8, ఫిబ్రవరి 2026, ఆదివారం

త్యాగరాజ హృదయం


 

త్యాగయ్య మామూలు మానవునిలా దుర్భర మరణం పొందలేదు, 10 రోజుల ముందే భద్రాద్రి రాముని గాంచి, గిరిపై నెలకొన్న అనే కృతి ద్వారా ఆ సాక్షాత్కారానికి శాశ్వతత్వాన్ని ఆపాదించి, ఆ స్వామి సూచనను గ్రహించి తన మరణ ఏర్పాట్లను చేసుకున్నాడు, శిష్యులందరూ చూస్తుండగా స్వేచ్ఛగా ఆత్మ దేహాన్ని వీడేంత ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకున్నాడు. అందుకే 250 ఏళ్లు గడిచినా ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. మరో 1000 ఏళ్లు గడిచినా ముందు తరాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. త్యాగరాజ హృదయాన్ని ఆయన శిష్యులు ఎందరో అక్షర రూపంలో ఆవిష్కరించారు. త్యాగయ్య ఆఖరి రోజుల స్థితికి కేశవ్ గారి చిత్రం చూడండి. 

పులకాంకితుడై యానందాశ్రువుల నింపుచు మాటలాడవలెనని
కలువరించ గని పది పూటల పై గాచెదనను త్యాగరాజ వినుతుని

గిరిపై నెలకొన్న రాముని గురి తప్పక గంటి భద్రగిరిపై నెలకొన్న!

ఎక్కడో తంజావూరు దగ్గర ఉన్న త్యాగరాజస్వామికి భక్త రామదాసు, ఆయన కొలిచిన భద్రాద్రి రాముని గురి ఎలా తెలిసి, కృతిలో వర్ణించగలిగారు? అదే కదా, భారతీయ ఆధ్యాత్మికతలోని గొప్పతనం. ఏ ప్రచార సాధనం లేని రోజుల్లో దివ్యదృష్టి ద్వారా, నోటి మాట ద్వారా పుంఖానుపుంఖాల విషయాలు, గ్రంథాలు దేశమంతా సద్గురువుల ద్వారా, సత్పురుషుల ద్వారా చాటబడేవి. 

గమనిక: భద్రాద్రి రాముడు రామదాసునే కాదు, ఆ తరువాత కాలంలో వచ్చిన త్యాగయ్యను కూడా బ్రోచాడన్నదానికి ఈ కృతి నిదర్శనం.  

కులదైవం - ఇష్టదైవం


కులదైవం
========

ఇది నేను చెప్పే విషయం కాదు, కొన్నాళ్ల క్రితం గురువు గారి చెప్పినది, యథాతథంగా రాసే ప్రయత్నం చేశాను. శ్రీగురుభ్యోనమః.

సనాతనధర్మ సాంప్రదాయాలను అనుసరించే ప్రతి వ్యక్తికి కూడా కులదైవం ఉంటుంది. అది ఎవరు అనేది మన తల్లిదండ్రులకు, పూర్వీకులకు, మన స్వగ్రామంలో ఉండేవారికి తెలుస్తుంది. ఒకవేళ వారికి తెలియకపోతే ఏమిటి అన్న కోణం వైపు చివర్లో దృష్టి పెడదాము. 

అసలు కులదైవం అంటే? మన జన్మకు, మన కుటుంబ నేపథ్యానికి సంబంధించిన దేవత. మన గతం గురించి అన్నీ ఎరిగి నిరంతరం వెన్నంటి ఉండే దేవత. పూర్వజన్మ కర్మఫలాలను బట్టే ప్రస్తుత జన్మ కుటుంబ నేపథ్యం. దాన్ని శాసించేది కులదేవత. బాగా ఉపాసన చేసి బాహ్యాభ్యంతర శుచి కలిగిన వారికి కులదేవత అనుగ్రహం, దర్శనం కలిగి తీరుతుంది. జ్ఞానులకు, అవధూతలకు, సద్గురువులకు ఈ కులదేవత కనబడుతుంది. అంతే కాదు, ఆ దేవత ఆ కుటుంబం లేదా వ్యక్తులపై ఎటువంటి వీక్షణంతో ఉంది అన్నది కూడా వారు చెప్పగలరు. కులదేవతలకు లెఖ్ఖలు ఉంటాయి. అందుకే కొన్నిసార్లు వారిని ఉపాసన చేయని మనుషులను తెలియని సమస్యలు పట్టిపీడిస్తుంటాయి. 

అందుకే, ధార్మికులకు సంధ్యావందనం లాంటి నిత్యకర్మలతో పాటు కులదేవతా ఉపాసన కూడా చాలా ముఖ్యం. తెలియని పీడలు, బాధలు అంతగా ప్రభావం చూపకుండా ఉంచేది కులదేవతే. పితృదేవతలు ఎలాగైతే వంశాభివృద్ధినిస్తారో అలాగే కులదేవతలు ఈతిబాధల నుండి, ఋణబాధల నుండి ఉపశమనం కలిగిస్తారు. 

గమనిక - అందరికీ తిరుమల శ్రీనివాసుడు కులదైవం కాదు. కొందరికి నారసింహుడు, కొందరికి శివుడు, కొందరికి లలిత, కొందరికి సుబ్రహ్మణ్యస్వామి, కొందరికి గణపతి, కొందరికి వీరభద్రుడు, మరికొందరికి సూర్యనారాయణుడు, కొందరికి భద్రకాళి, ఇంకొందరికి చండి, ఇంకొందరికి ఆంజనేయుడు. ఖచ్చితంగా ఆ రూపాన్ని తెలుసుకొని కొలువవలసిందే. అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకపోవటం, ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమతమవ్వటం, తెలియని అనారోగ్యాలు, కీచులాటలు..ఇటువంటివి కులదేవతను ఉపాసన చేయని ఫలితాలే. కులదైవం సాధారణంగా మన పూర్వీకులు నివసించిన ప్రాంతానికి సమీపంలో వెలసి ఉంటుంది. ఫలానా వేణుగోపాలస్వామి మా కులదైవం అని ఎవరైనా చెప్పారనుకోండి - దాని అర్థం వారి పూర్వీకులలో ఎవరో ఆ దేవతానుగ్రహాన్ని పొంది తరించి ఆ మార్గాన్ని తరువాతి తరాలకు చెప్పటం వల్లనే.   

చాలామటుకు కులదైవం వంశపారంపర్యంగా ఆస్తికులైతే తెలిసే అవకాశం ఉంది. ధర్మభ్రష్టులై కుటుంబంలో ఏ దేవుళ్ళను ఉపాసన చేశారు అన్న విషయాన్ని ఎక్కడో త్యజించిన వారి తరువాత తరాలవారికి కులదేవత ఎవరో తెలియకపోవచ్చు. అలాంటి వారికి పైన చెప్పినట్లు గురువులు, అవధూతలు, జ్ఞానులు, సిద్ధులు కులదైవాన్ని గుర్తించి చెప్పగలరు. ఒకవేళ ఆ అవకాశం లేఅకపోతే నిత్యం ఇంట్లో దీపం పెట్టి నన్ను అనుగ్రహించి నీ రూపాన్ని తెలుపు అని ప్రార్థిస్తే ఖచ్చితంగా కులదేవత సంకేతాలు పంపి మనకు దారి చూపుతుంది. 

ఇష్టదైవం:
=======

ఇష్టదైవం అనేది ఊరికే నిర్ణయించబడదు. పూర్తిగా మన పూర్వజన్మల వాసనలను బట్టే మనకు కొన్ని దైవాల మీద మక్కువ, నమ్మకం ఏర్పడుతుంది. ఉదాహరణకు నేను గత జన్మలో అమ్మవారిని పూజించినా లేక అటువంటి కర్మలలో పాల్గొన్నా లేక అనుభూతులు చెందినా, ఆ వాసనలు ఈ జన్మలో కూడా కొనసాగుతాయి. తెలియకుండానే ఆ దైవానికి ఆకర్షించబడతాము. అందుకే ఇది పూర్తిగా ఆత్మప్రబోధమైనదే. 

ఇష్టం దైవం ఉపాసన ఊరికే పోదు. అలాగే, కులదైవాన్ని విస్మరిస్తే అనుకున్న ఫలితాలు పూర్తిగా రావు. కులదైవం తెలియకపోతే ఒక్కొక్కసారి ఈ జన్మ కాలం పాటు ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉంటే మనకు ఎప్పుడో ఒకప్పుడు కులదైవం ఇష్టదైవం ద్వారా గోచరమవుతుంది. కులదైవం గురించి వ్రాసిన పోస్టులో దీపారాధన చేసి ఆ దీపజ్యోతిని కులదైవం అవగతమయ్యేలా చేయమని ప్రార్థించాలని చెప్పాను. మనకున్న సగుణోపాసనలో దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది ఇటువంటి కారణాల వల్లే. 

సారాంశం: మనిషిగా జన్మించాక ఆస్తికత చాలా ముఖ్యం. ఇలా కుల ఇష్టదైవాలను ఇతోధికంగా పూజిస్తే కామ్యములు తీరతాయి, కర్మలను సక్రమంగా నిర్వర్తించగలము, ఉన్నతమైన జన్మలను పొందగలము.  

7, ఫిబ్రవరి 2026, శనివారం

శృంగేరి శారదా పీఠాధిపతులు చంద్రశేఖర భారతీస్వామి చరిత్ర



సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాఙ్ముఖం
నౌమి శాస్త్రేషు నిష్ణాతం చన్ద్రశేఖరభారతీం


ఇంద్రియ విషయములకు అతీతులై నిరంతరం ధ్యానమగ్నులై వేదవిద్యా నిష్ణాతులై జీవించిన చంద్రశేఖర భారతీస్వామి వారికి నమస్సులు.

ఈ కర్మభూమిపై గత శతాబ్దకాలంలో జీవన్ముక్తులైన మహాత్ములు కొద్దిమందిలో శృంగేరి శారదాపీఠం 34వ అధిపతులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర భారతీ తీర్థ స్వామి వారు ఒకరు. మహాలయ ఆమావాస్య, వారి పుణ్యతిథి. మన పుణ్యభూమిపై నడయాడిన ఆ మహనీయుని వివరాలు సంక్షిప్తంగా:

శృంగేరి పుణ్యక్షేత్రంలో ఈశ్వరి గోపాలశాస్త్రి మరియు లక్ష్మమ్మ దంపతులు ఉండేవారు. వారికి 11 మంది బిడ్డలు జన్మించినా ఒక్కరూ బతకలేదు. అప్పటి శృంగేరి శారదా పీఠాధిపతులైన సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారిని ఆశ్రయించగా స్వామి వారు వారిని అనుగ్రహించి సత్సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు. ఆ సంతానం వల్ల తల్లిదండ్రులతో పాటు శృంగేరి సంస్థానానికి, భరతభూమికి మేలు కలుగుతుందని, కాబట్టి అతనిని శారదాంబ సేవకు అంకితం చేయమని సూచించారు. గోకర్ణం తీర్థయాత్ర వెళుతున్న దంపతులకు మహాబలేశ్వరుడు స్వప్న సాక్షాత్కారమిచ్చి పురుష సంతానం కలుగుతుందని చెబుతాడు. 1892వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీన, నందన నామ సంవత్సరం ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు వారికి మగబిడ్డ జన్మించాడు. స్వామి వారి అనుగ్రహంతో ఆ తల్లిదండ్రులు బాలునికి నరసింహశాస్త్రి అని నామకరణం చేశారు.

పువ్వు పుట్టగానే పరిమళించినట్లు దైవానుగ్రహంతో జన్మించిన నరసింహశాస్త్రి చిన్ననాటి నుండే ప్రాపంచిక విషయాల పట్ల నిరాసక్తితో, పూర్తిగా అంతర్ముఖుడై జ్ఞాన సముపార్జనలోనే ఉండేవాడు. శృంగేరి శారదాపీఠం కార్యనిర్వాహకులైన శ్రీకంఠ శాస్త్రి గారి వద్ద నివసిస్తూ విద్యాభ్యాసం చేశాడు. చిన్ననాటి నుండి నరసింహకు మూకపంచశతి అంటే మహా ప్రీతి. దానిని పఠిస్తూ తన్మయత్వంలో ఉండేవాడు. అలా ఒకసారి దానిని పఠిస్తూ బాహ్యప్రపంచాన్ని మరచి శృంగేరి పరిసరాలను దాటి కూడా వెళ్లాడు. నరసింహశాస్త్రికి బాలమేధావి, అమితమైన జిజ్ఞాస మరియు జ్ఞాపకశక్తి కలవాడు. ఆంగ్లభాషను పాఠశాలలో, సంస్కృతాన్ని ఇంట్లో తండ్రి వద్ద అభ్యసించాడు. నరసింహునికి ఎనిమిదవ ఏట బ్రహ్మోపదేశం హరిగింది. త్రికాల సంధ్య, ద్వికాల అగ్నికార్యం చేసే క్రమశిక్షణకు ఆ వయసులోనే నరసింహుడు అలవాటు పడ్డాడు. 11వ ఏట పీఠాధిపతుల సూచనతో నరసింహుడు శృంగేరిలోని సద్విద్యా సంజీవని సంస్కృత పాఠశాలలో చేరారు. ఆ స్వామి వారే బెంగళూరులో స్థాపించిన భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యా అభివర్ధని పాఠశాలలో మీమాంస మరియు వేదాంతములలో ఉన్నత విద్యనభ్యసించారు. ఆ గురువుల మనోసంకల్ప ఫలంగా నరసింహుడు అద్భుత విద్యా ప్రావీణ్యంతో చంద్రశేఖర భారతీస్వామిగా 1912లో ఉత్తరాధికారిగా నియమించబడ్డారు. ఆ సంవత్సరంలో ఏప్రిల్ నెలలో శివాభినవ నృసింహభారతీ స్వామి వారు విదేహముక్తి పొందగా చంద్రశేఖర భారతీస్వామి వారు శృంగేరి శారదా పీఠం 34వ అధిపతిగా పీఠాన్ని అధిరోహించారు.

వీరి హయాంలోనే శృంగేరి శారదా పీఠ నవీకరణ, శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి స్మృతిగా నృసింహవనం రూపొందాయి. 1916వ సంవత్సరంలో మైసూరు మహారాజా వారి సమక్షంలో శారదా క్షేత్రానికి కుంభాభిషేకం జరిగింది. 1924 వారు మైసూరు, తమిళనాడు, కేరళ ప్రాంతాలలో విజయ యాత్ర చేశారు. 1927లో ఆదిశంకరుల జన్మస్థలమైన కాలడిలో వేదాంత పాఠశాలను స్థాపించారు. మైసూరు ట్రావంకోర్ సంస్థానాలలో పర్యటించిన తరువాత శృంగేరి తిరిగి వచ్చారు. దీని తరువాత స్వామి వారు పూర్తిగా తపోమగ్నులై, అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి శిష్యులకు భాష్యములు బోధించేవారు. 1931లో పీఠం యొక్క నిర్వహణకై తన శిష్యుడైన శ్రీనివాసశాస్త్రికి సన్యాసమిచ్చి అభినవ విద్యా తీర్థ స్వామిగా నామకరణం చేసి ఉత్తరాధికారిగా ప్రకటించారు. దాదాపుగా అప్పటి నుండి పీఠం బాధ్యతలను అభినవ విద్యాతీర్థులే నిర్వహించారు. దీనికి మైసూరు రాజాస్థానం కూడా ఎంతో తోడ్పడింది. 1938 ప్రాంతంలో చంద్రశేఖర భారతీ స్వాముల వారు బెంగళూరు, మైసూరు, కాలడిలలో పర్యటించారు. తరువాత పూర్తిగా అవధూత స్థితిని పొంది ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉన్నారు. కేవలం శిష్యులకు వేదాంత బోధలో మాత్రమే మాట్లాడే వారు. 1945 నుండి స్వామి వారు పూర్తి అవధూత జీవితాన్ని గడిపారు. సత్యాన్వేషులకు, పాలకులకు మాత్రమే దర్శనమిచ్చే వారు, మిగిలిన సమయమంత తపోదీక్షలోనే. 1954లో భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు శృంగేరి పర్యటించి స్వామి వారితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించి వారి ఆశీర్వాదం పొందారు.

అవధూతగా స్వామి వారు తమ తపోశక్తితో అద్భుతమైన దేహకాతిని పొంది శారదాంబ ప్రత్యక్ష రూపంగా భక్తులకు గోచరించేవారు. 1954 సంవత్సరంలో స్వామి వారు దేహత్యాగం చేయాలని నిర్ణయించుకున్నారు. మహాలయ అమావాస్య, అనగా, 1954 సంవత్సరం సెప్టెంబర్ 26న తుంగా నదిలోకి వెళ్లి పద్మాసన స్థితిలో, దేహానికి ఎటువంటి కష్టమూ లేకుండా, ఆత్మకు ఎటువంటి క్షోభ లేని సచ్చిదానంద స్థితిలో దేహత్యాగం చేశారు. దీనికి ఆనాటి శిష్యులే ప్రత్యక్ష సాక్షులు. డాక్టర్లు దేహపరీక్ష చేసి పరిపూర్ణమైన ఆరోగ్యస్థితిలోనే స్వామి వారు సంకల్ప మాత్రంచే దేహత్యాగం చేశారు అని ఆశ్చర్యపోయారు. అభివన విద్యాతీర్థుల వారు వీరి గురువుల సమాధి పక్కనే శివలింగంతో స్మారకం నిర్మించారు.

చంద్రశేఖర భారతీస్వామి వారు గురురాజ సూక్తి మాలిక మరియు వివేకచూడామణి భాష్యం రచించారు. వీరు కంచి పరమాచార్యుల వారికి సమకాలీకులు. భరతజాతి అదృష్టం ఇద్దరు చంద్రశేఖరేంద్రులు ఒకే సమయంలో రెండు మహోన్నతమైన పీఠాలను అధిరోహించి సనాతన ధర్మ పరిరక్షణకు విశేషంగా తోడ్పడ్డారు. 42 ఏళ్ల పీఠాధిపత్యంలో తమ తపోశక్తిని పూర్తిగా ఆ క్షేత్ర పవిత్రతను కాపాడటానికి, ధర్మ రక్షణకు ధారపోశారు చంద్రశేఖర భారతీస్వామి వారు.

ఆ అవధూతకు పాదాభివందనములు.

శ్రీ టీకే గోవిందరావు జీవిత విశేషాలు



కర్ణాటక సంగీత ప్రపంచంలో భావప్రధాన గానానికి ప్రతీకగా నిలిచిన మహావిద్వాంసుడు శ్రీ త్రిపుణితుర కృష్ణారావు గోవిందరావు గారు. గాయకుడిగా మాత్రమే కాకుండా, సంగీత శాస్త్రవేత్తగా, గురువుగా, రచయితగా ఆయన చేసిన సేవలు అపారం. ఆయన జీవితం మొత్తం కర్ణాటక సంగీతానికి అంకితం అయింది అని చెప్పవచ్చు.

జననం – కుటుంబ నేపథ్యం:

టీకే గోవిందరావు గారు 1929 ఏప్రిల్ 21న కేరళ రాష్ట్రంలోని త్రిపుణితురలో తంకమ్మాళ్, కృష్ణారావు దంపతులకు జన్మించారు. సంగీతం, సంస్కృతి పరంగా సంపన్నమైన కుటుంబంలో ఆయన పెరిగారు. చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి చూపిన ఆయనకు కుటుంబమే తొలి ప్రేరణగా నిలిచింది.

తొలి అభ్యాసం - గురు పరంపర:

ప్రారంభంలో చెంబై వైద్యనాథ భాగవతర్ గారి ప్రభావం ఉన్నా, ఆయన జీవితాన్ని పూర్తిగా మలిచిన గురువు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్. 15 ఏళ్ల పాటు ఆయన వద్ద గురుకుల సాంప్రదాయంలో ముసిరి వారి వద్ద విద్యనభ్యసించి భావప్రాధాన్యమైన గాత్ర ధర్మాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నారు. 1949లో శ్రీ టి.కె. గోవిందరావు గారు మద్రాసులోని సెంట్రల్ కాలేజ్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్‌లో చేరారు. అక్కడ సంగీత కళానిధి తిరుప్పాంపురం స్వామినాథ పిళ్లై గారు మరియు శ్రీమతి టీ బృంద వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో సంగీత విద్వాన్ పట్టాను పొందారు. 

ముసిరి బాణి అంటే – పదాల అర్థానికి అత్యంత ప్రాధాన్యం, భావాన్ని స్పష్టంగా వ్యక్తపరచే గానం, అతి అలంకారాలు లేకుండా హృదయాన్ని తాకే శైలి.ఈ లక్షణాలన్నీ టి.కె. గోవిందరావు గారి గానంలో స్పష్టంగా కనిపిస్తాయి.

గాయకుడిగా ప్రత్యేకత:

టీకే గోవిందరావు గారి గానంలో శ్రోతలను ఆకట్టుకునే ముఖ్య లక్షణం భావం.స్వరాలు కేవలం శబ్దాలుగా కాకుండా, భావాన్ని మోసుకొచ్చే వాహకాలు అని ఆయన నమ్మకం. అందుకే ఆయన కృతులను పాడేటప్పుడు సాహిత్య ఉచ్చారణ, పదార్థ భావం, భక్తి రసం సమపాళ్లలో ఉంటాయి. అత్యంత క్లిష్టమైన రాగాలకూ ఆయన గానం సరళంగా, హృద్యంగా ఉంటుంది.

ఆకాశవాణి మరియు ఇతర సంస్థల ద్వారా సేవ:

గాయకుడిగా మాత్రమే కాకుండా, ఆకాశవాణిలో ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించడం ద్వారా కూడా ఆయన కర్ణాటక సంగీతానికి సేవ చేశారు. ఆకాశవాణిలో చీఫ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తూ, నాణ్యమైన సంగీత కార్యక్రమాలు, యువ కళాకారులకు అవకాశాలు, సంప్రదాయ సంగీత పరిరక్షణ వంటి అంశాలకు ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

యాభై ఏళ్లకు పైగా సాగిన ఆయన సంగీత జీవితంలో, తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా, ఆకాశవాణి చెన్నైలో సంగీత నిర్మాతగా, చివరికి న్యూఢిల్లీ ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో చీఫ్ ప్రొడ్యూసర్ (మ్యూజిక్)గా సేవలందించారు. అదేవిధంగా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సలహా కమిటీ సభ్యుడిగా, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఐసీసీఆర్ మరియు బనారస్, ఢిల్లీ, మద్రాస్, అన్నామలై, బెంగళూరు, తెలుగు విశ్వవిద్యాలయాలలో వివిధ హోదాల్లో పనిచేశారు.

గురువుగా, రచయితగా, పరిశోధకుడిగా:

గోవిందరావు గారు ఒక గొప్ప సంగీత పండితుడు. త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామ శాస్త్రి వంటి మహానుభావుల కృతులపై లోతైన అధ్యయనం చేసి, సరైన సాహిత్య, భావార్థం స్వర నిర్మాణం వివరించే విధంగా అనేక పుస్తకాలు రచించారు రచించారు. ప్రత్యేకంగా త్యాగరాజ స్వామి కృతులపై ఆయన చేసిన కృషి పరిశోధకులకు ఎంతో ఉపయోగపడింది.

ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆయన తన అసలైన లక్ష్యమైన గాయకుడిగా మరియు గురువుగా సేవ చేయడాన్ని ఎప్పుడూ వదలలేదు. భారతదేశమంతటా మాత్రమే కాకుండా శ్రీలంక, సింగపూర్, మలేషియా, యుకె, అమెరికా, కెనడా, మస్కట్ వంటి దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి, వందలాది మంది శిష్యులను తీర్చిదిద్దారు. గురువుగా ఆయన కఠినమైన నియమాలు పాటించినా, శిష్యులపై అపారమైన ప్రేమ చూపేవారు.సంగీతాన్ని వృత్తిగా కాకుండా, ఒక సాధనగా, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూడమని శిష్యులకు బోధించేవారు. ఆయన శిష్యులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కర్ణాటక సంగీతాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇదే ఆయనకు నిజమైన గౌరవం.

కర్ణాటక సంగీతంలోని మౌఖిక సంప్రదాయాన్ని పరిరక్షించడానికి మరియు ప్రచారం చేయడానికి ఆయన గానమందిర్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా సంగీత గ్రంథాల ప్రచురణ, ఆడియో–వీడియో రికార్డింగులు, సంగీత సదస్సులు, వర్క్‌షాపులు నిర్వహించారు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులు మరియు మహారాజ స్వాతి తిరునాళ్ కృతులన్నింటినీ ప్రామాణికంగా సేకరించి, రోమన్ మరియు దేవనాగరి లిపుల్లో, అర్థాలతో మరియు స్వర నోటేషన్‌తో ప్రచురించడం ఆయన చేసిన మహత్తర సేవ. నవరాత్రి మండపంలో ఆయన చేసిన గానం ప్రసిద్ధి చెందింది. అరుదైన స్వాతి తిరునాళ్ కృతులు ఆయన గానంలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

పురస్కారాలు – గౌరవాలు:

తన జీవితాంతం చేసిన సేవలకు గాను ఆయనకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. సంగీత కళానిధి, సంగీత చుడామణి, సంగీత శాస్త్ర రత్నాకర, సంగీత ఆచార్య, గాయక శిఖామణి వంటి అనేక బిరుదులతో పాటు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. శ్రీ కాంచీ కామకోటి పీఠం నుండి ఆస్థాన విద్వాన్ గౌరవం కూడా పొందారు.

వారసత్వం:

టీకే గోవిందరావు గారు 2011 సెప్టెంబర్ 18న పరమపదించారు. కానీ ఆయన గానం, రచనలు, శిష్య పరంపర ఆయనను నిత్యజీవిగా నిలిపాయి. బొంబాయి సోదరీమణులు లలిత-సరోజ, టీకే రామచంద్రన్, కల్పకం రామన్ వంటి ఎందరో శిష్యులు ఆయన పరంపరను కొనసాగిస్తున్నారు. కర్ణాటక సంగీతంలో భావానికి ఉన్న విలువను కొత్త తరాలకు గుర్తుచేసిన మహానుభావుడు ఆయన.

ముగింపు:

టీకే గోవిందరావు గారు కేవలం ఒక గాయకుడు కాదు. ఆయన ఒక ఆదర్శ గురువు, లోతైన భావజాలం కలిగిన పండితుడు, ఒక అద్భుతమైన సాంప్రదాయానికి పరిరక్షకులు. కర్ణాటక సంగీతం శ్రోతల హృదయాల్లో జీవించాలి అన్నదే ఆయన జీవిత లక్ష్యం. అటువంటి మహానుభావుని సేవలు ఎప్పటికీ మరువలేనివి. 

జయతు జయతు జయజయోస్తు జననీ వాణీ - భక్తి గీతం


 

చిన్నప్పుడు ఆకాశవాణిలో చిత్తరంజన్ గారు నేర్పించిన సరస్వతీదేవి భక్తి గీతం:

జయతు! జయతు! జయజయోస్తు! జననీ వాణీ!
వీణాపుస్తకపాణీ! సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

సురమునిగణ సంసేవిత సుమధుర హాసోజ్వలనయనా!
సితపద్మాసనశోభిత నతజనసేవితచరణా!భవభయహరణా!
సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

అనుదినమును నీ నామము మరువక స్మరియింతుమమ్మ! నీవే శరణంటిమమ్మ!నిఖిలలోకజనయిత్రీ! కరుణించుము తల్లీ!
పాహి హే జననీ! పాహి పరమపావనీ!
సకలలోకజనవందిత పంకజభవురాణీ! సురుచిరవేణీ!

అర్థం:

అమ్మా సరస్వతీ దేవీ! నీకు జయము జయము. వీణను, పుస్తకాన్ని చేతుల్లో ధరించిన నీవు మూడు లోకములలోని జనులచే పూజించబడేవు. పద్మము నుండి జన్మించిన బ్రహ్మదేవుని పత్నివి నీవు. అందమైన కురులు కలిగిన దానవు. నీకు జయము జయము. 

దేవతలు, ఋషులు నిరంతరం సేవించే దేవివి నీవు. మధురమైన చిరునవ్వుతో,మెరిసే కనులకాంతితో, తెల్లని పద్మాసనంపై విరాజిల్లుతున్నావు. భక్తజనులచే సేవించబడిన చరణములు కలిగియున్నావు. మాకు జననమరణ భయాలను తొలగించే తల్లివి నీవే.

ప్రతి రోజూ నీ నామాన్ని మరువకుండా స్మరిస్తూ మేమంతా నీశరణు కోరుతున్నాము అమ్మా. మూడు లోకాలకు జనని అయిన తల్లీ, మాపై కరుణ చూపించు. ఓ తల్లీ! మమ్మల్ని కాపాడు! నీవు అత్యంత పావనమైన మాతవు! మా జీవితాలకు రక్షణగా నిలువు తల్లీ!

 https://www.youtube.com/watch?v=4sue4fiSEtg 

నహుషుడి కథ



పురాణకాలంలో నహుషుడు అనే రాజు అత్యంత శక్తివంతుడైన, ధర్మబద్ధుడైన చక్రవర్తిగా ప్రసిద్ధి చెందాడు. ఆయన చంద్రవంశానికి చెందినవాడు. తన తపస్సు, శౌర్యం, పరాక్రమం వల్ల దేవతల కన్నా గొప్ప బలాన్ని సంపాదించాడు.

ఇంద్రుడి అప్రతిష్ఠ – నహుషుడికి దేవేంద్ర పదవి

ఒక సందర్భంలో ఇంద్రుడు వృత్రాసురుని సంహరించి బ్రహ్మహత్య పాపానికి గురయ్యాడు. ఆ పాపభారంతో ఇంద్రుడు దాగిపోయాడు. దేవలోకానికి నాయకుడు లేకపోవడంతో దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు నహుషుడిని దేవేంద్రునిగా నియమించాడు.

నహుషుడు దేవలోకానికి వచ్చాక మొదట ధర్మానుసారంగానే పాలన చేశాడు. దేవతలు, ఋషులు కూడా అతనిని గౌరవించారు. అయితే కాలక్రమేణా అతనిలో అహంకారం పెరిగింది.

అహంకారానికి ఆరంభం

దేవేంద్ర పదవికి వచ్చిన తర్వాత నహుషుడు అపార తేజస్సు సంపాదించాడు. ఆ తేజస్సుతో అతని శరీరం వెలుగులతో మెరసిపోయేది. ఆ వెలుగుల ప్రభావంతో దేవతలంతా అతనికి భయపడే స్థితి వచ్చింది. ఈ అహంకారమే అతని పతనానికి కారణమైంది.

నహుషుడికి దేవేంద్రుడి భార్య అయిన శచీదేవిపై (ఇంద్రాణి) కోరిక కలిగింది. శచీదేవి తెలివితో నహుషుడిని తప్పించుకుంటూ, “నీవు మహర్షులు నన్ను పల్లకీలో మోసుకొచ్చినప్పుడు మాత్రమే నీ కోరికను నెరవేర్చుతాను” అని షరతు పెట్టింది.

ఋషుల అవమానం

అహంకారంతో నహుషుడు మహర్షులను పల్లకీ మోయమని ఆజ్ఞాపించాడు. దేవతల భయంతో ఋషులు అంగీకరించాల్సి వచ్చింది. ఆ పల్లకీని మోసేవారిలో మహాతపస్వి అయిన అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు.అగస్త్యుడు చిన్న కాయంతో నడిచే కారణంగా పల్లకీ కొంచెం ఊగింది. అప్పుడు నహుషుడు అహంకారంతో “సర్ప! వేగంగా నడువు” అని అగస్త్య మహర్షిని దూషించాడు.

శాపం – పతనం

ఈ అవమానాన్ని సహించలేని అగస్త్య మహర్షి నహుషుడిని శపించాడు: “నీవు నన్ను సర్పమని పిలిచావు కాబట్టి నిజంగానే భూమిపై వేగంగా కదలలేని కొండచిలువగా పతనమవుదువు. ఆ స్థితిలో చాలాకాలంలో ఉంటావు.”

ఆ శాపంతో నహుషుడు వెంటనే దేవేంద్ర పదవి కోల్పోయి భూమిపై భయంకరమైన కొండచిలువగా మారిపోయాడు. అదే సమయంలో ఇంద్రుడు తన పాపం నుండి విముక్తి పొందాడు మరియు మళ్లీ దేవేంద్ర పదవిని అధిష్ఠించాడు. 

శాపవిముక్తి:

నహుషుడు అగస్త్యుడి శాపం వల్ల అజగర రూపం దాల్చి ఆయన కాళ్ల మీద పడి శాపవిమోచనం కోసం వేడుకుంటాడు. బహుదీర్ఘకాలం కొండచిలువ రూపంలో ఉండాలి అంటే నేను చాలా ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఏ ప్రాణి కనబడినా ఆ ప్రాణి బలమంతా నాకు రావాలి. అలాగే శాపవిమోచనం ఎప్పుడు కలుగుతుందో చెప్పండి అన్నాడు. ఆహారం గురించి వరం ఉపశమనంగా ఇస్తాడు అగస్త్యుడు. అలాగే, శాపవిమోచనం కాలాంతరంలో నీవడిగే ప్రశ్నలకు ఎవరైతే అత్యుత్తమమైన సమాధానాలు చెప్పగలిగితే ఆ రోజున నీకు శాపవిమోచనం, దీనికి చాలా సమయం పడుతుంది. నీలో ఉన్న అహంకారం తొలగిన తరువాతే ఇది జరుగుతుంది అని చెప్పాడు. 

కాలాంతరంలో ద్వాపరయుగంలో భీముడు కొండచిలువ రూపంలో ఉన్న నహుషుని చేత చిక్కి అవస్థ పడుతున్నప్పుడు ధర్మరాజు అక్కడికి వచ్చి నహుషుడితో సంభాషిస్తాడు. నహుషుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు అద్భుతమైన సమాధానాలు చెప్పాడు. బ్రాహ్మణుడు అనగా ఎవరు, అత్యుత్తమమైన ధర్మం ఏది మొదలైన ప్రశ్నలకు ఉత్తమమైన సమాధానాలు చెప్పగా నహుషుడికి శాపవిముక్తి కలిగి తిరిగి తన పూర్వరూపం పొందుతాడు, భీమసేనుడికి అపాయం తప్పుతుంది.

మహాభారతంలో యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు లోతైన ఆధ్యాత్మిక తత్త్వసారం కలిగినవిగా శాశ్వతంగా మిగిలిపోతాయి. 

ఆకటి వేళల అలపైన వేళల - అన్నమాచార్యుల కృతి



ఈతి బాధలలో, కష్టాలలో ఉన్నప్పుడు నాకు తప్పకుండా గుర్తుకు వచ్చే కృతి, అన్నమాచార్యుల వారి ఆకటి వేళల...శుభపంతువరాళి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అక్కారై సోదరీమణులు శుభలక్ష్మి, స్వర్ణలత అద్భుతంగా ఆలపించారు. 

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కిన వేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెఱగు

ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామమొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెఱగు

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతిగాక
మంకు బుద్ధి పొరలిన మరిలేదు తెఱగు

- తాళ్లపాక అన్నమాచార్యుల వారు 

భావం:

ఆకలి కలిగినప్పుడు, అలసిపోయినప్పుడు ధైర్యమును చేకూర్చి రక్షించునది హరినామమొక్కటే. అది తప్ప మరొక దిక్కు లేదు.

తాను ఎందుకూ పనికి రాని దుస్థితి ఏర్పడినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరులచే బంధింపబడి కృశించినప్పుడు, ప్రకాశమానమైన హరినామమొక్కటే గతి. దానిని మరచినచో మరొక గతి లేదు.

ఆపద కలిగినప్పుడు, నిందకు లోనైనప్పుడు, పాపము మీద పడినప్పుడు, భయపడినప్పుడు, మిక్కిలిగా స్మరింపదగిన హరి నామమొక్కటే గతి. దానిని మించి ఎంత ప్రయత్నించిననూ ఆ దుర్దశలనుండి కాపాడుటకు మరొక మార్గం లేదు.

శత్రువులు సంకెళ్ళతో బంధించినప్పుడు, చంపుటకు పిలిచినప్పుడు, అప్పులవారు అడ్డగించి నిలదీసినప్పుడు విడిపించుటకు శ్రీ వేంకటేశ్వరుని నామమొక్కటే ఉపాయము. దానిని వదలి మూర్ఖత్వముతో ఎంత ప్రయత్నించిననూ వేరొక ఉపాయము లేదు.

అన్నమయ్య శృంగార సంకీర్తన విని సాళ్వ నృసింహరాయలు ఆయనను చెరశాలలో బంధించి హింసించినప్పుడు ఆచార్యులు “ఆకటివేళల” అను సంకీర్తనను ఆలపించగా సంకెళ్ళు తమకు తామే విడిపోయానట. అప్పుడు రాజు ఆచార్యుల పాదాలపై పడి క్షమించమని వేడుకొనగా “శ్రీహరి నిన్ను రక్షించుగాక” అని దీవించెనట. ఈ విషయము అన్నమయ్య మనుమడు చిన్నన్న తాను రచించిన అన్నమయ్య జీవిత చరితలో తెలిపారు. 

https://youtu.be/sKW2OEb8-8M?t=127