5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

తరాల మార్పులు - జీవితాల్లో పెను మార్పులు


కాలాలు మారాయి, అవసరాలు పెరిగాయి, ఉద్యోగాలలో పని గంటలు పెరిగాయి, మనుషుల్లో ధర్మం మారింది. వీటన్నిటితో పని చేసే వారి జీవితాలు ఒత్తిడితో ఉన్నాయి. దీన్ని వృద్ధ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

కొడుకు/అల్లుడి గురించి -

"మేము ఉద్యోగాలు చేసినప్పుడు ఆరు గంటలకల్లా ఇంట్లో ఉండేవాళ్లమురా! ఈ ఉద్యోగాలేంటో? రాత్రింబవళ్లూ పని, పిల్లల చదువుల గురించి పట్టించుకునే సమయం లేదు. ఎందో, వీళ్లకు డబ్బుంది కానీ సుఖం లేదు..."

కోడలు/కూతురు గురించి -

"మా తరంలో ఆడవాళ్లు ఇంటి పట్టున ఉండి పిల్లలను చూసుకునే వాళ్లు. నా కోడలు, కూతురు ఉద్యోగం పొద్దున పోతే రాత్రి దాకా చేస్తూనే ఉంటారు. రాత్రిళ్లు పొద్దు పోయిన తరువాత కూడా కాల్స్...ఇక ఆ పిల్లల తిండి పట్టించుకునే వాళ్లు ఎవరు?...ఎందుకీ ఆడాళ్లకు ఉద్యోగాలు? మొగుళ్లు బోలెడు సంపాదిస్తున్నారు, హాయిగా మానేసి పిల్లల చదువులు, తిండి చూసుకోవచ్చు కాద?"

మనవలు/మనవరాళ్ల గురించి -

"వీళ్లకి బయటికి వెళ్లి ఆడుకునే బుద్ధి లేదు. ఇరవై నాలుగు గంటలూ టీవీ, సెల్ ఫోన్, ఐ ప్యాడ్...పసితనంలో సోడాబుడ్డీల కళ్లజోళ్లు..."

కోడలు గురించి -

"మా కోడలకి పిల్లలను అరిస్తే ఇష్టముండదు. మేము ఇలా పెంచలేదమ్మా. పిల్లలకు డిసిప్లీన్ లేకపోతే ఎలా? భయం భక్తి లేదు. ఎదురు ప్రశ్నిస్తారు, ఇంకా ముదిరితే అరుస్తారు..ఏవిటో ఈ పెంపకం..ఎందుకీ డబ్బు?..."

ఎదిగిన మనవడు/మనవరాలి గురించి:

"ఏం పిల్లలో, కాస్త కూడా ఒత్తిడి తట్టుకోలేరు, ఒక్క పని చాతకాదు, పొద్దున పోయి రాత్రికి వస్తారు కాలేజీనుంచి. వీళ్ల శరీరాల్లో శక్తి ఉండదు, ఏదైనా చెబితే కోపం..."

కొడుకు గురించి తండ్రి -

"మా వాడికి అప్పుడే స్పాండిలోసిస్ వచ్చింది. మెదలో, నడుములో డిస్క్ ప్రాబ్లం. ముప్ఫై కూడా లేవు. ఐదు కిలోల బరువు కూడ మోయలేడు. నేను ఆ వయసులో ఎంత బరువైన ఎత్తేవాడిని, ఎంత దూరమైనా నడిచి వెళ్లే వాడిని"

- ఇదీ చాలా మంది రిటైర్ అయిన తల్లిదండ్రులు తమ పిల్లల కుటుంబాల గురించి తమ సాటి వయస్కులతో, అక్క చెల్లెళ్లతో చెప్పేవి.

నిజమే. కానీ, ఈ సమస్యలకు కారణం ఏమిటి అని కూడా ఆలోచించాలి కదా?

1. ఇది వరకు చాలా మంధి చిన్న/మధ్య తరగతి ఊర్లలో, పట్టణాలలో ఉద్యోగాలు చేసుకునే వారు. కాబట్టి, తక్కువ డబ్బుతో అయినా సంసారం నడిచేది. ఇప్పుడు ఉద్యోగాలన్నీ పెద్ద పట్టణాలలోనే ఉంటున్నాయి. అక్కడ వస్తువుల ధరలతో పాటు, నెల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఒక సంపాదనతో కుటుంబం గడవటం కష్టమే. స్త్రీలు ఉద్యోగం చేయటం అనేది స్త్రీ స్వేచ్ఛ కోసం కన్నా ఆర్థిక వెసులుబాటు కోసమే ఎక్కువగా తప్పనిసరి అయ్యింది. ఇది ఈ తరం వాళ్లు కోరి తెచ్చుకున్నది కాదే?

2. ఇదివరకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో చేసే వారు, పబ్లిక్ సెక్టార్ (బ్యాంకులు వగైరా) జాబుల్లో చేసేవారు. కాబట్టి వారికి పని గంటలు పరిమితం. ఇప్పుడు అలా కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు, పని విపరీతం, కంపెనీల మధ్య పోటీ, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయిస్తే తప్ప లాభాలు రావు. అది కూడా కాకుండా, బీపీవో వంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వలన రాత్రిళ్లు పని చేయాల్సిన అవసరం. వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో ఉన్నవారితో కలిసి పని చేయాలి, అక్కడి కస్టమర్సును సపోర్ట్ చేయాలి. అలాగే, బ్యాకుల నుండి కస్టమర్లు ఎక్కువ పని వేళలు, ఎక్కువ సర్వీసులు ఆశిస్తున్నరు. ప్రభుత్వం కూడా దీనిపైనే దృష్టి పెట్టింది. ఇది వరకు 5:30 కల్లా ఇంటికి వచ్చే బ్యాంకు ఉద్యోగులు ఇప్పుడు రాత్రి పొద్దుపోయాక వస్తున్నారు. దీనితో పని వేళలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఇవేవీ, ఈ తరం వాళ్లు కొని తెచ్చుకున్నవి కాదే?

3. ఇది వరకు సమాజంలో భద్రత ఉండేది, పిల్లలు రోడ్లపైకి వెళ్లి ఆడుకునేందుకు వీలుగా ట్రాఫిక్ తక్కువ ఉండేది, ఆడపిల్లలపై అత్యాచారాలు తక్కువగా ఉండేవి. అందుకని, హాయిగా పిల్లలు రోడ్ల మీద ఆడుకునే వాళ్లు. ఇప్పుడు జనాభా పెరిగింది, రోడ్లు పెరగలేదు, ఆట స్థలాలు ఆక్రమించబడ్డాయి. పిల్లల భద్రత కోసం వారిని తల్లిదండ్రులు బయటికి పంపించటం లేదు. ఇది నేటి తరం కొని తెచ్చుకున్నది కాదే?

4. ఇది వరకు ఒక్క దూరదర్శన్ మాత్రమే ఉండేది, సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, ఇన్ని రకాల పరికరాలు లేవు. కాబట్టి పిల్లలకు ఆటలు, ఇతరులతో కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడో? వందల చానెళ్లు, వందల పరికరాలు, దానిలో పిల్లల సమయాన్ని హరించే లక్షల ఆటలు, పాటలు. దీనిలో నేటి తల్లిదండ్రులకు పాత్ర ఉంది. వారు నియంత్రణలో పెట్టవచ్చు, కానీ చేయటం లేదు.

5. ఒక తరం క్రితం, పిల్లలకు చదువులు -> ఉద్యోగాలు -> ఆర్థిక భద్రత అనే దాని మీదికి విపరీతమైన ఫోకస్ వచ్చి వ్యక్తిత్వ వికాసాన్ని వదిలేశారు. అంటే, మాకు డబ్బు లేదు, మా పిల్లలు చదువుకొని సంపాదించాలి అని ఆ తరం తల్లిదండ్రులు పిల్లలను చదువుల్లోనే ఉంచి,మిగితావి పక్కన పెట్టారు. దానితో ఎదిగే పిల్లల వ్యక్తిత్వ వికాసం జరగలేదు. కేవలం మార్కుల్లో మాత్రమే వారి ప్రతిభ. ఈ జాడ్యం నేడు, వికృతమై నారాయణ/చైతన్య వంటి కమర్షియల్ విద్యాసంస్థలకు జన్మనిచ్చింది. ఇక పిల్లలకు వ్యక్తిత్వ వికాసమే లేదు. దీనికి క్రిందటి తరం తల్లిదండ్రులే బాధ్యులు. నేటి తరం తల్లిదండ్రులు కళ్లు తెరిచి సరిదిద్దాలి.

6. ఇది వరకు అన్ని ఉద్యోగాలూ ఫైళ్లు చూడటం, రాయటం. అలాగే కార్మిక వర్గంలో ఎక్కువగా లేచి తిరిగి శరీరానికి పని పెట్టే ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. అన్ని ఉద్యోగాలూ కంప్యూటర్ మీద చేసేలా మారాయి. కంప్యూటర్ ఉద్యోగాలు పెరిగాయి. ఇవి సిట్టింగ్ జాబ్స్ కావటం, సరైన పద్ధతిలో కూర్చోకపోవటం వలన వెన్నెముక్ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వాళ్లు కూడ తోడ్పడి ప్రోత్సహించాలి.

మొత్తం మీద, క్రిందటి తరం తల్లిదండ్రులు పరిస్థితులను కాస్త అర్థం చేసుకోవాలి. తమ పిల్లలు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారో గ్రహించి దానికి కారణాలను కనుక్కొని వీలైనంత సహాయకరంగా ఉండాలి. ఊరికే పక్కవారితో ఆడిపోసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మారిన తరంతో పాటు మారిన పరిస్థితులు. అంతే. ఇది తెలుసుకుంటే తరాల మధ్య అంతరాలు రావు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి