9, మార్చి 2016, బుధవారం

అలుపులేని యోధురాలు ఇరోం షర్మిల


ఇరోం షర్మిల - పేరు వినగానే ఆమె ముక్కుకున్న పైపు, విరబోసుకున్న జుట్టు, ముఖంలో పోరాట పటిమ గుర్తుకొస్తాయి. మణిపూర్ రాష్ట్రంలో ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (ఏఎఫెస్పీఏ చట్టం 1958) రద్దు చేయాలని 780 వారాలకు, అనగా 15 ఏళ్లకు పైగా ఆహారాన్ని విసర్జించి శాంతియుగ నిరాహార దీక్ష చేస్తున్న అసమాన మహిళ. ఈ చట్టం శాంత్రిభద్రతలు అదుపులో లేని సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మీకి ప్రత్యేక అధికారాలు ఇవ్వటానికి భారత ప్రభుత్వం 1958లో రూపొందించింది. ఈ చట్టం ప్రకారం ఆయా రాష్ట్రాలలో ఆర్మీ వాళ్లు ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేసి నిర్బంధించవచ్చు, పెద్దగా పర్మిషన్లు లేకుండా అల్లర్లు సృష్టించే వారిని కాల్చి వేయవచ్చు.

2000 సంవత్సరం నవంబర్ 2వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలో మలోం అనే ఊరు దగ్గర 10 మంది పౌరులు కాల్చబడ్డారు. దాని వెనుక భారత పారామిలటరీలో ఒక భాగమైన అస్సాం రైఫిల్స్ హస్తముందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనతో కలతకు గురై ఇరోం ఆ సంవత్సరం నవంబర్ 5 నుండి ఆమరణ నిరాహారదీక్ష మొదలు పెట్టింది. ఏఎఫెస్పీఏ చట్టాన్ని మణిపూర్‌లో ఉపసంహరించాలని, అంత వరకు ఆహారం, నీరు ముట్టనని, తల దువ్వుకోనని ప్రతిజ్ఞ చేసింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు షర్మిల తన మాటకు కట్టుబడే ఉంది. ఆమెకు శాశ్వతంగా ముక్కు-గొంతు ద్వార పొట్టకు ఒకపైపు వేసి ఆరోగ్యం క్షీణించనప్పుడల్లా ప్రభుత్వం దాని ద్వారా శరీరానికి కావలసిన శక్తిని అందజేస్తోంది.

వివాదాస్పద చట్టం ఏఎఫెస్పీఏను వెనక్కు తీసుకోవటానికి ఇరోం షర్మిల 2006లో ఢిల్లీ జంతర్-మంతర్‌లో దీక్ష చేసింది. ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, హోం మంత్రికి లేఖలు రాసింది. 15 ఏళ్లుగా తన పోరాటం సాగిస్తూనే ఉంది. ఎన్నో సార్లు అరెస్టు అయి విడుదలైంది. ఆమెను గృహనిర్బంధంలో కూడా ఉంచారు. కొద్దికాలం క్రితం షర్మిలను కాపాడండి అనే ఉద్యమం కూడా ఆరంభమైంది. పుణే యూనివర్సిటీ వారు ఈమె పేరిట 39 మంది మణిపూర్ యువతీ యువకులకు ఉచిత డిగ్రీ కోర్సులను అందించింది. ఎన్నో విధాలుగా తన రాష్ట్రంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఈమె పోరాడుతూనే ఉంది.

అంతర్జాతీయంగా ఇరోం షర్మిలకు మానవ హక్కుల సంఘాలనుండి ఎన్నో గుర్తింపులు అందాయి. 2007లో గ్వాంగ్‌జూ మానవ హక్కుల అవార్డు, పీపుల్స్ విజిలన్స్ కమిటీ ఆన్ హ్యూమన్ రైట్స్ అవార్డు, 2009లో మయిలమ్మ అవార్డు, 2010లో ఆసియా మానవ హక్కుల సంఘం నుండి జీవిత సాఫల్య పురస్కారం, రవీంద్రనాథ్ శాంతి బహుమతి, సర్వ గుణ సంపన్న అవార్డులు లభించాయి. 2013లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను ప్రిజనర్ ఆఫ్ కాన్షియెన్స్ (మనస్సాక్షి ఖైదీ)గా గుర్తించింది.

ఏఎఫెస్పీఏను మణిపూర్‌నుండి ఉపసంహరించేంత వరకు తన తల్లిని కూడా కలువనని అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్న ఇరోం షర్మిల గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జోహారులు. స్త్రీ అబల కాదు, స్త్రీకి అనంతమైన శక్తి ఉంది ఉన్నదానికి షర్మిల నిలువుటద్దం.

ఈమె లక్ష్యం భారత సైన్యంపై కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల చట్టం పేరుతో దౌర్జన్యం కూడదు అన్నది ఆమె పోరాటం వెనుక సారాంశం. మణిపూర్‌లో  గత ఐదేళ్లలో ఐదు వేలమంది హింసలో మరణించారు. ఇందులో ఎంతో మంది అమాయకులు. చట్టవ్యతిరేక శక్తులను చర్చలకు పిలిచి శాంతియుతంగా త్వరగా ఈ సమస్యను భారత మరియు మణిపూర్ ప్రభుత్వాలు పరిష్కరించి ఇరోం షర్మిలకు విముక్తి కలిగిస్తారని ఆశిద్దాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి