20, ఆగస్టు 2017, ఆదివారం

కళలకు కాణాచి - విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల




విజయనగరం - ఆ భూమిలో ఏముందో! సంగీతానికి, సమస్త కళలకు పుట్టినిల్లు విజయనగరం. ఆ ప్రాంతాన్ని పాలించిన పూసపాటి గజపతి రాజులు ఆ కళలు వర్ధిల్లేలా వసతులు కల్పించి ప్రోత్సహించారు. ఆ పట్టణంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అంటే తెలియని కళాభిమానులుండరు. 1919వ సంవత్సరంలో మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు గారు ఈ కళాశాలను స్థాపించారు. తొలుత దీనిని విజయరామ గానపాఠశాల అని నామకరణం చేశారు. మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా హరికథా పితామహులు అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు కాగా, ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు ద్వారం వేంకటస్వామి నాయుడు గారు తొలి ప్రొఫెసర్. విజయరామ గజపతి రాజు గారి తరువాత వారి కుమారులైన అలక్ నారాయణ గజపతి రాజు గారు ఆ సంస్థ పేరును శ్రీ విజయరామ సంగీత మరియు నృత్య కళాశాలగా మార్చారు. వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు. తరువాతి మహారాజా పీవీజీ రాజు గారు ఈ కళాశాలను ఎంతో అభివృద్ధి చేశారు. 1955వ సంవత్సరంలో ఈ కళాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ సంగీత నృత్య విభాగాలలో డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులు ఉన్నాయి.



ఇక మహారాజా కళాశాలలో పనిచేసిన వారు, నేర్చుకున్న వారి జాబితా చూస్తే ఆ కళాశాల ఘన చరిత్ర తెలుస్తుంది - ప్రధాన అధ్యాపకులుగా ద్వారం వేంకటస్వామి నాయుడు గారు, ద్వారం నరసింగరావు నాయుడు గారు, ద్వారం భావనారాయణరావు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ద్వారం దుర్గాప్రసాదరావు గారు మొదలైన ప్రముఖులు పని చేశారు. వారి శిక్షణ పొందిన వారు వేలాది మంది విద్యార్థులు గురువులై ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు. ద్వారం వంశంలో ఎందరో ఈ సంస్థలో చదివిన వారే. ఘంటసాల వేంకటేశ్వరరావు గారు, పులపాక సుశీలమ్మ గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, సాలూరి హనుమంతరావు గారు, కొమాండూరి కృష్ణమాచార్యుల వారు, మంచాల జగన్నాథరావు గారు, మారెళ్ల కేశవరావు గారు, ముళ్లపూడి లక్ష్మణరావు గారు, ముళ్ళపూడి శ్రీరామమూర్తి గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మహామహోపాధ్యాయ నూకల చినసత్యనారాయణ గారు...ఇలా ఎందరో ప్రముఖులకు సంగీత విద్యను అలదిన సంస్థ మహారాజా కళాశాల. అక్కడి గాలిలో, నీటిలో, మనుషులలో సంగీతం అంతర్భాగం అని చెప్పటం అతిశయోక్తి కాదు.


గాత్రం, వయోలిన్, వీణ, మృదంగం, భరతనాట్యం, కూచిపూడి, కథక్‌లలో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా డిగ్రీ మరియు డిప్లోమా కోర్సులు ఈ కళాశాల ద్వారా చేయవచ్చు. దాదాపు 100 ఏళ్ల చరిత్ర గల ఈ కళాశాల తెలుగు జాతికి చేసిన సేవ ఎనలేనిది. పద్మ అవార్డులు, సంగీత కళానిధి బిరుదులు పొంది మన కళల ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసిన ప్రముఖులకు విద్యను ఇచ్చిన సరస్వతీ నిలయం ఇది. స్థాపించి పోషించిన ఆ మహారాజులకు, ప్రమాణాలు పాటించి ప్రతిభకు ప్రాణం పోసిన ప్రధాన అధ్యాపకులకు శతసహస్ర వందనాలు. ద్వారం కుటుంబ సభ్యులకు ఈ కళాశాలతో ఉన్న సుదీర్ఘమైన అనుబంధం, వారు ఈ సంస్థకు చేసిన సేవ చిరస్మరణీయం. ఆ కుటుంబ సభ్యులకు మనం ఎంతో రుణపడి ఉన్నాము.

ప్రముఖ గాయని, సంగీత అధ్యాపకురాలు, ద్వారం వేంకటస్వామి నాయుడు గారి మనుమరాలు, ద్వారం భావనారాయణరావు గారి కుమార్తె ద్వారం లక్ష్మి గారు ఫేస్బుక్‌లో నా యీ పోస్టుకు కామెంటుగా ఈ వివరాలు ఇచ్చారు:

"మా కుటుంబంలో మీరు చెప్పిన నలుగురు ప్రధాన అధ్యాపకులతో పాటు మా మేనత్త గారు ద్వారం మంగతాయారు గారు, ద్వారం రమణకుమారి గారు, ద్వారం మనోరమ గారు, నేను (మొత్తం ద్వారం కుటుంబం నుండి ఎనమండుగురం) ఈ కళాశాలలో పని చేశాము. ఈ కళాశాలలో చదువుకున్న మా ఇతర కుటుంబ సభ్యులు - మా అమ్మ గారు గుమ్మలూరి వరదమ్మ గారు, పెద్దమ్మ గారు గుమ్మలూరి రమణమ్మ గారు ఇక్కడ చదివారు. మా పెద్దమ్మమ్మ కుమారుడైన శ్రీ జోగారావు గారు ఇక్కడ లెక్చరర్‌గా పని చేశారు. వారి కుమారులు శాస్త్రి గారు ఇక్కడ పని చేస్తున్నారు. మా అత్త గారి వైపు కూడా ఇద్దరు పెద మామ గార్లు ఇక్కడ సంగీతం నేర్చుకున్నారు. మా ద్వారం కుటుంబానికి ఈ కళాశల పుట్టినిల్లు, ఓ దేవాలాయం. మా కుటుంబానికి ఈ కళాశాలతో అవినాభావ సంబంధం ఉంది ". 

19, ఆగస్టు 2017, శనివారం

అలనాటి గాయనీమణి ఎల్.ఆర్ ఈశ్వరి గారి సినీ ప్రస్థానం విశేషాలు


ఆమె పేరు వింటేనే ఉత్సాహం ఉరకలేస్తుంది. చిన్న-పెద్ద అని లేకుండా అందరూ ఆమె గళంలోని కైపుకు దాసోహమైన వాళ్లే. దశాబ్దాల పాటు మత్తెక్కించే పాటలతో పాటు ఎన్నో భక్తి గీతాలను కూడా పాడి దక్షిణాది సినీ అభిమానులను అలరించిన గాయని ఎల్. ఆర్. ఈశ్వరి. వీరి పూర్తి పేరు లూర్డ్-మేరీ రాజేశ్వరి ఈశ్వరి. 1939 డిసెంబరు 7న చెన్నైలో రోమన్ కేథలిక్ దంపతులైన ఆంథోనీ దేవరాజ్, రెజీనా మేరీ నిర్మల దంపతులకు జన్మించారు. అమ్మమ్మ వైపు వారు క్రైస్తవులు, నాయనమ్మ వైపు వారు హిందువులు కావటంతో రెండు కుటుంబాలకూ ఆమోదయోగ్యంగా అలా పేరు పెట్టుకున్నారు.

ఆరేళ్ల వయసులోనే భర్త  దేవరాజ్ మరణించటంతో  నిర్మల ముగ్గురు పిల్లల కుటుంబాన్ని నడిపే భారం తన మీద వేసుకుని, సినీ గీతాలలో కోరస్ పాడే ఉద్యోగంలో చేరారు . చిన్ననాటి పేదరికం వలన  ఎల్. ఆర్. ఈశ్వరికి  సంగీతం నేర్చుకునే అవకాశం రాలేదు. సిలోన్ రేడియోలో పాటలు విని నేర్చుకునే వారు. తల్లితో కలిసి కోరస్‌లో పాడటంతో ఆమె సినీ జీవితం ఆరంభమైంది. తొలి అవకాశం మనోహర అనే తమిళ చిత్రంలో జిక్కి గారితో కోరస్ పాటలో వచ్చింది. ఈ చిత్రం 1954లో ఎల్వీ ప్రసాద్ గారి దర్శకత్వంలో తమిళంలో, అదే సంవత్సరంలో డబ్ చేయబడి తెలుగు, హిందీ భాషలలో విడుదలైంది. అలాగే, 1957లో విడుదలైన సువర్ణసుందరి చిత్రంలో సుశీలమ్మ పాడిన పిలువకురా అనే పాట కోరస్‌లో కూడా పాడారు. 1958లో విడుదలైన తమిళ చిత్రం నల్ల ఇడత్తు సంబంధం అనే చిత్రంలో సంగీత దర్శకులు కేవీ మహాదేవన్ గారు మూడు పాటలు పాడే తొలి అవకాశాన్నిచ్చారు. షావుకారు జానకి, ఎం.ఆర్ రాధ నటించిన ఈ చిత్రం విజయం సాధించగా ఎల్.ఆర్ ఈశ్వరి సినీ నేపథ్య గాయని ప్రస్థానం మొదలైంది. తెలుగులో తొలి అవకాశం 1958లోనే కేవీ మహాదేవన్ గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన దొంగలున్నారు జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. తమిళ చిత్రాలలో 1961లో విడుదలైన పాశమలర్ అనే చిత్రంలో పాటలతో ఎల్.ఆర్ ఈశ్వరి గారి ఉత్థానం ప్రారంభమైంది. తమిళ దర్శకులు ఏ పీ నాగరాజన్ గరు అప్పటికే ఎం ఎస్ రాజేశ్వరి అనే గాయని ఉండటంతో రాజేశ్వరి ఈశ్వరి పేరుని ఎల్.ఆర్ ఈశ్వరి గా మార్చారు.
ఇక 1960-70 దశకాలు ఎల్.ఆర్ ఈశ్వరి గళంలో వెలువడిన పాటలు మత్తు, గమ్మత్తుతో వీక్షకులను ఉర్రూతలూగించాయి. సుశీలమ్మ, జానకమ్మ మాధుర్యానికి, సొగసుకు మారుపేరైతే ఎల్.ఆర్ ఈశ్వరి ఈ కైపున్న పాటలకు ట్రేడ్ మార్క్ అయ్యారు. తెలుగులో పాండవ వనవాసం, ప్రతిజ్ఞాపాలన, ఉమ్మడి కుటుంబం, భార్యా బిడ్డలు, రైతుబిడ్డ, రౌడీలకు రౌడీలు, మంచి మిత్రులు, అందమైన అనుభవం, అంతులేని కథ, నిండు మనసులు, నాగమల్లి, మరోచరిత్ర, పుట్టినిల్లు మెట్టినిల్లు, అమ్మాయిల శపథం, అగ్గి బరాట, శ్రీవారు మావారు, ముత్తైదువ, రామాలయం, గౌరి, మంచి చెడు, ధనమా దైవమా, శ్రీమంతుడు, జరిగిన కథ, జమీందారు గారి అమ్మాయి, అల్లూరి సీతారామరాజు, రైతు కుటూంబం, మానవుడు దానవుడు, మాతృదేవత, ప్రేం నగర్, దేవుడు చేసిన మనుషులు, రాజకోట రహస్యం, అమ్మ మాట, జీవన తరంగాలు, ప్రాణం ఖరీదు, అన్నదమ్ముల సవాల్, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ పాండవీయం, మొరటోడు, ప్రేమ జీవులు, దీక్ష ఆలీబాబా నలభై దొంగలు, బాలమిత్రుల కథ, అగ్గిదొర, ఇదాలోకం మొదలైన ఎన్నో తెలుగు చిత్రాలకు పాటలు పాడారు.

ఎల్.ఆర్ ఈశ్వరి గారి పాడిన పాటల్లో - గాలిలోన పైట చెంగు, పాములోళ్లమయ్య, మాయదారి సిన్నోడు, ఆకులు పోకలు ఇవ్వద్దు, లేలేలేలేలే నా రాజా, భలే భలే మగాడివోయ్, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, నందామయా గురుడ నందామయా, గుడిలోన నా సామి, తీస్కో కోకోకోలా, బోల్త పడ్డావు చిన్ని నాయనా వంటి మత్తెక్కించేవి ఎంతో పేరు పొందాయి. . విజయలలిత, హలం, జ్యోతిలక్ష్మి వంటి శృంగార నర్తకీమణులకు ఎల్.ఆర్ ఈశ్వరి గారు పాడారు. ఇంతే కాకుండా, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి ఎన్నో తమిళ తెలుగు చిత్రాలలో నేపథ్య గాయనిగా పాటలు పాడారు. తమిళంలో ఎన్నో అమ్మవారి భక్తి గీతాల ఆల్బంస్ పాడారు. అలాగే క్రైస్తవ భక్తి గీతాలు కూడా పాడారు. తమిళం, తెలుగులో ఎక్కువ పాటలు పాడిన ఆవిడ కన్నడంలో, మళయాళంలో కూడా ఎన్నో బహుళ ప్రాచుర్యం పొందిన పాటలు పాడారు. ఘంటసాల, టీఎం సౌందర్‌రాజన్, పీబీ శ్రీనివాస్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు, సుశీలమ్మ, జానకమ్మ, వాణీ జయరాం మొదలైన వారితో కలిసి పాడారు. సత్యం, చక్రవర్తి, కేవీ మహాదేవన్, ఎమ్మెస్ విశ్వనాథన్ వంటి మేటి సంగీత దర్శకుల వద్ద పని చేశారు.

1970వ దశకం చివరలో లో నేపథ్య సంగీతం నుండి కనుమరుగైన ఎల్. ఆర్ ఈశ్వరి గారు 2011లో శింబు నటించిన ఓస్తే అనే తమిళ చిత్రం ద్వారా పునః ప్రవేశం చేశారు. ఆ తరువాత తమిళ కన్నడ చిత్రాలలో పాడారు. మొత్తం 14 భాషలలో ఆవిడ పాటలు పాడారు. పాట ఎంత చలాకీనో, మనిషి కూడా అంతే చలాకీ. వందల ప్రైవేట్ కచేరీలలో పాల్గొన్న ఎల్. ఆర్ ఈశ్వరి గారు అవివాహిత. ఈ మధ్య కాలంలో టెలివిజన్ పాటల పోటీల కార్యక్రమాలలో జడ్జిగా పాల్గొన్నారు. కలైమామణి, స్వరాలయ పురస్కారాలు అందుకొని, 77 ఏళ్ల వయసులో కూడ ఉత్సాహంగా పాడగలుగుతున్న విలక్షణ గాయని ఎల్.ఆర్ ఈశ్వరి గారు. బాలసుబ్రహ్మణ్యం గారు వీరిని ఎల్. ఆర్ భాస్వరం అని ఆటపట్టిస్తుంటారు. భాస్వరంలా ఉరకలెత్తే గాయనీమణి అని ఆయన భావన.

ఎల్. ఆర్. ఈశ్వరి గారి పాటల్లో నాకు చాలా  ఇష్టమైన పాట 1972లో విడుదలైన అమ్మ మాట చిత్రంలో జ్యోతి లక్ష్మి పై చిత్రీకరించబడీన మాయదారి సిన్నోడు. తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ పాట ఇటీవలే రీమిక్స్ కూడా చేయబడింది. నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు గారు. అటు తరువాత 1978లో విడుదలైన మరో చరిత్ర చిత్రంలోని భలే భలే మగాడివోయ్ అన్న పాట. ఆచార్య ఆత్రేయ గారు రచించగా, ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం అందించిన ఈ పాటను బాలు, ఎల్.ఆర్ ఈశ్వరి గారు కలిసి పాడారు. ఈ పాటను కమల్ హాసన్, సరితలపై చిత్రీకరించారు. భాషేతర ప్రేమ నేపథ్యమైన ఈ చిత్రంలో ఈ పాటలో ఎల్. ఆర్ ఈశ్వరి గారి మత్తెక్కించే గాత్రం సమ్మోహనం. ఎల్. ఆర్. ఈశ్వరి గారికి పరమాత్మ ఆయురారోగ్యాలు, మరెంతో గాత్ర సేవా భాగ్యం ప్రసాదించాలని ప్రార్థన

అదిగదిగో గగనసీమ - దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన రావు బాలసరస్వతి, ఎమ్మెల్ వసంతకుమారి గానంలో



అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి పాడెనోయి 
సా రి గ మ ప ద ని సా సా దా ప మ రి గ మ రి సా

హాయి హాయి ఈ లోకం తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూలవనం నీ సర్వం ప్రేమ ధనం మరువకోయి ఈ సత్యం


నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు
చేలలోని గాలిపైన తీయనైన తూలికలు
చెరుచుకోకు ఈ సౌఖ్యం చేతులార ఆనందం
ఏనాడును పొరపడకో ఏమైనా త్వరపడకో
మరల రాదు రమ్మన్నా మాయమైన ప్రేమ ధనం
చిగురింపదు తిరిగి వాడి చెడిన పూలవనం మరువకోయి ఈ సత్యం


దేవులపల్లి కృష్ణశాస్త్రి - ఆ పేరంటేనే తెలుగుదనం. మాటల మువ్వలు భావానికి మురిసి నర్తిస్తే అది కృష్ణశాస్త్రి గీతమవుతుంది. ఆ పదాలేమీ కఠినంగా ఉండవు, పామరులకు కూడా తేటతల్లమే. అందరి హృదయవీణలు మీటి మోహన రాగాలు పలికిస్తాయి. భావానికి మారు పేరు కృష్ణశాస్త్రి. అందులోనూ లలిత సంగీతానికి ఆయన సాహిత్యం ప్రాణవాయువు. తెలుగునాట కృష్ణా గోదావరులున్నంత వరకూ కృష్ణశాస్త్రి సాహిత్యం మకుటాయమానంగానే ప్రకాశిస్తుంది. అటువంటి ఓ గీతమే 1953లో విడుదలైన నా ఇల్లు అనే చిత్రంలోని అదిగదిగో గగనసీమ అనే భావవీచిక.

చిత్ర నేపథ్యం:

ఆనాటి సినీ మహామహులు చిత్తూరు వుప్పలదడియం నాగయ్య గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో నాగయ్య గారు నాయకుడు, ప్రఖ్యాత నర్తకి టీ ఆర్ రాజకుమారి గారు నాయిక. ఈ రాజకుమారి గారి కుటుంబానికి చెందినవారే జ్యోతిలక్ష్మి, జయమాలిని. ఈ చిత్రంలో ప్రతినాయిక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితగారి తల్లి సంధ్య సోదరి విద్యావతి. రాజకుమారి, విద్యావతి గార్ల అద్భుతమైన నటనతో ఈ చిత్రం మంచి విజయమే సాధించినా పార్టనర్ల మోసం చేసి నాగయ్యగారికి చిల్లి గవ్వ కూడా దక్కలేదు. చిత్రానికి సంగీతం నాగయ్య గారు, అద్దేపల్లి రామారావు గారు అందించారు.రావు బాలసరస్వతీ దేవి గారు, ఎమ్మెల్ వసంతకుమారి గారు, జిక్కి గారు, ఎమ్మెస్ రామారావు గారు, నాగయ్య గారు ఈ చిత్రానికి నేపథ్య గాయకులు. ఈ చిత్రానికి సంభాషణలు కూడా కృష్ణశాస్త్రి గారే.

పాట వివరాలు:

తెలుగు నేపథ్య సంగీతంలో తొలి గాయనీమణుల్లో ఒకరైన బాలసరస్వతి గారు, ఎమ్మెల్ వసంతకుమారి గారు కలిసి పాడిన ఓ అరుదైన గీతం అదిగదిగో గగన సీమ. పాటలో ప్రధాన గాత్రం బాలసరస్వతి గారిదే. ఎంత మధురంగా పాడారంటే వినే వారు ఆనందంలో తేలిపోవలసిందే. ఈ గీతంలో అద్భుతమైన భావం. మంచి ఆశావహమైన స్ఫూర్తిని కలుగజేస్తూ కర్తవ్యాన్ని కూడా బోధిస్తుంది ఈ గీతం. సాహిత్యంలో కృష్ణశాస్త్రి ముద్ర అణువణువునా గోచరిస్తుంది. నాగయ్య గారు ఈ పాటను సారంగ రాగంలో కూర్చారు. ఈ గీతం నాగయ్య గారి సంగీత ప్రతిభను సూచిస్తుంది. తరువాత ఇదే బాణీలో ఎన్నో దేశభక్తి, లలిత గీతాలు తెలుగు సంగీత ప్రపంచంలో వచ్చాయి. ఇల్లు, ప్రేమ ఎంత ముఖ్యమైనవో తెలిపే సందేశాత్మకమైన భావగీతి ఇది. బాలసరస్వతి గారి గాత్రంలో ఆ చెప్పలేని పట్టులాంటి మృదుత్వం ఉంటుంది, ఆ స్వరలక్షణం లలిత భావ గీతాలకు ఎంతో శోభనిచ్చేది. ఎమ్మెల్ వసంతకుమారి గారు అప్పటికే మేటి గాయని అయినా నాగయ్య గారిపై గౌరవంతో, బాలసరస్వతి గారి గొంతులో గొంతు కలిపి అద్భుతమైన ఏకగాత్రం అనిపించేలా పాడారు. ఆనాటి సామాజిక పరిస్థితుల వలన బాలసరస్వతి గారు సుశీలమ్మ, లీల, జిక్కి లాగా బహుళంగా పాడలేకపోయినా, పాడినవి అమృత గుళికలు. మలయమారుతంలా వీచే ఈ గీతం విని ఆనందించండి. 

నీ దయ రాదా - త్యాగరాజస్వామి కృతి


నీ దయ రాదా రామ నీ దయ రాదా!

కాదనే వారెవరు కళ్యాణ రామా! 

నను బ్రోచే వాడవని నాడే తెలియ
ఇన వంశ తిలక ఇంత తామసమా!

అన్నిటికికధికారివని నేఁ బొగడితి
మన్నించితే నీ మహిమకుఁ దక్కువా!

రామ రామ రామ త్యాగరాజ హృత్సదన
నా మది తల్లడిల్లగ న్యాయమా వేగమే!


ఓ రామా! నీకు నాపై దయ కలుగదా? నీకు దయ రాకున్ననూ కాదనే వారున్నారా?  ఓ సూర్యవంశ శ్రేష్ఠుడా! నన్ను బ్రోచేవాడవు నీవేనని నీకు ముందే తెలుసు. అయినా ఇంత తామసమా? అన్నిటికీ నీవే అధికారివని నేను నిన్ను నుతించినాను. నన్ను మన్నించితే నీ మహిమకు ఏమైనా తక్కువగునా? త్యాగరాజుని హృదయములో నివసించే ఓ రామా! నా మనసు తల్లడిల్లేలా చేయుట నీకు న్యాయమా? వీగమే నన్ను బ్రోవుము.

- సద్గురువులు త్యాగరాజస్వామి

నిందాస్తుతిలో త్యాగరాజ స్వామి అనేక కృతులు రచించారు. క్లేశములో ఉన్నప్పుడు భక్తునికి భగవంతునిపై ఆగ్రహం కలగటం అనేది ఎందరో వాగ్గేయకారుల కృతులలో మనం గమనించవచ్చు. తనను బ్రోచుటలో ఆలస్యమెందుకు అని ప్రశ్నించే సంభాషణలో ఎన్నో కృతులు వచ్చాయి. అటువంటిదే నీ దయ రాదా? నిజంగా ఆయనే తనకు దిక్కు అని ప్రతి సాధకునికి తెలుసు. కానీ, ఆశ నిరాశ అయినప్పుడు మనలోని వికారాలు ఒకింత ఒలకటం మానవ సహజం. నీ దయ రాదా అన్న కృతిలో త్యాగయ్య ఇటువంటి భావనలనే వ్యక్తపరచారు. నీ అంతటి వాడు లేడు, నీవు తప్ప వేరే లేరు అని నుతిస్తూనే బ్రోచుటకు తామసమా అని పలికారు. అన్నీ నీవనుకున్నానే, నన్ను కాపాడితే నీ మహిమలకేమైనా తక్కువా అని నిష్ఠూరంగా ప్రశ్నించారు. నా మనసును కష్టపెట్టడం నీకు న్యాయమా అని నిలదీశారు. భక్తిమార్గంలో అనేక రకలా భావనలు వస్తాయి అన్న దానికి ఈ కృతి మరో నిదర్శనం. వసంతభైరవి రాగంలో త్యాగరాజస్వామి వారు ఈ కీర్తనను స్వరపరచారు. ఈ కీర్తనను తెలుగు, తమిళ చిత్రాలలో పొందు పరచారు. సుశీలమ్మ పూజ అనే చిత్రంలో ఆలపించగా, యేసుదాసు ఆరు సింధుభైరవి చిత్రంలో ఆలపించారు. యేసు దాసు గారి ఆలాపన ఇదిగో

చలి గాలి వీచింది - రావు బాలసరస్వతి గారి లలిత గీతం


లలిత గీతాల స్వర్ణయుగం రావు బాలసరస్వతి గారితోనే ప్రారంభమైందని వారి పాటలు విన్నప్పుడు ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓ నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఈ స్వర్ణ యుగంలో బాలమురళిగారు, ఘంటసాల మాష్టారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, చిత్తరంజన్ గారు, వేదవతీ ప్రభాకర్ గారు, విజయలక్ష్మీ శర్మ గారు, సురేఖా మూర్తి గారు, ఛాయా దేవి గారు, ద్వారం లక్ష్మి గారు..ఇలా ఎందరో గాత్ర సంపద కలిగిన కళాకారులు సాలూరి రాజేశ్వరరావు గారు, బాలాంత్రపు రజనీకాంతరావు గారు, పాలగుమ్మి విశ్వనాథం గారు మొదలైన మహామహుల సంగీతం స్వరపరచగా అద్భుతమైన గీతాలను పాడారు. దేవులపల్లి వారు, వింజమూరి శివరామారావు గారు, రజనీ, పాలగుమ్మి వారు, ఆరుద్ర, దాశరథి గారు మొదలైన రచయితలు అమూల్యమైన లలిత సంగీత సాహిత్యాన్ని మనకు అందించారు.

రావు బాలసరస్వతీదేవి గారి పాటలు శోధించి విన్న కొద్దీ వారిపై గౌరవం ద్విగుణీకృతమవుతోంది. వారి లలిత సంగీత ప్రతిభ అసామాన్యం. సైగల్ గారి ప్రభావం తనపై ఉందని చెప్పుకున్న బాలసరస్వతి గారు వారి శైలిని ఎంతగా తన లలిత సంగీత గానంలో కనబరచారో ఒక్కొక్క గీతంలో మరింత తెలుస్తోంది. భావానికి తేనె అలది అలా సెలయేటి ధారలా తన గళంలో సాహిత్యాన్ని ఒలికించారు వారు. అటువంటి గీతమే చలి గాలి వీచింది. ఈ గీతాన్ని యూట్యూబ్ ప్రకారం వింజమూరి శివరామారావు గారు రచించారని ఉంది. మరో వెబ్ సైట్లో ఆరుద్ర గారని ఉంది. సాహిత్య శైలి చూస్తే శివరామారావు గారి రచనే అని నా భావన. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి గారు అని యూట్యూబ్ ఉవాచ. లలిత సంగీత సామ్రాజ్ఞి బాలసరస్వతి గారని వారి పాటలు వింటే అర్థమవుతుంది. ఈ గీతంలో వారి గళం ఎంత లేతగా ఉంటుందో! సుసర్ల వారి సంగీతంలో లలిత సంగీతం వినటం ఇదే మొదటి సారి.

చలి గాలి వీచింది తెలవారబోతోంది ఇకనైన ఇల్లు చేరవా 
ప్రియా ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా!

ఎదురు తెన్నులు చూచి ఎద బెదిరి పోయింది
నిదురలో పడు తనువు నిలబెట్టుకున్నాను 
ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా

బరువాయె నా మేను చెరువాయె కన్నీళ్లు
విరహ వేదనను ఏమో మరి మోయలేను 
ఇకనైన ఇల్లు చేరవా ఓ ప్రియా ఇకనైన ఇల్లు చేరవా

ఉత్సాహంగా సాగే ఈ మధురమైన లలిత గీతం బాలసరస్వతి గారి గానంలో ఆలకించి ఆనందించండి. 

సుందరాంగ మరువగలేనోయ్ రావేల - సంఘం చిత్రంలోని ఆపాత మధురం


సంఘం - 1954లో విడుదలైన ఓ అద్భుత కళాఖండం. ఏవీఎం వారి బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించటానికి ప్రధాన కారణం కథ, వైజయంతిమాల, అంజలీదేవిల మేటి నటనాకౌశలం. ముఖ్యంగా వైజయంతిమాల గారిది మైమరపించే నటన. దాదాపుగా వీరిద్దరి భుజాల మీదే సినిమా నడుస్తుంది. అన్న ఎన్‌టీఆర్ గారు కూడా చాలా అందంగా ఉంటారు. ఈ చిత్రానికి ఆర్ సుదర్శనం గారు సంగీత దర్శకత్వం వహించగా తోలేటి వేంకటరెడ్డి గారు పాటలను రచించారు. నాయికలకు టీ.ఎస్. భగవతి మరియు సుశీలమ్మ నేపథ్య గానం చేశారు. 63 ఏళ్ల క్రితం ఇటువంటి చిత్రం వచ్చిందంటే ఓ సంచలనమే అనుకోవాలి. ఎంతో అభ్యుదయ భావాలను ప్రోత్సహించిన చిత్రం ఇది. చక్కని ఇతివృత్తం, మధ్య మధ్యలో హాస్యం, నటీనటుల సహజ హావభావాలు, సంగీత నృత్యాలు, చిత్రీకరణ ఈ చిత్రానికి ఆయువుపట్లు. రాణి, కామిని పాత్రలలో వైజయంతిమాల, అంజలి పోటీ పడి నటించారు. చిలక పలుకుల తెలుగులో వైజయంతిమాల తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. స్నేహితురాళ్లుగా వీరిద్దరూ చిత్రాన్ని డామినేట్ చేశారు.  ఈ చిత్రం తొలుత తమిళంలో నిర్మించబడి (పెణ్), తరువాత తెలుగులో, తరువాత హిందీలో (లడ్కీ) విడుదలై మూడు భాషల్లోనూ విజయం సాధించాయి.

ఈ చిత్రంలో సుశీలమ్మ, టీఎస్ భగవతి గారు పాడిన సుందరాంగ మరువగలేనోయ్ రావేల అనే కృష్ణ ప్రేమ గీతాన్ని మనోజ్ఞంగా తోలేటి వారు రచించంగా పాటలో తన్మయులై నటించారు నాయికలు. ఎంత సుందరమైన గీతమో! పాట సాహిత్యమొక వైపు, ఈ ఇరువురు అందమైన నాయికల నటన మరొక వైపు. ప్రేక్షకుల మనసులు దోచుకొని ఈ గీతాన్ని అజరామరం చేశాయి. ఆర్ సుదర్శనం గారు ఏవీఎం వారికి ఆస్థాన సంగీత విద్వాంసులు. చక్కని వీణా వాదనం, పక్క వాయిద్యముల ధ్వానములతో ఈ పాట అనుక్షణం అలరిస్తుంది. మేను పులకరింపజేస్తుంది. ఆపాత మధురం అని ఊరకే అనలేదు సుమా! సంగీతానికి, నటనకు, భావానికి, చిత్రీకరణకు సమమైన ప్రాధాన్యతనిచ్చి పాటలను కూర్చిన రోజులవి. నటీమణుల ప్రతిభను ప్రకాశింపజేసే సాంకేతిక నైపుణ్యం ఆనాటీ దర్శకులలో ఉండేది. తోలేటి వారి పద ప్రయోగం గమనించండి. చక్కని చిక్కని తెలుగులో లయబద్ధమైన పదమంజరిని రచించారు. ఈ సాహిత్యానికి సంగీత దర్శకులు ఉపయోగించిన వీణావాదనం మనోహరం. నాయికల కళ్లలో వలపులు, ఎదురుచూపులు అద్భుతః. టీఎస్ భగవతి గారు తమిళ చలనచిత్రసీమలో ప్రఖ్యాత గాయని. ఇక సుశీలమ్మ సంగతి చెప్పేదేముంది? వీరిద్దరి యుగళగీతం ఆద్యంతం రసజ్ఞులకు కర్ణామృతమే. ఈ మేటి వన్నె గల గీతాన్ని వీక్షించండి. సాహిత్యం ఇదిగో!

సుందరాంగ మరువగలేనోయ్ రావేల
నా అందచందములు దాచితి నీకై రావేల

ముద్దు నవ్వుల మోహన కృష్ణా రావేల
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు

మేని కనులలో వాలు చూపుల ఆ వేళ
నను జూసి కనుసైగ జేసితివోయి రావేల

కాలి మువ్వల కమ్మని పాట ఆ వేళ
ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెముల కలగలుపు

హృదయ వీణ తీగలు మీటి ఆ వేళ
అనురాగ రసములే చిందితివోయి రావేల

మనసు నిలువదోయ్ మధు వసంతమోయ్ రావేల
పూవులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే 


17, ఆగస్టు 2017, గురువారం

భక్త జన వత్సలే - నామదేవుని అభంగ్


భక్త జన వత్సలే యేయి ఓ విఠ్ఠలే
కరుణాకల్లోలే పాండురంగే

సజల జలద ధర పీతాంబర పరిధాన
యేయి ఉద్ధరణే కేశీరాజే

నామా మ్హణే తు విశ్వాచీ జననీ
క్షీరాబ్ధి నివాసిని జగదంబే

ఓ విఠ్ఠలా! భక్తులపై వాత్సల్యము కల పాండురంగా! ఈ భక్తునిపై కరుణతో రమ్ము! నీటితో నిండిన నల్లని మేఘము వంటి శరీరముతో, పీతంబరము ధరించి నన్ను ఉద్ధరించటానికి రమ్ము ఓ కేశవా! నామదేవుడు నీవు పాలకడలిలో నివసించే జగన్మాతవని విశ్వసిస్తున్నాడు. ఈ భక్తుడిపై కరుణతో రమ్ము!

నామదేవుడు మహా భక్తుడు. పాండురంగ విఠలుని జగన్మాతగా భావించి పలికిన మరాఠీ అభంగ్ ఇది. అచంచలమైన భక్తికి మరాఠా ప్రాంతం సుప్రసిద్ధి. తుకారాం, నామదేవుడు, జ్ఞానేశ్వరుడు, ఏకనాథ్ సక్కుబాయి, సమర్థ రామదాసు మొదలైన మహాభక్తులకు ఆ నేల జన్మభూమి. నామదేవుడు కొలిచిన ఆ పండరిపుర విఠలుడు ఆయనతో పాటు ఎందరో భక్తులను బ్రోచి మోక్షాన్ని ప్రసాదించాడు. అభంగములు పరమాత్మను భక్తితో ప్రస్తుతించే అద్భుత సంగీత సుమాలు. అభంగములు భక్తుడిని పరమాత్మను విడదీయరాని బంధంలో ముడివేసేవి. అటువంటి అభంగమే ఈ భక్త జన వత్సలే. కర్ణాటక సంగీత సాంప్రదయంలో అభంగములకు స్థానం ఉంది. బృందావన సారంగ రాగంలో కూర్చబడిన ఈ అభంగమును అరుణా సాయిరాం గారు పాడారు.



పాండురంగ మహత్యం – 1957: భక్తి రస కావ్యం

1957 నవంబర్ 28న విడుదలైన పాండురంగ మహత్యం తెలుగు భక్తి చిత్రాల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ పతాకంపై నందమూరి త్రివిక్...