1, ఆగస్టు 2026, శనివారం

కనుగొంటి కనుగొంటి ఈ కంట నేడు - రావు బాలసరస్వతీదేవి మధుర గానం

 


కనుగొంటి కనుగొంటి ఈ కంట నేడు

సంకటహరుడైన శ్రీ వేంకటేశుని

భక్తుల బ్రోవంగా ఏడుకొండలమీద
అవతారమొందిన అలుమేలుమంగేశుని

విశ్వరూప దర్శనపు వేళ శ్రిత జనావళి గన
ముదమార వేచిన వేంకటాచలపతిని

తోమాల సేవలో నానా పరిమళ సుమమాలికావృత
నీలిదేహుని దివ్యరూపంబు గంటి
ధర్మ సంస్థాపనాసక్త నిత్యాభిషక్తుని
శంఖ చక్రధరుని మంగళాకరుని

ఈ రోజు నా కన్నులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శిస్తూ పరమానందాన్ని పొందుతున్నాయి. భక్తుల సంకటాలను తొలగిస్తూ, వారిని రక్షించడానికి అలమేలుమంగ సమేతంగా ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీనివాసుడు తన దివ్య కరుణను ప్రసరిస్తున్నాడు. విశ్వరూప దర్శన సమయంలో అనేకమంది భక్తులతో కలిసి ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని తిలకిస్తూ, భక్తజనులు భక్తిపరవశులై ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

తోమాల సేవలో సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించబడిన నీలమేఘశ్యామల దివ్యమూర్తి తన అపూర్వ సౌందర్యంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. ధర్మాన్ని స్థాపిస్తూ, శంఖచక్రాలను ధరించి జగత్తుకు మంగళాన్ని ప్రసాదిస్తూ, తనను ఆశ్రయించిన వారందరినీ కాపాడుతూ శ్రీ వేంకటాచలపతి నిత్యం తన దివ్యానుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. ఆయన దివ్యదర్శనం భక్తుల హృదయాలను పవిత్రం చేస్తూ, వారికి ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తోంది.


రావు బాలసరస్వతీదేవి గారి గాత్రంలో ఎంత మాధుర్యమున్నదో ఈ గీతం వింటే తెలుస్తుంది. భక్తి భావనతో పాటు లాలిత్యాన్ని పండించిన వారి అమృత గానం ఆ శ్రీనివాసుని పాదాల వద్దకు తప్పక చేరే ఉంటూంది. గీత రచయిత, సంగీతకారులు ఎవరో తెలియదు. సరళమైన సాహిత్యంతోనే అద్భుతమైన భావనలను పండించవచ్చు అని ఈ గీతం మరో మారు నిరూపిస్తుంది. బాలసరస్వతి గారి గీతం కళ్లు మూసుకుని వింటే ఆ వేంకటరమణుని వైభవం కళ్లెదుట నిలుస్తుంది. అన్నమాచార్యుల వారి కలగంటి కలగంటి అనే సంకీర్తన స్ఫురణకు వస్తుంది. అనుపల్లవిలో బాలసరస్వతి గారి ఆలాపనలు అద్భుతం. స్వామికి జరిగే సేవల ప్రస్తావన ఉన్న ఈ గీతంలో ఆ నీలమేఘ శరీరుని దివ్యరూపమును గాంచిన భక్తుని హృదయ కమలములోని భావనలను మనోజ్ఞంగా ఆవిష్కరించిన ఈ గీతం బాలసరస్వతి గారి గాత్రంలో మరింత ప్రకాశించింది. నిత్యాభిషిక్తుడైన ఆ స్వామి దివ్య మంగళ స్వరూపమును గాంచిన భక్తుని ఆనందాతిశయాన్ని లలితంగా కవి తమ పదాలలో ఒలికించారు. బాలసరస్వతి గారి గాత్రాన్ని గమనిస్తే సహజంగా లలితమైన గాత్ర ధర్మం వారిది. స్వరాలను పలికిస్తూనే భావ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అద్భుతమైన గాత్ర లక్షణం వారిది. ఆనంద నిలయుడైన శ్రీనివాసుని దర్శన భాగ్యమున భక్తుని పారవశ్యాన్ని వారి గాత్రం వంద శాతం ప్రతిబింబించింది. లలిత గీతాలకు భావము అత్యంత ప్రముఖమైనది. ఆ ప్రాధాన్యతను ప్రతి ఒక్క గీతంలోనూ పలికించిన వారు బాలసరస్వతి గారు. వారికి మరో మారు వందనాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి