18, డిసెంబర్ 2016, ఆదివారం

ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట - త్యాగరాజ వైభవం


ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్ప రాదా!

చుక్కల రాయుని గేరు మోము గల 
సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు

తనువుచే వందనమొనరించుచున్నారా!
చనువున నామ కీర్తన సేయు చున్నారా! 
మనసున దలచి మైమరచి యున్నారా! 
నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీకిరు

త్యాగరాజస్వామి సంకీర్తనలలో సీతారాముల వైభవాన్ని అద్భుతంగా వర్ణించిన వాటిలో "ప్రక్కల నిలబడి" ఒకటి. రామ పరివారం కొలువుతీరి యుండగా అక్కడి స్థితిగతులను మనకు సద్గురువు మనోజ్ఞంగా తెలియజేశారు.

ఆ లోకాభిరామునికి ఇరు ప్రక్కల నిలబడి సీతాలక్ష్మణులు, పరివారము ఆయనను కొలిచే ముచ్చటను వాగ్గేయకారులు అనుభూతి చెందుతూ మన కళ్ల ఎదుట ఆవిష్కరించారు. కాసేపు శరీరముతో నమస్కరిస్తున్నారట. మరి కాసేపు నామ సంకీర్తన చేస్తున్నారట. మరి కాసేపు మనసులోనే తలచుతూ మైమరచియున్నారట. త్యాగరాజునిపై ప్రేమతో ఈవిధంగా ఆ పరివారం ఆ రాముని కొలుస్తున్న రీతిని ఖరహరప్రియ రాగంలో త్యాగరాజస్వామి పలికారు.

త్రికరణములతో పరమాత్మను కొలవటం ఆధ్యాత్మికత పరిపక్వతను సూచిస్తుంది. మనసా వాచా కర్మణా అక్కడ ఉన్నవారు రాముని కొలిచిన పద్ధతిని త్యాగరాజస్వామి కనులారా కంచి తరించి మనకు అందించారు. నామము తారకమై నాలికన కదలాడగా, శరీరము ఆయన రూపమును కాంచి వందనము చేయగా, మనసులోనే ఆయన రూపాన్ని తలచి మిగిలినవన్నీ మరచిపోయియున్నారు అన్న భావనను ఈ కృతిలో నుతించారు.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి గాత్ర ప్రవాహంలో బహుకొద్ది మాత్రమే వీడియోలు ఉన్నాయి. వాటిలో ఒకటి 1984లో తిరువాయూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాల సమయంలోని కచేరీ. ఆ నాటి సాయంత్రం ఆమె ఈ కృతిని అద్భుతంగా వివరంగా పాడారు. చూసి తరించండి. రామ పరివారాన్ని మనముందు మరో మారు ఆవిష్కరించిన ఆమెకు, త్యాగరాజస్వామి వారికి వందనాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి