25, జనవరి 2016, సోమవారం

గుళ్లో రామాయణాలు - 1:

గుళ్లో రామాయణాలు - 1:
=================

అందంగా, పట్టు చీర కట్టుకొని, నగలు అలకరించుకొని, మేకప్ వేసుకొని, సిగలో పూలు కొప్పుకు అలంకరించుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది ఒక 30 ఏళ్ల స్త్రీ.
అప్పటివరకు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్న స్త్రీల దృష్టి ఆవిడపై పడింది. అంతే ఇక విష్ణువు లేడు, సహస్రమూ లేదు, నామాలూ లేవూ. అంతా ఆ స్త్రీ వేషభూషణాలకు అర్పణం. స్తోత్రాలు పఠిస్తున్న పురుషుల దృష్టి కూడా మరల భగవంతునిపై ధ్యాస చెదరింది.
మొదటి స్త్రీ: "ఇదేమి కలికాలమో? గుళ్లోకి వస్తూ ఈ అలంకరణలేమిటో? కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా వదినా?"
రెండవ స్త్రీ: "అవును వదినా. నాక్కాంగ నగలు ఉన్నాయని దిగేసుకొచ్చింది. అయినా ఇదేమైనా పెళ్లా పేరంటమా? పవిత్రమైన శ్రీనివాస కళ్యాణానికి వస్తూ ఏమిటి ఈ చోద్యం?"
మూడవ స్త్రీ: "మనం ఆ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండే వాళ్లం? గుడికి అనగానే పట్టుచీర కట్టుకునే వాళ్లమే, కానీ ఇలా ఉన్న నగలన్నీ దిగేసి, మేకప్ వేసుకొని, అసహ్యం పుట్టేలానా? "
నాలుగవ స్త్రీ: "అసలు గుడికి స్త్రీలు పూలు పెట్టుకోకూడదని ఇటీవలే ప్రవచనాలలో విన్నాను. ఇది పాపం కదూ?"
అందరు స్త్రీలూ వంత పాడారు...అందరికీ మానసిక ప్రశాంతత చెదిరింది. భగవంతుడు సాక్షీభూతుడై మౌనంగా ఈ నాటకాన్ని చూస్తున్నాడు. నవ్వుకుంటున్నాడు.
ఇక రెండోవైపు పురుషులు:
మొదటి పురుషుడు: "ఏవిటండోయ్..ఈ రోజు గుడి మామూలు కన్నా కళకళలాడిపోతోంది..ఎవరీ అందాల భామ..మేకప్ చూస్తే కాస్త ఓవర్ అయినట్లు లేదూ...ఇది వరకెప్పుడూ చూడలేదే ఈ ప్రత్యేక పాత్రను? "
రెండవ పురుషుడు: "ఎవరైతే మనకెందుకండీ? అందాన్ని ఆస్వాదించండి. వీలైతే వివరాలు కనుక్కోండీ..."
మూడవ పురుషుడు: "ఈవిడను ఎక్కడో చూశానండీ. ఆ గుర్తుకొచ్చింది. ఓ సినిమా సభలో ఓ నటుడి పక్కన చూశా! ఓసి దీని అఘాయిత్యం కూల. ఆ వేషం గుళ్లో కూడానా?"
పూజారి (మనసులో): "అపచారం, అపచారం, దేవుడి ముందు ఏమిటీ లేకి వేషాలు? భగవంతుడు క్షమించడు..."
ఇంకేముంది, అప్పటి వరకు ఎవరి పనుల్లో వారు భగవంతుని ధ్యాసలో ఉన్న సమూహం అంతా ఈ చర్చలో మునిగిపోయింది. కలకలం మొదలయ్యింది. మనసులు చెదిరాయి. దేవుడినుండి స్త్రీపైకి మళ్లింది మొత్తం దృష్టి. త్రికరణములలో దేనిలోనూ శుద్ధి లేకుండా పోయింది. ఇంకెక్కడి భగవంతుడు? అప్పటివరకు అక్కడ నిలచి వారి భక్తిని గమనిస్తున్న ఆయన మళ్లీ స్థాణువైపోయాడు.

ఇంతలో ఆ ఆలయ ధర్మాధికారి ఆ అమ్మాయిని పిలిచాడు. "అమ్మా జాహ్నవీ! షోడశోపచారములలో నృత్య సేవ అందించు తల్లీ!" అని గర్భగుడి ముంగిటకు పిలిచాడు.
జాహ్నవి చిరునవ్వుతో కాళ్లకు గజ్జెలు కట్టింది. అలంకరణ అంతా సవరించుకుంది. మనసులో స్వామికి ఈ సేవ అంకితం అనుకుంది. పద్మావతీ శ్రీనివాసుల వైభవాన్ని నుతించే "ఏమొకొ చిగురుటధరమున" అనే అన్నమాచార్యుల వారి కీర్తనను క్యాసెట్టులో శోభారాజు గారు పాడుతుండగా, అద్భుతంగా తానే శ్రీనివాసుడై, తానే పద్మావతియై, తానే పరిచారికయై, తానే అన్నమాచార్యులై అభినయించింది.స్వామి మరల శిలనుండి వచ్చి గర్భగుడిలో అంతటా నిలిచాడు. ఆమె సేవను అంగీకరించాడు.
భౌతికమైన ఆమె వేషభూషణలను చూసి దారితప్పిన మనసులతో ఉన్న 'భక్తులు ' సిగ్గుతో తలవంచుకున్నారు. తాము కోల్పోయిన అమూల్యమైన సమయాన్ని గుర్తించారు...ఏమీ పట్టకుండా ఆ కళాకారిణి స్వామి ప్రసాదం స్వీకరించి పూర్ణాత్మయై అక్కడి నుండి కదిలింది.

2 కామెంట్‌లు:

  1. బాగా వ్రాసేరు. దీనికి మరో అంసం... సిసిటివిలు, లైవ్ టెలిక్యాస్టులూ ఉన్నప్పుడు చూడాలి ఇలాంటి వారి హావ భావాలు... ప్చ్. బాధ పడటం తప్ప మనం ఏమీ చేయలేమనుకుంటా...

    రిప్లయితొలగించండి
  2. చాలా బావుంది ..మానసికం గా ఎదగటం ..మనిషి కి..మహా ..కష్టం..హీనుడవ..గుణమ్ము.మాన..లేడు.అభివాదములు..

    రిప్లయితొలగించండి