29, జనవరి 2016, శుక్రవారం

గుళ్లో రామాయణాలు - 6

 గుళ్లో రామాయణాలు - 6



సాయినగర్‌లోని షిర్డీ సాయి గుడి ఆ కాలనీ వాసుల మంచి నిర్వహణతో బాగా పేరొందింది. నిజాయితీతో కమిటీ మెంబర్లు సాయినాథునికి రోజూ పూజలు, భక్తులకు సంతృప్తికరంగా చేయిస్తున్నారు. కమిటీలో దైవభక్తి కలిగిన రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఓర్పు,సామర్థ్యం కలిగిన మహిళలు కూడా ఉన్నారు. రెండేళ్లలో గుడి ఆదాయం బాగా పెరిగింది. ఆ గుడిపై అక్కడి స్థానిక రాజకీయ గూండాల కళ్లు పడ్డాయి. కమిటీ మెంబర్లను పిలిచారు.

"ఈ గుడి కమిటీకి మా పార్టీవోళ్లు ప్రెసిడెంటుగా ఉండాల. మేము దీన్ని మస్తు డెవలప్ చేస్తం. మా భిక్షపతన్న ఐతే మంచిగుంటది...." అని మాజీ కార్పొరేటర్ భిక్షపతిని ప్రెసిడెంటుగా చేయాలని ఒత్తిడి. ఎదిరించిన కమిటీ సభ్యులను బెదిరించటం, గుడి తాళాలు పగల గొట్టటం, హుండీలో డబ్బులు దోచుకోవటానికి ప్రయత్నాలు...

ఎవరా భిక్షపతి? పచ్చి గూండా. తాగుబోతు, భార్యను హింసించేవాడు, తల్లిదండ్రులను కాళ్లతో తన్నేవాడు. లేని అలవాటు లేదు. అధికార పార్టీలో సభ్యుడు.

కమిటీ సభ్యులు రాజకీయ ఒత్తిడికి తలవంచక తప్పలేదు. మొదలైంది గుళ్లో అధర్మం.

"మా బిడ్డ పుట్టినరోజు రేపు సండే. పొద్దుగాల అభిషేకం మేము జేస్తం, దర్శనం బంద్ చేయండి..." - పూజారికి బెదిరింపులు. భయంతో పూజారి తలవంచక తప్పలేదు. ఆరోజు ఉదయం దర్శనం బంద్. భక్తులకు అశాంతి.

"దసరారోజు సాయిబాబా సమాధి. దానికి పిల్లల చేత సాయి చరిత్ర నృత్య నాటిక ప్రదర్శిద్దాము..." అని పాపం ఒక కమిటీ సభ్యురాలు ప్రతిపాదన...

"గవన్నీ ఎందుకు. సినిమాపాటలు బెట్టి హుషారుగ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టిపిద్దం..."

ప్రతియేడాది సాయి సమాధి ఉత్సవాలు ఎంతో పవిత్రంగా జరిగేవి. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేది. ఈ యేడాది మైకులు, లౌడు స్పీకర్లలో రణగొణ ధ్వనులు...ప్రజలలో అసహనం పెరిగిపోతోంది. గుడి అంటే గౌరవం తగ్గిపోతోంది.దశమి నాడు ఒక వంద కార్లతో ఆ భిక్షపతి పార్టీ నాయకులు వచ్చారు. రెండు గంటల పాటు ట్రాఫిక్ జాం, మైకులో స్పీచులు. భగవంతుడు గురించి కాదు...వాళ్ల వాళ్ల స్వోత్కర్షలు...

గుడికి అన్నివైపులా తోరణాలు, పూమాలలు, లైట్లు మాత్రమే ఉండేవి. ఈ యేడాది, వీటన్నిటినీ కనుమరుగు చేసి భిక్షపతి, అనుచరుల ఫ్లెక్సీలు, సాయినాథునితో నించున్నట్లు, సాయినాథుడు ఆశీర్వదిస్తున్నట్లు, రకరకాల భంగిమలలో...వికారం పుట్టించేలా.

అన్నీ సాయినాథుడు గమనిస్తూనే ఉన్నాడు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి