25, జనవరి 2016, సోమవారం

గుళ్లో రామాయణాలు - 3

గుళ్లో రామాయణాలు - 3
===============



దేవుడి ముందు ఎక్కువ-తక్కువా?

బాగా చదువుకుని, దేశదేశాలు తిరిగి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నతమైన పదవులలో పని చేసి, నాలుగు చేతులా సంపాదించాడు ఓ పెద్దన్నయ్య. జీవితమంతా భోగలాలసుడే. రిటైర్మెంట్ తరువాతే దేవుడి మీద ధ్యాస మళ్లింది. అప్పటివరకు తన ఊరు అన్న విషయం మరచిపోయిన మనిషి అప్పుడు ఊళ్లో మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నాడు. . "శివుడు కలలోకి వచ్చాడురా. మన ఊళ్లో గుడి కట్టించమన్నాడు. నా దగ్గర ఉన్న డబ్బుతో కట్టిస్తాను. ధర్మకర్తలుగా మీరందరూ ఉండండి..." పెద్దన్నయ్య తన తమ్ముళ్లతో, చెల్లెళ్లతో అన్నాడు. ట్రస్టులో ఆయనతో పాటు కుటుంబమంతా చేరింది.

మాఘ మాసంలో గుడి ప్రతిష్ఠలు అయ్యాయి. ఏడాది తిరిగి వార్షికోత్సవం అయ్యింది. గుడికి ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. వార్షికోత్సవాలనంతరం శివపార్వతుల కళ్యాణం. శ్రీశైలంలో లాగా విగ్రహాలను ఏర్పరచారు, తోరణాలు కట్టారు, పూమాలలతో అలంకరించారు, లైట్లు పెట్టారు, మేళం, తాళం, అభిషేకాలు, పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాట్లు...

కళ్యాణానికి ఎవరు కూర్చోవాలి? 1116/- రుసుము పెట్టి కళ్యాణానికి కూర్చోవచ్చు అని బోర్డులో రాశారు. చాలా మంది సంబరపడి రుసుము కట్టారు. కళ్యాణం సమయం ఆసన్నమైంది. గర్భగుడిలో దంపతులు కూర్చోవటానికి రమ్మన్నారు. ఉత్సాహంగా ఆ ఊరికి చెందిన దంపతులు వచ్చి కూర్చున్నారు. మొదటి వరుస నిండిపోయింది. ఇంతలో అక్కడికి ఆ ధర్మకర్తల కుటుంబం వచ్చింది - అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, వాళ్ల జీవిత భాగస్వాములు...పెద్దన్నయ్య వచ్చి ముందు వరుసలో కూర్చున్నవారిపై "మిమ్మల్ని ఇక్కడ ఎవరు కూర్చోమన్నారు? ఈ స్థానం ధర్మ కర్తలది, లేవండి, ఆ వెనక్కు కూర్చోండి" అని దాదాపు 10 మంది మొదటి వరుస దంపతులను కసిరి లేపాడు. ఎదురుగా శివుడు కళ్యాణం చేసుకుందామనుకున్న తన భక్తులను ఇలా ధర్మకర్త లేవగొట్టటం చూశాడు.  అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఆ పెద్దన్నయ్య ప్రవర్తన చూసి ముందు వరుసలో కూర్చున్న దంపతులు నిర్ఘాంతపోయారు. అవమానంగా భావించారు. కానీ, కళ్యాణం కదా అని దిగమ్రింగుకొని వెనుక వరుసలో కూర్చున్నారు.

ముందు వరుసలో ఆ ధర్మకర్త కుటుంబ సభ్యులు గుడిలో విగ్రహాలు, కళ్యాణం చేసే ఉత్సవ విగ్రహాలు వెనుక వారికి కనిపించకూడా అడ్డంగ కూర్చున్నారు. ఇక ఇకలు, పక పకలు...వెనుక వారికి ఏమీ తోచటం లేదు. స్వామి కళ్యాణ వైభోగం వారి కళ్లబడలేదు. అసంతృప్తితో కళ్యాణం ముగిసింది. తీర్థ ప్రసాదాలు కూడా మొదట ఆ కుటుంబానికే. స్వామి వారికి అలంకరించిన పూ మాలలు, శేష వస్త్రాలు, మారేడు దళాలు కూడా ఆ కుటుంబానికే.

దేవుడినే మోసమా?

గర్భగుడి ముందు ఫోటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం అని పెద్ద అక్షరాలలో రాసి బోర్డు పెట్టి ఉంది. చూడకుండా ఎవరో భక్తుడు వచ్చి సెల్ ఫోన్లో ఫోటోలు తీయబోయాదు. ధర్మాధికారి పెద్దగా అరచి అతన్ని బయటకు పంపించేశాడు. అహా! నిజంగా మూల మూర్తులను ఫోటో తీయకూడదు అన్నది ఎంత చక్కగా పాటిస్తున్నారో అనుకున్నారు భక్తులు. దర్శనాలు అయిపోతున్నాయి. గుడి మూసే సమయమైంది. ధర్మాధికారి వచ్చి - "పూజారి గారూ! మా మనవడు వచ్చి స్వామి వారు, అమ్మ వార్ల ఫోటోలు తీసుకుంటాడు, ప్రింట్ ఇచ్చి నా తోబుట్టువులందరికీ ఫ్రేం కట్టించి ఇవ్వాలి. మా వాడు ఫేస్‌బుక్లో పెట్టాలి....మనవడు వచ్చాడు, ఫోటోలు తీసుకున్నాడు..అన్నీ గమనిస్తూనే ఉన్నాడు స్వామి.

మరుసటి ఏడుకి ధర్మకర్త కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి, కొంతమందికి రావటం కుదరలేదు. ఊరిలో భక్తులకే కళ్యాణంలో అగ్రతాంబూలం. ఫోటోలు తీసుకుందామనుకున్న వ్యక్తి కెమెరా హఠాత్తుగా పనిచేయాలేదు, వేరే ఏ విధంగా ఫోటోలు తీయాలనుకున్నా కుదరలేదు.

1 కామెంట్‌:

  1. ఇదంతా నిజమేనండి. మా వుర్లో అయితే ఆ ట్రస్టీ ఎప్పుడూ గుళ్ళోనే ఉంటాడు.వచ్చినవాళ్లందరినీ తిడుతూఉంటాడు. పూజారులనైతే బూతులే. ఇదివరలో బ్రహ్మలు గర్భగుడిలో అబిషేకం చేసుకునేవారు.ఇప్పుడు రాకూడన్నారు. ఎవరి సొంత గుడో అన్నట్టు ఉంది.

    రిప్లయితొలగించండి