2, జనవరి 2021, శనివారం

బ్రహ్మాండ వలయే మాయే - మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ కృతి


ఈ భారతదేశంలో సంగీతం కలకాలం నిలిచింది అంటే దానికి ఆనాటి పాలకుల ఇచ్చిన ఆదరణ కూడా ఒక ముఖ్యమైన కారణం. త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారులు రాజాశ్రయాన్ని పూర్తిగా త్యజించారు, అది ఆనాటి పరిస్థితులకు సముచితంగా వారు ఎంచుకున్న మార్గం. రాజాశ్రయంలో ఉన్న లోటుపాట్లను ఎరిగే, నరస్తుతులకు, వారిచ్చే కానుకలకు దూరంగా నిలిచి పూర్తిగా రాముని సేవలోనే గడిపారు. కర్నాటక సంగీతంలో ఉన్న మహత్తును, ఆధ్యాత్మిక సంపదను గ్రహించి ఆ తరువాతి కాలంలో ఎందరో జమీందార్లు, పాలకుకు స్వయంగా సంగీతాన్ని పూర్తిస్థాయిలో అభ్యసించి, దానిని ఉపాసనా మార్గంలో వినియోగించుకుని, అద్భుతమైన అనుభూతులను పొందుతూ, తమ తమ ఆస్థానలలో సంగీత సాహిత్య నాట్య సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి కళాకారులను, గురువులను ఆదరించి, ప్రోత్సహించారు. అటువంటి వారిలో మైసూరు సంస్థానం చివరి మహారాజా జయచామరాజ వడయార్ గారు ప్రముఖులు. వారు శ్రీవిద్యోపాసకులే కాకుండా కర్నాటక శాస్త్రెయ సంగీత ప్రావీణ్యం కలవారు, ఎన్నో కృతులను కూడా రచించారు. మైసూరు సామ్రాజ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారిని నుతిస్తొ ఆయన రచించిన ఒక కృతి. వడయార్ గారి ముద్ర శ్రీవిద్య. అలాగే, ఈ కృతిని ఆయన మాండ్ రాగంలో స్వరపరచారు. తగ్గట్టుగానే పల్లవిలోనే రాగముద్రను పొందు పరచారు. వారి సంస్థానంలో నిత్యం ఈ కృతిని విద్వాంసులు ఉదయం అమ్మవారి సేవలో ఆలపించేవారట. అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద కలిగిన ఈ కృతిని పరిశీలిస్తే వడయార్ గారి సంస్కృత భాషా పాండిత్యం, ఉపాసనా బలం గోచరిస్తాయి. శివజాయే, బ్రహ్మరంధ్రనిలయే, అహినిభవేణి, అంతరహిత కైవల్య విహారిణి, గతినిర్జితకరిణి మొదలైన పదసమూహాలు వడయార్ గారి ప్రతిభలోని ఔన్నత్యాన్ని తెలుపుతాయి. వివరాలు:

సాహిత్యం
========

బ్రహ్మాండ వలయే మాయే బ్రహ్మాది వందిత శివజాయే

బ్రహ్మవిద్యానందిత హృదయే బ్రహ్మర్షాద్యుపాసిత శ్రీవిద్యా బ్రహ్మరంధ్రనిలయే

గౌతమార్చిత గాయత్రి గౌరీ గిరిరాజేంద్ర పుత్రి
కాంత రాగిణి నారాయణి కారుణ్య లలితే మంజులవాణి
అంతర్ముఖ జ్యోతిర్మయ కల్యాణి అహినిభవేణి పురాణి
అంతరహిత కైవల్య విహారిణి గతినిర్జితకరిణి గీర్వాణి

భావం
=====

పరమశివుని పత్నివైన ఓ పార్వతీదేవీ! నీవు బ్రహ్మాండమును చుట్టి యున్న మాయవు, బ్రహ్మాదులచే పూజించబడుచున్నావు. నీవు బ్రహ్మవిద్యచే ఆనందము పొందే హృదయము కలిగియున్నావు, బ్రహ్మర్షులచే ఉపాసించే శ్రీవిద్యవు, సహస్రార చక్రమునందు నివసించియున్నావు. నీవు గౌతమ మునిచే అర్చించబడిన గాయత్రివి, పర్వతరాజేంద్రుడైన హిమవంతుని పుత్రివి, పతియైన పరమశివునిపై అనురాగముతో నిండియున్నావు, నారాయణుని సోదరివి, కరుణామూర్తివి, లలితవు, మృదువైన పలుకులు కలిగియున్నావు, ఎల్లప్పుడూ అంతర్ముఖవై ప్రకాశించెదవు, ఎల్లప్పుడూ శుభములు కలిగించెదవు, తుమ్మెదల సమూహము వంటి కురులు కలిగియున్నావు, సనాతనమైనదానవు, అంతములేని మోక్షములో విహరించెదవు, ఏనుగును మించిన నడక కలిగి, వాక్కే అస్త్రముగా గల పరదేవతవు.

శ్రవణం
======

మాండు రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని విదుషీమణి ఎమ్మెస్ షీలా గారు ఆలపించారు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి