27, డిసెంబర్ 2025, శనివారం

భగవద్రామానుజులు - మేల్కోటే రామప్రియ విగ్రహం

 ఆరోజుల్లో చోళరాజు పెడుతున్న హింసలు భరించలేక భగవద్రామానుజులు తన శిష్యగణంతో మైసూరు సమీపంలోని మేల్కోటేలో దాదాపు 20 ఏళ్లు నివసించారు. అక్కడ ఉన్నప్పుడు ఆయన సనాతనధర్మానికి, సమాజానికి చేసిన సేవ అంతా యింతా కాదు. వేదపాఠశాల, చెలువనారాయణస్వామి దేవస్థాన నిర్మాణం, తత్సంబంధమైన వ్యవస్థల ఏర్పాటు, క్షామంతో అలమటిస్తున్న ప్రజల కోసం తొన్నూరు రిజర్వాయర్ నిర్మాణం...ఇవన్నీ రామానుజుల వారి చలవే. అంతే కాదు, మొట్టమొదటిసారి హరిజనులు దేవాలయ ప్రవేశానికి అనుమతించబడింది చెలువనారాయణుని సన్నిధిలోనే, అది రామానుజుల వారి వల్లే.


అక్కడి మహారాజు విష్ణువర్ధనుని చేత తాలక్కాడ్, తొండనూర్, బేలూరు, నాగమంగళ, బెళవాడి అనే ఐదు ప్రదేశాలలో కీర్తినారాయణ, నంబినారాయణ, కేశవనారాయణ, సౌమ్యనారాయణ, వీరనారాయణ దేవస్థానాలను ఏర్పాటు చేయించి శ్రీవైష్ణవ వ్యాప్తికి, స్థిరత్వానికి తోడ్పడ్డారు. నిజం చెప్పాలంటే శ్రీరంగం కన్నా శ్రీవైష్ణవం నిలబడింది మైసూరు ప్రాంతంలో రామానుల వారు చేసిన ప్రయత్నాల వల్లనే. అందుకే ఆయన పంచ నారాయణ క్షేత్ర ప్రతిష్ఠాపనాచార్యగా ప్రసిద్ధి పొందారు.

అంతే కాదు, 82 ఏళ్ల వయసులో కాలినడకన ఢిల్లీ వెళ్లి మొఘల్ సుల్తాను వద్ద నుండి ఉత్సవమూర్తి అయిన రామప్రియ రూపాన్ని పరిపూర్ణమైన భక్తి మహిమతో సాధించి తీసుకు వచ్చి సనాతనధర్మంలోని భక్తి మార్గం యొక్క గొప్పతనాన్ని మరోమారు చాటి శాశ్వతం చేశారు. బీబీ నాంచారి అన్న గాథ ఈ ఉదంతానికి సంబంధించినదే. ఇస్లాంలో జన్మించినా ఆ రామప్రియ ఉత్సవమూర్తిలోని దైవాన్ని గ్రహించి ఆరాధించ గలిగిన స్త్రీ కాబట్టే ఆమెకు పూజనీయ స్థానం కలిగించారు రామానుజుల వారు.

వెయ్యేళ్ల నాడు రామానుజుల వారు ఢిల్లీ నుండి తెచ్చిన రామప్రియ విగ్రహం ఇదుగో!

రామానుజో విజయతే!