20, జనవరి 2026, మంగళవారం

భగవద్రామానుజాచార్యుల జీవనయాత్ర – స్థలాల ఆధారిత సారాంశము



భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో రామానుజాచార్యుల వారు అతి విశిష్టమైన స్థానాన్ని అలంకరించిన అవతారపురుషులు. విశిష్టాద్వైత సిద్ధాంతానికి ప్రాణప్రతిష్ఠ చేసి, భక్తి–జ్ఞాన–కర్మల సమన్వయాన్ని ప్రజలకు సులభముగా బోధించిన జగద్గురువులు. వారి జీవితం ఒక స్థలంలో స్థిరముగా ఉండిన జీవితం కాదు; అది ధర్మప్రచారం నిమిత్తం దేశమంతా విస్తరించిన ఒక మహాయాత్ర.

శ్రీపెరుంబుదూరు – అవతార స్థలం:    

శ్రీ రామానుజాచార్యుల జన్మస్థానముగా ప్రసిద్ధి పొందినది శ్రీపెరుంబుదూరు గ్రామము. ఇది తమిళనాడులోని ఒక పుణ్యక్షేత్రము. క్రీస్తుశకం 11వ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ వారు జన్మించారు. చిన్ననాటి నుంచే అపూర్వమైన బుద్ధిశక్తి, ధార్మిక స్వభావం కలిగిన బాలకుడిగా ప్రసిద్ధి చెందారు. వేదపాఠనానికి అనుకూలమైన వాతావరణంలో పెరిగిన ఈ బాలుడు, భవిష్యత్తులో భారతీయ తత్వచింతనకు దిశానిర్దేశం చేసే మహాచార్యుడవుతాడని అప్పుడే సంకేతాలు కనిపించాయి.

కాంచీపురం – విద్యాభ్యాసము మరియు అంతర్మథనం:

బాల్యానంతరం రామానుజులు కాంచీపురానికి చేరుకున్నారు. ఇది ఆ కాలంలో విద్యా–సాంస్కృతిక-ఆధ్యాత్మిక కేంద్రముగా వెలుగొందిన నగరం. ఇక్కడ యాదవప్రకాశుడు అనే అద్వైతాచార్యుని వద్ద వేదాంత విద్యను అభ్యసించారు. అయితే గురువు బోధించిన అద్వైత భావన, శిష్యుని హృదయంలోని భక్తి ప్రధానమైన దృష్టితో సరిగా ఏకీభవించలేదు. ఈ అంతర్మథనమే భవిష్యత్తులో విశిష్టాద్వైత సిద్ధాంత రూపకల్పనకు బీజమైంది.

కాంచీపురంలోనే వారు దేవాలయ సేవలలో పాల్గొని, శ్రీ వరదరాజ స్వామి అనుగ్రహంతో భక్తి మార్గాన్ని లోకానికి బోధించసాగారు. ఇక్కడ గృహస్థ జీవితం నుంచి విరక్తి చెంది, క్రమంగా సన్యాస మార్గానికి పయనించారు.

శ్రీరంగం – ప్రధాన పీఠము మరియు కార్యక్షేత్రము:

రామానుజాచార్యుల జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ శ్రీరంగంలో ప్రారంభమైంది. కావేరి నదీ తీరంలో విరాజిల్లే శ్రీరంగనాథస్వామి ఆలయం వారి ఆధ్యాత్మిక కార్యాలకు కేంద్రబిందువైంది. ఇక్కడ వారు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని సుస్థిరంగా స్థాపించారు. ఆలయ ఆరాధనా విధానాలను శాస్త్రీయంగా పునర్వ్యవస్థీకరించి, సామాన్య ప్రజలకు సైతం భక్తి మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.

శ్రీరంగంలోనే వారు శ్రీభాష్యం, గీతాభాష్యం వంటి మహాగ్రంథాలను రచించి, బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైత వ్యాఖ్యానాన్ని అందించారు. వారి జీవితాంతం ఈ పుణ్యక్షేత్రమే వారి నివాసముగా, కార్యక్షేత్రముగా నిలిచింది. చివరికి ఇక్కడే వారు దేహత్యాగం చేశారు. ఈనాటికీ వారి శరీరావశేషాలు ఆలయ ప్రాంగణంలో సజీవ సంప్రదాయంగా దర్శనమిస్తాయి.

మేల్కోటే (తిరునారాయణపురం) – విరోధముల నడుమ ధర్మస్థాపన:

చోళ రాజుల కాలంలో కొన్ని మతపరమైన సంఘర్షణల కారణంగా రామానుజాచార్యులు శ్రీరంగాన్ని విడిచి కర్ణాటక ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది. అప్పుడు వారు మేల్కోటే అనే ప్రాంతంలో దీర్ఘకాలం నివసించారు. ఇది కూడా వారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థలముగా నిలిచింది.

మేల్కోటేలో వారు దేవాలయాలను పునరుద్ధరించి, విగ్రహారాధనకు ప్రాధాన్యతనిచ్చారు. అక్కడ యదుగిరి యతిరాజ మఠాన్ని స్థాపించి, అనేక శిష్యులను తయారుచేశారు. సామాజిక సంస్కరణలు, భక్తి ప్రచారం, తత్వవాద బోధన — అన్నీ కలిసిన సమగ్ర కార్యాచరణ అక్కడ సాగింది. కొందరు వారు అక్కడ 12 సంవత్సరాలు, మరికొందరు 30 సంవత్సరాలకు పైగా నివసించినట్లు చెప్పారు.

ఉపసంహారం:

శ్రీ రామానుజాచార్యుల జీవితం ఒక వ్యక్తిగత యాత్ర కాదు. అది సమాజాన్ని, ఆధ్యాత్మికతను, తత్వచింతనను ఒక కొత్త దిశగా నడిపించిన మహాప్రయాణం. శ్రీపెరుంబుదూరులో జన్మించి, కాంచీపురంలో విద్యనభ్యసించి, శ్రీరంగంలో సిద్ధాంతాన్ని స్థాపించి, మేల్కోటేలో ధర్మాన్ని నిలబెట్టిన ఈ మహాచార్యుడు భారతదేశ ఆధ్యాత్మిక భూభాగమంతటా తన ప్రభావాన్ని చాటాడు.

వారి నివసించిన ప్రతి స్థలమూ ఈనాటికీ ఒక తీర్థక్షేత్రమే. వారి బోధనలు కాలాతీతమైనవి, వారి జీవితం అనుసరణీయమైనది, వారి సిద్ధాంతం సనాతనమైనది. 

18, జనవరి 2026, ఆదివారం

వీరభద్రుడు-వీరభద్రుని పళ్ళెం

వీరభద్రుడు:

శివుని అంశతో జన్మించినవాడు ఇతడు. రౌద్రరూపము దాల్చిన శివుడు తన జడను లాగి నేలకు కొట్టగా ఈ వీరభద్రుడు జన్మించాడు. దక్షుడు బ్రహ్మ చేస్తున్న సత్రయాగము చూడటానికి వచ్చినప్పుడు తనను చూసి లేచి మాట్లాడని తన అల్లుడగు శివునిపై కోపించి శపించి వెళ్లిపోతాడు. ఆనాటి నుండి దక్షుడు శివునిపై శత్రుభావము వీడక ఉంటాడు. అందువల్ల శివుడిని,కుమార్తె ఉమ పిలువకుండానే బృహస్పతి సవనము ఆరంభిస్తాడు. అది తెలిసి ఉమ తన తండ్రి చేస్తున్న యాగమును చూడటానికి భర్త అనుమతిని పొంది యజ్ఞశాలకు వెళుతుంది. అక్కడ తండ్రిచే అవమానించబడి ఆయనను నిందిస్తూ యోగాగ్నిని సృష్టించి దానిలో దగ్ధమవుతుంది. ఆ వృత్తాంతమును శివుడు నారదుని ద్వారా తెలుసుకొని కోపోద్రిక్తుడై తన జడ ఒకటి పెఱికి భూమి మీద విసరగా, దాని నుండి వీరభద్రుడు ఆవిర్భవించి, ఘోరమైన రూపము దాల్చి దక్ష యజ్ఞమును ధ్వంసము చేయటానికి శివుని ఆనతి పొంది యజ్ఞశాలకు వెళ్లి యజ్ఞధ్వంసము మరియు దక్షవధ చేస్తాడు. అప్పుడు బ్రహ్మ మొదలగు దేవతలు శివుని ప్రార్థింపగా శివుఁడు ప్రసన్నుడై మళ్లీ దక్షాదులను అనుగ్రహిస్తాడు. దక్షయజ్ఞము ధ్వంసమయ్యే సమయంలో యజ్ఞపురుషుడు మృగరూపము ధరించి పారిపోవుచుండగా ఆ మృగమును వీరభద్రుడు వధిస్తాడు, శివుడు పునరుజ్జీవింపచేస్తాడు. దక్ష యజ్ఞ సమయంలో రౌద్ర రూపము దాల్చిన ఉమ అంశతో ఆవిర్భవించిన భద్రకాళిని వీరభద్రుని పత్నిగా భావిస్తారు. 

శివ పురాణం, స్కాంద పురాణం, పద్మ పురాణం వీరభద్రుని గురించి ప్రస్తావిస్తాయి. మన దేశంలో లేపాక్షి, కొత్తకొండ, రిషీకేశ్, హుమ్నాబాద్, కుంభకోణం మొదలైన ప్రాంతాలలో వీరభద్రుని దేవాలయాలున్నాయి. వీరశైవాన్ని ఆచరించేవారు ఎక్కువగా కర్నాటక, తెలంగాణా, పల్నాడు ప్రాంతాలలో ఉంటారు. ఉత్తరాదిన దక్షయజ్ఞ విధ్వంసకుడిగా, దక్షిణాది వారు శివుని ప్రమథ గణాధిపతిగా, క్షేత్రపాలకునిగా, వీరునిగా వీరభద్రుని ఆరాధిస్తారు. శ్రీశైలంలో బయలు వీరభద్రస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. 

=

వీరభద్రుడి పళ్లెం:

వీరభద్రుడికు చేసే విశిష్టమైన పూజ, వీరశైవులు ఆచరించే ఒక ఆచారము వీరభద్రుడీ పళ్లెం/వీరభద్రుని వీథి పళ్ళెం. ఈ పూజా తతంగం అద్భుతమైన వీరవిన్యాసాలతో కూడి ఉంటుంది. అసాధ్యం అనిపించే వీరనాట్యంతో అద్భుతమనిపిస్తుంది.  శివద్వేషులను అంతం చేసే మహావీర ఖడ్గాన్ని ఈ ప్రక్రియలో ప్రదర్శిస్తారు.  ఆ వీరనాట్యం చూసి తీరాల్సిందే, చెప్పశక్యం కాదు. అటువంటి వీరభద్రుని పళ్ళెం వీరశివాచార కుటుంబాలకు, లింగధారులకు ఒక కుటుంబ ఆచారంగా వస్తూంటుంది. ఇందులో వీరభద్రుని ఆవిర్భావ కథను దక్షయజ్ఞ దండకంగా అమితమైన ఆవేశంతో చదువుతూ, ఢమఢమ డప్పులు మోగిస్తూ,  నారసాలు పొడుచుకోవడం, అగ్గి విన్యాసాలు చేయడం, సూదుల్లాంటి మేకులున్న పావుకోళ్ళని ధరించి అశ్శరభ శ్శరభ, దశ్శరభశ్శరభ అని నాట్యం చేయడం, నిప్పుల గుండాలు తొక్కడం ఇలా ఎన్నో వీరోచిత విన్యాసాలుంటాయి.

వీరి ఖడ్గ ప్రదర్శనం వీరా వేశంతో కూడుకొని వుంటుంది. స్త్రీలూ, పురుషులూ ఒక గుంపుగా వీధిలో ప్రవేశించి అక్కడక్కడ ఆగుతూ ఈ ఖడ్గాలు చదివి ముందు సాగుతారు. ఖడ్గధారి ఖడ్గం చదివేటప్పుడు గుంపులోనుంచి ముందుకు వస్తాడు. సాంబ్రాణి ధూపంతో అతనిని ముంచెత్తుతారు. సన్నాయి బూరలతో, డోళ్ళతో, శంఖాలాతో, ఖడ్గధారిని ఆవేశ పరుస్తారు. ఆ ఆవేశంలో ఖడ్గధారి ఖడ్గం (వీరభద్ర ఆవిర్భావ గాథని వివరించే పదాల్లాంటివి) చదువుతాడు. పళ్లెంలో మహావీర ఖడ్గాన్ని ఉంచుతారు.  వీభద్రపళ్లెంలో ఈ ఖడ్గ విన్యాసం తప్పనిసరిగా ఉంటుంది. ఖడ్గం పట్టి చేసే  ఈ నృత్యాన్ని ఖడ్గ నృత్యమని కూడ పిలుస్తారు. ఈ నృత్యం ప్రత్యేకంగా కొన్ని జాతులవారు మాత్రమే చేస్తారు. ఏ కులం వారైనా వీర శైవ మతాన్ని అవలంబించిన ప్రతి వారూ ఈ నృత్యాన్ని తప్పక చేస్తారు.

తంతు తతంగం:

ఈ మహావీరఖడ్గ నృత్య సమయంలో పెద్ద పెద్ద ప్రభలు గట్టి ఆ ప్రభలను అనేక అలంకారలతో ముంచి వేస్తారు. ప్రభకు ముందూ వెనుకా స్త్రీ పురుషులు నడుస్తూ వుంటారు. ప్రభ ముందు సన్నాయి వాయిద్య కాండ్రు రెండుమూడు దళాలువారుంటారు. ముఖ్యంగా ఈ నృత్యంలో వీరు వాయించే వాయిద్యం వీరంగం. ఇది ఒక ప్రత్యేకమైన వాయిద్యం. కణకణమని అతి దురితంగా డోళ్ళు మ్రోగుతాయి. సన్నాయి బూరలు తారాస్థాయిలో గుక్క పట్టి నృత్య కారుని చెవుల్లో వూదుతారు. సాంబ్రాణి ధూపం ముఖానికి దట్టంగా పట్టిస్తారు. దీనితో ఖడ్గధారి వీరావేశంతో ఒక్కగెంతు గ్తెంతి దశ్శరభశరభ, అశ్శరభ శరభ అంటూ డోలు వాయిద్య గాళ్ళను కవ్విస్తూ... అదదదద అబబబబ అగగగగ ... అని డోలు వాయిద్య గానిని కవ్వించి ముక్తాయింపులు ఇప్పించి దశ్శరభ అశ్శరభ అని వీరభద్రుని ఆవిర్భావగాథ లైన దక్షుని దండకం తదితరాలు చదువుతూ వీరనాట్యం చేస్తాడు. హంగూ, ఆర్భాటం చేస్తారు. వీరంగ ధ్వనులు మిన్ను ముట్టుతాయి. ఇలా ఖడ్గం పట్టి దండకం చదువుతూ, వాయిద్యాల గమకాలననుసరించి, వీరావేశంతో ఆ ప్రక్కకూ, ఈ ప్రక్కకూ అడుగులు వేస్తూ, కంకణం కట్టిన కత్తిని వేగంగా త్రిప్పుతూ ఆసాంతంలో ఏ గ్రామదేవతను గాని ఏ దేవుణ్ణి పూజిస్తారో, ఆ గ్రామం పేరు తలచి జై మంగళ గిరి వీరభద్ర అని ముగించి మరల వాయిద్యగాండ్రను అదరించి శరభ, శరభ అంటూ నానా హంగామా చేసి ఆ కత్తిని ఎవరైతే ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారో, అతని పళ్ళెంలో వుంచుతారు.

ఇలా ఊరేగుతూ నాలుగు వీథులూ కలిసిన చోటల్లా ఒక్కొక్క వ్వక్తి పై విధంగా ఖడ్గ నృత్యం చేస్తాడు. ఇలా ఉత్సవం ముందుకు సాగేకొద్దీ జన సమూహం ఎక్కువై ఎంతో ఉద్రేకాన్ని కలిగిస్తుంది. నృత్యధారి ధరించే ఖడ్గం చాల భారీగా వుంట్ఘుంది. ఖడ్గం మిలమిల మెరుస్తూ వుంటుంది. ఖడ్గం మధ్య భాగంలో తమలపాకులతో గాని, మామిడాకులతో గానీ కంకణం కడతారు. కొన్ని చోట్ల నిమ్మకాయలు గుచ్చడం ఉంది. 

ఖడ్గ ధారి కర్తవ్యాలు:

ఖడ్గం ధరించే వ్వక్తి విభూతి రేఖలు పట్టించి, విచిత్ర వేష ధారణలో వుంటాడు. ఖడ్గం ధరించే వ్వక్తి ఆ రోజున ఉపవాసముంటాడు. ప్రతి వారూ ఈ నృత్యం చేయడం కష్టం. నృత్యం చేసే ప్రతి వ్వక్తి దక్షుని దండకాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. లేనట్లేయితే అడుగు పడదు. ఖడ్గ నృత్య ధారి ప్రళయ తాండవంగా నృత్యం చేసిన తరువాత శివమెక్కి ఆవేశంతో నారసాలు పొడుచు కుంటాడు.

నారసాలు:

ఖడ్గ నృత్యంలో ఆ నారసాల నృత్యం మహా ఉత్తేజంగా, భయంకరంగా వుంటుంది. ఖడ్గ నృత్యం అయిన వెంటనే ఆ వ్వక్తి నారసాలు పొడుచుకుంటాడు. 

నారసాలంటే అనేక రకాలుగా వుంటాయి.  ఏకనారసం, కంటి నారసం, గొంతు నారస, శిరసు నారసం, శూల నారసం మొదలైన పేర్లతో వుంటాయి. ఇవి శూలం మాదిరిగా ఉండి, త్రిశూలం చివరి భాగంలో నూనె గుడ్డలు చుట్టి, వాటిని వెలిగించి, సన్నని మొన భాగాన్ని నాలికపై గుచ్చుతారు. ఇలా గ్రుచ్చే సమయంలో జోరుగా వాయిద్య సమ్మేళనం జరిగుతుంది. రణగొణ ధ్వనులు చేస్తారు. ఉద్రేకంలో ఉన్న వారికి కర్పూరం వెలిగించిన పళ్ళెం చేతికిస్తారు. నృత్యకారుడు చేతితో నారసాన్ని పట్టుకుని వాయిద్యానికి తగినట్టు వీరాధివీరుడిలా గుండ్రంగా తిరుగుతూ నృత్యం చేస్తాడు. చేసే కొద్దీ వాయిద్యాల జోరు ఎక్కువ అవుతుంది. ఈ జోరులో వెలిగించిన వత్తులు, ఒక్కొక్కటిగా ఆరి పోవడంతో ఈ నృత్యం కూడ పూర్తి అవుతుంది.

స్థలానుకూలంగా ఆచారాలు: 

ఈ వీరభద్రుని పళ్ళెం పట్టే విధానంలోని ప్రధాన విన్యాసాల గురించే మనం ఇంతసేపూ చెప్పుకున్నాం.  కొన్ని చోట్ల ఈ విన్యాసాలతో పాటుగా నిప్పుల గుండాలు తొక్కడం తదితర ఎన్నో భీభత్సమైన విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు. కలియుగంలో జంతుబలులు నిషేధించినా కొన్ని చోట్ల అవి ఈ విన్యాసాల్లో చోటుచేసుకుంటాయి. సాధారణంగా కూషంఆండాన్ని సాత్విక బలిగా అర్పిస్తూ ఉంటారు. ఇలా వీరభద్రుని పళ్లెం వీరోచిత విన్యాసాలతో కూడి చివరగా ఏదైనా ఒక వీరభద్ర దేవాలయం దగ్గరే ముగుస్తూ ఉంటుంది.   


11, జనవరి 2026, ఆదివారం

తెర తీయగ రాదా - త్యాగరాజస్వామి కృతి



త్యాగరాజస్వామి సమకాలీకులలో ఉపనిషద్బ్రహ్మేంద్ర స్వామి వారు ప్రముఖులు. వీరు కాంచీపురంలో మఠాన్ని ఏర్పాటు చేసి 108 ఉపనిషత్తులపై భాష్యం రచించారు. సన్యాస స్వీకార సమయంలో గురువులు ఇచ్చిన పేరు రామచంద్రేంద్ర సరస్వతి అయినా వారు ఉపనిషత్తులపై చేసిన కృషి వలన ఆయనకు తదనుగుణమైన నామం వచ్చింది. వారు ఒకసారి త్యాగరాజస్వామిని కాంచీపురం రమ్మని ఆహ్వానించారు. శిష్యుల్ని వెంటబెట్టుకుని త్రోవలో పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, అక్కడి వేల్పులను దర్శించిన అనుభవంతో కీర్తనలు రచించి పాడుకున్నారు త్యాగయ్య. కోవూరు, పుత్తూరు, నాగులాపురం, వాలాజీపేట, శ్రీరంగం, నాగపట్టణం తపస్థీర్థం, ఘటికాచలం మొదలైన క్షేత్రాల్లో రచించిన కీర్తనలన్నీ ఒక ఎత్తయితే, తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నప్పుడు పాడిన కీర్తన మరో ఎత్తు. అదో చారిత్రాత్మక సన్నివేశం. తిరుమలకు చేరుకున్న త్యాగయ్యకు వెంటనే దర్శనం కాలేదు. ఆలయంలో ప్రవేశించగానే అర్చకులు తెర వేసి స్వామి కైంకర్యాలు చేస్తున్నారు. నిరుత్సాహంతో చింతాక్రాంతుడైన త్యాగయ్య అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశమున్న కీర్తన ఆలపించారు. శ్రీనివాసుడు త్యాగయ్యపై కరుణించగా తెర తొలగిపోయి అద్భుతమైన దర్శనం కలిగింది. కృతి వివరాలు:

తెర తీయగ రాదా లోని
తిరుపతి వేంకటరమణ మచ్చరమను

పరమపురుష ధర్మాది మోక్షముల
పారదోలుచున్నది నాలోని

మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతి యున్నది
అచ్చమైన దీపసన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది

వాగురమని తెలియక మృగగణములు వచ్చి తగులు రీతి యున్నది
వేగమే నీ మతముననుసరించిన త్యాగరాజ సన్నుత మదమత్సరమను

భావం: 

ఓ తిరుపతి వేంకటరమణా! నా మనసులో మదమత్సరాదులనే అరిషడ్వర్గములు నెలకొనియున్నవి. ఈ ఆరు అంతశ్శత్రువులనే తెర తొలగించుము. ఓ పరమపురుషా! ఈ తెర మానవుని సాధనా సంపత్తికి దోహదము చేసే ధర్మార్థ కామ మోక్షములను విధులకు దూరము చేయుచున్నది. ఈ తెర ఆకలిగొన్న చేప గేలము నందు గల ఎరను ఆశించి దానిలో చిక్కుకున్న రీతి, స్వచ్ఛమైన దీపకాంతికి అడ్డుపడి అంధకారములో పడవేసి అధోగతిపాలు చేస్తున్నది. ఈ మదమత్సరములనే తెర ఎడారులలో ఎండమావులను చూసి భ్రమసి పశుగణములు వాని వద్దకు చేరుకున్నట్లుగా మాయలో పడవేసి నీకు దూరము చేయుచున్నవి. వీటిని తొలగించి నీ దర్శనమును ప్రసాదించుము. నీ భక్తియనే మతమును అవలంబించాను, నన్ను కాపాడుము. 

గౌళిపంతు రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

5, జనవరి 2026, సోమవారం

ధీమహి గాయత్రీం సతతం - గణపతి సచ్చిదానందస్వామి వారి కృతి



ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం 

సంధ్యాత్రితయే మునివినుతాం సవితృ వరేణ్య శ్రీ రూపాం
ధీమద్ధీ చోదన శీలాం భర్గోరూపాం తాం దేవీం

మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం
పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం

ముక్తా విద్రుమ హేమగణా ఘన ధవళోజ్జ్వల వర్ణమయీం
వ్యాహృతి రూపాం ప్రణవార్ధాం గాయక సచ్చిదానందకరాం 


ధీమహి

శబ్దార్థం: ధ్యానించుదము
భావార్థం: మనస్సును ఏకాగ్రం చేసి స్మరిస్తాము

గాయత్రీం

శబ్దార్థం: గాయత్రీ దేవిని
భావార్థం: వేదమాత అయిన గాయత్రీ దేవతను

సతతం

శబ్దార్థం: ఎల్లప్పుడూ
భావార్థం: నిరంతరం, అవిచ్ఛిన్నంగా

భావం:

మేము ఎల్లప్పుడూ, నిరంతరం గాయత్రీ దేవిని ధ్యానిస్తాము.

సంధ్యాత్రితయే మునివినుతాం సవితృ వరేణ్య శ్రీ రూపాం

సంధ్యా–త్రితయే

శబ్దార్థం: మూడు సంధ్యా కాలములలో
భావార్థం: ప్రాతః, మాధ్యాహ్న, సాయంకాల సంధ్యలలో

ముని–వినుతాం

శబ్దార్థం: మునులు స్తుతించినది
భావార్థం: ఋషులచే మహిమించబడిన దేవి

సవితృ–వరేణ్య

శబ్దార్థం: సవితృ దేవునికి అత్యంత ప్రియమైనది
భావార్థం: సూర్య తేజస్సుతో ఏకరూపమైనది

శ్రీ రూపాం

శబ్దార్థం: దివ్యమైన రూపమును కలిగినది
భావార్థం: మంగళకరమైన, శోభాయమాన రూపధారి

భావం:

మూడు సంధ్యలలోనూ మునులు స్తుతించే, సూర్య తేజస్సుతో వెలుగొందే దివ్య రూపధారిణి గాయత్రీ.

ధీమద్ధీ చోదన శీలాం భర్గోరూపాం తాం దేవీం

ధీమత్–ధీ

శబ్దార్థం: జ్ఞానసంపన్నమైన బుద్ధి
భావార్థం: ఉత్తమమైన వివేక బుద్ధి

చోదన–శీలాం

శబ్దార్థం: ప్రేరేపించే స్వభావం కలది
భావార్థం: మన బుద్ధిని ఉత్తమ మార్గంలో నడిపించేది

భర్గః–రూపాం

శబ్దార్థం: తేజస్సు స్వరూపిణి
భావార్థం: పాపనాశకమైన దివ్య కాంతి స్వరూపం

తాం దేవీం

శబ్దార్థం: ఆ దేవిని
భావార్థం: ఆ పరాశక్తిని

భావం:

మన జ్ఞానాన్ని ఉత్తేజపరచే, దివ్య తేజస్సు స్వరూపమైన గాయత్రీ దేవిని ధ్యానిస్తాము.

మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం

మహిత

శబ్దార్థం: మహిమ కలది
భావార్థం: గొప్పగా ఆరాధించబడినది

చతుర్వింశతి వర్ణాం

శబ్దార్థం: 24 అక్షరాలు కలది
భావార్థం: గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాల స్వరూపిణి

త్రిపదాం

శబ్దార్థం: మూడు పదాలుగా విభజించబడినది
భావార్థం: భూః–భువః–స్వః అనే మూడు పాదాల రూపం

నిటల–అక్షీం

శబ్దార్థం: నిటలంలో నేత్రమున్నది
భావార్థం: తృతీయ నేత్రంతో విరాజిల్లే శక్తి

భావం:

24 అక్షరాలు, మూడు పాదాలు కలిగిన తృతీయ నేత్రధారిణి గాయత్రీ దేవి.


పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం

పంచ–శిరస్థాం

శబ్దార్థం: ఐదు శిరస్సులు కలది
భావార్థం: పంచభూతాత్మక శక్తి స్వరూపిణి

దశ–హస్తాం

శబ్దార్థం: పది చేతులు కలది
భావార్థం: అనేక శక్తులను ధరించినది

ఉపనయన–అర్థే వినియుక్తాం

శబ్దార్థం: ఉపనయన సంస్కారానికి నియమించబడినది
భావార్థం: బ్రహ్మవిద్య ప్రవేశానికి అధిష్ఠాన దేవత

భావం:

ఉపనయనాది సంస్కారాలకు మూలదేవతగా నిలిచిన మహాశక్తి.

ముక్తా విద్రుమ హేమగణా ఘన ధవళోజ్జ్వల వర్ణమయీం

ముక్తా – ముత్యముల వంటి
విద్రుమ – ప్రవాళముల వంటి
హేమగణా – బంగారు కాంతి వంటి

ఘన ధవళ ఉజ్జ్వల వర్ణమయీం

శబ్దార్థం: దట్టమైన తెల్లని ప్రకాశం కలది
భావార్థం: శుద్ధత, పవిత్రత ప్రతీక

భావం:

వివిధ రత్నకాంతులతో మెరిసే పవిత్ర దివ్య స్వరూపిణి.

వ్యాహృతి రూపాం ప్రణవార్థాం గాయక సచ్చిదానందకరాం

వ్యాహృతి రూపాం

శబ్దార్థం: భూః–భువః–స్వః స్వరూపిణి
భావార్థం: లోకత్రయాన్ని ఏకరూపం చేసినది

ప్రణవార్థాం

శబ్దార్థం: ఓంకారానికి అర్థస్వరూపం
భావార్థం: పరబ్రహ్మ తత్త్వ స్వరూపిణి

గాయక సచ్చిదానందకరాం

శబ్దార్థం: పఠించువారికి ఆనందమిచ్చేది
భావార్థం: చైతన్యానందాన్ని ప్రసాదించేది

భావం:

ఓంకారార్థ స్వరూపిణి అయిన గాయత్రీ దేవి భక్తులకు సచ్చిదానందాన్ని ప్రసాదిస్తుంది.

తాత్పర్యం:

మేము ఎల్లప్పుడూ గాయత్రీ దేవిని ధ్యానిస్తాము, నిత్యం గాయత్రీ దేవినే మనసారా స్మరిస్తాము. సంధ్యా కాలములన్నిటిలోనూ పూజింపబడే ఆమెను, మునులు స్తుతించే, సవితృ దేవుని శ్రేష్ఠ తేజస్సుతో వెలుగొందే శ్రీమయ రూపమును కలిగిన దేవిని ధ్యానిస్తాము.మన బుద్ధిని ప్రేరేపించి, శుద్ధి చేసే స్వభావముతో భర్గస్వరూపంగా ప్రకాశించే ఆ దేవిని స్మరిస్తాము. ఇరవై నాలుగు అక్షరాల గాయత్రీ మంత్ర స్వరూపిణిగా, మూడు పదాలుగా విస్తరించిన త్రిపదా స్వరూపిణిగా, నిటలమున తృతీయ నేత్రంతో విరాజిల్లే దేవిని ధ్యానిస్తాము. ఐదు శిరస్సులు, పది హస్తాలు కలిగిన మహాశక్తిగా, ఉపనయనాది సంస్కారములకు అధిష్ఠాన దేవతగా ఆమెను మనసారా స్మరిస్తాము. ముక్త, విద్రుమ, హేమమణులవంటి కాంతితో శుద్ధ ధవళ వర్ణంతో ప్రకాశించే దేవిని, వ్యాహృతుల స్వరూపమై, ప్రణవార్థంగా నిలిచిన దేవిని, గానంతో సచ్చిదానందాన్ని ప్రసాదించే గాయత్రీ దేవిని మేము ఎల్లప్పుడూ ధ్యానిస్తాము.

గీతాంజలి బృందం ఆలాపన 

లీలాజగజ్జ్యోతిర్లతా - అమ్మ వారి కృతి


 
లీలాజగజ్జ్యోతిర్లతా
శైలాధిరాడ్గేహోదితా

ఫాలాంబక ప్రేమాధృతా
మాలాలసద్భూషావృతా 

బుధజన మన సమ్మోదినీ
మదయుతజన సంతాపినీ

మృదుకరకలాసంశోభినీ
హృదిలసతు మే విద్యాధునీ  

- ఉడుపా వేంకటనారాయణశాస్త్రి

1. లీలా జగజ్జ్యోతిర్లతా  

   – లీలామయంగా ప్రకాశించే జగత్తు అంతటిని వెలిగించే జ్యోతి లత (ప్రకాశ వల్లి)  

   → అమ్మవారు సౌందర్యంతో, కాంతితో జగత్తును వెలిగించే శక్తి.

2. శైలాధిరాడ్ గేహోదితా  

   – శైలాధిరాజు =  హిమవంతుడు, గేహోదితా = ఇంటిలో జన్మించిన  

   → పార్వతీదేవిగా, హిమవంతుని కుమార్తెగా జన్మించిన దేవి.

3. ఫాలాంబక ప్రేమాధృతా 

   – ఫాలాంబకుడు = శివుడు, ప్రేమాధృతా =  ప్రేమతో ఆరాధించిన  

   → శివుని ప్రేమను పొందిన, ఆయన ప్రియమైన దేవి.

4. మాలాలసద్భూషావృతా  

   – మాలలతో అలంకరించబడిన, శోభాయమానమైన అలంకారాలతో ఉన్న దేవి  

   → ఆభరణాలతో, పుష్పమాలలతో అలంకరించబడిన అమ్మవారు.

5. బుధజన మన సమ్మోదినీ

   – బుద్ధిమంతుల మనస్సులను ఆనందింపజేసేవారు  

   → జ్ఞానులు, భక్తులు ఆమెను ధ్యానించి హర్షించేవారు.

6. మదయుతజన సంతాపినీ  

   – మదంతో ఉన్న (అహంకారుల) జనులను బాధించేవారు  

   → అహంకారులను సంహరించే, దుర్మార్గులను శిక్షించే శక్తి.

7. మృదుకరకలాసంశోభినీ* 

   – మృదువైన చేతులతో కళాశోభను కలిగించినవారు  

   → ఆమె చేతులు సౌందర్యంతో, కళాత్మకతతో నిండినవి.

8. హృదిలసతు మే విద్యాధునీ 

   – హృదయంలో ప్రకాశించే విద్యా నదిగా వెలిగేవారు  

   → విద్యారూపిణిగా, జ్ఞానాన్ని ప్రసరించే శక్తిగా అమ్మవారు.

చిల్కుండ సోదరీమణులు లక్ష్మీ నాగరాజ్, ఇందు నాగరాజ్ ఈ కృతిని చారుకేశి రాగంలో ఆలపించారు


హరికథా కళాకారిణి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు



తెలుగుదనంతో పూర్తిగా ముడిపడిన కళ హరికథ. సాహిత్యం, సంగీతం, కూసంత నృత్యం ఖచ్చితంగా వస్తేనే హరికథ చెప్పగలరు. అటువంటి కళను అభ్యసించేందుకు సుమనస్కులు, సంస్కారవంతులు, కళాపోషకులు అప్పటి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం జమీందారు బలుసు ప్రభాకర బుచ్చి కృష్ణ సత్యనారాయణరావు గారు 1973లో సర్వారాయ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా సర్వారాయ హరికథా పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో నేర్చుకుని గొప్ప కళాకారిణి పేరొందారు శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు, ప్రముఖ ఆంధ్రనాట్య కళాకారులు కళాకృష్ణ గారి ధర్మపత్ని. 2024లో వారికి పద్మశ్రీ అవార్డు లభించింది. వారి జీవిత విశేషాలు ఈ పోస్టులో, వారితో ఇంటర్వ్యూ చూడండి, ఎంత చక్కని తెలుగు భాష వారిది! 

శ్రీమతి దాలిపర్తి ఉమామహేశ్వరి గారు తెలుగు మరియు సంస్కృత భాషల్లో ప్రసిద్ధి చెందిన హరికథా కళాకారిణి. సంస్కృతంలో హరికథను ప్రదర్శించిన మొదటి మహిళా హరికథా కళాకారిణి అనే దేశవ్యాప్త ఖ్యాతి ఆమెకు లభించింది.

1960 మే 21న ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలో సాంప్రదాయ సంగీతకారుల కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయస్సు నుంచే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసిస్తూ, పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఆమె తండ్రి తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయానికి ఆస్థాన నాదస్వర విద్వాంసులు.

హరికథ నేర్చుకోవడంలో శ్రీ ఎస్బీపీబీకే సత్యనారాయణరావు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరి గారు ఉమామహేశ్వరి గారిని ఎంతో ప్రోత్సహించారు. హరికథను ఆమె గురువులైన శ్రీ కడలి వీరదాసు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షితులు, రాజశేఖరుని లక్ష్మీపతిరావు, ఎన్సీహెచ్ కృష్ణమాచార్య, వేదిమంచి నరసింహదాసు గారి వద్ద అభ్యసించారు. ఆమె నాట్యాచార్య శ్రీ నటరాజ రామకృష్ణ గారి శిష్యురాలిగా శాస్త్రీయ నృత్యాన్ని కూడా నేర్చుకున్నారు. ఆమె తొలి తెలుగు హరికథ గౌరీకల్యాణం, ఇది ఆమె మాతృసంస్థ అయిన సర్వారాయ హరికథ పాఠశాలలో ప్రదర్శించబడింది. తొలి సంస్కృత హరికథ కాళిదాస కుమారసంభవం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని ఖ్యాతిగాంచిన కాళిదాస అకాడమీలో ప్రదర్శించారు. అప్పటి నుంచి కాళిదాస అకాడమీలో ఆమె ప్రదర్శనలు ప్రతి యేటా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాళిదాసుని దాదాపు అన్ని నాటకాలు, కావ్యాలను సంస్కృతంలో ఆమె ప్రదర్శించారు. సర్వారాయ హరికథ పాఠశాల గౌరవ ప్రధానాచార్యురాలిగా ఆమె అనేక మంది బాలికలకు హరికథను వృత్తిగా తీసుకునేలా శిక్షణ, ప్రేరణ అందిస్తున్నారు.ఉమామహేశ్వరి గారు హరికథా పితామహుడిగా పరిగణించబడే ఆది భోట్ల నారాయణదాసు గారి హరికథలను ప్రజలకు విస్తృతంగా పరిచయం చేశారు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాల నుంచి ఎన్నో ప్రత్యేక ఘట్టాలను చేర్చి తన ప్రదర్శనలకు విశిష్టతను తెచ్చారు.రమణ మహర్షి, శారదా దేవి పరమహంస, పొట్టిశ్రీరాములు, ఆదికవి నన్నయ్యలపై హరికథలు రచించి వాటిని ప్రజాదరణ పొందేలా చేశారు. కవయిత్రిగా, రచయితగా కూడా ఆమె విశిష్ట ప్రతిభ చూపారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం, అన్నవరం, వేములవాడ వంటి అనేక క్షేత్రాలలో ఆమె ప్రదర్శనలు నిరంతరం జరుగుతుంటాయి. ఆమె వృత్తిజీవితంలో అత్యున్నత ఘట్టం 1986లో బద్రినాథ్‌లో జరిగిన శ్రీ ఆది శంకరాచార్య జయంతి వేడుకలలో చేసిన హరికథ ప్రదర్శన. అంతేకాక, ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, యేలు విశ్వవిద్యాలయాలలో జరిగిన వేదిక సదస్సుల్లో పాల్గొన్నారు. దేశం నలుమూలలా, విదేశాలలో కూడా ఆమె హరికథా వైభవాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. 1981లో మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు, 1993లో హార్వర్డ్ వేదసమ్మేళనం, 1996లో అమెరికాలో ఆటా తెలుగు సమావేశం (హ్యూస్టన్), అలాగే యూకే (1996), సింగపూర్, ఇండోనేషియా (2003), ఒమన్ తదితర దేశాలలో ఆమె ప్రదర్శనలు ప్రశంసలు అందుకున్నాయి.

ఆమె కళను సంరక్షించేందుకు అనేక సాంస్కృతిక సంస్థలు ఆమె ఆడియో, వీడియో రికార్డులు నిర్వహించాయి. వాటిలో బొంబాయి నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, న్యూఢిల్లీ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ, సాహిత్యకళా పరిషత్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్, వారణాసిలోని జ్ఞాన ప్రవాహ సంస్థలు ముఖ్యమైనవిగా నిలుస్తాయి. హరికథకు చేసిన విశేషసేవలకు అనేక పురస్కారాలు, గౌరవాలు ఆమెకు లభించాయి. సెంట్రల్ సంగీత నాటక అకాడమీ పురస్కార్, లలితకళా పురస్కారం, కలారత్న పురస్కారం, మహిళా నవరత్న అవార్డు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డు వంటి అనేక గుర్తింపులు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్్లో స్థానం పొందిన తొలి మహిళా హరికథ కళాకారిణి ఆమె. శృంగేరి శారదా పీఠాధిపతి ఆమెకు అభినవ మాతంగి బిరుదు ప్రదానం చేశారు. ఉజ్జయినిలోని కాళిదాస అకాడమీ చిత్రకథా సరస్వతి, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఉత్తమ హరికథ ప్రవచనకారిణి వంటి బిరుదులతో ఆమెను సత్కరించాయి.దూరదర్శన్, ఆకాశవాణి లో ఆమె గ్రేడ్‌డ్ ఆర్టిస్ట్. శ్రీ సర్వారాయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుండి లలితకళా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సంస్కృతి శాఖ నుండి ఉగాది పురస్కారం కూడా పొందారు.

ఉమామహేశ్వరి గారితో ముఖాముఖీ

అదివో చూడరో అందరు మొక్కరో - అన్నమాచార్యుల కీర్తన



 అదివో చూడరో అందరు మొక్కరో గుదిగొని బ్రహ్మము కోనేటి దరిని

రవిమండలమున రంజిల్లు తేజము దివి చంద్రునిలోని తేజము
భువిననలంబున బొడమిన తేజము వివిధంబులైన విశ్వతేజము

క్షీరాంబుధిలో చెలగు సాకారము సారె వైకుంఠపు సాకారము
యీరీతి యోగీంద్రులెంచు సాకారము సారెకు జగముల సాకారము

పొలసినయాగంబులలో ఫలమును పలుతపములలో ఫలమును
తలచిన తలపుల దానఫలంబును బలిమి శ్రీవేంకటపతియే ఫలము


భావం: 

ఇదిగో చూడండి - ఇది సాధారణ దృశ్యం కాదు. ఇది దర్శించినవారందరూ సహజంగానే నమస్కరించేంత మహిమ కలిగిన స్వరూపం.పుష్కరిణి సమీపంలో వెలసిన ఈ పరబ్రహ్మను బయటి చూపుతో కాదు; మనస్సును అంతర్ముఖం చేసి, లోతుగా ధ్యానించినవారే చేరగల మార్గమిదని అన్నమాచార్యుల వారు చెబుతున్నారు. ఇది జ్ఞానమార్గం కాదు, అహంకారాన్ని వదిలే అంతర్యాత్ర.

సూర్యునిలో కనిపించే ఉజ్జ్వల కాంతి, చంద్రునిలో కనిపించే శాంత ప్రకాశం, అగ్నిలో మండే ఉగ్ర తేజస్సు - ఈ మూడు వేర్వేరు లక్షణాలైనా, మూలంగా అవన్నీ ఒకే తేజస్సు. అది పరబ్రహ్మ తేజస్సు. అంటే దేవుడు ఎక్కడో వేరుగా లేడు. ప్రకృతిలో కనిపించే ప్రతి శక్తి ఆయనే.

అదే పరబ్రహ్మం పాలసముద్రంలో నారాయణుడిగా సాకారమైంది. అదే వైకుంఠంలో నిత్యనివాసిగా ప్రకాశిస్తోంది. యోగులు తమ ధ్యానంలో దర్శించేది కూడా అదే రూపం. అలాగే సమస్త లోకాలకు ఆధారమైన మూలస్వరూపం కూడా ఆయనే. ఇక్కడ అన్నమాచార్యులు నిరాకార–సాకార భేదాన్ని తొలగించే సందేశం యిచ్చారు. రూపం ఉన్నా,లేకున్నా, సత్యం ఒక్కటే అని చెబుతున్నారు.

యజ్ఞయాగముల ఫలము, అనేక తపస్సుల ఫలము, నిరంతరము తలచిన ఫలము, దానములు చేసిన ఫలము, అన్నీ కూడా ఆ శ్రీవేంకటేశ్వరుడే. అన్నమాచార్యుల తత్త్వసారాంశం ఇదే - సాధనలన్నీ గమ్యం కాదు, భగవంతుడే గమ్యం. 

ఈ కీర్తన మొత్తం చెబుతున్నది ఒక్క వాక్యంలో: సర్వత్రా కనిపించే తేజస్సు భగవంతుడే. అన్ని సాధనల పరమ ఫలితం ఆయనే.


శోభారాజు గారి ఆలాపన