నాల హారాలను రామునికి సమర్పించాడు. అప్సరసలు నృత్యం చేశారు. ప్రకృతి పుష్పములతో, ఫలములతో పులకరించింది.

రాముడు తొలుత బ్రహ్మణులను, తరువాత సుగ్రీవ అంగదాదులకు కానుకలు అందజేశాడు. సీతమ్మకు ముత్యాల హారాన్ని బహుకరించాడు. రాముడు సీతతో ఆ హారాన్ని సభలో అత్యంత పరక్రమవంతుడు, బుద్ధిమంతుడు, వినయసంపన్నుడు మరియు సమస్త శుభగుణములు కల్వానికి బహుకరించమనగా సీతమ్మ ఆ హారాన్ని హనుమకు ఇచ్చింది. రాముడు మిగిలిన వానరులకు కూడా కానుకలిచ్చాడు. తరువాత సుగ్రీవాదులు కిష్కింధకు, విభీషణుడు లంకకు తిరిగి వెళ్లారు.

పాండురంగ మహత్యం – 1957: భక్తి రస కావ్యం

1957 నవంబర్ 28న విడుదలైన పాండురంగ మహత్యం తెలుగు భక్తి చిత్రాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్...