గుళ్లో రామాయణాలు - 4
=================
దేవుడి పేరుతో అవినీతి?
పూజారి: "సార్ - ప్రసాదానికి బియ్యం, పప్పు ఇతర వంట సామాను కావాలి. దాదాపు 5 వేల దాకా అవుతుంది..."
ధర్మాధికారి: "అదేమిటండీ! పదిహేను రోజులు కూడా కాలేదు నేను తెప్పించి...ఇంతలో?"
పూజారి: "అయ్యా ధనుర్మాసం కదా! నివేదనలు ప్రత్యేకంగా, ఎక్కువగా..."
ధర్మాధికారి: "సరే..."
పూజారి భార్య: "ఏవండీ - ఇంట్లో నెలవారీ ఉప్పులు పప్పులు తేవాలి. డబ్బులు ఇవ్వండీ..."
పూజారి: "క్రితం నెల గుడి సరుకుల్లో కొన్ని తీసి పక్కన పెట్టాను చూడు. లోపల ఉన్నాయి..."
దేవుడి పేరుతో మోసమా?
ధర్మాధికారి: "మేనేజర్ గారూ - క్రితం నెలలో వచ్చిన హుండీ వసూలు వివరాలు లెక్కలు రాసారా? సేవలు చేయించుకున్నవారికి రసీదులు ఇచ్చారా?
మేనేజర్: "సార్! లెక్కలన్నీ ఉన్నాయి. సోమవారం చూపిస్తాను. రసీదులన్నీ ఇచ్చాను".
సోమవారం దాటింది. మేనేజర్ లేడు. సేవకు భక్తులు ఇచ్చిన రుసుములో 25వేల రూపాయల తేడా. రసీదులు ఇవ్వలేదు. హుండీ ఆదాయం గత నెలకన్నా 70 శాతం తక్కువ ఉంది. మానేసిన మేనేజర్ కారు కొన్నాడు.
సాక్షీభూతుడైన స్వామి లెక్కలు వేస్తున్నాడు.
డబ్బున్న వారికో ధర్మం, లేనివారికో ధర్మమా?
ధర్మాధికారి: "పూజారి గారూ! గర్భగుడిలోకి మీరు తప్ప ఎవ్వరూ రాకూడదు. విగ్రహాలను ఎవ్వరినీ తాకనివ్వద్దు. ఖచ్చితంగా పాటించండి..."
పూజారి: "అలాగే సార్"
ఒక వారం తరువాత, ఆలయానికి ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ధర్మాధికారికి బంధువు సతీ సమేతంగా వచ్చారు.
ధర్మాధికారి: "పూజారి గారు! వీరు మనకు బాగా కావలసిన వారు, లోపలకు తీసుకువెళ్లి పాదాలను తాకించి శేషవస్త్రాన్ని కప్పించండి.
పూజారి ప్రశ్నార్థకంగా, సందేహంతో: "అలాగే సార్..."
అన్నీ చూస్తూనే ఉన్నాడు ఆ పరమాత్మ.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి