21, మార్చి 2015, శనివారం

తాళ్లపాక అన్నమాచార్యుల వారి 512వ వర్ధంతి












తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు పరిపూర్ణమైన తత్త్వ సంపదలు. మధుర భక్తితో రచించిన శృంగార సంకీర్తనలు ఒక ఎత్తైతే , అపూర్వమైన సామాజిక సందేశము, ఆధ్యాత్మికత కూడిన సంకీర్తనలు మరింత ఎత్తు. మానవ జన్మ లక్ష్యము, సమకాలీన సమస్యలకు పరిష్కారము, భగవద్గీతా సారాంశము - సామాన్యుని భాషలో, మంత్ర సమానమైన పదములుగా రచించారు సద్గురువులు. మనలను సరైన మార్గంలో అత్యంత ప్రభావవంతంగా నడిపించే వారే సద్గురువులు. అనేకరకములైన మానసిక పరిస్థితులకు సముచితమైన సందేశముతో సాంత్వననిచ్చి మానవ జన్మకు సార్థకతను కూర్చే శక్తి అయన రచనలలో ఉంది. కాబట్టే దాదాపు ఆరువందల సంవత్సరాలైనా ఆయన సాహితీ సంపద మనకు మార్గదర్శకంగానే నిలుస్తోంది.
ఎప్పుడు మనం ఆయనిచ్చిన ఈ అపూర్వమైన సంపదను సద్వినియోగం చేసుకున్నట్లు?
1. అందరిలోనూ ఉన్నది ఒకటే అన్న సందేశాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరించినపుడు. సాటి మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించి సోదర భావంతో మెలగినపుడు.
2. మనం ఏవిధంగా తలస్తే ఆ రూపంలో దర్శనమిచ్చే మహత్తరమైన దివ్యశక్తి పరమాత్మ. ఎన్ని భగవద్స్వరూపాలైనా, అన్నీ ఆయన దార్శనికాలే. కాబట్టి దేవతా స్వరూపాలను తారతమ్యం లేకుండా చూడగలిగినపుడు, వివిధ తత్త్వాలను, మార్గాలను గౌరవించినపుడు.
3. మనలోని తెరలను, పొరలను, మాలిన్యాలను తొలగించుకొని, ఈ దేహమనే అద్భుతమైన సాధనాన్ని ఉపయోగించుకుని జనన మరణాలను దాటిన మోక్ష స్థితిని చేరుకోగలిగినపుడు.
4. సర్వస్యశరణాగతితో పరమాత్మకు మనలను మనం సమర్పించుకుని ఈ దుర్లభమైన మానవ దేహంతో అద్భుతమైన ఫలితాలను సాధించుకోగలిగినపుడు.
5. అనంతమైన కష్టాలను ఈ సంకీర్తనల సాయంతో అవలీలగా దాటగలిగినపుడు, సంయమనం, స్థితప్రజ్ఞత చూపగలిగినపుడు.
అన్నమాచార్యులను మించిన సంఘసంస్కర్త లేడు. ఆయన సంకీర్తనలు మించిన ఒలిచిన అరటిపండులా సులువైన సాధనం లేదు. మానవతకు నిఘంటువు, మానవ జన్మ లక్ష్యానికి నిర్వచనం ఆయన సాహిత్యం. తెలిసితే మోక్షమే.
ఆ సద్గురువుల 512వ వర్ధంతి సందర్భంగా వారి పాదాలకు శతసహస్ర వందనాలు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి