16, ఫిబ్రవరి 2011, బుధవారం

కమలాకుచచూచుక కుంకుమతో - శ్రీ వేంకటేశ్వర స్తోత్రము, తాత్పర్యము


నారాయణ సమారంభాం నాథయాముని మాధ్యమం 
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం

నారాయణునితో మొదలుకొని, ఆళ్వారులు, రామానుజులు మొదలైన వారి వరుసలో యున్న నా గురుదేవులకు, ఈ గురు పరంపరకు వందనములు.

తిరుమలేశునికి నిత్యము సుప్రభాత సమయాన పాడే వెంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తిని  రచించింది మహా వైష్ణవ గురువులైన మనవాళ మాముని శిష్యులైన ప్రతివాది భయంకర అణ్ణన్గరాచార్యులు. మనవాళ మామునికి అష్టదిగ్గజములుగా పిలవబడిన ఎనిమిది మంది శిష్య శిఖామణులు. వారిలో అణ్ణన్ (అణ్ణన్గరాచార్యులు) ప్రముఖులు. వీరు 15వ శతాబ్దములో ప్రస్తుతపు తమిళనాట జీవించారు. శ్రీరంగం రంగనాథుని సేవలో ఆచార్యులతో పాటు తాను కూడా తరించారు. వైష్ణవ సంప్రదాయంలోని ప్రతి స్తోత్రంలో మనవాళమాముని ప్రస్తావన ఉంటుంది అంటే అందులో అతిశయోక్తి లేదు. ప్రతి వైష్ణవ దివ్య క్షేత్రంలో దివ్య ప్రబంధాల పారాయణం ముందు ఈ క్రింద శ్లోకం చదువుతారు.

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం

- శ్రీశైలేశార్ గా పిలవబడిన ఆచార్యులు తిరువైమొళి పిళ్లై దయకు పాత్రుడైన, ధీమంతము, భక్తి మొదలగు సుగుణములకు నిలయమైన, రామానుజాచార్యులను ఎల్లప్పుడూ ధ్యానించే మనవాళ మామునికి వందనము.

ఆ విధముగా ప్రసిద్ధి చెందిన మనవాళ మాముని శిష్యాగ్రగణ్యుడు అయిన ప్రతివాది భయంకర అణ్ణన్గరాచార్యులు మనకు దివ్యమైన, శ్రావ్యమైన,  వెంకటేశ్వర సాహితీ సంపదను ఇచ్చారు. ఆ ఆచార్యులకు శత సహస్ర వందనములు సమర్పించుకుంటూ, శ్రీ వేంకటేశ్వర స్తోత్రము, తాత్పర్యము. శ్రవణం సుస్వరలక్ష్మి సుబ్బులక్ష్మి గారిగళంలో .

అద్భుతమైన ప్రాస, పద ప్రయోగము, సర్వస్య శరణాగతి, భక్తి, ప్రపత్తి  ఈ స్తోత్రం లక్షణాలు. ప్రతి దినము వైష్ణవ ఆలయాలలో మార్మోగే ఈ స్తోత్రము మనకు భక్తిని, ముక్తిని ప్రసాదించు గాక.



కమలాకుచచూచుక కుంకుమతో నియతారుణితాతులనీలతనో |
కమలాయతలోచన లోకపతే విజయీ భవ వేంకటశైలపతే || ౧||

సచతుర్ముఖషణ్ముఖపంచముఖప్రముఖాఖిలదైవతమౌలిమణే |
శరణాగతవత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే || ౨||

అతివేలతయా తవ దుర్విషహై రనువేలకృతైరపరాధశతై|
భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే || ౩||

అధివేంకటశైలముదారమతేజనతాభిమతాధికదానరతాత్ |
పరదేవతయా గదితాన్నిగమైః కమలాదయితాన్న పరం కలయే || ౪||

కలవేణురవావశగోపవధూ శతకోటివృతాత్స్మరకోటిసమాత్ |
ప్రతిపల్లవికాభిమతాత్సుఖదాత్ వసుదేవసుతాన్న పరం కలయే || ౫||

అభిరామగుణాకర దాశరథే జగదేకధనుర్ధర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవ దయాజలధే || ౬||

అవనీతనయాకమనీయకరం రజనీకరచారుముఖాంబురుహమ్ |
రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే || ౭||

సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుకాయమమోఘశరమ్ |
అపహాయ రఘూద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే || ౮||

వినా వేంకటేశం న నాథో న నాథః సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ !ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ || ౯||

అహం దూరతస్తే పదాంభోజయుగ్మప్రణామేచ్ఛయాఽఽగత్య సేవాం కరోమి |
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ || ౧౦||

అజ్ఞానినా మయా దోషానశేషాన్ విహితాన్ హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే || ౧౧||

తాత్పర్యము:

లక్ష్మీదేవి స్తన్యముల కుంకుమ వలన ఎరుపెక్కిన శరీరము కల నీలమేఘ శ్యాముడు, కమలముల వంటి కన్నులు కలవాడు, లోకపతి అయిన వేంకటాచల పతికి విజయము కలుగు గాక.

బ్రహ్మ, మహేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు మొదలైన దేవతలలో శిరోమణి యైన, శరణు కోరిన వారి పాలిటి వాత్సల్య సారమునకు నిధి వంటి వృష శైలపతి అయిన వేంకటేశా! నన్ను కాపాడుము.

ఓ వృషాద్రి పతీ! శ్రీ హరీ! అనేక పాపములు, తప్పులు చేసినందుకు చింతించుచు, శరీరము వణుకుచు, నీ శరణు కోరుటకు నీ వద్దకు వేగముగా వచ్చితిని. నీ అపారమైన కృపను నాపై కురిపించుము.

ఓ లక్ష్మీ పతీ! స్వతహాగా కరుణా సాగరుడవై వేంకటాచలముపై యున్నావు , కోరిన వారికి అడిగిన దానికన్నా ఎక్కువగా ఇచ్చెడి వాడవు, దేవతలచే పూజించ బడిన వాడవు, వేదములకు సారము, గతి యైన నిన్ను మించిన  దైవము లేదు.

వేణు రవముతో గోపికలను సమ్మోహనం చేసే, శత కోటి తపస్సులను, అనేక కోట్ల ఇతర దేవతల కొలువును మించి ప్రతి ఒక్క గోపిక అభిమతము నెరవేర్చి వారికి సుఖమునిచ్చిన వసుదేవ తనయుడవైన నీకు సమానమైనది ఏదియును లేదు.

సకల గుణాభిరాముడు, దశరథ తనయుడు, జగత్తులో కెల్లా ఉత్తముడైన ధనుర్ధారి, ధీరుడు, రఘు వంశములో జన్మించిన, రమాపతి యైన ఓ రామా! దయా జలధీ! నాకు వరములిమ్ము.

సీతాదేవి చెట్టపట్టిన అందమైన చేతులు కల, చంద్రుని వలె, కలువ వలె అందమైన ముఖము కల, నిశీధిలో రాజు వలె సంచరించి సూర్యుని వలె అంధకారాన్ని నాశనము చేసే ఓ రఘు రామా! నీ శరణు కోరుతున్నాను.

ఓ ప్రభూ! నీవు సోదరులతో అలరుతూ, అమోఘమైన శరములతో, ప్రసన్నమైన ముఖము కల వాడవు, సుహ్రుదయుడవు, భక్త సులభుడవు, సుఖమునిచ్చే వాడవు. ఓ రఘు వంశోత్తమా! కావున నిన్ను విడచి, ఒక్కసారి,  ఒక్క క్షణము కూడా నేను వేరేవ్వరినీ ప్రార్థించను.

వేంకటేశుడు తప్ప నాకెవ్వరు నాథుడు లేడు, నాథుడు లేడు. నేను ఎల్లప్పుడూ వేంకటేశునే స్మరింతును, స్మరింతును. కావున ఓ వేంకటేశా! హరీ! నాపై దయ చూపి నీకు తగినది, ప్రియమైనదే నాకు ప్రసాదించుము, ప్రసాదించుము.

ఓ వేంకటేశా! నీ పాద పద్మముల సేవకై ఎంతో దూరమునుండి నేను వచ్చితిని. కావున ఓ ప్రభూ! నీ సేవ చేసుకునే భాగ్యమును నాకు ప్రసాదించుము, ప్రసాదించుము.

ఓ శేష శైల శిఖామణీ! నేను అజ్ఞానముతో, నిస్సహాయతతో చేసిన అశేషమైన దోషములను హరించి, నన్ను క్షమించుము, క్షమించుము. 

1 కామెంట్‌:

  1. ప్రసాద్ గారు,

    ఈ స్త్రోత్రానికి తాత్పర్యం పోస్ట్ చేసినందుకు చాలా ధన్యవాదములు ..!!!

    రామ్

    రిప్లయితొలగించండి