3, అక్టోబర్ 2016, సోమవారం

శరన్నవరాత్రులు - గాయత్రీదేవి అలంకారం


ఈరోజు బెజవాడ కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఆ సందర్భంగా ఓ అరుదైన వాగ్గేయకారుడు మరియు ఆయన రచించిన గాయత్రీమాత కృతి వివరాలు మీకోసం.

గాయత్రీ దేవి మీద రచించబడిన కృతులలో ఎక్కువమటుకు మన తెలుగుజాతి మహనీయుడు ఓగిరాల వీరరాఘవ శర్మ గారు రచించినవే. భక్త జ్ఞానానందతీర్థగా సన్యాసాశ్రమంలో పిలువబడిన ఈ కృతికర్త మహా గాయత్రీ ఉపాసకులు. 1908 మార్చి 23న ఒంగోలు జిల్లా ధేనువకొండ గ్రామంలో జన్మించిన ఈయన తండ్రి వద్దే వేదవేదాంగాలు నేర్చుకున్నారు. ఈయన సంగీత గురువు హరి నాగభూషణం గారు. ఆలిండియా రేడియో ద్వారా కొన్ని వందల కచేరీలు చేశారు. రచనలు చేయటంతో పాటు ఆయన రాగాలను కూడా సృష్టించారు. భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రస్ఫుటించే ఆయన కీర్తనలు దేవీ గానసుధ అనే పుస్తక రూపంలో ప్రచురించబడ్డాయి. గాయత్రీ మాతపై రచనలు చేసిన మొట్టమొదటి వాగ్గేయకారులు ఈయనే. తరువాత మైసూరు మహారాజావారు ఒక రచన చేశారు. సన్యాసాశ్రమానికి పూర్వం 'రాఘవ ' అనే ముద్రను, అటుతరువాత 'జ్ఞానానంద తీర్థ ' అనే ముద్రను ఆయన ఉపయోగించారు. ఆయన కుమారుడు ఓగిరాల రామకృష్ణగారు, కుమార్తెలు విమల-లలిత కూడా సంగీత ప్రవీణులు. ఈయన కొవ్వూరులో గాయత్రీ పంచాయతన పీఠం ఏర్పాటు చేశారు.1989లో ఆయన సిద్ధి పొందారు. ఆయన రచించిన శ్రీ గాయత్రీ దేవి సనాతని అనే కృతి వలజి రాగంలో మీకోసం. దీనిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

శ్రీ గాయత్రీ దేవీ సనాతని సేవక జన సుశ్రేయోదాయిని

వాగధిపతి సురేంద్ర పూజితే వరదాయకి పంచరదనే సువాసిని

రాగద్వేష రహితాంతరంగ హితే రత్నఖచిత మణిహార మండితే
రసయుత సంగీత మోదితే రాఘవాది భక్త రక్షణ చరితే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి